Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పూలలో సువాసన, వ్యక్తుల్లో యోగ్యత దాచినా దాగదు' అని అన్నారు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. దేశం వైజ్ఞానికంగా ముందుకు పోవాలని కలలుగన్నవాడాయన.
ఏదైనా పని ప్రారంభించేప్పుడు ఒకసారి ఆగు. పరిణామాల గూర్చి ఆలోచించు. అప్పుడు ప్రారంభించు - అని పెద్దలు చెప్పిన మాట కొందరు ఎందుకోగాని, అస్సలు పట్టించుకోరు. తోచింది చేస్తారు. నోటికొచ్చింది మాట్లాడుతారు. ''గీతా శ్రవణం మధుమేహానికి మందు'' అని అన్నాడో ప్రఖ్యాత డాక్టర్ వైద్యుడు. ''శ్రీకృష్ణుడి బోధనలతో ఒత్తిడి దూరం అవుతుందని'' హైదరాబాదులోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎండోక్రైనాలజీ డిపార్టుమెంట్ హెడ్ అన్నారు. వ్యాయామం, ఆహార నియమావళి పాటిస్తూ భగవద్గీత వింటే ఆ వ్యాధిని మరింత నియంత్రణలో పెట్టవచ్చనీ ఆయన అన్నారు. ''భగవద్గీత ఒక మతానికి సంబంధించిన గ్రంథం కాదు, జీవితంలో 700 అంశాలను వివరించే గ్రంథం'' అని కూడా అన్నారు. దీనికి సంబంధించిన అధ్యయనం - పరిశోధనా పత్రం ''ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం''లో ప్రచురితమైందని చెప్పారు.
ఒత్తిడిని తట్టుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అవలంభిస్తారు. కొందరు పచ్చని పంట పైరుల్లో గడుపుతారు. కొందరు అడవుల్లోకి వెళ్ళి ప్రకృతి ఒడిలో గడుపుతారు. కొందరు వెళ్ళి దగ్గర్లోని పార్కులో కూచుంటారు. సంగీతాభిమానులైతే వారికి ఇష్టమైన సంగీతం వింటారు. కొందరు మంచి రచనలు చదువుతూ గడుపుతారు. ఇటీవలి కాలంలో కంప్యూటర్ నిపుణులు ఎక్కువగా స్ట్రెస్బాల్ ఉపయోగిస్తున్నారు. ఇలా ఎవరి పద్ధతివారికి ఉంటుంది. తప్పిస్తే, ఆ ప్రఖ్యాత డాక్టరు చెప్పినట్టు భగవద్గీత ఒక మతానికి సంబంధించింది కాదు అని ప్రకటించగానే ఇతర మతాల వారంతా దాన్ని స్వీకరించిన దాఖలాలు లేవు. ఈ డాక్టర్లో డాక్టరు లక్షణాల కన్నా మతపిచ్చి అధికంగా కనిపిస్తోంది. ప్రస్థుత భారత ప్రధాని ప్రపంచానికి ఓ'యోగా దినాన్ని' ప్రకటిస్తే... ఢిల్లీలో ఓ వందమందిని పోగేసుకుని ఆయన ప్రదర్శించుకోవాలే తప్ప, ప్రపంచ దేశాల్లో ఎవరూ ఎక్కడా దాన్ని ఆచరించడం లేదు. ప్రవాస భారతీయులెవరైనా ఆచరించినా, అదో మొక్కుబడికిందే లెక్క. అలాగే ఈ డాక్టరు భగవద్గీతకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం తేవాలని ఉబలాట పడ్డాడు తప్పిస్తే, మరొకటి కాదు. హిందూమతం మీద భగవద్గీత మీద విశ్వాసం లేని ఇతర మతస్థులకు గీత వినిపించి, వారి మానసిక ఒత్తిడి తగ్గించగలిగితే అప్పుడు ఆ డాక్టర్ చెప్పింది నిజమని నమ్మొచ్చు. అదే మధుమేహానికి వాడే మందుబిళ్ళలు మీరు ఏ మతస్థుడికైనా, ఏ కులస్థుడికైనా, భక్తుడికైనా, నిరీశ్వరవాదికైనా ఇచ్చి ఫలితం చూడొచ్చు.
ఇకపోతే పెరిగిన ఆధునిక అవగాహనను బట్టి, అన్నింటినీ వ్యాధులు (ణఱరవaరవర) అని అనకూడదు. కొన్ని శరీరధర్మరీత్య వచ్చే అవకతవకలు (ణఱరశీతీసవతీర) మాత్రమే! జనాన్ని భయపెట్టి లేదా వారికి తమ పైత్యాన్ని అంటగట్టి వ్యాపారం చేసుకోవడం లేదా ప్రాచుర్యంలోకి రావడం కొందరు డాక్టర్లకు అలవాటు. బహుశా ఈ డాక్టరు ఆ బాపతువాడేనేమో. లోగడ ఒక కర్నాటక సంగీత విద్వాంసుడు ''మ్యూజిక్ తెరపి' అన్నాడు. అది ఎవరిపై పనిచేస్తుందండీ? ఆ సంగీతం తెలిసి, దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి తనను తాను మరిచిపోయి ప్రశాంతత పొందగలిగే స్థాయిలో ఉంటేనే కదా? సరిగమలు తెలియని వాడికి, శాస్త్రీయ సంగీతమనగానే 'అమ్మనాయనో' అని పారిపోయే వారికి అది పనిచేయదు కదా? సైన్సు అందించిన మెడికల్ ట్రీట్మెంట్తో సమంగా ఏ తెరపీ రాదు. వాటి మీద విశ్వాసం ఉన్న ఏ కొద్దిమందికో అది అదనంగా కొంత ఉపశమనం ఇవ్వొచ్చు. అంతేగాని, మెడికల్ ట్రీట్మెంట్ మానేసి ఇలాంటి తెరపీలతో జనాబాహుళ్యంలో పని జరుగుతుందా? ఆలోచించిండి! మరో విషయం ఏమిటంటే 'గీతాశ్రవణం-మధుమేహం'కు సంబంధించిన తమ అధ్యయనం ఇండియన్ జర్నల్లో ప్రచురింపబడిందని ఆ డాక్టర్ రాజేశ్ చెప్పారు కదా? ఇదిగో ఇలాంటి చాదస్తులెవరో ఆ జర్నల్ ఎడిటోరియల్ బోర్డులో ఉండి ఉంటారు. అందుకే ప్రచురించి ఉంటారు. ఇండియన్ జర్నల్లో కాకుండా విదేశీ జర్నల్లో ప్రచురింపబడితే, దాని ప్రామాణికత గూర్చి కొంత వరకు ఆలోచించే వాళ్ళం. ఎందుకంటే ఆ దేశాల శాస్త్రవేత్తలు దాన్ని పరిశీలించి, విశ్లేషించిన తర్వాతనే ప్రచురిస్తారు. ఇక్కడివాళ్ళు ఇక్కడి పైత్యాన్ని ప్రచురించుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇండియన్ జర్నల్స్ అన్నీ నాసిరకంవి అని నేను చెప్పడం లేదు. ప్రపంచ స్థాయి పరిశోధనలు ఈ దేశంలో జరుగుతున్నాయి. ఆ స్థాయి సైన్సు పత్రికలు ఇక్కడ అచ్చవుతున్నాయి. అయితే, ఇప్పుడు వైజ్ఞానిక స్పృహను దెబ్బతీసే సైన్సు సంఘాలు, పత్రికలు కొన్ని తయారయ్యాయి. అవి అధికారంలో ఉన్న పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్నాయి.
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ను కొందరు రూపొందించుకున్నారు. కేంద్ర ప్రభుత్వపు ఆలోచనల్ని యథాతథంగా చర్చించడం దీని ఉద్దేశం. ఇది సైన్స్కు సంబంధంలేని అనేక విషయాలకు ప్రాముఖ్యమిచ్చి అతిగా చూపించడం జరుగుతూ ఉంది. దేశంలో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సైన్సు సంఘాలు, సైంటిస్టులు రాజకీయాలకు లొంగి పనిచేయడమే 'ఆత్మనిర్భర్ భారత్' అన్న మాట? దేశ ప్రజల ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చేయాలన్న ధ్యేయంతో కొన్ని సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్న విషయం మనం మరవకూడదు. సామాన్య పౌరులు, ముఖ్యంగా యువతీ యువకులు జాగరూకతతో మసలుకోవాల్సిన అవసరం ఉంది. జరుగుతున్న మోసాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ''జ్ఞానమే అన్నింటి కంటే గొప్పధనం. ఎవరికి వారు వారెంతటి ధనవంతులన్నది ప్రశ్నించు కోవాలి!'' అనే మాట నిరంతరం గుర్తు చేసుకోవాలి.
2021 నవంబర్ 18న ఒక హర్యానా డాక్టరు - చిన్న పిల్లల వైద్య నిపుణుడు ప్రజల సమక్షంలో గోశాల ముందు నిలబడి ఆవుపేడ తిన్నాడు. అంతే కాదు, పంచగవ్యాల విశిష్టతను తెలుపుతూ, ఈ సమాజాన్ని ఉద్దరిస్తున్నానన్న పట్టలేని సంతోషంలో ఉపన్యసించాడు. ఆవుపేడ దేహాన్ని, మనసును పవిత్రం చేస్తుందని సెలవిచ్చాడు. ఎంబిబియస్, యం.డి. చదివిన మనోజ్ మిట్టల్ అనే ఈ డాక్టరు ప్రజలకు ఆవుపేడ సందేశాన్ని ఇవ్వడమే గాక, వారి ముందే ఆవుపేడ ఊరించుకుంటూ చప్పరించి వారికి ప్రాయోగిక పరిజ్ఞానం కలిగించాడు. అందుకే అన్నారు... మూర్ఖోరక్షిత: రక్షిత: అని! మూర్ఖుల్ని రక్షిస్తే వారే వారిని రక్షించుకుంటారు - అని? ప్రభుత్వాలకు సరైన ఆలోచన ఉంటే గింటే.. వెంటనే అతని మెడికల్ డిగ్రీలు రద్దుచేసి వైద్యవృత్తికి అనర్హుడిగా ప్రకటించాలి. 'నాయనా - నువ్వీ గోశాలలోనే ఉండు. పేడ ఎత్తుతూ ఉండు. ఆకలయినప్పుడు ఇంత తింటూ ఉండు. నీ జన్మ ధన్యమవుతుంది' అని అతణ్ణి గోవులకే వదిలేయాలి. కానీ ప్రభుత్వం ఆ పనిచేయదు. ఎందుకంటే.. అందులో విరాజిల్లుతున్న పెద్దలే ఇలాంటి పేడ పురుగుల్ని మత వ్యాప్తికి ప్రత్యక్షంగా పరోక్షంగా వాడుకుంటున్నారయ్యే! రాజకీయాలు మారిపొయ్యాయి. ఒకప్పుడు రైట్వింగ్ - లెప్ట్ వింగ్ మధ్యన ఉండేవి. ఇప్పుడు అలా కాదు. నిజానికీ - అబద్దాల ప్రచారానికీ మధ్య నడుస్తున్నాయి. ''ఆలోచన తక్కువయ్యే కొద్దీ మాటలు ఎక్కువవుతాయి'' - ఫ్రెంచ్ ఫిలాసర్ మాంటెస్క్యూ మాట గుర్తుకొచ్చినప్పుడల్లా ఎందుకోగాని, ప్రస్థుతం అధికారంలో ఉన్న మన దేశ నాయకులు గుర్తుకొస్తారు.
సూర్యాపేట రూరల్ - దురాజ్పల్లి గ్రామంలో నాటు వైద్యుడు జక్కిలి భిక్షపతి నాటు వైద్యం చేస్తూ, మహిళల్ని లొంగదీసుకుంటున్నాడు. రాజేశ్వరి అనే మహిళ తన 18ఏండ్ల కూతురు శ్రావణికి వైద్యం చేయించడానికి తీసుకొచ్చింది. నాటువైద్యుడు ఒకరోజు వారిని తన దర్గాలోనే ఉండమన్నాడు. దేవుడి సన్నిధిలో నిద్రచేస్తే మంచిదని చెప్పాడు. అతని మాట విని తల్లీ కూతుళ్ళు అక్కడే ఉండిపోయారు. రాత్రివేళ నాటు వైద్యుడు తల్లిని బలవంత పెట్టాడు. తన కోరిక తీర్చడమంటే దైవం కోరిక తీర్చినట్టేనని నమ్మబలికాడు. ఆమె వినలేదు. తిరగబడింది. వైద్యం చేయడానికీ కోరిక తీర్చడానికీ సంబంధమేమిటని ప్రశ్నించింది. ఉక్రోషంతో నాటు వైద్యుడు, పాలల్లో పసరు కలిపి కూతురికి తాగించి చంపేశాడు. చివరికి పోలీసులు నాటువైద్యుణ్ణి అరెస్టు చేసి తీసుకుపోయారు. గాంధీనగర్ సమీపంలో దర్గా ఏర్పాటు చేసుకుని నాటు వైద్యం పేరుతో మహిళల మీద లైంగిక దాడులు చేస్తున్నాడని పోలీసు విచారణలో తేలింది. 2021 నవంబర్.
తండ్రీ కొడుకులు రోడ్డుమీద నడుస్తున్నారు. దూరంలో శబ్దం వినిపించింది. తండ్రి కొడుకును అడిగాడు.. ''ఆ శబ్దం విని అదేమిటో చెప్పరా నాన్నా!'' అని!.. కొడుకు జాగ్రత్తగా విని ''అది లారీ చప్పుడు డాడీ'' అన్నాడు. ''నిజమే! బాగా కనిపెట్టావ్! కానీ, అది ఖాళీగా వస్తోంది తెలుసా?'' అన్నాడు తండ్రి. కొడుకు ఆలోచనలో పడ్డాడు. ''దాన్ని చూడకుండానే మీరెలా కనిపెట్టారా విషయం? ఆశ్చర్యంగా అడిగాడు కొడుకు. ''అదిగో అంతంత పెద్ద శబ్దాలు వస్తున్నాయంటే అది ఖాళీదే అయి ఉంటుంది'' అని వివరణ ఇచ్చాడు తండ్రి. కాసేపటి ఆ ఖాళీ లారీ వారి పక్క నుండి వెళ్ళిపోయింది. మరికాసేపటికి శబ్దాలు దూరమయ్యాయి. చిన్నోడు తండ్రి కాళ్ళకు చుట్టుకుని ''భలే కనిపెట్టేశావు డాడీ'' అని తండ్రి ముఖంలోకి ఆనందాన్ని ప్రసరించాడు.
అందుకే చూడండి ఖాళీ బుర్ర లెప్పుడూ ఎక్కువ శబ్దాలు చేస్తుంటాయి. టీవీ యాంకర్లు, రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రధానులు ఎవరైనా కావొచ్చు. బుర్ర ఖాళీగా ఉన్నప్పుడే దేశవాసులకు అర్థం పర్థం లేని ''సుభాషితాలు'' చెపుతుంటారు. అక్కడ వారి స్థాయి, హౌదా ముఖ్యం కాదు. మెదడ్లులేక పోవడం, ఉన్నా.. వాటికి తమ అహాన్ని అడ్డువేసి, సరిగా పనిచేయనివ్వక పోవడం.. చూస్తున్నాం! అందుకే మన దేశంలో కొందరు ఉన్నత విద్యావంతులు విద్యావిహీనుల్లా మాట్లాడు తుంటారు. తమ మూర్ఖత్వ విశ్వరూప ప్రదర్శన నిత్యం చేస్తుంటారు. ఇలాంటివి కేవలం మన భారతదేశానికే ప్రత్యేకం! అదేమిటో....
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు