Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా ప్రభావంతో సంవత్సరంన్నరపాటు మూతబడ్డ విద్యాలయాలు క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. కరోనా కాలంలో పిల్లలంతా ఇంటి దగ్గర నుండే చదువుకొన్నారు. ప్రయివేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల నుండి ట్యూషన్ ఫీజులు వసూలు చేసి ఆన్లైన్ నుండి పాఠాలు చెప్పారు. పరీక్షలు కూడా ఆన్లైన్లో నిర్వహించారు. ఫలితాల అనంతరం పైక్లాసులకు ప్రమోషన్ కూడా ఆన్లైన్లో జరిగిపోయింది. కాని 60శాతంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ చదువు పూర్తిగా దూరమైంది. వారు దూరదర్శన్లో వచ్చే పాఠాలను వినాలి. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య ఉండే సంబంధం కరోనా కాలంలో పూర్తిగా తెగిపోయింది. ప్రయివేట్ పాఠశాలల వారికి కనీసం టీచర్లు తెరమీదనైనా కనిపిస్తారు. కానీ దూరదర్శన్లో వాళ్లకు రెగ్యులర్గా పాఠాలు చెప్పే టీచర్ కన్పించరు. పాసయ్యాం పైక్లాసులకు ప్రమోట్ ఆయ్యామని సంతృప్తి తప్ప ఆచరణలో పిల్లలు చదువుకు దూరమయ్యారు. అంతకు ముందు సంవత్సరాలలో చదువుకొన్నది కూడా మర్చిపోయారు. తరగతి రీత్యా ప్రమోట్ అయినా విజ్ఞానం రీత్యా డిమోట్ అయినట్లే లెక్క.
స్కూల్ పిల్లలు అత్యధికం ఆటపాటల్లో మునిగిపోయారు. వారికి ఇంటి వద్ద చదువు గాని, ట్యూషన్ లాంటివి గాని లేవు. విద్యా వాతావరణమే లేకుండా పోయింది. విద్యాలయంలో తోటి సహచరులతో ఉండే సాంగత్యం, టీచర్లతో ఉండే అనుబంధం వారికి చదువుకొనే వాతావరణాన్ని పెంపొందిస్తుంది. అర్థం కాకపోతే మరలా చెప్పడం, చెప్పింది అర్థమయిందా లేదా తెలుసుకోవడానికి ప్రశ్నలు వేయడం, నోట్స్ రాసుకుంటున్నారా లేదా పరిశీలించడం ఈరకంగా విద్యార్థి ప్రగతిపై టీచర్కు పట్టు ఉంటుంది. ఈ కాలంలో అవన్నీ తెరమరుగయ్యాయి. వారు వింటున్నారా లేదా వింటే బుర్రకెక్కుతున్నదా లేదా తెలుసుకోవడమే కష్టం. టీవీల ముందు కూర్చొని పాఠాలు విన్న వారి సంఖ్య 20శాతంకు మించి ఉండదని ఒక సర్వేలో వెల్లడయింది. ప్రభుత్వం ఆన్లైన్ పాఠాలు వినే సదుపాయం కల్పించనందున ప్రయివేట్ విద్యార్థుల కన్నా ప్రభుత్వ విద్యార్థులు వెనుకబడ్డారు. కరోనాతో ఆన్లైన్ విద్య అనివార్యమనడంలో సందేహం లేదు. కాని అది సంప్రదాయ విద్యకు ప్రత్యామ్నాయం కాదు. ఆ పేరుతో ఆన్లైన్ విద్యను శాశ్వతం చేయరాదు. ఆన్లైన్ విద్యావ్యాపారం జోరందుకుంటోంది. దాన్ని నిలవరించాలి.
ప్రయివేట్ పాఠాశాలల విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కట్టడంతోపాటు ఆన్లైన్ చదువు కోసం స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ కొనటం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారింది. తల్లిదండ్రుల ఫోన్లు పిల్లలకిస్తే మధ్యలో వచ్చే కాల్స్తో పాఠాలపై కేంద్రీకరణ భంగమవుతుంది. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ ఉన్నా ఆ వేగం సరిపోదు. చదువుపై ప్రత్యేక శ్రద్ద పట్టుదల ఉన్నవారు మాత్రమే కిందామీదా పడి చదువుకున్నారు. మిగతావారికి చదువు చెప్పిన కిందే లెక్క తప్ప అది తలకెక్కింది లేదు.
కరోనా కాలంలో చదువు కోసం సెల్ఫోన్ల వాడకం పెరిగింది. విద్యార్థి చేతిలో సెల్ఫోన్ సరికొత్త సమస్యలకు దారి తీసింది. యూట్యూబ్ చానెల్ ద్వారా వీడియోలు చూడడం, మ్యూజిక్ వినడం పెరిగింది. ఆమేరకు పిల్లల్లో సాంస్కృతిక అభిలాష పెరిగితే సంతోషించవచ్చు, కాని సెల్ఫోన్ కొన్ని పెడధోరణలకు దారితీసింది. ముఖ్యంగా వీడియో గేమ్స్ బాగా వ్యాప్తిలోకి వచ్చాయి. వీటిల్లో అత్యధికులకు రమ్మీ, ఫ్రీ ఫైర్ వంటి గేమ్స్ వ్యసనంగా మారాయి. పబ్జి బాగా పాపులర్ అయింది. ఈ రంది ఆ మోజులో పడ్డవారికి కనిపించదు. వినిపించదు. మరో సైకో ప్రపంచంలోకి వెళ్లిపోతారు. కొన్ని తరహా గేమ్స్, రియాలిటీ షోలకు బెట్టింగ్ పెట్టి ఆడడం పరిపాటి అయ్యింది. డబ్బుల కోసం అప్పులు చేయడం, అప్పులు తీర్చడానికి ఇంట్లో ఒత్తిడి చేయడం, అబద్ధాలు చెప్పడం లాంటి సంస్కృతికి అలవాటు పడ్డారు. స్నేహితుల మధ్య ఘర్షణులు పెరిగాయి. ఆడపిల్లల వెంటపడడం, వేధించడం పెరిగింది. ఆన్లైన్ స్నేహాల పేరుతో ఆడ పిల్లలు మోసాలకు గురవడం పెరిగింది. స్కూలు పిల్లల మధ్య పెరిగినవారికి ఒక్కసారిగా స్థానిక లొకాలిటీలో వివిధ రకాల పిల్లలతో సంపర్కం ఏర్పడింది. అనేక మంది మొదటిసారి తాగుడు లాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. బీరు తాగడం ఫ్యాషన్ అని భావిస్తున్నారు. సినిమాలు కూడా అదే సంస్కృతి నేర్పించింది. రకరకాల స్కీముల పేరుతో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరికి సెల్ఫోనే ఒక వ్యసనంగా మారింది. ఈ దుష్పరిణామాల మధ్య అనేక మంది చదువుకు దూరమయ్యారు.
కరోనా కాలంలో డ్రాపౌట్ల రేటు కూడా పెరిగింది. ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని పనులకు పంపడం, తల్లిదండ్రుల పనులకు సహాయం చేయడం ఎక్కువైంది. ఆన్లైన్ సదుపాయం లేక, ఒకవేళ ఉన్నా అర్థంకాక చదువుకే స్వస్తి చెప్పిన వారున్నారు. అయితే కరోనా కాలంలో ఆన్లైన్ మినహా మరో మార్గం లేదు. ఆన్లైన్తో పాటు విద్యార్థులపై నిరంతర అజమాయిషీ, పరిసరాల్లో విద్యాభోధన లాంటి పద్ధతులు అవలంభించనందున బోధనేతర పద్ధతులకు అలవాటుపడి డ్రాపౌట్లు పెరిగాయి. రిజిష్టర్లో విద్యార్థిగా నమోదయ్యి ఉపాధి పనులకు పోయినవారెందరో ఉన్నారు.
కరోనా కాలంలోనూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతో రిస్క్ తీసుకొని ప్రాణాలను పణంగా పెట్టి విధులకు హాజరయ్యారు. పిల్లలు లేకపోయినా ప్రభుత్వం చెప్పిన పనులు చేస్తూ కూర్చున్నారు. ఈ క్రమంలో అనేక మంది ఉపాధ్యాయులు ప్రాణాలర్పించారు. ప్రభుత్వం నుండి వారి కుటుంబాలకు ఎలాంటి సహాయం అందలేదు. అయినా ప్రభుత్వ ఉపాధ్యాయులు అష్ట కష్టాలు పడి విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రయివేట్ టీచర్ల కథ మరోరకంగా ఉంది. వారికి జీతభత్యాల్లేవు. ఉపాధి లేదు. అనేక మంది టీచర్లు ఉపాధి పనులకు వెళ్లారు. కుటుంబాలను పోషించుకోడానికి ఆటోలు తోలారు. ఏదీ దొరక్కుంటే పస్తులున్నారు.
ప్రయివేటు విద్యాలయాల పరిస్థితి అన్నిటిదీ ఒకే రకంగా లేదు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు దర్జాగా ఫీజులు వసూలు చేసి డబ్బు సంపాదించాయి. ఎక్కడా కనికరం చూపలేదు. ప్రభుత్వ నిబంధనలు పాటించలేదు. పాటించాలని ప్రభుత్వాలూ వారిపై ఒత్తిడి తేలేదు. ప్రభుత్వ అధికారుల దృష్టంతా చిన్న యాజమాన్యాలపైనే పడింది. విద్యార్థుల నుండి ఫీజులు రాక, ఉపాధ్యాయులకు జీతాలివ్వలేక వారూ స్కూళ్లు మూసేసుకున్నారు. ఆ పిల్లలంతా అధిక భాగం ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. ఆ రకంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కాని అందుకు తగిన వసతులు లేవు. టీచర్లు లేరు. నిధులూ కేటాయించలేదు. ఈ స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ స్కూళ్లను, ఉపాధ్యాయుల్ని, ప్రయివేటు రంగంలోని చిన్న స్కూళ్లను ఆదుకోవడానికి ఎలాంటి పథకమూ ప్రవేశపెట్టలేదు. అంబానీ, అదానీల కోసం లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించిన మోడీ సర్కారు విద్యను నిర్లక్ష్యం చేసింది. పిల్లల్ని, టీచర్లను వీథుల్లో పడేసింది.
ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా కరోనా కాటు వేస్తుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఆదుకోకపోగా అదనపు భారాలు మోపాయి. సందట్లో సడేమియా అన్నట్లుగా ప్రజలెవ్వరూ ఏ భారం వేసినా, ఏ మార్పులు చేసినా పట్టించుకోరన్న ధీమాతో తామనుకున్న కార్పొరేట్ అనుకూల సంస్కరణలు సాగించుకుంటూ పోయారు. ఒక వైపు కేంద్రం నూతన విద్యా విధానం (ఎన్ఇపి) పేరుతో విద్యను వ్యాపారం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండే విద్యను తాను లాగేసుకుంది. అయినా మన రాష్ట్ర ప్రభుత్వం మారు మాట్లాడకుండా మిన్నకుండి పోయింది. అకడమీషియన్లు దీనిని వ్యతిరేకిస్తున్నా కేంద్రం లెక్క చేయకుండా అమలు జరపడానికే పూనుకుంటున్నది. ఈ సంస్కరణలు సామాన్యులను చదువుకు దూరం చేసేవే అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా విద్య ఖరీదవుతుంది. విద్యపై కార్పోరేట్ పెత్తనం పెరుగుతుంది. చదువు కొందరికే అన్న నానుడి నిజమవుతుంది. ఈ ప్రమాదాన్ని నివారించి అందరికీ విద్య కోసం ఉద్యమించాలి.
- వి. శ్రీనివాసరావు