Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి శరీరం లో జ్ఞానేంద్రియాలు అతి ముఖ్యమైనవి. ఒక్కొక్క జ్ఞానేంద్రియం ఒక్కొక్క రకమైన పనిచేస్తూ సమాజంలో మనిషి మనుగడకు దోహద పడుతున్నవి. కళ్ళు చూడడానికి దోహద పడతే చెవులు వినడానికి ఉపయోగపడుతున్నవి. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన కండ్లకు, చెవులకు ప్రాధాన్యత నివ్వడంలో నేటి సమాజం నిర్లక్ష్యం చేస్తుంది. ఈ నిర్లక్ష్య ఫలితంగానే నేడు వినికిడి శక్తి లోపం పెరుగుతుంది.
ఆడియాలజీ (లాటిన్ ఆడియర్ నుండి, ''వినడానికి'', గ్రీక్ -లోజియా నుండి) ఏర్పడిన తరువాత ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న అంతర్జాతీయ ఆడియాలజిస్టు దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది వినికిడి, సమతుల్యత, సంబంధిత రుగ్మతలను అధ్యయనం చేస్తుంది. ఆడియాలజిస్టులు వినికిడి లోపం ఉన్నవారిని గుర్తించి చికిత్స చేస్తారు. వినికిడి లోపం గుర్తించబడితే, శ్రవణ నిపుణులు ఏ వినికిడి పరికరాలను వినియోగించాలో నిర్ణయిస్తారు. నష్టం తీవ్రత, వినికిడి లోపం కనుగొనబడితే వినికిడి శక్తిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వినికిడి లోపం రోజురోజుకూ పెరుగుతుంది. మనదేశంలో 15 నుంచి 20 శాతం మంది వినికిడి, మాట సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక రకమైన వినికిడి సమస్యతో బాధపడే వారి సంఖ్య 10శాతం వరకు ఉంటుందని అంచనా. 2 లక్షల మంది విద్యార్థులు వినికిడి సమస్య కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో 50ఏండ్ల వయసు పైబడిన వారిలో వినికిడి తీవ్రత అధికమవుతుంది. 2050 వరకు వినికిడి సమస్య తీవ్రత పెరిగి ప్రతి నలుగురిలో ఒకరికి వినికిడి లోపం ఏర్పడుతుందని 2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి.
మానసిక క్షోభకు గురి చేస్తున్న వినికిడి సమస్య
వినికిడి సమస్య అనేది ప్రతి ఒక్కరిని తీవ్ర మానసిక సమస్యకు గురి చేస్తున్న వ్యాధిగా మారింది. వినికిడి లోపం ఉన్నవారు సకలాంగులతో కలిసి ఏమి చేయలేమని అందరితో కలిసి మెలిసి ఉండలేమని చుట్టూ జరుగుతున్న ఎలాంటి పరిణామాలను గమనించలేకపో తున్నామని బాధపడుతుంటారు. ప్రయాణాలు చేసే సమయంలో బస్స్టాండ్, రైల్వే స్టేషన్లలో చేస్తున్న ప్రకటనలు తెలుసుకోలేక తోటివారిని అడగలేక లోలోపల కుమిలిపోతుంటారు. ప్రారంభంలోనే వినికిడి లోపాన్ని గుర్తిస్తే భవిష్యత్తులో జరిగే పెద్ద నష్టం నుండి పిల్లలని కాపాడుకోవచ్చుననే విషయం చాలామంది తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా వినికిడి లోపంతోపాటు సమాజంలో ఒంటరిగా మిగిలిపోతున్నారు.
సమాజంలో ఆడియాలజిస్ట్ పాత్ర
శ్రవణ, వెస్టిబ్యులర్ సిస్టమ్స్ యొక్క రుగ్మతలను గుర్తించడం, నిర్థారణ చేయడం, చికిత్స చేయడం, పర్యవేక్షించడంలో నైపుణ్యం కలిగిన, ఆరోగ్య సంరక్షణకు అవసరమైన సూచనలు జాగ్రత్తలు చెప్పే నిపుణుడే ఆడియోలజిస్ట్. వినికిడి సమతుల్య సమస్యలను గుర్తించడానికి, చికిత్స చేయడానికి ఆడియాలజిస్ట్లు కృషి చేస్తారు. శిశువులలో వినికిడి లోపం నిర్థారణ చేయడం ద్వారా వినికిడి శక్తి లోపం విస్తరించకుండా నివారించేందుకు కృషి చేస్తున్నారు. వినికిడిలోపం ఉన్నవారికి కోపింగ్, పరిహార నైపుణ్యాలను నేర్పించడంలో సహాయపడతారు. సహాయ పరికరాల రూపకల్పన, వ్యక్తిగత పారిశ్రామిక వినికిడి భద్రత కార్యక్రమాలు, నవజాత వినికిడి స్క్రీనింగ్ కార్యక్రమాలు, పాఠశాల వినికిడి స్క్రీనింగ్ ప్రోగ్రామ్లు, వినికిడి నష్టాన్ని నివారించడానికి సహాయపడే ప్రత్యేక లేదా అనుకూలంగా అమర్చిన ఇయర్ ప్లగ్లు, ఇతర వినికిడి రక్షణ పరికరాలను అందించాలి. లోపలి చెవి యొక్క వెస్టిబ్యులర్ భాగం యొక్క పాథాలజీల నుండి ఉత్పన్నమయ్యే పరిధీయ వెస్టిబ్యులర్ రుగ్మతలను అంచనా వేయడానికి శిక్షణ పొందిన ఆడియాలజిస్టులు అవసరం. బెనిగ్న్ పరోక్సిమల్ పొజిషనల్ వెర్టిగో (బిపిపివి) వంటి కొన్ని వెస్టిబ్యులర్, బ్యాలెన్స్ డిజార్డర్లకు చికిత్సను అందిస్తారు. ఆడియాలజిస్టులు నియోనాటల్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ను కూడా అమలు చేస్తున్నారు. ఇది యుఎస్, యూకే, భారతదేశంలోని అనేక ఆసుపత్రులలో తప్పనిసరి చేయబడింది. 2018లో కెరీర్ కాస్ట్ యొక్క నివేదిక సర్వే ప్రకారం మూడవ అతి తక్కువ ఒత్తిడితో కూడిన ఉద్యోగం ఆడియాలజిస్ట్ వృత్తి. ఈ వృత్తిని ఎంచుకోవడం ద్వారా సమాజానికి మేలు చేయడం కోసం నేటి తరం యువత మందుకు రావాలి.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలో గణనీయంగ వినికిడి లోపం ఏర్పడింది. ఆడియాలజీ ఇంటర్నేషనల్ సొసైటీ 1952లో స్థాపించబడిన తరువాతనే వినికిడి శక్తి నివారణకు తీసుకోవలసిన చర్యలపై సైంటిఫిక్ పీర్-రివ్యూడ్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీ ప్రచురణల ద్వారా జాతీయ సంఘాలు, సంస్థల మధ్య పరస్పర సంబంధం ఏర్పడింది. వినికిడి లోపం ఉన్న వారికి అవసరమైన సహాయం అందించేందుకూ, వినికిడి లోపం, చెవిటి వారి అవసరాలను తీర్చడానికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరంతరం కృషి చేస్తుంది.
చేయాల్సిన కృషి
ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో ప్రతి 5 లక్షల మందికి ఒక ఆడియాలజిస్ట్ మాత్రమే ఉన్నారు. ఉదా: యూఎస్ఏలో 33కోట్ల మంది ప్రజలకు 2 లక్షల మంది ఏఎస్ఎల్పీ డాక్టర్స్ ఉంటే ఇండియాలో 133 కోట్ల మంది ప్రజలకు కేవలం 5000 మంది మాత్రమే ఉన్నారు.
రాష్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఆడియాలజిస్టు కళాశాలలు ఏర్పాటు చేయాలి. అన్ని మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులలో దీ.Aూూూ/వీ.Aూూూ ఆడియాలజిస్టులను నియమించాలి. పుట్టిన ప్రతి శిశువుకు 24గంటలోగా వినికిడి పరీక్షలు చేయించాలి. ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో వినికిడి పరీక్షలు చేయాలి. స్కూల్ పిల్లలకు సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా వినికిడి పరీక్షలు చేయించాలి. వినికిడి సమస్య గుర్తించి విద్యార్థులందరికీ ఏడీఐపీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మిషన్స్ సరఫరా చేయాలి. వినికిడి సమస్యతో బాధపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వినికిడి మిషన్లు కొనుక్కోడానికి అవసరమైన పూర్తి ఆర్థిక సహాయం చేయాలి. వినికిడి సమస్యతో బాధపడుతున్న పేదలకు కూడా ఆరోగ్యశ్రీ స్కీము ద్వారా నాణ్యమైన వినికిడి మిషన్లు అందించాలి. పుట్టుకతోనే వినికిడి సమస్య ఉండి కాక్లియర్ ఇంప్లాంట్ చేయాల్సిన అవసరమున్న చిన్నారులకు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రస్తుతం ఉన్న ఒక చెవికి కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలు ఉచితంగా చేయాలి. మాటలు రాని మూగ వారికి స్పీచ్ థేరపి ప్రభుత్వమే ఉచితంగా ఇప్పించాలి.
- యం.అడివయ్య
- కె.నాగేందర్