Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశానికి ముస్లింలు రాకపూర్వం అంటే క్రీ.పూ.1000 (బిసిఇ) నుండి క్రీ.శ. 1200 (సి.ఇ.) మధ్యకాలంలో భారతదేశంలో స్వర్ణయుగం కొనసాగిందని, ఆ కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి సాధించాయని, హిందుత్వ వాదులు వాదిస్తారు. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనకు అందుబాటులోకి వచ్చిన విమానాలు, ఇంటర్నెట్, మూలకణ పరిశోధనలు, ప్లాస్టిక్ సర్జరీ వంటివన్నీ అప్పుడే, ఆ స్వర్ణయుగంలోనే భారతదేశంలో ఉండేవని... దబాయిస్తారు. అదే నిజమైతే అవి ఎవరు కనిపెట్టారు? ఎవరు అభివృద్ధి చేశారో చెప్పాలి కదా? ఆ జ్ఞానవంతులెవరో వారు ఎక్కడ చదువుకుని జ్ఞానులయ్యారో చెప్పాలి కదా? పైగా పురాతన గాథలకు, పురాణ పాత్రలకు వాటిని అన్వయించి చెపుతారు. అవన్నీ వాస్తవాలుగా మనం స్వీకరించాలని ఆశపడుతుంటారు. ఆధారాలు చూపకుండా మొండివాదనల్ని జనం ఎలా ఒప్పుకుంటారూ? ఏ కొద్దిపాటి వైజ్ఞానిక పరిజ్ఞానం ఉన్న వారైనా, ఇప్పుడు దేశంలో మనకు అందుబాటులోకి వచ్చిన శాస్త్ర పరిజ్ఞానం, పరికరాలు అన్నీ 18-20 శతాబ్దాల మధ్య కాలంలో యూరొప్ దేశాలు ప్రపంచానికి అందించినవే నన్నది గ్రహిస్తారు.
భారతదేశంలో దిల్లీ సల్తనత్-ముస్లిం సుల్తానుల పరిపాలన సి.ఇ. 320సంవత్సరాల పాటు (1206-1526) కొనసాగింది. మామ్లక్ రాజవంశం (1206-1290) ఖిల్జీ రాజవంశం (1290-1320) తుగ్లక్ రాజవంశం (1320-1414) సయ్యీద్ రాజవంశం (1414-1451) ఆఫ్ఘాన్-లోది రాజవంశాలు (1451-1526) రాజ్యమేలాయి. ఆ కాలంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్లో కొంత భాగం భారతదేశంలో అంతర్భాగాలుగా ఉండేవి. ఆ తర్వాత తొలి మొఘల్ చక్రవర్తి బాబర్ పరిపాలన సి.ఇ. 1526లో ప్రారంభమై 1530 వరకు కొనసాగింది. అతని తర్వాత అతని వారసులు వరుసగా 1857 వరకు రాజ్యమేలారు. ఆయా కాలాలకు సంబంధించిన నాటి చరిత్రకారులు విషయాలన్నీ గ్రంథస్థం చేసే ఉంచారు. కాబట్టి, ఆ కాలానికి సంబంధించి అబద్దాలు అల్లడానికి వీలులేదు. అందుకే హిందూత్వ వాదులు 1000బిసిఇ నుండి 1200సి.ఇ. మధ్య కాలాన్ని కావాలనే ఎంచుకున్నారు. ఈ సున్నితమైన అంశం పాఠకుల దృష్టికి తీసుకు రావడానికే, నేనిక్కడ ముస్లిం రాజుల ప్రవేశానికి సంబంధించిన వివరాలు విపులంగా ఇచ్చాను. ముస్లిం సుల్తానులు దేశంలోకి రాక పూర్వమే ఇక్కడ స్వర్ణయుగం కొనసాగి ఉంటే.. దాని ప్రభావం, దాని ఛాయలు దిల్లీ సల్తనత్ కాలంలో కనిపించాలి కదా? ఇంటర్నెట్, ప్లాస్టిక్ సర్జరీ లాంటి వైజ్ఞానిక సౌకర్యాలన్నీ మొఘలులు ఎందుకు వాడుకోలేకపోయారూ? వాటిని ముస్లిం పాలకులు సర్వనాశనం చేశారని హిందూత్వవాదులు చెప్పినా చెపుతారు - ఆశ్చర్యం లేదు. కానీ, అందుబాటులో ఉన్న సౌకర్యాల్ని ఎవరైనా ఎందుకు నాశనం చేసుకుంటారూ? ఆలోచించాల్సిన విషయం కదా?
మరో అవాస్తమేమంటే.. ముస్లిం రాజులు పరిపాలన సాగించినంత కాలం హిందువులు పీడనకు గురయ్యారని, బానిసల్లా జీవించారని చెపుతారు. సమకాలీనంలో ఉన్న హిందూ ముస్లింల మధ్య ద్వేషాన్ని రగిలించడానికి ఇది ఉపయోగపడే అబద్దమే తప్ప, అందులో నిజం లేదు. దేశ చరిత్రలో అశోకుడు - 'ద గ్రేట్' ఎలా అయ్యాడు? తర్వాత కాలంలో అక్బర్ 'ద గ్రేట్' అని ఎలా పిలిపించుకున్నాడు? ముస్లింలతో తాము అణిచివేయబడ్డామని, బ్రిటిష్వారితో తాము అణచివేయబడ్డామని అరిచిగీపెట్టే ముందు తామేం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిది. పరిపాలకులు ఎవరైనా, చిన్నా చితక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటికి అంత ప్రాముఖ్యమివ్వాల్సిన పనిలేదు. అంటరాని తనాన్ని ప్రవేశపెట్టి, జనాన్ని నాలుగు వర్ణాలుగా విభజించి, కింది కులాల వారిని చిత్రహింసలకు గురిచేయడం ఎవరు మరిచిపోయారనీ? చరిత్రకారులు, సామాజిక కార్యకర్తలు వందల ఏండ్లుగా గొంతెత్తి న్యాయపోరాటాలు చేస్తూనే ఉన్నారు కదా?
భారతదేశంలో వివిధ జాతుల సమ్మేళనం వివిధ సంస్కృతుల సమ్మేళనం కామన్ ఎరాలోని ఒకటి రెండు శతాబ్దాలలో జరిగిందని చరిత్రకారుల పరిశీలనలు, జన్యుశాస్త్రవేత్తల పరిశోధనలు అన్నీ తేటతెల్లం చేశాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా హిందూత్వ సిద్ధాంత కర్తలు భారత ఉపఖండమంతా ''ముందు నుండే ఆర్య సంస్కృతి వెల్లివిరుస్తోందనీ..'' దాన్నే ఇంకా ఇంకా సంరక్షించుకోవాల్సి ఉందని అబద్దాలు చెపుతుంటారు. పురావస్తు పరిశోధనలు గానీ, జన్యుశాస్త్ర సంబంధమైన సాక్ష్యాలు గాని చెపుతున్నదేమంటే, ఉత్తర భారతీయులు ఇరాన్, మధ్య ఆసియా జాతులతో సమ్మిళితమైనట్లు నిగ్గుతేల్చాయి. అంటే, వివిధ జాతులు భారతదేశంలోకి వలస వచ్చిన విషయం రూఢి అయ్యింది. దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి తప్ప - హిందుత్వ వాదులు చెప్తున్న బలహీనమైన అబద్దాపు వాదనను ఏమాత్రం పట్టించుకోగూడదు.
ఇంతకీ ఈ 'హిందూత్వ' అనే మాట ఎలా వాడుకలోకి వచ్చిందీ? ముందు అది అర్థం చేసుకోవాలి! లౌకిక జాతీయవాద సంస్థ అయిన భారత జాతీయ కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలకు ప్రతినిధిగా పనిచేసింది. స్వాతంత్య్ర సమరంలో అందరూభుజం భుజం కలిపి పోరాడారు. అప్పటికి వారి మధ్య హిందూ, ముస్లిం అనే బేధాలు లేవు. తాము వేరు, తమ జాతులు వేరు, తమ మతాలు, విశ్వాసాలు వేరు వేరనే అభిప్రాయం 1920లలో బలపడింది. సుమారుగా ఆ కాలంలోనే రెండు వాదాలు తలెత్తాయి. మహ్మదీయ భూస్వాములూ, మధ్య తరగతి విద్యావంతులు కలిసి 30 డిసెంబర్ 1906న ఢాకా - బంగ్లాదేశ్లో అంటే నాటి బ్రిటిష్ ఇండియాలో 'ముస్లింలీగ్'ను స్థాపించారు. దాని వెనక మహ్మదాలి జిన్నా, ఫజుల్ హక్, ఆగాఖాన్ వగైరాలున్నారు. ముస్లిం జాతీయ వాదంగా అది ముందుకు కొచ్చింది. 1947లో పాకిస్థాన్ ఒక స్వతంత్ర దేశంగా విడిపోవడంలో ముస్లింలీగ్ ప్రధానపాత్ర పోషించింది కూడా! అదే సమయంలో మరోవైపు హిందూ అగ్రజాతి వర్ణాలవారు, మధ్య తరగతి విద్యావంతులూ కలిసి 'హిందూ మహాసభ'ను -1915లో స్థాపించారు. తమది హిందూ జాతీయవాదమని ప్రకటించుకున్నారు. దాని వెనక మదన్ మోహన్ మాలవ్యా, సావర్కర్ మొదలైనవారున్నారు.
తమది జాతీయవాదమని చెప్పుకున్నారే గాని, బ్రిటిష్కు ఎదురు తిరిగి పోరాడలేదు. వారికి లొంగిపోయి, స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొంటున్న నాటి భారతీయ యువతను తప్పుదారి పట్టించారు. స్వదేశీయుల్ని అడ్డుకుంటూ బ్రిటిష్వారికి మేలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకున్నారు. ముస్లింలీగ్ ప్రభావంతో ఒక ముస్లిం రాజ్యం 'పాకిస్థాన్' ఎలా ఏర్పడిందో.. అలాగే ఇక్కడ భారతదేశాన్ని హిందు మహాసభ ఆధ్వర్యంలో ఒక హిందూ రాజ్యంగా మార్చాలని తహతహలాడారు. హిందూ మహాసభ తర్వాత కాలంలో కె.బి.హెడ్గేవార్ నాయకత్వంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు (ఆరెస్సెస్)గా 1925లో రూపం మార్చుకుంది. దాని నుండే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 1980లో ఆవిర్భవించింది. దాని నేపథ్యంలో ఎ.బి.వాజ్పారు, ఎల్.కె. అద్వానీలు ఉన్నారు. 1947లోనైనా 2021లోనైనా ఈ హిందుత్వ వాదుల ఎజండా ఒక్కటే! లౌకిక ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని ఎలాగైనా ఒక హిందూ రాజ్యంగా మార్చాలని! ఆ ప్రయత్నం వారు ముమ్మరంగా చేస్తున్నట్లు మనకు ప్రస్థుత బీజేపీ పాలనలో స్పష్టమౌతూనే ఉంది. దేశంలో అధిక సంఖ్యాకులు హిందువులు గనక, ఆ హిందూ మెజారిటీ వాదాన్ని చట్టబద్ధం చేయడానికి వారు ఏర్పరుచుకున్న దృక్పథమే 'హిందూత్వ'-గా పిలవబడుతూ ఉంది.
జేమ్స్ మిల్ (జీAవీజుూ వీ×ూూ) రాసిన బ్రిటిష్ ఇండియా చరిత్ర (ునజు న×ూుఉ=్ ఉఖీ దీ=×ు×ూన ×చీణ×A) 1817లో అచ్చయ్యింది. ఆ కాలం నాటి అనేక అంశాల్ని ఆ గ్రంథం విపులంగా చర్చించింది. ఆ రచయిత హిందూ-ముస్లిం-బ్రిటిష్ మూడు విభిన్న దృక్పథాల గురించి వివరించాడు. పైగా హిందూ-ముస్లింలు రెండు వేర్వేరు జాతుల వారని.. వారి మధ్య నిరంతరం ఘర్షణలు సాగుతూ వచ్చాయనీ రాశాడు. అందుకే హిందూత్వ వాదులు అతని గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ అర్థశతాబ్దంలో చరిత్రకారులు, జన్యుశాస్త్ర పరిశోధకులు, పురావస్తు పరిశీలకులు అందరి కందరూ జేమ్స్ మిల్ వాదనని తప్పుపట్టారు. హిందూ-ముస్లిం-బ్రిటిష్ అంటూ వైజ్ఞానికంగా మానవ జాతిని విభజించే పద్ధతి సరికాదని దుయ్యబట్టారు. మానవ జాతి అంతా ఒక్కటేనని చెపుతూ, లెక్కలేనన్ని ఆధారాలు చూపారు. ఆధారాలులేని వాదనలు, మనిషిని మనిషి నుండి విడగొట్టే కుట్రలు, రాజకీయాలు ఇప్పుడిక సాగవు. మత విశ్వాసాలు ఎప్పుడూ వ్యక్తిగతమే! విశ్వాసాల ఆధారంగా చట్టాలుండవు. పరిపాలన సాగదు. 'ఆర్య' అనే శబ్దానికి గౌరవనీయుడనే అర్థం ఉంది కాబట్టి, మిగతావారి కన్నా హిందువులు 'ఎక్కువ గౌరవనీయులు' అనే అభిప్రాయం స్థాపించాలని వారి ప్రయత్నం. అందుకు 1930 నాటి జర్మన్, ఇటాలియన్ ఫాసిజాల భావజాలం అరువు తెచ్చుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడరు.
దేవాలయాల్లోని గుప్త నిధుల కోసం ముస్లింలు దేవాలయాల్ని కొల్లగొట్టింది నిజమే. అయితే అక్కడ హిందూమతాన్ని నాశనం చేసి, ముస్లిం మతాన్ని స్థాపించాలన్న ఆకాంక్ష లేదు. సంపదను, నిధులను దోచుకోవడానికి హిందూ ఆలయాలపై హిందూ పాలకులే దాడిచేసిన ఉదంతాలు కూడా చరిత్రలో ఉన్నాయి. అది గమనించుకోవాల్సిన అంశం. అంటే ఏమిటీ? అక్కడ సంపదకు ప్రాముఖ్యం ఉందే కానీ, మతానికి కాదు. హిందూ మత ఛాందసులు వేల వేల మంది బౌద్ధుల్ని నరికి చంపి భీభత్సం సృష్టించారు కదా? మరి అక్కడ సంపద దోచుకోవడం కాదు. మత మార్పిడే ముఖ్యమయ్యింది. దీనిలో మనకు మళ్ళీ - యూరోప్లో జనాన్ని బలవంతంగా క్రైస్తవంలోకి లాక్కోవడానికి క్రైస్తవులు చేసిన భీభత్సం గుర్తుకొస్తుంది. మతం ఎప్పుడూ ఎక్కడా శాంతిని స్థాపించలేదు. భీభత్సాల్ని మారణ హౌమాల్ని మాత్రమే మిగిల్చింది.
వేరు వేరు మతాల మధ్య ఘర్షణలు జరిగాయంటే దానికి వేరు వేరు కారణాలు ఉండొచ్చు. వాటిని అలా ఉండనివ్వండి. మరి ఒక మతానికే చెందిన హిందువుల్లో కొందరు అగ్రవర్ణం వారు, మరి కొందరు నిమ్నవర్గం వారు ఎలా అయ్యారూ? విద్య, ఆర్థిక స్థోమత, సమాజంలో ఉన్నతమైన స్థాయి ఆ అగ్రవర్ణవారికే ఉండాలని.. మిగతా వారికి అవి సమకూరగూడదని ఎందుకు ప్రయత్నించినట్టూ? చెరువులోని నీళ్ళు తాగడానికీ, పుట్టుకకూ సంబంధమేమిటీ? దేశంలోని అధిక సంఖ్యాకుల్ని బానిసలుగా -జంతువుల కన్నా హీనంగా ఎందుకు చూసినట్టూ? అస్పృశ్యులుగా మార్చి... వారిని సమాజంలో ఎందుకు వెలివేసినట్టూ? వెట్టి చాకిరీ ఎందుకు చేయించుకున్నట్టూ? ఇంతటి వివక్ష, హింస భరించలేకనే కదా ఈ దేశ మూలవాసులు ఇతర మతాలు స్వీకరించారూ? విశాల భావాలతో ప్రజాస్వామ్య బద్ధంగా మెలిగితే ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు వారు సమాధానమైనా చెప్పగలగాలి. లేదా బుద్ధుడికి, చార్వాకులకూ క్షమాపణలు చెప్పి సన్మార్గంలో హేతుబద్ధంగానైనా నడవడానికి ప్రయత్నించాలి. మరో మార్గం లేదు - అతిగా చేస్తే ఏ మతమైనా సరే ఉగ్రవాదంలోకే దారితీస్తుంది. ఈ దేశానికి వైజ్ఞానిక స్పృహనందించిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూని కావాలనే కనుమరుగు చేయాలని చూస్తున్న హిందూత్వవాదుల కుట్రల్ని బారతీయ యువత అర్థం చేసుకుంటోంది. మూర్ఖుల్ని ఎవరూ ఎద్దేవా చేయనవసరం లేదు. వారి మూర్ఖత్వమే వారిని నవ్వులపాలు చేస్తుంది. రాబోయే వైజ్ఞానిక తరం, ఇక మూర్ఖపు - అజ్ఞానపు - మత భావనల్ని, ఎంత మాత్రమూ సహించబోదు.
- సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు