Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లపై ఈ నెల 5న సుప్రీంకోర్టు యిచ్చిన తీర్పు చరిత్రలో నిలుస్తుంది. మహారాష్ట్రలో మరాఠాలకు కల్పించిన రిజర్వేషన్ల విషయంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వెలువరించిన ఆ తీర్పులో రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలపైన స్పష్టత యివ్వడం జరిగింది. రిజర్వేషన్లు 50శాతం మించకూడదు. కేంద్ర ప్రభుత్వం దేశ మంతటా షెడ్యూల్డ్ కులాలకు 15శాతం, షెడ్యూల్డ్ తెగలకు 7.5శాతం మొత్తం 22.5శాతం చొప్పున విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అవి జనాభా ప్రాతిపదికన కల్పించబడిన సామాజిక రిజర్వేషన్లు. రాజ్యాంగం ప్రసాదించిన సామాజిక రిజర్వేషన్లు తరాల తరబడి పీడనకు వంచనకూ గురైన అణగారిన తరగతుల వారికి తాత్కాలిక ఊతంగా ఉపయోగ పడుతున్నాయి. కాగా మండల్ కమీషన్ సిఫార్సుల మేరకు 1992 నుంచి ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వారికి 27శాతం రిజర్వేషన్లు కల్పించబడినవి. దానితో మొత్తం రిజర్వేషన్లు 49.5శాతానికి చేరినవి. దేశ జనాభాలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వారు 27శాతం కంటే ఎక్కువే ఉంటారు. కానీ రిజర్వేషన్లు 50శాతం మించకూడదు అనే పరిమితి దష్ట్యా ఓబీసీ జనాభాలో క్రీమీ లేయర్ని మినహాయించి 27శాతం మంది పేదలకే రిజర్వేషన్ సదుపాయం అనుమతించింది. అయితే 50శాతం గరిష్ట పరిమితి తొలగించాలని, ఇంకా చాలా మందికి రిజర్వేషన్ సదుపాయం అనుమతించాలని కోరుతూ గడిచిన మూడు దశాబ్దాల కాలంలో వివిధ సందర్భాల్లో న్యాయస్థానాల్లో పలు వ్యాజ్యాలు నడిచినవి. వాటన్నింటిని సుప్రీం కోర్ట్ తోసిపుచ్చుతూ వచ్చింది. కాగా మరాఠా రిజర్వేషన్ల వ్యాజ్యం వాదనల్లో రిజర్వేషన్లపై గరిష్ట పరిమితిని పున్ణపరిశీలించాలనే అభ్యర్ధన మరింత విస్పష్టంగా తిరస్కరించబడింది. మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదంటూ ఇందిరా సాహ్ని కేసులో 9మంది సభ్యుల ధర్మాసనం 1992లో యిచ్చిన తీర్పు రిజర్వేషన్ల విషయంలో చారిత్రాత్మక తీర్పుగా ప్రసిద్ధిగాంచింది. అనంతరం జరిగిన రాజ్యాంగ సవరణలు, సామాజికంగా వచ్చిన మార్పుల కారణంగా ఈ తీర్పును పరిశీలించాలన్న వాదనలు చాలా సందర్భాల్లో వచ్చాయి. అయినా ఆ తీర్పును బలపరుస్తూ కనీసం నాలుగు సందర్భాల్లో రాజ్యాంగ ధర్మాసనాల నిర్ణయాలు వెలువడినందున దీనిని మరోసారి పరిశీలించాల్సిన అవసరం లేదు. అందువలన 11మంది సభ్యుల విస్తత రాజ్యాంగ ధర్మాసనానికి పంపించాల్సిన పని లేదని జస్టిస్ అశోక్ భూషణ్ నేతత్వంలోని జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్త, జస్టిస్ రవీంద్ర భట్ లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తిరస్కరించింది. ''50శాతం పరిమితిని తొలగించాలంటే అది సమానత్వ ప్రాతిపదికన కాకుండా కుల ఆధారిత సమాజం అవుతుంది. రాజకీయ వత్తిళ్లతో రిజర్వేషన్లను పెంచుకుంటూ పొతే అసమానతలు తగ్గించడం కష్టమవుతుంది. పురోగమనం కాకుండా అందరూ వెనుకబాటుతనాన్ని కోరుకుంటే దేశంలో స్తబ్దత ఏర్పడుతుంది. అది రాజ్యాంగ ఆశయాలకు విరుద్ధం'' అని ధర్మాసనం పేర్కొంది. వెనుకబడిన తరగతుల అభివద్ధికి ఒక్క రిజర్వేషన్లే సరిపోవని, ఇతర సంక్షేమ చర్యలు ఉండాలని సూచించింది. కాగా రిజర్వేషన్లకు అర్హతగల వెనుకబడిన తరగతుల అభివృద్ధిలో కాలానుగుణంగా ఏర్పడే హెచ్చుతగ్గులను బట్టి చేర్పులు మార్పులు చేయవచ్చు. అందుకు 102వ రాజ్యాంగ సవవరణ ఎలాగూ ఉంది. అయితే సామాజికంగా ఆర్ధికంగా వెనుకబడిన కులాలను నిర్ణయించే అధికారం మాత్రం రాష్ట్రపతి (కేంద్ర ప్రభుత్వం)కే ఉండాలని చెప్పింది. అందుకోసం వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ వేసి, అది చేసే సిఫార్సుల ఆధారంగానే చేయాల్సి ఉంటుందని వివరించింది. ఫలానా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ప్రతిపాదనలు చేయవచ్చు. కానీ తమకు తామే అమలు చేసుకొనే అధికారం రాష్ట్రాలకు లేదనే విషయాన్ని నొక్కి వక్కాణించింది. అందువల్లనే అది రిజర్వేషన్ల విషయంలో మరో చారిత్రక తీర్పుగా నిలుస్తుంది.
- నాగటి నారాయణ
సెల్:9490300577