Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబద్ధం - దర్జాగా బతికి ఏదో ఒక రోజు ఛస్తుంది. నిజం - రోజూ ఛస్తూ, ఏదో ఒక రోజు బతికి భవిష్యత్తులో చరిత్రగా మారుతుంది. అటు తర్వాత అది అనునిత్యం బతుకుతుంది. శాస్త్రీయ దృక్కోణం లేని సాహితీవేత్తలు, కళాకారుల వల్ల సమాజానికి జరిగే మేలు కన్నా కీడే ఎక్కువ! ఒకప్పటి పురాణ రచయితల వల్ల ఆధునిక సమాజం కూడా ఎలా అతలాకుతలం అవుతుందో గమనించండి. 8,800 శ్లోకాలతో వ్యాసుడు రాసిన 'జయం' అనే ఒక కట్టుకథను, వైశంపాయనుడు 24వేల శ్లోకాలకు పెంచాడు. దానికి 'భారతం' అని పేరు పెట్టాడు. కొంత కాలానికి దానికే మరో 76వేల శ్లోకాలు జోడించి, ఆ గ్రంథాన్ని లక్ష శ్లోకాలకు విస్తరించాడు. అప్పుడు దాన్ని 'మహాభారతం' అని అన్నాడు. ఆ తర్వాత, ఆ కథలో అనేక ప్రక్షిప్తాలు చేరిపోయాయి. అందుకే మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే 'మహాభారతం' చారిత్రక గ్రంథం కాదు - కాలేదు. పైగా పురాణాల ద్వారా హిందూ ధర్మం మనకిచ్చిన వరాలు కొన్ని ఉన్నాయి. అవి బాల్య వివాహాలు, సతీసహగమనం, వైధవ్యం, జోగినీ వ్యవస్థ - వరకట్నం వగైరా. ఇవి స్త్రీలను అణిచిపెట్టడానికి ఎంతగా ఉపకరించాయో అందరికీ తెలుసు. ఇక కుల వ్యవస్థ, అంటరానితనం, బలులు, కన్యాశుల్కం ఇతర మూఢనమ్మకాలు ఎన్నో, ఎన్నెన్నో. ఇవన్నీ గొప్పతనాలా? సంస్కృతీ సంప్రదాయాల పేరిట కొనసాగించిన మూఢనమ్మకాలా? ఇవి వరాలా? లేక శాపాలా? ఇంగిత జ్ఞానంతో ఎవరికి వారే ఆలోచించుకోవాలి! మారుతున్న కాలాన్ని, జరుగుతున్న వైజ్ఞానిక ప్రగతిని గమనించకుండా పురాణాలకు అనుగుణంగా ఆధునిక వ్యవస్థ ఉండాలను కోవడం బుద్ధి తక్కువ. ఆధునికంగా జీవిస్తూ, వేల ఏండ్ల నాటి విలువల్ని ప్రతిష్టించుకోవాల్సిన అవసరాన్ని కొందరు 'చదువుకున్న నిరక్షరాస్యులు' నొక్కి చెపుతుంటారు. ప్రజలు అలాంటి వారి నోళ్ళు మూయించాలి!
'చదువుకున్న అవివేకులు' తమ ఇండ్లలో పెండ్లిండ్లు జరిగితే, సీతారాముల పెండ్లిలోని తలంబ్రాల ఘట్టం పెండ్లి పత్రికల్లో ముద్రించుకుంటున్నారు. కొత్తజంటను సీతారాముల్లా వర్థిల్లమని దీవిస్తున్నారు. భజంత్రీలను సీతారాముల కళ్యాణం పాటలు వాయించమంటారు. ప్రేమకు, అన్యోన్యతకు ప్రతినిధులై సీతారాముల జంట ఉన్నట్టు - రామాయణంలోనే లేదు. 'అమ్మో సీతకష్టాలు' అనే పదం ఈనాటికీ వాడుకలో ఉంది. కొత్త జంటల్ని సీతారాముల్లా ఉండమనడం ఏమైనా తెలివిగల పనేనా? ఒక్కసారి ప్రజాకవి వేమన పద్యాలు తిరగేస్తే అసలు నిజాలు తెలుస్తాయి.
కనక మృగము భువిని కద్దు లేదనకుండ
తరుణి విడిచి పోయె దాశరథియు
తెలివి లేనివాడు దేవుడెట్లాయెరా?
విశ్వదాభిరామ వినురవేమ.
వెర్రికుక్కల వలె వేదములు చదివేరు
అన్వయంబు నెరుగరయ్య వార్లు
వేద విద్యలెల్ల వేశ్యల వంటివి
విశ్వదాభిరామ వినురవేమ
తల్లితో రమించె తండ్రి యజ్ఞము చేసి
తనయుడట్లె రంభ తనర గూడె
తల్లిని రమింత్రు దబ్బుర విప్రులు
విశ్వదాభిరామ వినురవేమ
వేదాలు, పురాణాలు ఎంత సంస్కార హీనంగా రాయబడ్డాయన్నది వేమనే కాదు, ఆయన తర్వాత కూడా హేతువాద రచయితలు ఎత్తి చూపుతూనే ఉన్నారు. దేవుడిపేరుతో, భక్తి పేరుతో గుడ్డిగా విశ్వసించేవారు - వారి విశ్వాసాల్లో వారు ఉండొచ్చు. కానీ, విశ్వాసాల్లో లేనివారిని, హేతుబద్ధంగా విశ్లేషించుకునే వారిని బూతులు తిట్టే అర్హత వారికి ఉండదు. వారి వాదనని వారు సంస్కారవంతంగా వినిపించొచ్చు. బూతులు తిడితే తాము సంస్కార హీనులమని వారికి వారే ఢంకా బజాయించుకున్నట్టు..
మత బోధకులు ఏం చేశారూ? సహాయపడిన వారికి కృతజ్ఞతలు చెప్పడం కూడా నేర్పించలేదు. పైగా మనుషుల్ని అవమానపరిచే పదం నేర్పారు. ''దేవుడి దయవల్ల'' అని అనమన్నారు. కృతజ్ఞతా భావం ఉంటే అది సహాయపడిన వారికే నేరుగా వ్యక్తం చేయాలి కదా? 'దేవుడి దయ' అనే పదం మనుషుల్ని అవమాన పరిచేది. మనువాదులు మతవాదులు అంతే కదా? వారు మనుషుల్ని మనుషులుగా ఎప్పుడు గుర్తించారు గనుక అయినా సహాయపడ్డవాడికీ, సహాయం తీసుకున్నవాడికీ మధ్య దేవుణ్ణి ఎందుకు జొప్పించారో - దాని వెనక జరిగిన కుట్ర ఏమిటో అర్థం చేసుకుంటే మంచిది. అబద్ధాన్ని నిలబెట్టాలనుకునే వారికీ, నిజాల్ని ప్రకటించే వారికి పొసగదు. తటస్థంగా ఉండేవారంతా ఆలోచించుకోవాలి. దేన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. అబద్ధం వైపు భ్రమల వైపు ఉన్నవారు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. అబద్ధపు పవిత్ర గ్రంథాల ప్రభావం సమకాలీన సమాజంపై ఎలా పడుతూ ఉందో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
హైదరాబాదు బంజారాహిల్స్లో ఓ తండ్రి ఘోరం - ఉన్నట్టుండి ఇంటి నుంచి చిన్న కూతురు మాయమైంది. పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. వారు ఆచూకీ తీసి, అమ్మాయిని వెతికి ఇంట్లో అప్పగించారు. అప్పుడు చిన్న కూతురు తను పారిపోవడానికి కారణం చెప్పింది. తన తండ్రే తనమీద అఘాయిత్యం చేస్తున్నాడని! అదివిని ఇంట్లోంచి పెద్దకూతురు కూడా ముందుకొచ్చి పోలీసుల ముందు అదే విషయం చెప్పింది. అంటే.. ఆ తండ్రి తన ఇద్దరు కూతుళ్ళపై ఒకరికి తెలియకుండా మరొకరిపై అఘాయిత్యం చేస్తున్నాడని తేలింది. ఒకే ఇంట్లో అక్కా చెల్లెళ్ళిద్దరూ వారి తండ్రి వల్లే చితికిపోయారని పోలీసులు తేల్చారు. నిందితుణ్ణి అరెస్టుచేసి తీసుకెళ్ళారు. ఇది 2021 జనవరి 19నాటి సంఘటన. మానవవాదులు ఎన్నడూ ఇలాంటి సంఘటనల్ని సమర్థించరు. అక్రమ సంబంధాలతో రాయబడ్డ మత గ్రంథాల్ని అర్థనిమిలిత నేత్రాలతో విని పరవశించిపోయేవారే ఆలోచించాలి. అర్థరహితమైన వ్యాఖ్యలు చేయడంలో మత గురువులు ఎప్పుడూ ముందుంటారు. ''బహిష్టు సమయంలో వంట చేసే మహిళ మరుజన్మలో వావి వరుసలు లేని వ్యభిచారిగా పుడుతుంది'' అని అన్నాడు స్వామి కృష్ణా స్వరూప్దాస్. జీవశాస్త్రపరంగా బహిష్టు అంటే ఏమిటో అతనికి అవగాహనలేదు. మరు జన్మగురించి అవగాహన లేదు. వ్యభిచారాన్ని ఎవరు పెంచి పోషించారో అవగాహన లేదు. నోరుందికదా వినే బకరాలున్నారు కదా అని ఏదో ఒకటి వాగడం ఎంత వరకు సబబూ? ''ఒరేరు నీ తల్లి బహిష్టు సమయంలో కూడా చిన్నప్పుడు నీకు పాలిచ్చిందిరా మనువాదీ!'' అని చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి కదా? లేకపోతే అతను తన అజ్ఞానాన్నే గొప్ప జ్ఞానంగా భావిస్తూ ఉంటాడు.
ఇలాంటి విషయం ఏదైనా చెప్పగానే ''ఏం మీకు హిందూమతంలోని తప్పులే కనిపిస్తున్నాయా? ఇతర మతాల్ని, ఆ మత గ్రంథాల్ని, ఆ మత బోధకుల్ని విమర్శించరా?'' అని తమ స్థాయిని తాము తగ్గించుకుని కొందరు మాట్లాడుతుంటారు. నిజానికి మానవవాదులెవ్వరూ ఏ మతాన్నీ వెనకేసుకురారు. మతం అని అంటే, అది అన్ని మతాల గురించి చెప్పిన మాట! మత విశ్వాసకులు అంటే అది అన్ని మతాల విశ్వాసకులు అని అర్థం.. ప్రతిసారీ ఒక్కొక మతాన్ని ఊటంకిస్తూ చెప్పడం కుదరదు. అల్లాను ప్రసన్నం చేసుకోవడం కోసం, ఆయన ప్రేమకు పాత్రురాలు కావడం కోసం కేరళ పాలక్కడ్ జిల్లాలో గర్భవతి అయిన ముప్పయేండ్ల తల్లి, తన ఆరేండ్ల కొడుకు గొంతుకోసి చంపేసింది. పాలకులే కాదు, మత విశ్వాసాలున్న ప్రజలు కూడా ఈ దేశాన్ని త్వరిత గతిన పాతరాతి యుగంలోకి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు. మత విశ్వాసంతో పరిపాలన సాగిస్తున్న ప్రస్థుత మత-కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఎంత ఘోరంగా విఫలమవుతూ ఉందో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. కోవిడ్ ఉధృతిలో జనం శవాల గుట్టలుగా పేరుకు పోతుంటే దేశ నాయకుడు మాత్రం ఎలక్షన్ ర్యాలీలు నిర్వహిస్తూనే వచ్చారు. కుంభమేళాకు అనుమతి ఇచ్చి, 30లక్షల మందిని గంగానదిలో నగంగా జలకాలాడించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వేశంతో బెంగాల్ వెళ్ళారు. బెంగాలీల మెప్పుకోసం బంగ్లా స్వాతంత్య్ర సమరంలో పాల్గొని జైలుకెళ్ళానని అబద్ధం చెప్పారు. కేరళ వెళ్ళి బైబిల్ సూక్తులు వల్లించారు. అన్నిచోట్లా అన్ని వేళలా మూర్తీభవించిన మత విశ్వాసంలా ఆయన రంగులు మార్చారు. ఇక సామాన్యుల్లో వైజ్ఞానిక స్పృహ పెంచడం ఎలాగని కొంతమంది రచయితలు, మేథావులు, సైన్సు సంస్థల కార్యకర్తలూ 'తపన'పడుతూనే ఉన్నారు. ''కొందరికి దేవునిపై నమ్మకం ఉంటే ఉండొచ్చు. కానీ, దాని ఆధారంగా ఇతరులపై మతాన్ని రుద్దే హక్కు ఎవ్వరికీ ఉండదు'' అని అన్నారు ప్రపంచ ప్రసిద్ధురాలైన నర్స్ - ప్లోరెన్స్ నైంటింగేల్!
''నా మానవత్వానికి మతం లేదు. నీ మతానికి మానవత్వం లేదు. అందుకే నీ మతం నాకు సమ్మతం కాదు'' అని మానవవాదులు గట్టిగా చెబుతున్నారు. ఇందులోని నిజానిజాలు అందరూ సీరియస్గా ఆలోచించాలి. ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో దమ్తరి జిల్లాలో సంతానం లేని మహిళలు బోర్లాపడుకుంటే పూజారులు మంత్రగాళ్ళమని చెప్పుకుతిరిగే కొందరు పురుషులు వారి వీపుపై నుంచి తొక్కుతూ వెళతారు. టెక్నాలజీ పెరుగుతోంది. కానీ జనంలో మూఢనమ్మకాలు తగ్గడం లేదు. మనుధర్మ శాస్త్రరీత్యా స్త్రీలు కూడా శూద్రులే - అయితే స్త్రీ గర్భం నుంచి పుట్టిన అగ్రవర్ణం వారంతా శూద్రులు కాకుండా ఎలా ఉంటారూ? ఎవరూ సూటిగా సమాధానం చెప్పరు. నిచ్చెనమెట్ల సంస్కృతికి కాలం చెల్లింది. ''తెలివితక్కువ తనం ఈజ్ ఈక్వల్ టు - భగవంతుడు!' - అనే ఫార్ములా ఇచ్చాడు రాహుల్ సాంకృత్యాయన్! అదెలాగంటే.. ''నీ తెలివి తక్కువ తనాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడి ''భగవంతుడు'' అనే గౌరవనీయమైన పేరు పెట్టుకున్నావ్! అంటే తెలివి తక్కువ తనం - భగవంతుడితో సమానం అయినట్టేకదా?'' అన్నది రాహుల్ సాంకృత్యాయన్ ఆలోచన!
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
డా||దేవరాజు మహారాజు