Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యమకారులనగానే రాజకీయ, సామాజిక ఉద్యమ కారులు మాత్రమే గుర్తుకు వస్తారు. వారి గురించే ఎక్కువ చర్చలు జరుగుతుంటాయి. అవి అవసరమే.. కానీ, అంతకన్నా ముఖ్యమైంది సైన్సు! ఆరోగ్య ఉద్యమ కారుల గూర్చి తెలుసుకోవడం! వారి కృషి గుర్తించడం వారి అడుగు జాడల్లో నడవడం. వీరి తర్వాతే, ఏ రంగంలోని ఉద్యమకారులైనా వస్తారు. జన చైతన్యం కోసం జీవితాల్ని త్యాగం చేసిన వైజ్ఞానిక రంగ కార్యకర్తలు మన దేశంలో ఎందరో ఉన్నారు. వారిలో డాక్టర్ అమిత్సేన్ గుప్త (1958-2018) పేరు తప్పక చెప్పుకోవాలి. తన కృషిని ఈ దేశానికి మాత్రమే పరిమితం చేయకుండా దాన్ని దేశ సరిహద్దులు దాటించిన వాడాయన!
జన స్వాస్థ్వా అభియాన్కు కన్వీనర్గా ఉంటూ, అసోసియేట్ గ్లోబల్ కో ఆర్డినేటర్గా ప్రజారోగ్య ఉద్యమానికి ఊపునిచ్చిన వారు. 2000 సంవత్సరంలో జన స్వాస్థ్యా అభియాన్ (జెఎస్ఏ)కు రూపకల్పన చేయడంలోనూ, దాని పరిధిని దేశంలో విస్తృత పరచడంలోనూ డాక్టర్ అమిత్ సేన్ గుప్త సేవలు ప్రశంసనీయమైనవి. కార్యకర్తగానే కాక, మంచి వక్తగా, సైన్సు రచయితగా గొప్ప స్థాయినందుకున్న వారు. అసలైతే డాక్టర్ అమిత్ మంచి పేరున్న వైద్యుడు. ఢిల్లీలోని మౌలానా ఆజాద్ వైద్య కళాశాల నుండి పట్టా తీసుకుని, కొన్ని సంవత్సరాలు ప్రయివేట్ ప్రాక్టీస్ చేశారు. అయితే, దానిలో ఆయనకు సంతృప్తి కలగలేదు. ఒళ్ళు కదలకుండా ప్రాక్టీస్ చేసి, డబ్బు సంపాదించుకుని, సుఖంగా జీవించగలిగే అవకాశం ఉండి కూడా, ప్రజల కోసం ఆయన వాటిని వదలుకున్నారు. పూలబాటను వదిలి, ముళ్ళబాటను పట్టారు. జనాన్ని చైతన్య పరచాలనుకున్నారు. ఒక వైద్యుడిగా కొంత మందికి వైద్యం అందించడం కాదు, ఎక్కువ మందిలో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో సైన్సు కార్యకర్తగా మారి, ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టారు.
వైద్య శాస్త్రంలో డిగ్రీ తీసుకుని ప్రాక్టీసు చేస్తున్న దశలోనే ఢిల్లీలోని సైన్స్ ఫోరం (డిఎస్ఎఫ్) సంస్థాపక సభ్యుడయ్యారు. ఆ తర్వాత 1990లలోనే ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ (ఏఐపీఎస్ఎన్) వారి ఉద్యమాలలో పాల్గొనడం ప్రారంభించారు. అందులో చురుకుగా పాల్గొంటూనే జన స్వాస్థ్యా అభియాన్కు రూపకల్పన చేశారు. ఒక డాక్టరు కార్యకర్తగా మారడం వెనక కొన్ని సంస్థలు, కొన్ని సంఘాలు పనిచేశాయి. తర్వాత కాలంలో వాటికి ఆయనే నాయకుడై నడిపించారు. గ్లోబలైజేషన్ ప్రభావం వల్ల ప్రజారోగ్యం ఎలా చెడిపోతూ ఉంది? అనే అంశం మీద ఆయన విస్తృతంగా ఉపన్యాసా లిచ్చేవారు. అంతే కాదు, ప్రజారోగ్యానికి హాని చేసే మందులు-డ్రగ్స్లతో జరిగే వ్యాపారాలు ఆగిపోవాలని సుప్రీం కోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేశారు. ప్రజారోగాన్ని ప్రయివేట్ కార్పొరేట్లకు అప్పగించడాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. ప్రజల ఆరోగ్యం - ప్రభుత్వ బాధ్యత - అన్నది ఆయన వాదన!
ప్రజారోగ్య సమస్యలకు అంతర్జాతీయ వేదికను సమకూర్చి పరిష్కారాల కోసం పోరాడడమన్నది సామాన్యమైన విషయం కాదు. ప్రజారోగ్యమంటే... అందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, వాణిజ్య... అంశాలెన్నో ఇమిడి ఉంటాయన్నది డాక్టర్ సేన్గుప్త గ్రహించారు. అందుకే విద్య, ఆరోగ్యం, సంక్షేమం వంటి శాఖలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని పోరాడారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖల సహాయ సహకారాలతో గ్రామీణ పారిశ్రామీకరణ - ప్రజారోగ్యం - సమస్యలు వంటి విషయాలపై ఆయన దృష్టిపెట్టారు. వృత్తిరీత్యా వైద్యుడైనా, ఆయన ఆ పరిధిలోనే ఉండిపోలేదు. సమాజంలోని ఏ వర్గంవారి సమస్యలైనా సరే, వాటి పరిష్కారానికి ఈ డాక్టరుగారు ముందు నిలబడేవారు. అందుకే వ్యవసాయ కార్మికుల ఉద్యమాలకు కూడా నాయకత్వం వహించి ముందు నిలబడిన సందర్భాలున్నాయి.
క్షేత్ర స్థాయిలో ఉద్యమ కారుడిగా పనిచేస్తూనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్ అమిత్సేన్ గుప్త సదస్సులు నిర్వహిస్తూ ఉండేవారు. 2018లో ఆయన చనిపోవడానికి ముందు చెప్పుకోతగ్గ రెండు అతిపెద్ద సదస్సులు నిర్వహించారు. ఒకటి - ఛత్తీస్ఘడ్-రాయపూర్లో 'నేషనల్ హెల్త్ అసెంబ్లీ'' - సెప్టెంబర్లో నిర్వహింస్తే, దానికి దేశంలోని 22 రాష్ట్రాల నుండి 1300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే నవంబర్లో పీపుల్స్ హెల్త్ అసెంబ్లీ' - ఢాకాలో నిర్వహిస్తే, దానికి 75దేశాల నుండి 1400మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆయన తన కార్యక్రమాలలో అన్నింటా యువతకు ఎక్కువ ప్రోత్సాహమిచ్చేవారు. వారిని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉండేవారు. కారణం భవిష్యత్ కాలం యువతీ యువకులదేనన్నది ఆయన అభిప్రాయం.
వేదికల మీదైనా, వేదికల కింద మామూలు సంభాషణల్లోనైనా ఎప్పుడూ నవ్వుతూ, ఎంతో ఆశాభావంతో మాట్లాడేవారు కామ్రేడ్ అమిత్సేన్ గుప్త. ఆయన నవ్వు ముఖం, మాటల్లోని స్థిరత్వం ఎదుటివారిని ఇట్టే ఆకర్షించి ప్రభావితం చేసేదని ఆయనతో కలిసి పనిచేసిన పరిశోధకులు, డాక్టర్లు, సైన్సు కార్యకర్తలు చెపుతుంటారు. ముఖ్యంగా కమ్యూనిటీ మెడిసిన్లో ప్రొఫెసరయిన డాక్టర్ మెహన్రావు చెప్పింది అక్షరాల నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే ఆయనకు డాక్టర్ అమిత్తో పరిచయం సుమారు 35ఏండ్లు. అంత సుదీర్ఘకాలం చూస్తూ, కలిసి పనిచేస్తూ వచ్చిన ఆ మిత్రుడి మాటల్లో తప్పకుండా వాస్తవం ఉండి ఉంటుంది కదా? దేశకాల పరిస్థితుల్ని చూసి, ఈ బలవంతపు హిందుత్వ దేశభక్తి గూర్చి చాలా బాధపడిపోయేవాడినని, దేశం ఏమైపోతుందోనని ఆందోళన పడేవాడినని చెప్తారు డాక్టర్ మోహన్రావు. అలాంటిది నా ఆప్తమిత్రుడు డాక్టర్ అమిత్సేన్ గుప్త మాత్రం హిందుత్వవాదుల మూఢత్వంపై పొట్ట చక్కలయ్యేట్టు నవ్వేవారని, తననూ నవ్వమనేవారనీ.. చెప్పారు. ఈ అసమర్థుల పాలన ఎక్కువ కాలం కొనసాగదని - దాన్ని మార్చుకోవాలంటే వామపక్షవాదులు, అంబేద్కరిస్టులు, పెరియారిస్ట్లు, సైన్స్ కార్యకర్తలు ఆలోచనా విధానం కలిసే వారంతా ఐకమత్యంతో వివిధ రంగాల్లో నిరంతరం పనిచేస్తూనే ఉండాలని కామ్రేడ్ సేన్గుప్త చెపుతుండేవారట!
ఆయన రచనల్లో, ఉపన్యాసాలలో, మామూలు సంభాషణల్లో ఒక బలమైన సందేశం ఉండేదని, భవిష్యత్తు పట్ల ఆశాభావం ఉండేదని ఆయన ఓదార్పు మాటలతో తను, తన లాంటి వాళ్ళూ ఎంతో మంది ఊరట పొందేవారని, కొత్త ఉత్సాహతో పనిచేస్తూ పోయేవారమని' చెప్పారు.. డాక్టర్ మోహన్రావు. ఆయన లేకపోవడం అభ్యుదయ భావనకు, ప్రజాసైన్సు, ప్రజారోగ్య ఉద్యమాలకూ తీరని విఘాతం కలిగిందని, దేశవ్యాప్తంగా లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు.
కామ్రేడ్ అమిత్సేన్ గుప్త 1978 నుండి సీపీఐ(ఎం) సభ్యుడిగా ఉన్నారు. పీపుల్స్ డెమాక్రసీకి 'సైన్స్ అండ్ డవలప్మెంట్' శీర్షికన రెగ్యులర్ కాలమ్ రాసేవారు. ఇతర పత్రికలకు, అనేక వెబ్ మ్యాగ్జైన్లకు కూడా రాసేవారు. మెడిసిన్లో డిగ్రీ తీసుకున్న తర్వాత ఆయన తండ్రిగారు ప్రయివేట్ ప్రాక్టీస్ పెట్టమంటే డాక్టర్ అమిత్ సైనిక ఫామ్స్ దగ్గర్లో ఒక కుగ్రామాన్ని ఎంచుకున్నారు. గ్రామీణ పేదలకు అందాల్సిన వైద్యం గురించి ఆయనకు అప్పటికే ఒక తపన ఉండేది. అనుకున్న విధంగా క్లినిక్ ప్రారంభించనైతే ప్రారంభించారు కానీ, అంతటి పేదరికంలో ఉన్న పల్లెజనం దగ్గర ఎంత ఫీజు తీసుకోవాలి? ఎలా తీసుకోవలి? అని తనలో తాను మదనపడుతుండేవారు. అందుకే తర్వాత కాలంలో మందుల తయారీ వెనక నడుస్తున్న రాజకీయాల్ని అర్థం చేసుకుని, కార్యాచరణకు పూనుకున్నారు గనుకనే డాక్టర్గా మిగిలిపోక ఉద్యమకారుడయ్యారు. ఆ పనిలో భాగంగానే ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ (ఏఐపీఎస్ఎన్)కు జనరల్ సెక్రటరీ అయ్యారు. జన స్వాస్థ్యా అభియాన్కు, గ్లోబల్ పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్కు ఆద్యుడయ్యారు. 2003లో ఆసియా సోషల్ ఫోరమ్ హైదరాబాద్లో నెలకొల్పారు. 2004లో వరల్డ్ సోషల్ ఫోరమ్ ముంబైలో ఏర్పాటు చేశారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్)- పేటెంట్కు సంబంధించిన చట్టాల గూర్చి కృషి చేశారు. 'ఏంటీ కేపిటలిస్ట్ గ్లోబలైజేషన్ వరల్డ్' - కేపిటలిస్ట్ వ్యతిరేక ఉద్యమాలు లేవనెత్తారు. 1987లో భారత జన విజ్ఞాన జాతా ప్రారంభించారు. 'ఢిల్లీ సాక్షారతా సమితి'ని ఏర్పరచి నిరక్షరాస్యులైన యువకుల్ని, మహిళల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. బలమైన సంకల్పం, పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరు ఎన్నెన్ని పనులు ఎన్నెన్ని రకాలుగా చేయొచ్చో డాక్టర్ అమిత్ సేన్ గుప్త జీవితం నుండి నేర్చుకోవచ్చు. మామూలుగా పత్రికలకు వ్యాసాలు రాసి ప్రచురించడమే కాకుండా... అంత తీరిక లేకుండా గడుపుతూ కూడా, కొంత సమయం పరిశోధనకు కేటాయించేవారు. పరిశోధనా పత్రాలు కూడా ప్రచురిస్తూ ఉండేవారు. అలాంటి ఒక పరిశోధనా పత్రం ఆయన మరణానంతరం అచ్చయ్యింది. ఆయన వ్యాసాలు ఇంటర్నెట్లో ఉన్నాయి. ఆసక్తిగలవారు వెతుక్కోవచ్చు. వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి.
2018 నవంబర్ 28న గోవాలో సముద్ర స్నానానికి వెళ్ళి డాక్టర్ అమిత్ సేన్ గుప్త నీటిలో మునిగి చనిపోయారు. ఒడ్డున ఉన్న ఆయన భార్య త్రిప్త చూస్తుండగానే ఆ దుర్ఘటన జరిగింది. అప్పటికి ఆయనకు అరవైఏండ్లు. కొడుకు అరిజిత్ సేన్ గుప్త కాలేజి విద్యార్థి. కుట్రపూరితంగా ఎవరైనా ఏమైనా చేశారా? అని మీడియా అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే వివరాలేవీ ఆ తర్వాత బయటికి రాలేదు. డాక్టర్ అమిత్సేన్ గుప్త ఈతకోసం వెళ్ళి సముద్రంలో మునిగిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు అందరికందరూ శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే అందులోంచి తేరుకుని, ఆయన కుటుంబం చురుకుగా పనిచేసే ఆరోగ్య కార్యకర్తలకు ఫెలోషిప్ ప్రకటించింది. జనంలో తిరుగుతూ వారికి వైజ్ఞానిక స్పృహ, ఆరోగ్య స్పృహ - మానవ హక్కుల స్పృహ కలిగించే యువకుడిని గాని, యువతిని గానీ గుర్తించి ఒక లక్ష రూపాయలు స్టైఫండ్గా ఇవ్వాలని నిర్ణయించారు. గొప్ప ఆలోచన! దేశంలో డబ్బుగల వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ, ఇలా సమాజానికి ఉపయోగపడే పని చేద్దామన్న స్పృహ మాత్రం చాలా కొద్దిమందికే ఉంటుంది. అలాంటి వారిని దుర్భిణి వేసి వెతుక్కోవాల్సిందే!
(కామ్రేడ్ డాక్టర్ అమిత్సేన్ గుప్త స్మృతిలో)
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు