Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం తెలియాలంటే, దానికంటే ముందున్న మనుధర్మ శాస్త్రం గురించి, అప్పటి దారుణ పరిస్థితుల గూర్చి కొంత తెలుసుకోవాలి. ఇప్పుడున్న రాజ్యాంగాన్ని పక్కనపెట్టి అదే పాత మనుస్మృతిని మళ్ళీ అమలు చేయాలని ప్రస్థుత కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అది మళ్ళీ వేరే విషయం. అణిచివేత గురించి పెరియార్ ఇ.వి.రామసామి ఏమన్నారో ఒకసారి శ్రద్ధగా గమనించండి.. ''ఒక పెద్ద దేశం, చిన్న దేశాన్ని అణిచివేయాలని చూస్తే, నేను చిన్న దేశం వైపు నిలబడతాను. ఆ చిన్న దేశంలోని మెజారిటీ మతం చిన్న మతాన్ని అణగదొక్కాలని చూస్తే, నేను చిన్న మతంవైపు నిలబడుతాను. ఆ మైనార్టీ మతంలో కులాలుండి, అందులో ఒక కులం మరో కులాన్ని అణగదొక్కాలని చూస్తే - నేను, అణిచివేతకు గురయ్యే కులం వైపు నిలబడతాను. ఆ అణిచివేతకు గురైన కులంలో ఒక యజమాని తన నౌకరును అణిచివేస్తుంటే నేను ఆ నౌకరు వైపు నిలబడతాను. ఆ నౌకరు తన ఇంట్లో తన భార్య హక్కుల్ని కాలరాస్తుంటే.. నేను ఆ నౌకరు భార్యవైపు నిలబడి గొంతెత్తుతాను. చివరికి నేను చెప్పేది ఏమిటంటే.. అణిచివేత అనేది ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నా అది నా శత్రువు'' మానవవాదులందరూ ఈ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. వివక్ష అనేది ఎక్కడ ఉన్నా, ఏ రకంగా ఉన్నా ఖండించాల్సిందే.
సహజంగానే మనలో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. దేశంలో కులమతాల బేధాలతో జనం ఇంకా ఎందుకు విడిపోయి ఉన్నారు? ఉన్నత వర్గాలు, నిమ్నవర్గాలూ అని ఇంకా విభజనలు ఎందుకున్నాయి? సమాజంలోని ఆ బలహీనతను ఉపయోగించుకునే కదా రాజకీయ నాయకులు ఆటలాడుతున్నారు. సమాజంలో బ్రాహ్మణులు, పూజారులు దైవభక్తిగల సచ్ఛీలురని, మాంసభక్షణ చేయరని ఒక తప్పుడు అభిప్రాయం ప్రచారమైంది. మొదటవారు ఎలా ఉండేవారు, తర్వాత కాలంలో ఎలా మారారూ? ఎందుకు మారారూ? అనే విషయాలకు చారిత్రక ఆధారాలు లభించిన తర్వాత కూడా తప్పుడు అభిప్రాయంలో ఉండటం న్యాయమా? దేశంలో బౌద్ధాన్ని నాశనం చేసే ఉద్దేశంతో బుద్ధుణ్ణి దశావతారాలలో చేర్చుకుని, బౌద్దారామాల్ని ఆలయాలుగా మార్చుకుని, అహింస పాటిస్తూ, బౌద్ధుల కాషాయాన్ని స్వంతం చేసుకుని వైదికవర్గం మారిపోయింది. అసలైతే జంతు బలులు, మాంసభక్షణ వారికి వేదకాలం నుండీ ఉంది. అందుకు స్పష్టమైన ఆధారాలు మనుస్మృతిలో, వేదాలలో, పురాణాలలో కనిపిస్తున్నాయి. అన్ని అబద్దాల వలెనే వారి అహింసా సిద్ధాంతం అబద్ధం. వారి శాఖాహార భక్షణ అబద్ధం. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మనువాదులు నిజాయితీగా ఆ విషయాలు ఒప్పుకోవాలి. మాంసం తినే ఇతర మతస్థులపై దాడులు చేయడం మానుకోవాలి. కొన్నేండ్ల క్రితం అఖ్లక్ అనే ముస్లిం ఇంట్లో జొరబడి అతడి ఫ్రిజ్లో మాంసం ఉందని.. అతణ్ణి కొట్టి చంపిన ఉదంతం మనకు గుర్తుంది. మనువాద దేశభక్తులు అలాంటి దాడులు చేసేముందు తమ పూర్వీకుల మాంసభక్షణ గురించి తెలుసుకుంటే మంచిది. మనుస్మృతిలోని విషయాలు నెమరువేసుకోవడం మంచిది...
''క్రీత్వా స్వయం వావ్యుత్పాద్య పరోపకృత మేవ వా,
దేవాన్ పితృం శ్చార్చయిత్వా, ఖాదన్ మాంసం న దుష్యతి 32
నాద్యాదవిధినా మాంసం విధిజ్ఞో నాపది ద్విజ:
జగ్ద్వా హవిధినా మాంసం ప్రేత్య తైరద్యతే వశ: 33
న తాదృశం భవత్యేనో మృగ హంతుర్థనార్థిన:
యాదృశం భవతి ప్రేత్య వృధా మాంసాని ఖాదత: 34
ఈ శ్లోకాల తాత్పర్యం ఏమిటంటే.. కదిలే ప్రాణులకు కదలలేని ప్రాణులు, కోరలు గల ప్రాణులకు కోరలు లేని ప్రాణులు, చేతులున్న ప్రాణులకు చేతులు లేని ప్రాణులు, శూరులకు పిరికిపందలు ఆహారంగా కల్పించబడ్డారు. ప్రతిదినం అన్నంతో (తినదగిన) ప్రాణులమాంసం తినడం పాపం కాదు. బ్రహ్మ దేవుడే భక్షించగల వాటిని ఏర్పరిచాడు. యజ్ఞం కోసం పశువును హింసించి, హౌమంచేసి ఆ హవిశ్శేషాన్ని(యజ్ఞంలో మిగిలిన శేషాన్ని) తినడం మంచిది. అది దైవ విధి! అలా కాకుండా, స్వార్థానికై ప్రాణుల్ని చంపి తినడం రాక్షస విధానం. కొన్న దాన్ని / సమకూర్చు కున్న దాన్ని / ఇతరులు ఇచ్చింది ఏ మాంసమైనా దేవతలకు, పితృదేవతలకు నైవేద్యం పెట్టి తినాలి. నైవేద్యం పెట్టని మాంసం తినగూడదు. ఒకవేళ అలా తింటే జన్మాంతరంలో ఆ జంతువులే అతణ్ణి తింటాయి. బతుకు దెరువుకు, ధనం కోసం, జంతువుల్ని చంపి మాంసం అమ్ముకునేవారు పాపులు! బోయలైనా, కటిక వారైనా, రుచికోసం జంతువుల్ని చంపేవారైనా.. పాపం మూటగట్టు కుంటారు. దేవతలకు నైవేద్యం పెట్టేవారికి మాత్రం పాపం అంటదు. ఇక్కడ మాంస భక్షణలో కూడా దైవాన్ని, దైవభక్తిని, వారి సంప్రదాయాల్ని ప్రచారం చేసుకోవడం కనిపిస్తుంది. ముస్లింలలో కూడా హలాల్ చేయని మాంసం తినరు. హలాల్ అంటే దేవుడికి / అల్లాకు సమర్పించడం - నైవేద్యమే! పొట్టకూటికి వేటాడి, మాంసం అమ్ముకునే వారికి మాత్రం పాపం తగులుతుందని ప్రచారం చేశారు. అంటే బలవంతంగా సంప్రదాయాల వైపు, మూఢ నమ్మకాలవైపు జనాన్ని మళ్ళించడం జరిగింది. దేశంలో అధిక సంఖ్యాకుల్ని శూద్రులుగా ముద్రవేసి, ప్రతి చిన్న విషయంలోనూ వారి మీద ఆధిపత్యం కొనసాగించడం వైదిక మత బోధకుల నైజమని అర్థమవుతూ ఉంది. యజ్ఞం పేరుతో మాంస భక్షణ చేసి, సురాపానం చేసి విలాసాల్లో తేలిపోవడం.. అయితే అదంతా దేవుడి పేరుతో జరిగేది కాబట్టి, వారి చర్యల్ని గౌరవభావంతో చూడాలన్నది వారి కోరిక!
నియుక్తస్తు యథాన్యాయం యో మాంసం నాత్తి మానవ:
న ప్రేత్య పశుతాం యాతి సంభావానేక విం శతిం 35
అసంస్కృతాన్ పశూన్ మంత్రై ర్నాద్యాద్వి ప్ర: కదాచన
మంత్రైస్తు సంస్కృతానద్యా చ్ఛాశ్వతం విధి మాస్థిత: 36
కుర్యాధృతపశుం నంగే కుర్యాత్పిష్ట పశుం తధా
నత్వేవ తు వృధా హతుం పశుమిచ్చేత్క దాచన 37
యావంతి పశురోమాణి తాపత్కృత్వో హ మారణమ్
వృధా పశుఘ్ను: ప్రొప్నోతి పేత్య జన్నని జన్మని 38
ఈ శ్లోకాల తాత్పర్యం ఏమిటంటే.. శాస్త్ర మర్యాదను అనుసరించి, శ్రాద్ధంలో నియుక్తుడైన బ్రాహ్మణుడు పితృదేవతలకు సమర్పించిన మాంసాన్ని తినకపోతే గనక, అతడు ఇరవై ఒక్క జన్మలు పశువై పుడతాడు. వేద మంత్రాలతో ప్రోక్షణ చేయక, ఊరకనే చంపబడ్డ పశువులను బ్రాహ్మణుడు ఎప్పుడైనా సరే, తినకూడదు. మంత్రాలతో సంస్కృతమైన పశుమాంసాన్ని తినడం న్యాయం - దీని ద్వారా మనకు ఏం అర్థమవుతూ ఉందంటే శ్రాద్ధ కర్మలలో సమర్పించిన మాంసం బ్రాహ్మణులు తప్పని సరిగా తినాలి. సంస్కృత మంత్రాలకు లేని శక్తుల్ని ఆపాదించి, బుకాయించడం స్పష్టంగా కనిపిస్తోంది. సంస్కృత మంత్రాలతో మాంసమేమైనా శుభ్రపడుతుందా? దాని రుచి ఏమైనా పెరుగుతుందా? తినేదేదో తినకుండా దేవుడు, మంత్రాలు సంస్కృతం పేరు చెప్పి, తాము అధికులమని ప్రకటించుకోవడమే. మనుస్మృతి - పంచమాధ్యాయం-లోని విషయాలు ఇలా ఉన్నాయి.
బభూవుర్హి పురోడాశా భక్ష్యాణాం మృగపక్షిణామ్
పురాణేష్వపి యజ్ఞేషు బ్రహ్మక్షత్ర సమేషు చ 23
యత్కించిత్స్నే హసం యుక్తం భోజ్యం భోజ్యమగర్హితమ్
తత్పర్యుషిత మాస్యాద్యం హవిశ్శేషం చ యద్భవేత్ 24
చిరస్థిత మపి త్వాద్యమ స్నేహాక్తం ద్విజాతిభి:
యవగోధూమజం సర్వం పయసశ్పైవ విక్రియా: 25
టూకీగా వీటి అర్థం ఏమిటంటే.. బ్రాహ్మణులు యజ్ఞం కోసం వేద సమ్మతమైన మృగాల్ని, పక్షుల్ని చంపారు. పూర్వం అగస్త్య మునీంద్రుడు తన తల్లిదండ్రుల పోషణ కోసం శాస్త్ర విహితాలైన పక్షుల్ని చంపినట్టు తెలుస్తూ ఉంది. అదే విధంగా పూర్వ కాలంలో మునులు, ఇతర బ్రహ్మక్షత్రియులు చేసిన యాగాలలో శాస్త్రసమ్మతంగా భక్షింప తగిన మృగపక్షులు పురోడాంశంగా ఉండేవి. నూనె, నేయిలతో ఉండి, దుర్గంధం లేని వస్తువులు చాలా కాంగా ఉన్నవైనా సరే తినొచ్చు. యవలు, గోధుమలతో చేసిన పదార్థాలు నూనె నేయి వంటి పదార్థాలన్నీ చాలా కాలం నిలువ ఉన్నా బ్రాహ్మణులు తినొచ్చు.
ఏత దుక్తం ద్విజాతీ నాంభక్ష్యా భక్ష్య మశేషత:
మాంసస్యాత: ప్రవక్ష్యామి విధిం భక్షణ వర్జనే 26
దీని అర్థం ఏమిటంటే.. ఇంతవరకు బ్రాహ్మణులు ఏవి తినాలో ఏవి తినగూడదో మీకు చెప్పాను కదా? ఇక మాంసా లలో ఏవితినవచ్చో, ఏవి తినగూడదో అనే విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను..అని అన్నాడు భృగు మహర్షి..''
ఈ వ్యాసంలో నేను చెప్పిన విషయాలు ఏవీ, నేను ఊహించి చెప్పిన నా స్వంత కవిత్వం కాదు. పండితులు డాక్టర్ నల్లందిఘళ్ లక్ష్మీ నరసింహాచార్యులు తెలుగు తాత్పర్యంతో రాసిన '' మనుస్మృతి'' గ్రంథంలోనివి. ఇది తిరుమల ఆస్థానం వారి ఆర్థిక సహాయంతో ముద్రింపబడిన గ్రంథం. తాత్పర్య రచన చేసిన వారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులు. ఈ వివరణలన్నీ ఎందుకు ఇవ్వాల్సి వస్తోందంటే, స్వతహాగా మనం సంస్కృత పండితులం కానప్పుడు, సంప్రదాయ రచనల మీద సాధికారత లేనప్పుడు.. అవి ఉన్నవారి అనువాదాల మీద ఆధారపడతాం. ఇందులోని విషయాలపై విభేదించేవారు ముందుగా వెళ్ళి మనుస్మృతి, వేదాలు, పురాణాలు తిరగేసి అందులో ఉన్న అనైతిక అక్రమ సంబంధాల గూర్చి, స్త్రీలను, శూద్రులను హింసించడం గూర్చి, యజ్ఞయాగాదుల పేర జరిగిన జంతు బలుల గూర్చి, మాంస భక్షణ గూర్చి తెలుసుకోవడం మంచిది. జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునే దిశలో ఆలోచించడం మంచిది. జంతు ప్రవర్తనను మాని, మనుషులుగా మారి, ఆధునికతను సంతరించుకుని ఈ కాలానికి అనుగుణంగా నడుచుకోవడం మంచిది. సమకాలీన సమాజంలో ఉన్న సంప్రదాయ వాదుల్ని, బ్రాహ్మణుల్ని, వైదిక మత బోధకుల్ని మానవ వాదులెవరూ అసహ్యించుకోరు. మనుషులంతా ఒకటే అనే భావనతో ఉన్నవారు గనక, అందరినీ ప్రేమించినట్టుగానే వీరినీ ప్రేమిస్తారు. వారి ఎదుగుదలకు తోడ్పడతారు. గతంలో జరిగిన హింసను, తప్పిదాల్ని బేరీజు వేసుకోవడం ఎందుకంటే... వాటి వల్ల ఎంత వెనకబడిపోయామో తెలుసుకోవడానికి మాత్రమే! ''గతంలో ఎప్పుడో జరిగిన వాటిని తెచ్చి ఎందుకు భూతద్దంలో చూపెడతారు. ఇప్పుడు మీ కళ్ల ఎదుట ఎన్ని ఘోరాలు జరగడం లేదూ?'' అని కొందరు దారి మళ్లించే ప్రయత్నం చేయొచ్చు. కానీ, వారు తెలుసుకోతగ్గ విషయమేమంటే, తప్పు తప్పే - ఏ కాలంలో జరిగినా తప్పే. వాటిని నిరంతరం సవరించుకుంటూనే ఉండాలి. 'గతమెంతో ఘన కీర్తి గలవోడా!' అని పాడుకుంటూ గతంలో ఉండిపోతే కుదరదు. వర్తమానంలోకి రావాలి. భవిష్యత్తులోకి దారులు కూడా వేయాలి. మత రహిత, కుల రహిత సమాజస్థాపన మన ముందున్న పెద్ద లక్ష్యం! వైజ్ఞానిక దృక్పథం, మానవీయ విలువల పరిరక్షణ అందులో అంతసూత్రం కావాలి!!
- వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు