Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ దేశాలన్నింటి లో ఆహార ఉత్పత్తిలో మన దేశం రెండవ స్థానంలో ఉండి కూడా, పోషకాహార లోపంలో ఆకలి కేకల్లో అగ్రస్థానంలో నిలవడం వైచిత్రి! పాలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో ఇండియా ప్రథమ స్థానంలో ఉండగా.. బియ్యం, గోధుమలు, చక్కర, పల్లికాయ, కూరగాయలు, పండ్లు, చేపల ఉత్పత్తిలో ద్వితీయస్థానంలో ఉన్నది. ఆహార ధాన్యాల ఉత్పత్తి క్రమేనా పెరిగినా, అదే క్రమంలో ఆకలి కూడా పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 2021 అంచనాల ప్రకారం ప్రపంచ జనాభాలో 10శాతం జనాభాలో పోషకాహారలోపాన్నీ, 30శాతం జనాభాకు తగిన ఆహారం దొరక్కపోవడాన్నీ గమనించారు. కరోనా వైరస్ విజంభనతో అదనంగా 11.8కోట్ల ప్రజలు ఆకలి కోరలలో చిక్కుకున్నారు. కరోన నిబంధనల నడుమ ప్రజాహార పంపిణీ వ్యవస్థల వైఫల్యం, నిరుద్యోగం పెరగడం, ధరలు పెరగడం, అసమానతలు పెరగడంతో పేదలకు రెండు పూటల ఆహారం అందని ద్రాక్షే అయ్యింది.
2021-22లో 316 మిలియన్ టన్నుల రికార్డ్ స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగి (2020-21లో 311 మిలియన్ టన్నులు, 2019-20లో 298 మిలియన్ టన్నులు, 2018-19లో 285 మిలియన్ టన్నులు) భారతదేశం ఆహారధాన్యాలలో స్వయంసంవృద్ధి స్థాయికి చేరినా, పోషకాహారలోపం 2018లో 13.8శాతం ఉండగా 2020లో 15.3శాతం వరకు క్రమంగా పెరుగుతూనే ఉన్నది. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అధికమై, మిగులు స్థాయికి చేరినప్పటికీ నిరుద్యోగం, పేదరికంతో కొనుగోలు సామర్థ్యం కొరవడిన కారణంగా పోషకాహారలోపం, ఆకలి చావులు పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో దాదాపు 14శాతం (అనగా 190 మిలియన్లు) ప్రజలు పోషకాహార లోపంతో, 20శాతం 5-ఏండ్ల లోపు పిల్లలు తక్కువ బరువుతో, 35శాతం పిల్లలు స్టంటెడ్ గ్రోత్తో, 52శాతం 15-49 ఏండ్లలోపు మహిళలు రక్తహీనతతో సతమతం అవుతున్నారు.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ -2021 వివరాల ప్రకారం 116దేశాల్లో ఆకలి సూచికలో భారతదేశ స్థానం అట్టడుగున 101వ స్థానంలో ఉండటం విచారకరం. 2020లో ఇండియా స్థానం 94 ఉండగా, 2021లో 101 వరకు మరింత దిగజారడం గమనార్హం. దక్షిణ ఆసియాలోని పొరుగు దేశాలైన శ్రీలంక (65), బంగ్లాదేశ్ (76), నేపాల్ (77), పాకిస్థాన్ (92) హంగర్ సూచికల స్థానాలతో పోల్చితే భారత్ వెనుకబడి ఉండటం విషాదకరం. ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, యఫ్ఏఓ) నిర్వచనం ప్రకారం ఆకలి సూచికలను గణించడానికి పోషకాహారలోపం (అండర్నురిష్మెంట్), చైల్డ్ వేస్టింగ్ (ఎత్తుకన్న తక్కువ బరువు ఉండడం), చైల్డ్ స్టంటింగ్ (వయసు కన్న తక్కువ ఎత్తు ఉండడం), చైల్డ్ మోర్టాలిటీ (పిల్లల మరణాల రేటు) అనబడే నాలుగు అంశాలు పరిగణలోకి తీసుకొన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార భద్రత కార్యక్రమంగా 1975లో ఇండియా సమగ్ర బాలల అభివృద్ధి సేవలను ప్రారంభించింది. భారత ప్రభుత్వం చేపట్టిన పోషన్ అభియాన్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, మద్యాహ్న భోజన పథకం లాంటి పథకాలతో స్టంటింగ్, వేస్టింగ్, రక్తహీనత, తక్కువ బరువుగల శిశు జననాలను తగ్గించడానికి కృషి చేస్తున్నామని ప్రభుత్వాలు చెపుతున్నాయి. ఆహార భద్రత పథకంలో భాగంగా గర్భిణులు, పిల్లల తల్లులు, బాలలకు పోషకాహారం అందించే ప్రయత్నాలు ముమ్మరంగా చేపడుతున్నా మంటున్నారు.. పేదల కనీస అవసరాలు తీర్చడానికి ఆయుష్మాన్ భారత్, అంత్యోదయ, పియం కిసాన్, స్వచ్ఛ భారత్, ఉజ్వల, 100 రోజుల పనికి ఆహారపథకం లాంటివి కూడా ప్రజారోగ్య కల్పనకు దోహదపడుతున్నా యంటున్నారు. అయినా ఆకలి సూచీలో మనమే అగ్రస్థానంలో ఎందుకుంటున్నాం? ఆహారధాన్యాల ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, మిగులు నిల్వలు ఉన్నాయని సగర్వంగా చెప్పుకున్నప్పటికీ, పేదల కడుపుల్లో ఆకలి కేకలు వినపడడం ఆశ్చర్యాన్ని, ఆవేదనని కలిగిస్తున్నది. ఆహార నిల్వలు గోదాముల్లో పందికొక్కుల పాలు కావడంతో పాటు మురికివాడల్లో, గ్రామీణ నిరుపేదల కుటుంబాల కడుపుల్లో ఎలుకలు పరుగెడుతున్నాయి. మన దేశంలో స్థూలకాయులు ఓ వైపున, బక్కచిక్కిన అస్థిపంజర అభాగ్య భారతీయ పేదలు మరో వైపున పెద్ద సమస్యగా నిలుస్తున్నారు. ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం పెంచడానికి ఉద్యోగ ఉపాధుల కల్పన, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు, విద్య వసతుల కల్పన, లింగ సమానత్వ చర్యలు, జనాభా నియంత్రణలతో పాటు అసమానతలు తొలగించినప్పుడే అందరికీ పోషకాహారం అందుబాటులోకి వస్తుంది.
- డాక్టర్ బుర్ర మధుసూదన్రెడ్డి
సెల్:9949700037