Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాటిన్ అమెరికా లోని హొండురాస్లో ఆదివారం నాడు జరిగిన ఎన్నికలలో వామపక్ష లిబరల్ రీఫౌండేషన్ పార్టీ అభ్యర్థి గ్జియోమారో కాస్ట్రో ఆధిక్యతలో ఉన్నారు. రెండు రోజుల తరువాత ప్రతిపక్షం తన ఓటమిని అంగీకరించటంతో ఆమె విజయం ఖరారైంది. సగానికిపైగా ఓట్లు లెక్కించిన సమయానికి ఆమెకు 53శాతం, ప్రత్యర్ధికి 33శాతం, మూడో స్దానంలో ఉన్న మరో అభ్యర్థికి తొమ్మిదిశాతం ఓట్లు వచ్చాయి. ఈ దశలో ఓట్ల లెక్కింపు నిలిపివేశారు. గత ఎన్నికల్లో లెక్కింపులో జరిగిన అక్రమాలు, అమెరికా జోక్యనేపథ్యం, లెక్కింపు ప్రారంభం కాగానే తామే గెలిచినట్లు అధికార పార్టీ ప్రకటించటం వంటి పరిణామంతో ఈసారి కూడా గతాన్ని పునరావృతం చేయనున్నారా అన్న అనుమానాలు తలెత్తాయి. లెక్కింపు నిలిపివేసిన ఒక రోజు తరువాత మంగళవారం నాడు పాలకపార్టీ ఒక ప్రకటన చేస్తూ తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామంటూ ప్రకటన చేసింది. దీంతో పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లైంది. గ్జియోమారో దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్రకెక్కనున్నారు. మీడియా ఆమె విజయం సాధించినట్లే అంటూ వార్తలిచ్చింది. ఓట్ల తేడా చాలా ఎక్కువగా ఉండటం, ఫలితాలపై సర్వత్రా చర్చ జరగటంతో విధిలేని పరిస్థితిలో అధికారపార్టీ ఓటమిని అంగీకరించినట్లు కనిపిస్తోంది.
పన్నెండు సంవత్సరాల తరువాత హొండురాస్లో మరోసారి వామపక్షనేత అధికారంలోకి రావటం లాటిన్అమెరికాను తన పెరటితోటగా భావిస్తున్న అమెరికాకు మరో ఎదురుదెబ్బ. 2005లో జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చిన జోస్ మాన్యుయల్ జెలయా రోసాలెస్ సతీమణే గ్జియోమారో. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నవంబరు చివరి ఆదివారంనాడు అధ్యóక్ష, పార్లమెంట్, స్ధానిక సంస్ధల, సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ సభ్యుల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఎన్నికైన వారు మరుసటి ఏడాది జనవరి 27న బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు 2006 జనవరిలో అధ్యక్షుడిగా అధికారానికి వచ్చిన జెలయా మిలిటరీ కూలదోసే వరకు (2009 జూన్ 28) అధికారంలో ఉన్నాడు. జెలయా పురోగామి విధానాలను అనుసరించినప్పటికీ మితవాద లిబరల్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు గెలిచిన గ్జియోమారో వామపక్ష పార్టీ తరఫున, పురోగామి అజెండాతో పోటీ చేశారు. అందువలన ఒక వామపక్షవాదిగా దేశంలో గెలిచిన తొలినేతగా పరిగణించాలి. ఇది అమెరికా సామ్రాజ్యవాదులకు మరో పెద్ద దెబ్బ-వామపక్ష శక్తులకు ఎంతో ఊపునిచ్చే పరిణామం.
ఒక సంపన్న వ్యాపార కుటుంబానికి చెందిన, మితవాద లిబరల్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ మిగతా లాటిన్ అమెరికా దేశాల ప్రభావంతో విదేశాంగ విధానంలో వెనెజులా, బ్రెజిల్, అర్జెంటీనాలతో కలసి జెలయా అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకొన్నాడు. లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల కూటమిలో చేరాలని నిర్ణయించాడు. ఇది మితవాద రాజకీయ శక్తులతో పాటు వాణిజ్య, పారిశ్రామిక, మీడియా శక్తులకు అసలు మింగుడు పడలేదు. అందరికీ ఉచిత విద్య, చిన్న రైతులకు సబ్సిడీలు, వడ్డీరేటు తగ్గింపు, కనీసం వేతనం 80శాతం పెంపు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పన, దారిద్య్ర నిర్మూలన వంటి చర్యలు తీసుకున్నారు. కత్తిగట్టిన ప్రయివేటు మీడియా ప్రభుత్వ కార్యకలాపాలను దాదాపు బహిష్కరించింది. అసలేం జరుగుతోందో కూడా జనానికి తెలియకుండా అడ్డుకుంది. దాంతో రోజుకు రెండు గంటల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి టీవీ, రేడియో ప్రసారం చేయాలనే ఉత్తరువులను జెలయా జారీ చేశాడు. ప్రతిపక్షం దీనిని నిరంకుశ చర్యగా అభివర్ణించింది. దేశంలో హత్యల రేటు మూడు శాతం తగ్గిన సమయంలో పెరిగిపోయినట్లు మీడియా ప్రచారం చేసింది. జెలయాను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఆయనను తీవ్రంగా విమర్శించే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దానిని అవకాశంగా తీసుకొని ఇంకే ముంది జెలయానే ఆ పని చేయించాడనీ, జర్నలిస్టులకు రక్షణ లేదనే ప్రచారం మొదలు పెట్టారు. 2010లో జరిగే ఎన్నికలలో అధ్యక్ష, పార్లమెంట్, స్థానిక సంస్థలతో పాటు దేశ రాజ్యాంగ సవరణల గురించి కూడా ఓటింగ్ నిర్వహించాలని జెలయా 2009లో ప్రతిపాదించాడు. జెలయా తన పదవీ కాలాన్ని పొడిగించుకొనేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ సవరణలు చేయరాదనే నిషేధాన్ని ఉల్లంఘించినందున పదవికి అనర్హుడు అంటూ అభిశంశన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
రాజ్యాంగ సవరణపై ప్రజాభిప్రాయ సేకరణతో సహా ప్రతిపోలింగ్ కేంద్రానికి నాలుగు బ్యాలట్ బాక్సులను తరలించేందుకు సహకరించాలని జెలయా మిలిటరీని కోరాడు. మిలిటరీ ప్రధాన అధికారి ధిక్కరించటంతో అతడిని బర్తరఫ్ చేశాడు. మిలిటరీ అధికారికి మద్దతుగా రక్షణ మంత్రితో పాటు పలువురు మిలిటరీ అధికారులు రాజీనామా చేశారు. సైనికాధికారిని బర్తరఫ్ చేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పార్లమెంట్, సుప్రీం కోర్టు కూడా తీర్మానించాయి. అయితే బర్తరఫ్కు రెండు రోజుల ముందే కీలక ప్రాంతాలలో సైన్యాన్ని మోహరించటం, బర్తరఫ్కు ముందు రోజే ఆ పని చేసినట్లు వార్తలు వ్యాపించటాన్ని బట్టి కుట్రలో భాగంగానే ప్రధాన అధికారి ధిక్కరణ కూడా ఉందని వెల్లడైంది. సైనిక దళాల ప్రధాన అధికారిని బర్తరఫ్ చేసిన మరుసటి రోజు జెలయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించటంతో, వెంటనే సైన్యం ఆపని చేసింది. నిదుర మంచం మీద ఉన్న జెలయాను అరెస్టు చేసి పక్కనే ఉన్న కోస్టారికాలో పడేసి వచ్చారు. హింసాకాండ చెలరేగే ప్రమాదం ఉందనే కారణంగా అధ్యక్షుడిని బర్తరఫ్ చేసినట్లు సాకు చెప్పారు. తరువాత రాజీనామా ఆమోదిస్తున్నట్లు పార్లమెంట్ తీర్మానించింది. నిజానికి జెలయా ఎలాంటి రాజీనామా పత్రంపై సంతకం చేయలేదు. ఐక్యరాజ్యసమితో సహా అంతర్జాతీయ సంస్థలు అనేకం ఖండించాయి, చివరకు కుట్ర సూత్రధారి ఒబామా కూడా తొలగింపు చట్టబద్ధం కాదని ప్రకటించాల్సి వచ్చింది. తరువాత జరిగిన ఎన్నికలలో అనేక అక్రమాలు జరిగాయి. తొలుత 60శాతం ఓట్లు పోలయ్యాయని, 55శాతం ఓట్లతో కొత్త అధ్యక్షుడు ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆ తరువాత అసలు పోలైంది 49శాతమే అని పేర్కొన్నారు. ఈ అక్రమాన్ని మీడియా బయటపెట్టకపోగా సక్రమమే అని చిత్రించి మద్దతు ఇచ్చింది. ఎన్నికలలో జెలయాను పోటీకి అనర్హుడిగా ప్రకటించారు. మితవాదశక్తులే అధికారానికి వచ్చాయి.
2011లో లిబరల్ పార్టీ నుంచి జెలయా మద్దతుదారులు విడిపోయి లిబరల్ రీఫౌండేషన్ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. 2009లో సైనిక కుట్రను వ్యతిరేకిస్తూ ఏర్పడిన నేషనల్ పాపులర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (జాతీయ ప్రజాప్రతిఘటన కూటమి) దీనిని ఏర్పాటు చేసింది. 2013 ఎన్నికల్లో గ్జియామారో అధ్యక్ష పదవికి పోటీ చేసి చతుర్ముఖ పోటీలో రెండవ స్థానంలో నిలిచి 29శాతం ఓట్లు తెచ్చుకున్నారు. 2017 ఎన్నికల్లో రీఫౌండేషన్ పార్టీతో మరోవామపక్షం జతకట్టింది, ఆ పార్టీ నేత సాల్వడోర్ నసరల్లా పోటీ చేశారు. అధికారపక్షం అక్రమాలకు పాల్పడి ఓటర్ల తీర్పును తారు మారు చేసింది. ఓట్ల లెక్కింపుపేరుతో రోజుల తరబడి కాలయాపన చేసి చివరకు అధికారపక్షం గెలిచినట్లు ప్రకటించారు. విజేతకు 42.95శాతం నసరల్లాకు 41.42శాతం వచ్చినట్లు చెప్పారు. అక్రమాలకు నిరసన తలెత్తటంతో దేశంలో పది రోజుల పాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తరువులు అమలు జరిపారు.Û ఎన్నికలు జరిగిన 21 రోజుల తరువాత ఫలితాన్ని ప్రకటించారు. నెల రోజుల పాటు సాగిన నిరసనల్లో 30మంది ప్రాణాలను బలితీసుకున్నారు. కోటి మంది జనాభా ఉన్న హొండూరాస్లో 2021 ఎన్నికల్లో తాము అధికారానికి వస్తే ప్రజాస్వామిక సోషలిజాన్ని అమలు జరిపేందుకు పని చేస్తామని, నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తామని లిబరల్ రీఫౌండేషన్ ప్రకటించింది.
ఓటింగు ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభంలోనే తామే విజయం సాధించినట్లు అధికార నేషనల్ పార్టీ ప్రకటించుకుంది. బహుశా అవసరమైతే గత అక్రమాలనే పునరావృతం గావించే ఎత్తుగడ దానిలో ఉండవచ్చు. మరోవైపు మనం విజయం సాధించామని గ్జియోమారో కాస్ట్రో మద్దతుదార్లతో మాట్లాడుతూ ప్రకటించారు. రాజధాని తెగుసిగల్పాలో సంబరాలు ప్రారంభమయ్యాయి. త్రిముఖ పోటీలో అధికారపక్షం చాలా వెనుకబడి ఉంది. దాంతో ఎలాంటి ప్రకటన లేకుండానే లెక్కింపు నిలిపివేశారు. నేషనల్ పార్టీని అధికారంలో కొనసాగించేందుకు అక్రమాలకు పాల్పడవచ్చని పోలింగుకు ముందే ప్రతిపక్షం హెచ్చరించింది. ఓట్ల లెక్కింపు నిలిపివేసినా జనం సంయమనం పాటించారు.అడ్డదారిలో గెలిచేందుకు అధికారపక్షం పాల్పడని అక్రమాలు లేవు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులు, హత్యలు జరిగాయి. ఓటర్లను బెదిరించారు. ప్రభుత్వ వనరులను ఉపయోగించి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తాయిలాలు అందించారని. అధికార మీడియా పాలక పార్టీ, అధó్యక్ష అభ్యర్థికి అనుకూలంగా పని చేసిందని ఐరోపా దేశాల కమిషన్ చెప్పింది. ప్రయివేటు మీడియా గురించి చెప్పాల్సిన పని లేదు.
అధికారపక్ష అభ్యర్ధి నసిరీ అస్ఫురా ప్రస్తుతం రాజధాని తెగుసిగల్పా నగర మేయర్గా ఉన్నాడు. ఏడులక్షల డాలర్ల మేరకు ప్రజల సొమ్ము మింగేసినట్లు విమర్శలున్నాయి, పండోరా పత్రాల్లో కూడా అతని అవినీతి ప్రస్తావన ఉంది. మూడో అభ్యర్థి లిబరల్ పార్టీకి చెందిన యానీ రోసెంథాల్ నిధుల గోల్మాల్ కేసులో మూడు సంవత్సరాలు అమెరికా జైల్లో ఉండి వచ్చాడు. అబార్షన్ నేరం కాదంటూ చట్టసవరణ చేస్తానని, బాంకుల్లో నిధులు జమచేసేందుకు వసూలు చేసే చార్జీలను తగ్గిస్తానని, అవినీతి అక్రమాల విచారణకు కమిషన్ ఏర్పాటు చేస్తామని గ్జియోమారో ప్రకటించారు. నయా ఉదారవాదం మనల్ని పాతాళంలో పూడ్చిపెట్టిందని దాన్నుంచి బయటకు లాగి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాస్వామిక సోషలిజాన్ని అమలును తాము గట్టిగా నమ్ముతున్నట్లు ప్రకటించారు. సమస్యలపై సంప్రదింపులు, ప్రజాభిప్రాసేకరణ వంటి భాగస్వామ్య ప్రజాస్వామిక మార్పులను తీసుకువస్తామన్నారు.
గ్జియోమారో అధికారానికి వస్తే తీవ్ర చర్యలు తీసుకుంటారని, దేశం అమెరికాతో సంబంధాల్లో ఉన్నందున ఒకవేళ తెగతెంపులు చేసుకుంటే నెల రోజులు కూడా గడవదని ఆమె మీద ప్రచారం చేశారు. చైనాతో ఎలాంటి సంబంధాలను కలిగి ఉంటారన్న ప్రశ్నకు తైవాన్తో ఉన్న సంబంధాలను తెగతెంపులు చేసుకొని చైనాతో ఏర్పాటు చేసుకుంటామని ఆమె చెప్పారు. అమెరికా వత్తిడి, ప్రభావంతో తైవాన్తో సంబంధాలు కలిగి ఉన్న పదిహేను దేశాల్లో హొండూరాస్ ఒకటి. ఆ దేశ వ్యవహారాల్లో తమకు వ్యతిరేకంగా అమెరికా వత్తిడి చేస్తోందని చైనా పేర్కొన్నది. గ్జియోమారో ఎన్నిక అమెరికాకు, అక్కడి మీడియాకు ఏ మాత్రం మింగుడు పడదు. అందువలన అడుగడుగునా ఆటంకాలు కలిగించేందుకు పూనుకుంటారని వేరే చెప్పనవసరం లేదు. నిరుద్యోగం, నేరాలు, అవినీతి, అంతర్జాతీయ మాదక ద్రవ్య ముఠాల కేంద్రంగా ఉంది. వాటిని ఎదుర్కొనే క్రమంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంది.
- ఎం. కోటేశ్వరరావు
సెల్:8331013288