Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా ప్రభావం వల్ల ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. ఇది అన్నిదేశాల ప్రజల మీద విలయ తాండవం చేసింది. చిరు వ్యాపారులు, కూలీనాలి చేసుకునే ప్రజల జీవన స్థితిగతులను పూర్తిగా మార్చివేసింది.
పరిస్థితి ఇలా ఉండగా కరోనా ప్రభావం నేటి విద్యా వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యా లయాలు మూతపడ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థికమాంధ్యంతో పాటు విద్యార్థుల, ఉపాధ్యాయుల, అధ్యాపకుల, ఆచార్యుల జీవితాలు అగమ్యగోచరంగా కనిపిస్తున్నాయి. ఒక తరం విద్యార్థుల భవిష్యత్తు కుంటుపడే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే సెమిస్టర్లు వాయిదా పడుతున్నాయి. జాతీయ, ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిభా పోటీ పరీక్షలు కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ, నిట్, గేట్ వంటి పోటీ పరీక్షల్లో విద్యార్థులు పాల్గొనే అవకాశం కనబడటం లేదు.
తెలంగాణలో గతేడాది కెజి టు పీజి విద్యార్థుల్ని ప్రమోట్ చేశారు. ఈ విద్యా సంవత్సరం కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది. పరిస్థితి చేయి దాటక ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని విద్యార్థుల భావి భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తూపోతే విద్యార్థుల్లో పరిశీలనా దృష్టి, సృజనాత్మక శక్తి, విజ్ఞానం దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల సరైన మౌలిక వసతులు కల్పించి, జాగ్రత్తలు తీసుకొని వచ్చే విద్యాసంవత్సరమైనా యథావిధిగా అకాడమిక్ క్యాలండర్ ప్రకారం పాఠశాలల్ని, కళాశాలల్ని తెరిచేందుకు ప్రయత్నించాలి. లేదంటే సమాజ అభ్యున్నతి, దేశసేవ కోసం ఉపయోగపడాల్సిన ఓ తరం నిర్వీర్యం అవుతుంది. ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా తరగతి గదిలో ప్రత్యక్ష బోధనవలె విద్యార్థుల అంతర్గత శక్తుల్ని వెలికితీయలేవు. పైగా అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడి హాస్పిటల్స్లో ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో పనిచేసే ఉద్యోగుల్ని ఒక రకంగా ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో పని చేసే ఉద్యోగుల్ని, మరో రకంగా చూస్తున్న ప్రభుత్వం వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు ఇంకా మమ్మరం చేయాలి. దేశంలో రాష్ట్రంలో అనేక బడ్జెట్ స్కూల్స్, కాలేజీలు మూతపడే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి.తత్ఫలితంగా ప్రైవేట్ పాఠశాలల్లో, కాలేజిల్లో చదివే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు, కాలేజీలకు వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఉన్నవారికే సరైన వసతులు కల్పించలేకపోతున్న ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగితే వారి సంక్షేమం పట్టించుకోగలదా? కొత్త ఉద్యోగాలు వేయగలదా? ఇది ప్రశ్నార్థకమే. అందుకు ఆర్థిక వనరులు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వచ్చే విద్యాసంవత్సరమైనా సరైన మౌలిక వసతులు కల్పించి, జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టి అకడమిక్ కాలెండర్ను ప్రకటించి స్కూల్స్ను, కళాశాలలను నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
- కాళేశ్వరం కృష్ణమూర్తి,
సెల్:9705196097