Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా గణతంత్ర వేడుకల్లో ఈసారి అపశృతి నెలకొనబోతున్నదా? అవును నిజమే అనే సమాధానం వస్తున్నది. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయత. ఎన్ని వేలసార్లు చెప్పుకునా ఈ భావన చెక్కుచెదరదు. ఉపఖండాన్ని పోలిన ఈ సువిశాల భారతావని భిన్న జాతుల, భిన్న మతాల, భిన్న భాషల, భిన్న సంస్కృతుల సంగమం సామరస్యం సహజీవనం మహౌత్కృష్టమైనదని వివేకానందుడు ఏనాడో చెప్పాడు.
ప్రతిఏటా గణతంత్ర వేడుకలు వీటినే ప్రతిబింబిస్తాయి. ఎక్కడ, ఏ మూలన ఉన్నా మన దేశ ప్రజల శక్తి సామర్థ్యాలు ఒకేచోట ఎలుగెత్తి చూపడానికి ఇదో వేదిక అవుతుంది. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం, ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రం, ఒక సంస్కృతి నుండి మరో సంస్కృతి పరస్పరం స్ఫూర్తి పొందడమే గాకుండా బాహ్య ప్రపంచానికి కూడా భారతీయత అంటే ఇది కదా..! అని తేటతెల్లమవుతుంది.
ఈసారి జనవరి 26న రాజధాని ఎర్రకోటలో జరిగే 73వ గణతంత్ర దినోత్సవం ఈ ఘన సాంప్రదాయానికి నీళ్ళు వదలనున్నదా..? అనే అనుమానం రాక మానడం లేదు.
మొదటిది బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సాంస్కృతిక ప్రజ్ఞా పాటవాలు, వైజ్ఞానిక ప్రగతి బాటలు తెలియజెప్పే నమూనా శకటాల ప్రదర్శనలకు గణతంత్ర వేడుకలో తావివ్వలేదు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొరపెట్టుకున్నా రక్షణమంత్రిత్వశాఖ ససేమిరా... కుదరదు అని మొండిగా అంటున్నది. ఆయా రాష్ట్ర ప్రజల సృజన శీలతను ఇది అవమానించడమేకాదు, మనోభావా లను గాయపరచడం కూడా అవుతుందని రాజకీయ విజ్ఞులు అంటున్నారు.
ముఖ్యంగా ఈ విరుద్ద పద్ధతిని పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, విజయన్, స్టాలిన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ అంశం చినికి చినికి గాలివాన కాకముందే ప్రధాని మంత్రి మోడీ జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. కాని అనేక జాతీయ, సర్తసత్తాక, సారన్వభౌమ, ప్రజాస్వామ్య అత్యవసర విషయాల్లో ప్రధాని ఎలా ఉలుకు పలుకు లేకుండా మిన్నకున్నారో ఇప్పుడూ అలాగే మిన్నకుంటున్నారు. ఇలా అయితే మన జాతీయ సమైక్యతను దేశ సమగ్రతను సంరక్షించేదెవరు? ఇక ప్రజలే రక్షించుకోవాలి అని ఆ విజ్ఞులు భావిస్తున్నారు.
గణతంత్రం అంటే రిపబ్లిక్. ప్రజారాజ్యం. దేనిలోనైతే అత్యున్నత రాజ్యాధికార సంస్థలు ఒక నిర్దిష్ట కాలానికి ప్రజలచే ఎన్నుకోబడతాయో ఆ ప్రభుత్వ రూపాన్నే మనం రిపబ్లిక్ అంటున్నాం. దేశాధ్యక్షుడైన రాష్ట్రపతి ఈ సందర్భంగా జాతికి ప్రత్యక్ష సందేశం ఇస్తారు. రాజకీయాలకు అతీతమైన సమకాలీన భారత విశిష్టతను అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పే శుభ తరుణమది. కాని ఇలాంటి మహౌన్నత సమయాన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అత్యంత సంకుచితంగా స్వార్థపూరితంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు? భారతీయతకు కళంకం కాదా..? అని వారు ప్రశ్నిస్తున్నారు.
కాగా, ఆజాదీ అమృతోత్సవ్ పేరిట 75ఏండ్ల దేశ స్వాతంత్య్ర వేడుకలను కేంద్రం నిర్వహిస్తున్నది. నిజం చెప్పుకోవాలంటే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిస్తేనే దేశం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదురించడంలో ఎక్కడవారికి అక్కడ లెక్కలేనన్ని సాహసోపేతమైన వీరోచిత అనుభవాలు ఉన్నాయి. అశేష ప్రాణత్యాగాలు ఉన్నాయి. అసలు ఆ సామ్రాజ్యవాద వ్యతిరేక స్వాతంత్య్ర పోరాటమే భారత ప్రజలనందరిని ఒక్క తాటిపై నిలిపిందనే విషయం మరువరాదు. అలాగే దోపిడీ, పీడనల వ్యతిరేకంగా సాగిన పారంపర్య పోరాటా లను తమ జాతి గర్వకారణాలుగా ఇలాంటప్పుడు చెప్పుకోవడం ప్రతీతి. ఇప్పుడు ఈ శకటాలను అడ్డుకోవడం ద్వారా మా ఘనమైన వారసత్వ విజయాలను మరుగుపర్చాలన్న కేంద్రం దుష్టతలంపు కనిపిస్తున్నదని ఆ రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. స్వాతంత్య్రపోరాటం అనుభవంలేని పార్టీకి ప్రజల త్యాగాల గురించి, సాహసాల గురించి ఏం తెలుస్తాయి? అని అడుగుతున్నాయి.
సామాజిక రుగ్మతలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నారాయణ గురు కేరళ శకటాన్ని తిరస్కరించడమంటే ఏమిటి? దేశంలో ఇంకా సామాజిక వివక్షలు కొనసాగాలని బీజేపీ కోరుకుంటుందా? అని ఆగ్రహంతో అడుగుతున్న ప్రశ్నకు కేంద్రం జవాబు చెప్పలేకున్నది. ఎటు నుండి ఎటు చెప్పుకున్నా రాష్ట్రాలమీద కేంద్రం చేసే ఈ చర్య అ ప్రజాస్వామ్య, అవాంచనీయ రాజకీయ ఆధిపత్యం తప్ప మరేమీ కాదనేది స్పష్టమవుతున్నది.
మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలకు ప్రదర్శనలో చోటుండాలి. కానీ కొన్ని శకటాలకే.. అవి బీజేపీ ఏలుబడిలో ఉన్న వాటికి మాత్రమే అనుమతినిస్తున్నట్టు తెలుస్తున్నది. అలాగే వేడుకలు ముగింపు సందర్భంగా అబైడ్ విత్ మీ (నాతోనే ఉండు) అనే కీర్తన ఆలపించి బీటెంగ్ రిట్రీట్తో సమాప్తం చేస్తారు. మహాత్మాగాంధీకి ఇది చాలా ఇష్టమైన కీర్తన. 1847లో ఆంగ్లకవి హెన్రీ ప్రాన్సిస్ ఈ కీర్తన రచించారు. 1950 నుండి ఇది వేడుకల్లో ఆనవాయితీగా వస్తున్నది. గాంధీ సిద్ధాంతాలను, భావనలను గ్రోసిపుచ్చి గాడ్సే ఆలోచనలకు పట్టంకట్టే దుర్మార్గానికి బీజేపీ పూనుకుంటున్నదని కాంగ్రెస్ విమర్శించింది. 'అబైడ్ విత్ మీ' కీర్తనను తొలగించడాన్ని చివరకు శివసేన సైతం తప్పుపట్టింది. కరుడుకట్టిన మూసబోసిన భావనలు అమలు చేయడానికే బీజేపీ కంకణం కట్టుకున్నట్టు అర్థమవుతున్నది.
కొసమెరుపు: వైవిద్యమనేది ప్రాకృతిక సమాజ ధర్మం. ప్రాణులన్నింటికీ ఇది వర్తిస్తుంది. వనంలో ఎన్నో రకరకాల వృక్షాలు, జీవాలు ఉన్నాయి. ఉదాహరణకు బోధి వృక్షాలు ఎన్ని ఉన్నా రూపంలోను, ఫలవంతంలోను ఎంతో వ్యత్యాసం. మానవులూ అంతే. ఆలోచనల్లోనూ, ఆచరణల్లోనూ మనిషి మనిషికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అయితే ఆ ఆలోచన, ఆచరణ, సృజనశీలత మానవ కళ్యాణానికి వినియోగించాలి గాని విధ్వంసానికి కాదు.
వేల సంవత్సరాల క్రితమే బుద్ధుడు చేసిన బోధ ఇది. ఆ క్రమంలోనే 'సత్యం - అహింస' తన తత్వజ్ఞాన ప్రచారానికి వికేంద్రీకరణ మార్గాన్ని ఎంచుకుని విభిన్న గుణాల గలవారిని శిష్యులుగా స్వీకరించి వారి అంతర్గత సామర్థ్యాన్ని ఎరుకపరిచి రుజు మార్గంలో పయనించేలా కర్తవ్య బోధ చేశాడు.
కాని ఇప్పుడు ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తత్విరుద్ధంగా అపసవ్య దిశలో పయనిస్తున్నది కదూ....
- కె. శాంతారావు
సెల్:9959745723