Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాలో నుంచి ప్రపంచం ఉద్భవించాలి
అది నా హృదయం మీద ఒరిగిపోవాలి
దాని నీటి బుగ్గలు నా జీవరక్తం నుంచి పుడతాయి
నా ఆత్మశ్వాస దాని ఆకాశ కలశాన్ని తాకుతుంది
వెళ్ళగలిగినంత దూరం సంచరించాను
ప్రపంచాల్ని పైనా కిందా పట్టుకుని తిరిగొచ్చాను'.. అంటూ జెన్నీకి అంకితం చేసిన 'అన్వేషిత' కవితలో నూతన ప్రపంచాల అన్వేషణ కోసం తనుపడే కలల్ని వర్ణిస్తాడు మార్క్స్. ఎడతెగని శోధన, అన్వేషణ యవ్వనం నుంచీ మార్క్స్లో ఉన్న విశిష్టలక్షణాలు. చివరికంటా అనంత జాగృత యాత్ర చేస్తూనే ఉన్నాడు. ఒక నూతన ప్రపంప సృష్టికి శక్తివంతమైన సత్యవంతమైన సాధనాలను మనకందించి, చైతన్యపు దీపదారిని వెలిగించిపోయాడు.
మార్క్స్ జన్మించి రెండువందలయేండ్లు గడచిపోయింది. మే5 రాగానే ఈ ప్రపంచగమన సూత్రాల గ్రంథపు పుటలల్లో, ఎవరేమిటో, ఎందుకిలానో బోధించే మార్క్స్ గొంతుక ధ్వనిస్తూనే ఉంటుంది. వ్యధలు, బాధలు, దు:ఖాలు, పీడనలు, దోపిడీలు, విభజనలు, భయాలు, బానిసత్వాలు, దేబురించడాలు, మోసాలు, మోహాలు, భ్రమలు, భయంకర హింసాకృతువులు, విధ్వంసాలు, అమానవీయకృత్యాలు, సకలం, సమస్తం, సమాజాన్ని ఎక్స్రే తీసి దోషాలను, అనారోగ్య కారణాలను స్పష్టంగా ఎత్తిచూపిన సామాజిక వైద్యుడు కారల్ మార్క్స్. అంతే కాదు, సర్వస్వతంత్రుడయి, సామూహిక మానవీయ ప్రతీకయి, నిర్భయుడయి, అజేయుడయి, నిత్య చలన శీలుడై, సంపూర్ణ మానవుడయి మనిషి మనగలిగే సమసమాజాన్ని నిర్మించుకునే నైపుణ్యాన్ని, ఆవశ్యక పరిణామాల్ని అర్థం చేయించిన మానవలోక మహానాయకుడు మార్క్స్.
నిరంతర సామాజిక చలనంలో కాలం కారల్మార్క్స్ను కన్నది. చరిత్ర తనను తాను నిర్మించుకునే ప్రయాణంలో మార్క్స్ను మహాశిల్పిగా తీర్చిదిద్దుకున్నది. ఇది మార్క్స్కు ఏదో మానవతీతశక్తిని ఆపాదించటం కోసం చెపుతున్నది కాదు. ఒక సామాజిక అనివార్యతలోంచే మార్క్స్ మేథస్సు వికసించింది. మార్క్స్కు ముందు అనేకానేక సామాజిక శాస్త్రవేత్తల, తత్తవేత్తల, ఆర్థికవేత్తల, జీవపరిణామ సిద్ధాంతవేత్తల, చరిత్రకారుల, న్యాయశాస్త్రజ్ఞుల, భాషాసాహిత్య, భౌతిక శాస్త్రాల శోధకుల పునాదులపై నుంచి నూతన అన్వేషణా చూపుతో చేసిన నిరంతర శ్రమా కృషిలోంచి మార్క్సిజాన్ని అందించగలిగాడు మార్క్స్. మహాపురుషులు తమ ఘనకార్యాల నిమిత్తం పరిస్థితులు పరిపక్వమైన చోట ప్రత్యక్షమవుతారన్నట్టుగా హెగెల్ మరణించిన సంవత్సరంలో కార్ల్ అనే పదమూడేండ్ల బాలుడు ట్రయర్లోని జిమ్నాజియమ్లో చదువుతూ ఉన్నాడు. ఈ పట్టణానికి సమీపంలోని బార్మెన్లో పదకొండేండ్ల ఫ్రెడరిక్ ఏంగెల్స్ ఉన్నాడు. వీరిద్దరి జన్మస్థలం రైన్లాండ్ కావడం యాధృచ్ఛికమైన గొప్ప సంఘటన. మార్క్స్కు ఇలా కలిసొచ్చిన రెండు అంశాల్లో ఏంగెల్స్ కూడా రైన్లాండ్లో జన్మించడం ఒకటయితే రెండోది, వాళ్ళ ప్రక్కనే ఉన్న లుడ్విష్ వెస్ట్ఫాలెన్ కుటుంబ స్నేహాన్ని పొందటం. వెస్ట్ఫాలెన్ మార్క్స్ మనసును సామాజిక విషయాలపైకి మళ్ళించి ఆనాడున్న వ్యవస్థపై విమర్శనాత్మక వైఖరిని రేకెత్తించిన తొలి వ్యక్తి. ఇక అతని కుమారుడు ఎడ్గార్ మార్క్స్కు పాఠశాల స్నేహితుడు. కమ్యూనిస్ట్ లీగ్ వరకూ కొనసాగిన మిత్రుడు. ఇక వెస్ట్ఫాలెన్ కూతురే జెన్నీ. మార్క్స్ భార్యగా జీవితాంతం విశ్వసనీయ సహచరిణి, అతని మేథోశ్రమలో అనుభవించిన దారిద్య్రంలో నిజమైన భాగస్వామి. తండ్రి హైన్రిచ్ మార్క్స్ నుంచి జర్మనీ, ఫ్రెంచ్ సాంస్కృతిక వారసత్వాన్ని పొంది, అభివృద్ధి నిరనోధక శక్తులు విజృంభిస్తున్న ప్రష్యావరణంలోంచి ప్రపంచాన్ని కొత్తగా చూసి మరో ప్రపంచ నిర్మాణ స్వాప్నికుడుగా రూపొందిన సృజనాత్మక తాత్వికుడు మార్క్స్.
విద్యార్థి దశనుంచే మార్క్స్లో ఉన్న భావాలు గమనిస్తే ఆరంభం నుంచే ఏ ఆలోచనలతో కొనసాగాడో మనకర్థమవుతుంది. ''అతడు తన కోసమే శ్రమించినట్టయితే బహుశ గొప్ప పండితుడుగా, గొప్ప జ్ఞానిగా, మంచి కవిగా ప్రసిద్ధి చెందవచ్చు. కానీ అతనెప్పటికీ పరిపూర్ణుడు, సిసలైన గొప్ప వ్యక్తిగా ఉండజాలడు. తొటివారి మేలు కోసం శ్రమించడం ద్వారానే మనిషి పరిపూర్ణతను సాధించగలుగుతాడు'' అని పదిహేడవయేటనే చెప్పగలిగాడు.
ఇప్పుడు మార్క్సిజానికి ప్రాసంగికతలేదని, పాతబడిన భావాలని, శాస్త్ర సాంకేత విజ్ఞానం చాలా పెరిగిందని, ద్రవ్య పెట్టుబడి, ప్రపంచీకరణ వచ్చిందని చాలా మంది పెట్టుబడిదారీ సిద్ధాంత వేత్తలు, అధ్యయనం చేయని యువత చర్చ చేస్తుంటారు. కానీ, బ్రహ్మాండమైన సామాజిక మార్పులతో కూడిన ఈ యుగంలో ఉన్నంత 'ఆధునికంగా' మార్క్స్ బహుశ మరెప్పుడూలేడు. ఎందుకంటే మార్క్స్ ఎంత సుదూర భవిష్యత్తులోకి చూశాడనేది ఈనాడు మరీ మరీ స్పష్టంగా వెల్లడవుతూ ఉంది.
ప్రపంచం నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అది పర్యావరణ సంక్షోభం, జీవావరణ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, సామాజిక సంక్షోభం, తాత్విక సంక్షోభం. ఇలా అన్ని రంగాలలోనూ తీవ్రమైన సంక్షోభాలు చోటు చేసుకున్నాయి. వ్యాధులు, బాధలు, ఆకలి, చావులు, కరువులు, ఉపాధిలేమి, పర్యావరణ విధ్వంసం, నిర్బంధాలు, నేరాలు, నిరంకుశ నియంతృత్వ పాలన, మానవ విలువల హననం కండ్లముందు అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు జరిగిపోవడం ఎరుకలో ఉన్న విషయమే. దీనికి మూలమైన కారణాన్ని ఇప్పటి వరకు ఎవరైనా చెప్పారా? ఇదీ పరిష్కారమని ఒక్క విధానాన్ని సూచించారా? లేదు. కానీ వీటన్నింటికీ మార్క్స్ ఆనాడే కారణాన్ని కనిపెట్టాడు. ఇవన్నీ జరగకుండా ఆపడమెలాగో సశాస్త్రీయంగా ప్రకృతి నియమాల, సామాజిక నియమాల సంబంధాలను విపులంగానే వివరించి చెప్పాడు. ఇలాంటి సంక్షోభాలు వస్తాయనీ చెప్పాడు.
ఈ విషయం కేపిటలిస్టులకు బాగా తెలుసు. వారి దోపిడి గుట్టును బైటపెట్టాడనీ తెలుసు. అందుకే వాళ్ళకు మార్క్సిస్టులంటే గుండెల్లో గుబులు. ఇంకెవ్వరొచ్చినా వాళ్ళకొచ్చే ఇబ్బందేమీలేదు. కమ్యూనిస్టులు రావద్దు. మిగతా వాళ్ళందరినీ కలిపయినా కమ్యూనిస్టులను అధికారంలోకి రాకుండా చూస్తారు. అంతేకాదు, గొంతు విప్పేందుకు కూడా అవకాశం లేకుండా చేస్తారు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. అయినా తోసుకుని వాళ్ళువస్తారు. సూర్యుడు ఉదయించినట్లు. ఇది ఆశకాదు. చారిత్రక సత్యం. మార్క్సిజాన్ని ధ్వంసం చేయడానికి బూర్జువా సిద్ధాంతవేత్తలు విశ్వప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎన్నో వాదాలను తీసుకొచ్చారు. మార్క్స్ బతికున్నప్పటి నుంచీ ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ నిష్పలమవటాన్ని చూస్తున్నాం. సాహసోపేతమైన, సృజనాత్మకమైన, అన్వేషణాత్మక మార్క్స్ ఆలోచన వర్తమాన ప్రపంచంలో సజీవంగా ఉంటూ పోరాడుతోంది. జీవితంలో, సామాజిక పోరాటంలో ప్రతి ఒక్కరికి తమ తమ స్థానమేదో తెలుసుకోవడానికి, ప్రపంచం నుంచి సామాజిక మాలిన్యం కుళ్ళు తొలగించడానికి, యుద్ధాలు, బాధలు పేదరికం, ఆకలి, అన్యాయం నివారించడానికి తోడ్పడుతోంది. ఈ భూతలాన్ని మానవుని నివాసయోగ్యంగా చేయడానికి తోడ్పడే ఏకైక సిద్ధాంతం, ఆచరణ మార్క్సిజమే.
మార్క్స్ సరుకు ప్రపంచాన్ని గూర్చిన విశ్వరూపాన్ని తన పెట్టుబడి గ్రంథంలో వివరించాడు. శ్రమదోపిడీ ఏరకంగా, ఎంత ముసుగేసుకుని జరిగిపోతోందో, శ్రమ పరాయీకరణతో తనను తానే కోల్పోయే మనిషి ఎలా అన్యధీకరించబడతాడో విపులంగా వివరిస్తాడు. సహజంగా మానవుని మౌలిక కార్యకలాపమైన శ్రమ చేయడంలో ప్రకృతిని మారుస్తూ తనూ మారతాడు. తన సొంత కార్యకలాపంపై అదుపాజ్ఞలను తానే కలిగి ఉంటాడు. కానీ పనిచేస్తూనే తన పనిపై అదుపాజ్ఞలను కోల్పోవడమే పరాయీకరణ. అప్పుడు పనిచేసే సాధనంగా మానవుడు మారిపోతాడు. పరాయీకరణలో అసలు మనిషికి సముచితంగా చెందవలసిన దాన్ని వేరే మరేదో కొట్టేయడమే. ఇక వస్తువుగా మారి అన్యధీకరించబడి అమానవీయమైన వాడిగా ఉంటాడు. ఆస్తియొక్క వ్యక్తీకరణయే మనిషి జీవితంగా మారాక అసలు మనిషి కనపడడు. కనుక మనిషిని పరాయీకరించిన అసలు కారిణి సొంత ఆస్తి. ఆర్థిక పరాయీకరణకు సంబంధించిన అన్ని ఛాయలు రాజకీయ, మత, తాత్విక, నైతిక, న్యాయ, చట్ట మొదలైన అన్ని అంశాలు ఆర్థిక పరాయీకరణ ప్రతి ఫలనంగానే రూపొందుతాయి. మీరొక్క ఉదాహరణ చూడండి. తనకు స్వతహాగా ఏ శతృత్వం లేకపోయినా డబ్బు తీసుకుని కిరాతకంగా హత్యచేస్తాడు. అంటే ఓ కత్తి చేసేపనే మనిషీ చేశాడు. మనుషులు వస్తువులుగా కొనబడతారు, అమ్మబడతారు. ఇప్పుడు అధికారాన్ని కూడా కొనగలుగుతున్నారు. రాజకీయమూ అమ్మబడుతోంది. కాబట్టి అన్ని అనర్థాలకు మూలమైన సొంత ఆస్తిని రద్దు చేసినప్పుడే మానవ సారపు అనుభూతుల వినియోగం జరుగుతుంది. అప్పుడే మనిషికి యదార్థమైన జీవితం లభిస్తుంది. మనిషి విలువలన్ని డబ్బులో నిక్షిప్తమవుతాయి. అదే విధంగా మతంలో అయితే మనిషికి చెందవలసిన స్వీయ స్థితిని దేవుడు ఆక్రమించుకుంటాడు. మనిషి యొక్క బాధలకు, బరువులకు పరిహారంగా అతని ప్రగాఢమైన కోరికల అభివ్యక్తీకరణకు మాధ్యమంగా విధిని మతం నిర్వర్తిస్తుంది. అంటే మనిషిపని, ఆలోచన ప్రాధాన్యత కోల్పోతుంది.
భౌతిక సంపదలపై, ఉత్పత్తి సాధనాలపై ఎవరు ఆధిపత్యం కలిగి ఉంటారో వారే మేథో సాధనాలపై యాజమాన్యం కలిగి ఉంటారని మార్క్స్ ఎంగెల్స్లు జర్మన్ ఐడియాలజీలో వివరిస్తారు. సాంస్కృతికపరమైన ఆధిపత్యం కారణంగా తమ వర్గ దోపిడీకి సమ్మతిని ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. అంటే కర్మ సిద్ధాంతం, ప్రజలను అణచిఉంచటానికి, వారి బాధలకు, కష్టాలకు దోపిడీ కారణం కాదని, వారి జన్మల కర్మఫలమని ప్రజలంతట ప్రజలే నమ్ముకునేలా తయారుచేస్తారు. విద్యా సంస్థలు, న్యాయం, చట్టాలు, నీతులు, సాంస్కృతిక అంశాలు అన్నీ దోపిడీకి అనుకూలతను, సమర్థతను పొందేందుకు ఉపయోగపడుతాయి. అయితే దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు రాకమానవు. అయితే నేడు పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ ప్రతిఘటనలను కూడా మార్కెట్ చేస్తున్నది. ప్రజల సంస్కృతిని హైజాక్ చేసి ఈవెంట్ మేనేజ్మెంట్ల క్రింద మార్చి సజీవ సంస్కృతిని ధ్వంసం చేస్తున్నది. ఇప్పటికే పెట్టుబడి దోపిడీ ఉత్పత్తి విధాన ఫలితంగా ప్రకృతి విధ్వంసానికి గురయింది. దాని ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న కరోనా విపత్తు. మార్క్స్ ఆనాడే విశదీకరించిన అదనపు విలువ దోపిడీ ఫలితంగానే శ్రామికులు మరింత దారిద్య్రంలోకి, అణచివేతకి, అస్థిరతలోకి నెట్టబడుతున్నారు. సంపద కొందరివద్దే పోగుబడుతోంది. లేమితనం, దారిద్య్రం మరోవైపు పెరుగుతోంది. ఈ సత్యం మార్క్స్ కాలంలో కంటే ఇప్పుడు మరింత స్పష్టంగా కనపడుతోంది. శ్రామికవర్గం తాము పోగొట్టుకుంటున్నది తెలుసుకుని తమను తాము నిజమైన మనుషులుగా నిర్మించుకునే వ్యవస్థకు పురుడుపోస్తుంది.
ఈ వ్యవస్థ మారక తప్పదు. అప్పటి వరకు ఎదురయ్యే ఓటములు కష్టాలు కమ్యూనిస్టులను కుంగతీయలేవు. అందుకే ''సునాయాసంగా సఫలీకృతం అయ్యే ప్రయత్నం కాదు నాది, శాంతియుతంగా జరిగేదీ కాదు, నా ఈ అవిశ్రాంతతకు అదే కారణం, ఇక్కడ బుద్ధిజీవులు, మంచుగడ్డల్లో చచ్చిన శవాలై తిరుగుతున్నారు. ఇప్పట్లో వాళ్ళకు నేనరన్థం కాను. ఏ వరదలూ నన్ను ముంచెత్తలేవు, ఒక నవ్య సృష్టి జరుగుతుంది, ఒక కొత్త వ్యవస్థకు ద్వారాలు తెరచుకుంటాయి. విజయం వరించదనే భయం లేదు'' అనిమార్క్స్ ఇచ్చిన ధైర్యం, మనందరికీ ఆశయాల కోసం నిబద్ధంగా ముందుకు పోయేందుకు ప్రేరణనిస్తూనే ఉంటుంది. మార్క్స్ ప్రపంచం ఉన్నంత వరకూ చీరంజీవుడే.
కె. ఆనందాచారి
సెల్:9948787660