Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, 'అబద్దాల ప్రచారం పెరిగింది' - అని జనంలో ఒక అభిప్రాయం ఉంది. అది నిజమే అయినా, మనువాదులు కొన్ని శతాబ్దాల క్రితమే ఆ పని ప్రారంభించారు. బౌద్ధ, జైన ఆలోచనా విధానాల్ని నాశనం చేసే క్రమంలో దేశంలో ఎన్నెన్ని అఘాయిత్యాలు చేశారో, ఎన్నెన్ని అబద్దాల్ని పురాణాలుగా మలిచారో నిశితంగా విశ్లేషించుకుంటే అర్థమవుతుంది. వారు ప్రచారం చేసిన అబద్దాల సుడిలో కొట్టుకుపోతే ఏవీ అర్థం కావు. ఆ ప్రవాహానికి ఎదురు నిలిచి, అవగాహన పెంచుకుని, ఒక విహంగ వీక్షణంలా అన్ని విషయాలు ఆకళింపు చేసుకుని గమనిస్తే గాని... విషయం బోధపడదు. గడుస్తున్న ఇప్పటి కాలం మరీ మరీ గడ్డుకాలం. కరోనా వైరస్ ఎలాగయితే వీరవిహారం చేస్తోందో, అంతకు మించి అధికార పార్టీ నిర్వహిస్తున్న ఐటి సెల్ ఎన్నెన్నో అబద్దపు వైరస్లను సమాజంపైకి పంపుతోంది. పైన నిర్ణయాలు తీసుకునే వారు ఎలాగుంటే, కిందున్న మామూలు జనం కూడా అలాగే ఉంటారు. పైన ఉన్నవారిని అనుకరిస్తుంటారు. నిజాయితీ, నిబద్దతా లేకుండా, తమ పని జరిగితే చాలునన్నట్లు తయారవుతుంటారు. సమాజంలో వీరి సంఖ్య పెరుగుతూ ఉండటం మనం గమనిస్తున్నాం.
ఎవరెవరో తాగి బండ్లు నడుపుతున్నారు. ప్రమాదాలు జరిగి, సంబంధం లేనివారు చనిపోతున్నారు. చట్టాల్లో లోపాలు, లాలూచీ పడే అధికారులు, లిక్కర్ అమ్మకాలతోనే నిలబడుతున్న ప్రభుత్వ ఖజానాలు... అమాయకుల చావులకు బాధ్యులెవరూ? అని ప్రశ్నిస్తే సమాధానం సూటిగా రాదు. ఇదీ అలాంటిదే - అసత్య ప్రచారాలతో జనం ఆలోచనల్ని భ్రష్టు పట్టిస్తున్నవారు దేశ ప్రతిష్ట, దేశ ప్రజల ప్రతిష్ట దిగజారిపోతున్న విషయం పట్టించుకోరు. స్విచ్ ఎక్కడో వేస్తే, లైటు ఎక్కడో వెలిగినట్టు.. వీళ్ళు చేసే అబద్ద ప్రచారాల ఫలితం భవిష్యత్ తరాల మీద బలంగా ఉండబోతోంది. అందుకని, సత్వరం జాగ్రత్త వహించాల్సి ఉంది. అబద్దాన్ని అబద్దమని విసుగులేకుండా చెప్పాల్సి ఉంది. తప్పదు! ఇలాంటి వారిని ఎవరూ అడ్డుకోక వదిలేస్తే భవిష్యత్తు అంధకారమవుతుంది. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి సామాన్య పౌరులు తమ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. ప్రజా సంకల్పం ముందు, ప్రజా బలం ముందు ఏ ప్రభుత్వాలూ నిలవవు. ప్రతిఘటిస్తూ, ప్రపంచానికి ఉద్యమస్ఫూర్తిని తెలియజెప్పిన మన రైతు ఉద్యమకారుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరికి వారు వారి వారి లక్ష్య సాధన దిశగా సాగిపోవాలి. ప్రజల్లో మార్పు వస్తే, వ్యవస్థలు, ప్రభుత్వాలు అవే మారతాయి.
భారతీయ బ్రాహ్మణ సంస్కృత పండితుడు శివకర్ బాపూజీ తల్పడే (1864-1916) మహారాష్ట్ర పౌరుడు. 1895లో అతను మానవ రహిత విమానాన్ని మెర్క్యూరీ ఇంజన్తో 1500 ఫీట్ల ఎత్తులో నడిపించాడని ప్రచారం చేశారు. ఇది రైట్ బ్రదర్స్ కనిపెట్టిన దానికన్నా ఎనమిదేండ్లు ముందని ఢంకాబజాయించారు. దానికి తల్పడే 'మారుత్ సఖా' అని పేరు పెట్టాడని చెపుతారు. మారుతి అంటే గాలి. సఖా అంటే స్నేహితుడు. ఆ విమానాన్ని ఆయన రుగ్వేదం 96.2లోని విషయాల ఆధారంగా తయారుచేశాడని చెపుతారు. ముంబాయిలో బరోడా మహారాజు తన ఆస్థాన సభ్యులతో కొలువుదీరి ఉండగా తల్పడే తన విమాన్ని గాల్లో నడిపించాడని, మళ్ళీ సురక్షితంగా నేలపైకి తీసుకొచ్చాడనీ చెప్పుకుంటారు. దురదృష్టవశాత్తు బ్రిటిష్ వారు ఆ కుటుంబాన్ని వేరు వేరు కేసులలో ఇరికించి చంపేశారనీ... దానితో ఆ విమాన పరిజ్ఞానం మనకు దక్కలేదని ఎస్పీహెచ్ నిత్యానంద పరమశివం వివరణ ఇచ్చారు. ఆక్సిజన్, హైడ్రోజన్ల కలయికతో నీరు ఏర్పడిందన్న ప్రాథమిక సమాచారమే వేదాలలో లేనప్పుడు, విమాన తయారీ గూర్చి ఉందని అంటే ఎలా నమ్మడం? తల్పడే గొప్పదనాన్ని భరించలేక ఆ కుటుంబాన్ని, ఆ పరిజ్ఞానాన్ని బ్రిటిషు వారు నాశనం చేసిందీ నిజమయితే.. బ్రిటిషు పాలనలలోనే సి.వి.రామన్, విశ్వకవి టాగూర్ నోబెల్ సాధించారు కదా? ఎంతో మంది వైజ్ఞానికులు బ్రిటన్ వెళ్ళి పరిశోధనలు చేశారు. గాంధీ, నెహ్రూలతో సహా ఎంతో మంది బారిస్టర్లయ్యారు. వీరందరికన్నా తల్పడే గొప్పోడని అనుకునే వీరి కహానీలు నమ్మాలా?
మైక్రోస్కోపు ఆవిష్కరించక పూర్వమే ఫలదీకరణ, పిండోత్పత్తిపై ప్రాచీన భారతదేశంలో అవగాహన ఉందని ఒక అబద్దానికి తెరలేపారు. ఆ విషయాలకు సంబంధించిన శిల్పాలు తమిళనాడులోని కాలభైరవనాథ ఆలయంలో లభించాయని... అవి సుమారు వెయ్యేండ్ల క్రితంవి... అని చెపుతారు. అయితే వెయ్యేండ్ల క్రితం అంటే 1021 సి.ఇ.లో భారతదేశ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనించాలి. కామన్ ఎరా 1001-1027 మధ్య కాలంలో వరుసగా మహ్మద్ గజనీ భారతదేశంపై దండయాత్రలు చేస్తున్నాడు. అప్పటికి 500ఏండ్లకు ముందే అంటే 500సి.ఇ. వరకే గుప్తరాజులు పూర్తిగా పతనమైపోయారు. ఉత్తరాన పశ్చిమదిశ నుండి దండెత్తి వస్తున్న ఆ ముస్లిం చొరబాటుదారులను ఎదుర్కొనే స్వతంత్ర ప్రతిపత్తి గల రాజు ఆ కాలంలో ఎవరూ లేరు. ఇక దక్షిణాన పల్లవులు, చోళులు, చాళుక్యులు, రాష్ట్ర కూటులు పరిపాలన సాగిస్తూ ఉండేవారు. ఎంత సేపటికి తమ రాజ్యాల్ని ఇతరుల నుండి కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారే గాని, వైజ్ఞానికంగా అభివృద్ధి చెంది, పురుషుల వీర్య కణాల గూర్చి, స్త్రీ అండాల గూర్చి, ఫలదీకరణం గూర్చి, పిండ దశ పరిణామాల గూర్చి ఏ భారతీయులు అధ్యయనం చేశారూ? మైక్రోస్కోపులేకుండా అలాంటి అధ్యయనాలకు వీలేలేదు. అప్పటికి సూక్ష్మదర్శిని ప్రపంచంలోనే లేదు. అయితే, సూక్ష్మంగా ఉండే ఆ జీవకణాల్ని నాటి రుషులు తమ ''దివ్యదృష్టి''తో చూశారా? ఏమో.. చెవిలో పువ్వు పెట్టుకున్న వాళ్ళు ఏమైనా చెప్పగలరు. మూఢ విశ్వాసంలో మునిగి ఉన్నవారు దేనినైనా నమ్మగలరు.
మైక్రోస్కోపుకు రూపకల్పన చేసిన అంటన్ వాన్ లీవెన్హాక్, డచ్ శాస్త్రవేత్త జీవించిన కాలం 1632-1723 సి.ఇ. అయినప్పుడు భారతీయులకు వెయ్యేండ్ల క్రితమే సూక్ష్మదర్శిని ఎక్కడిది? ఆలోచిస్తే పొయ్యేదేముంది.. అజ్ఞానం తప్ప? ఇదే కాదు, ఇలాంటివి ఇంకెన్నో అద్భుతాలు కేవలం భారతదేశంలోనే జరుగుతాయి. ప్రపంచంలో మొదటి సైకిల్ ఇక్కడే తయారయ్యిందని, శివపార్వతులు 'లొడో' ఆట ఇక్కడే ఆడారని వాటి తాలూకు శిల్పాలు ఫలానా ఫలానా ఆలయాల గోడల మీద చెక్కి ఉన్నాయని మనువాదులు దేశ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అలాగే గెలీలియో టెలిస్కోపు 1609లో కనిపెడితే, దాని కంటే ముందే... 12వ శతాబ్దంలో దేశంలో టెలిస్కోపు ఉందనీ, దాని శిల్పాలు కర్నాటక హళైబీడు ఆలయంలో ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. అలాంటిదే మరొకటి.. వేల యేండ్ల క్రితం, ఆగత్స్యుడు విద్యుత్తును కనిపెట్టాడని చెప్పే దేశభక్తులున్నారు. సరే.. ఒక్క క్షణం ఒప్పుకుందాం.. కానీ, ఆ కాలంలో విద్యుత్తు ఏయే ప్రాంతాలకు సరఫరా చేశారో చెప్పాలి! పైగా ఆ విద్యుత్ తీగలు ఎలా తయారు చేశారో కూడా చెప్పాలి. జంతువుల్ని బలి ఇచ్చినప్పుడు ఆ జంతువుల మెడ నరాలో లేక తోక నరాలో తీసి వాటితో విద్యుత్ తీగలు తయారుచేశారా? ఇప్పుడు మనం వాడుతున్న విద్యుత్కు సంబంధించిన సమాచారమంతా మనదగ్గరుంది. తీగలు ఏయే లోహాలతో తయారవుతున్నాయో కూడా తెలుసు. ఏది ఎంత ఓల్టేజో తెలుసు. మరి అప్పటి వివరాలు ప్రకటించాలి కదా? వాస్తవానికి ఆధారాలుంటాయి కానీ, అబద్దాలకెక్కడీ
శ్రీకృష్ణుడి 'కాళీయ మర్థనం' గురించి కల్పిత కథల్లో వినడమే తప్ప అందుకు ప్రాచీన శిల్పాల్లో, కట్టడాల్లో ఏ ఆధారాలూ లేవు. ఆధునిక చిత్రకారులు గీసిన చిత్రాలలో మాత్రం నాగుపాము పడగ మీద శ్రీకృష్ణుడు నిలబడి వేణువు ఊదుతూ ఉండటం.. చుట్టూ గోపికలు ఆయనను స్తుతిస్తూ, నమస్కరిస్తూ నిలబడటం కనిపిస్తుంది. అది మార్పులు చేర్పులు చేసుకున్న ఊహాచిత్రం.. అని తెలుస్తూ ఉంది. అయితే, బార్హుత్-ప్రసేన్జిత్ స్తంభంపై చెక్కిన 'కాలీయ దమన్' - వెలుగులోకి వచ్చింది. అందులో ధర్మబోధ చేస్తున్న బుద్ధుడు ఒక నాగుపాము పడగమీద కొంచెం ఎత్తులో నిలబడి ఉంటాడు. రాజవంశీయులు, పుర ప్రముఖులు అందరూ ఆయనకు నమస్కరిస్తూ ఉంటారు. నేపథ్యంలో ఒక పెద్ద వృక్షం, పెద్ద పెద్ద ఆకులూ చెక్కి ఉంటాయి. బుద్ధుడు రాజ్యాన్ని వదిలేసినా, ప్రజలు ఆయనను నాగవంశీయుల మహానాయకుడిగా ఆరాధించుకున్నారు. అత్యున్నత స్థానంలో నిలపుకున్నారు. ఆ శిల్పం ఆ విషయాన్నే ప్రతిబింబించింది. శ్రీకృష్ణుడు కూడా నాగవంశీయుల మహా నాయకుడే అని.. వేద సంస్కృతిలో భాగమైన కల్పిత కావ్యాల్లో రాసుకున్నారు. కృష్ణుడు కల్పిత పాత్ర అయితే, బుద్ధుడు చారిత్రక పురుషుడు. ఆ తేడాను మనం అర్థం చేసుకోవాలి!
కృష్ణుడు మరెవరో కాదు, మనువాదులు మార్చుకున్న బుద్ధుడే అని మధుర తవ్వకాల్లో బయటపడింది. అక్కడి తవ్వకాల్లో సుమారు నాలుగువేల బౌద్ధ ప్రతిమలు, ధమ్మ చక్రాలు మొదలైనవి లభించాయి. మధుర, కనిష్కుడు పరిపాలించిన ప్రాంతం. అతడు బౌద్ధం స్వీకరించిన సామ్రాట్టు. అందువల్ల, లభించిన ఆధారాలన్నీ బౌద్ధానికి సంబంధించినవే కావడంలో ఆశ్చర్యం లేదు. అయితే బుద్ధుణ్ణి శ్రీకృష్ణుడిగా మార్చుకుని, కథలల్లుకున్నది మాత్రం తర్వాతి కాలంలోని బ్రాహ్మణ పండితులు. బుద్ధుడి ధమ్మచక్రాన్ని మార్చి, కృష్ణుడికి సుదర్శన చక్రం చేశారు. బుద్ధుడి ధమ్మచక్రం శాంతి, అహింస, నైతికతల ప్రచారానికైతే.. మార్చుకున్న శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం శత్రు సంహారానికని కథల్లో రాసుకున్నారు. బుద్ధుడు నాగవంశానికి తలమానికమైనవాడు.. అని గుర్తించుకున్న వారికి విషయం బోధపడుతుంది. బంకించంద్ర చటోపాధ్యాయ తన రచన బోలికి సమ్యలో బ్రాహ్మణులు ఎన్నో తప్పుడు కథనాలు, కావ్యాలు, మహాకావ్యాలుగా రాసి, ప్రచారం చేసి.. బ్రాహ్మణేతరులను ఇక్కట్లపాలు చేసినట్టు.. రాశారు. పండిత్ రాహుల్ సాంకృత్యాయన్ కూడా తన 'ఓల్గా సె గంగా'లో ఈ విషయాలు చాలా వివరంగా రాశారు. మనువాదులు ప్రచారం చేసిన తప్పుడు విషయాలనే మనం ఇంకా సంస్కృతీ సంప్రదాయాల పేరుతో నెత్తిన మోస్తున్నాం.
ఇలా సంస్కృతీ సంప్రదాయాల పేరు మీద ఇంగిత జ్ఞానాన్ని నాశనం చేసుకుంటున్నాం. వైజ్ఞానిక అవగాహనను చంపుకుంటున్నాం. మట్టి బొమ్మల్ని, టెర్రకోట ప్రతిమల్ని లేదా ఇటీవలి కాలంలో చెక్కిన శిల్పాల్ని చూపుతూ అవి బిసిఎ కాలం నాటివనో, లేదా కామన్ ఎరా మొదటి శతాబ్దం కాలం నాటివనో.. చెప్పుకోవడంలో అర్థం లేదు. ఆత్మద్రోహానికీ, అబద్దాలకూ అలవాటు పడితే నిజాలు రుచించవు. వాస్తవాలు తెలుసుకుని వాస్తవాలు మాట్లాడితేనే ఎదుటివారి దగ్గరైనా, ఇతర దేశాల్లోనైనా గౌరవం దక్కుతుంది. అబద్దాలతో మన హుందాతనాన్ని మనమే చిదిమేసుకుంటున్నామన్న సంగతి... దేశ ప్రధాని నుండి సామాన్య పౌరుడిదాకా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం!
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమి విజేత, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు