Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వు చెప్పే విషయం నేను ఒప్పుకోకపోవచ్చు, కానీ నేను చచ్చేదాకా నిన్ను నువ్వు వ్యక్తీకరించుకునే హక్కును మాత్రం సమర్థిస్తూనే ఉంటాను.
- వోల్టేర్, ఫ్రెంచ్ రచయిత, చరిత్రకారుడు, తత్త్వవేత్త.
రాలే ఆకులో, జారే చినుకులో, మండే నిప్పులో వీచే గాలిలో ప్రతి విషయంలో దాక్కుని ఉన్న అంతస్సూత్రాన్ని అర్థం చేసుకోవడమే సైన్సు. ప్రాయోగిక పరిజ్ఞానంతో, నిరూపణలతో నిలబడేదే సైన్సు. తనను తాను పునరుద్దరించుకునేదే సైన్సు. అది పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకూడదు. నిత్యజీవితంలో ప్రధాన భాగం కావాలి. మనమిప్పుడు ప్రతి అంశాన్నీ వైజ్ఞానిక దృష్టికోణంతో అవలోకించాల్సి ఉంది. అప్పుడే సహేతుకమైంది ఏదో, అహేతుకమైంది ఏదో గుర్తించగలుగుతాం. దానివల్ల వేటికి ప్రాధాన్యమివ్వాలో, వేటికి ఇవ్వకూడదో అర్థమవుతుంది.
కర్నాటక గవర్నర్ తవర్ చంద్ గెహ్లాట్ ప్రఖ్యాత జోగ్ జలపాతం చూద్దామని వెళ్ళారు. ఆయన వెళ్ళిన సమయానికి అందులో నీరు లేదు. గవర్నర్కు నేతపర్వం కలిగించడానికి లింగనమఖి రిజర్వాయరు నుండి 500 క్యూసెక్కుల నీటిని నాలుగు గంటలపాటు జోగ్ జలపాతానికి మరలించారు. అక్కడ కొంత సేపు ఆనందించిన గవర్నర్ తన దారిన తాను వెళ్ళిపోయారు. అసలు విషయమేమంటే అధికారులు గవర్నర్ మెప్పుకోసం విడుదల చేసిన నీటితో రెండు వేల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయ్యేది. అసలు ఆ లింగనమఖి రిజర్వాయరు నిర్మించిందే జలవిద్యుత్ కోసం. అధికారంలో ఉన్నవారి మెప్పుకోసం ఈ దేశంలో ఎంత దుర్వినియోగం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఇది భారతదేశంలోని ఒక రాష్ట్ర గవర్నరు విషయం. మరి అలాంటి ఎంతోమంది గవర్నర్ల పైన ఉన్న ప్రధాని స్థాయి ఎంత ఉన్నతమైందో మనకు తెలుసుకదా?
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్కు సంబంధించి ఒక సంఘటన చూద్దాం. ఎలక్షన్ సమయంలో ఆయన ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడు తున్నాడు. అంతే. ఎదురింట్లోంచి ఆ ఇంటి యజమాని బయటికొచ్చాడు. ''మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! ఇక్కడ మీరేం చేస్తున్నారో తెలుస్తోందా? నా ఇంటిముందు లాన్ పాడు చేస్తున్నారు. దయచేసి ఖాళీ చేసి వెళ్ళిపోతే సంతోషం'' అని గొంతెత్తి బిగ్గరగా చెప్పాడు. అంతే - ప్రైమ్ మినిష్టర్ స్కాట్ మోరిసన్ వినిపించుకున్నాడు. వెంటనే తన ఉపన్యాస కార్యక్రమం ఆపేసి నిముషాల్లో వెళ్ళిపోయాడు. ఏదో పక్కింటివాడి మీద కోపం వెళ్ళగక్కినట్టు ఆ ఇంటి యజమాని కోప్పడటం - దేశ ప్రధాని కిమ్మనకుండా వెళ్ళిపోవడం. ఎంత ప్రజాస్వామ్యం? ఎంత నాగరికత? పౌరులకు ఎన్ని హక్కులూ? ఇలాంటి సంఘటన మన దేశంలో సాధ్యమా? అలాంటి మాట ఇక్కడ, ఈ దేశంలో కనీసం వార్డు మెంబరుకు కూడా చెప్పలేం. చెప్పినా - అతనేమైనా వింటాడా? తన వెంట ఉన్న వారిని ఉసిగొల్పి, ఆ ఇంటి యజమానిని తన్నించి, నోరు మూయిస్తాడు. నాగరిక - అనాగరిక దేశాల మధ్య వ్యత్యాసం అలా ఉంటుంది. మానవీయ విలువల్ని నిలుపుకోవడమంటే ఏమిటో మనం ఇంకా నేర్చుకోవాల్సే ఉంది.
ఇక్కడ భారత ప్రధాని, ఆయన అనుచరులు ఏ స్థాయిలో ఉన్నారో చూద్దాం. ఈ పోలిక ఎందుకంటే ఎవరు సహేతుకంగా ఉన్నారు. ఎవరు అహేతుకంగా మాట్లాడుతున్నారో బేరీజు వేసుకోవడానికి మాత్రమే! ఇందులో ఎవరినీ నొప్పించాలని గానీ, ఎవరి మనోభావాలో దెబ్బతీయాలని గానీ... కాదు! దేశ ప్రజల ఆకలి, నిరుద్యోగం, ప్రాజెక్టులు, కరోనా నివారణ, రైతులకు కనీస మద్దతు ధర లాంటి అప్రధానమైన విషయాల్ని పక్కనపెట్టి - అతిప్రధానమైన విగ్రహాల నిర్మాణం, చేపట్టిన భారత ప్రధాని, కేదార్నాథ్లో శంకరాచార్య విగ్రహ ప్రతిష్టాపన చేసి, 136 కోట్ల దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చారు. ఆ విగ్రహ ప్రతిష్టాపన అనంతరం దాని ముందు కూర్చుని.. ఆయన 'ధాన్యం' చేశారు. అప్పుడు శంకరాచార్య విగ్రహం నుండి ఒక కాంతిరేఖ ఉద్భవించినట్టు తనకు అనిపించిందనీ - భవ్య భారతదేశాన్ని సాక్షాత్కరింపజేసినట్టు అనిపించిందనీ ప్రధాని మోడీ పత్రికల వారికి తెలిపారు. ఒక నిర్జీవపు రాత్రి విగ్రహం - కాంతిరేఖలు ప్రసరించడం ఎప్పుడు ఎలా సాధ్యమవుతుందోనన్నది వారి అనుచర లెవరైనా పరిశోధిస్తే నొబెల్ ప్రకటిద్దామని స్వీడన్: స్టాక్ హౌమ్లో ప్రైయిజ్ కమిటి ఆతురతతో ఉన్నట్లుంది...! ఇలా భ్రమలూ భ్రాంతుల్లో బతికే వారినా ఈ దేశ ప్రజలు దేశ నాయకులుగా ఎన్నుకున్నారూ...? మన అజ్ఞానానికి ఎంతో బాధ కలుగుతుంది. మనం అజ్ఞానంతో ఎన్నుకునే నాయకులు అజ్ఞానంలో ఉండక, జ్ఞాన సంపన్నులెలా అవుతారూ? అయోధ్యలో రామాలయం కాదు, ఇప్పటికైనా రామాయణం ఆధారంగా పుష్పక విమానం తయారు చేయించకపోతే అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దెదిగిపోవాలి. దీనిపై మోడీ - షాలు స్పందించాలి అని ప్రతిపక్షం వారు డిమాండ్ చేస్తున్నారు. ''పరివార్ పరివార్-అని తెగమాట్లాడు తున్నారు కదా? ఏదీ మీ పరివారం? ఏదీ మీ కుటుంబం?'' అని కొందరు మోడీని, ఆదిత్యనాథ్ను ప్రశ్నించారు. దానికి ఆదిత్యనాథ్ ట్విట్టర్లో జవాబిచ్చాడు.. ''నా రాష్ట్రంలోని 25కోట్ల మంది ప్రజలు నా పరివారమే'' అని అన్నాడు. తన ''హృదయ వైశాల్యం'' ఎంతో ప్రకటించాడు. అది కొద్ది నిముషాలు కూడా నిలువలేదు. లక్షల మంది ప్రశ్నలు గుప్పించారు. ''మరి ముస్లింలను ఏం చేస్తావు నాయనా? వాళ్ళు 'అబ్బా జాన్' అంటే నీకు చిర్రెత్తుకొస్తుంది. దళిత అమ్మాయి అయితే అర్థరాత్రి గుట్టు చప్పుడు కాకుండా కాల్చేయిస్తావు. ఇక యువతీ యువకులెవరైనా తిండిలేదని అన్నా, ఉద్యోగం ఇప్పించమని అన్నా లాఠీలతో వారిని నుగ్గు నుగ్గు చేయిస్తావు... ఇవి కాక, ఇంకా ఎక్కడుంది నీ పరివారం?'' అని!
సంస్కృతం మాట్లాడితే మధుమేహం రాదు.. అని అన్నాడు బీజేపీ ఎంపీ గణేష్సింగ్. అమెరికాకు చెందిన ఓ సంస్థ పరిశోధనల ప్రకారం రోజూ సంస్కృతం మాట్లాడటం వల్ల మానవ నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని, కొవ్వు నియంత్రణలో ఉంటుందని, మధుమేహం రాదని - ఇస్లామిక్ భాషలతో సహా ప్రపంచంలోని 97శాతం భాషలు సంస్కృతం ఆధారంగానే రూపొందాయని ఆయన ప్రకటించారు. ఇది ఆయన స్వీయ అనుభవమా కాదా? అనేది చెప్పలేదు. ఈ ప్రకటనతో మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. 1. ఆయన నాడీ వ్యవస్థ దెబ్బతిన్నదని 2. ఆయన శరీరంలో కొవ్వు నియంత్రణలో లేదని! ఇంతదానికి అమెరికా పరిశోధనా సంస్థ దాకా ఎందుకూ? తమరి వారణాసి పరిశోధనా శాలలో తయారైన విశ్వహిందూ ప్రొడక్ట్ - అని చెప్పుకుంటే గొడవే ఉండేది కాదు. మాక్సు ముల్లర్ పండితునికి లేని పరిజ్ఞానం ఈ బీజేపీ ఎంపీకి ఉన్నందుకు ఆ పార్టీవారు బహుశా ఛాతీలు విరుచుకుంటున్నారేమో? అన్ని భాషలకు తల్లి సంస్కృతం కాదు నాయనా - అన్ని భాషల కలయిక సంస్కృతం అని చెప్పిన పండితులున్నారు. మరి ఈయన ఎప్పుడైన విన్నాడో లేదో. 'నేటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి మూలం భాగవద్గీత' అని అన్నాడు వరంగల్ నిట్ అసోసియేట్ ప్రొఫెసర్ పి.హెచ్. కృష్ణ. ఇతని కన్నా ఉన్నత స్థితిలో ఉన్న పెద్దలే ఇంతకన్నా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అసలైతే ఇలాంటి వాళ్ళ డిగ్రీలు రద్దుచేయాలి. కానీ, ప్రభుత్వాలే సన్నాసుల చేతుల్లో ఉంటే చర్య తీసుకునేది ఎవరూ? కావాలని మూర్ఖ సన్యాసులను ఎన్నుకుంటున్న సగటు మనుషులు తమ మూర్ఖకత్వంలోంచి బయటపడి వివేకవంతులయితే కదా - వివేకవంతులను ఎన్నుకునేది? పాఠాలు చెప్పే అధ్యాపకుల ఆలోచనలే అంత నాసిరకంగా ఉంటే, వారి క్లాసులో ఉండే విద్యార్థుల భవిష్యత్తు ఏమిటీ? ఇక దేశ భవిష్యత్తు ఏమిటీ?
ఉత్తరప్రదేశ్ గాజియాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు లేరు. వేరు వేరు కారణాల వల్ల డాక్టర్లంతా ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయారు. కొత్తవారెవరూ వచ్చి చేరడం లేదు. ఎందుకంటే అక్కడి ఆసుపత్రులలో పనిచేసే పరిస్థితులు లేవు. వసతుల్లేవు. పరికరాలు లేవు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి ప్రాణం మీదికి తెచ్చుకోవడమెందుకని మామూలు ప్రజానీకం కూడా అటువైపు వెళ్ళడం లేదు. అంతగా అవసరమైతే భూమి, జాగా, నగానట్రా అమ్ముకుని, ప్రయివేటు హాస్పిటల్స్లో చేరుతున్నారు. ప్రభుత్వ పెద్దలకు కూడా కావల్సింది అదే. కార్పొరేట్లు బలపడితే, ఫలితంగా తాము బలపడినట్లే కదా? అదీ లింకు! ఎప్పటికప్పుడు ఏదో ఓ దేవుడిపై, ఏదో ఓ దేవాలయంపై చర్చ పెట్టుకుని మనో బలాన్ని, మనశ్శాంతిని పొందుతున్నారు. బీజేపీని విమర్శించే ప్రాంతీయ పార్టీలు కూడా తాము అధికారంలో ఉన్న చోట బీజేపీనే అనుసరిస్తున్నాయి. అక్కడ వారు రామ మందిరమంటే ఇక్కడ వీరు మరో గుడి పునరుద్దరిస్తారు. అక్కడవాళ్ళు ఒక సన్యాసి కాళ్ళమీద పడితే ఇక్కడ వీరు మరో సన్యాసి కాళ్ళమీద పడతారు. ఎదురు నిలిచి గట్టిగా నిలదీయాల్సిన ప్రతిపక్షంలో ఉన్న పార్టీలవారు కూడా పూజలు నిర్వహిస్తూ బోనాలెత్తుకుని ఊరేగుతున్నారు. ఆచరించేదంతా ఒక్కటే అయినప్పుడు, హిందూ వేరు - హిందుత్వ వేరని ఉపన్యాలివ్వడం ఎందుకూ? వేల యేండ్ల నాటి అనాగరిక సంప్రదాయాల్ని పునరుద్దరించుకుంటూ తాము ప్రగతి ప్రథాన ఉన్నామంటే ఎట్లా? దేశం వెలిగిపోతోందని చెపుతూ మూర్ఖులు మూర్ఖుల్ని కలుపుకు పోవడమేనా - 'సబ్క సాత్ సబ్క వికాస్' అంటే? కల్తీ తేనెను అధిక ధరకు అమ్మే రామ్దేవ్ దేశభక్తుడు. కష్టపడి తాము పండించిన పంటకు కనీస మద్దతు ధర అడిగే - రైతు దేశద్రోహి - ఖలిస్తానీ - ఉగ్రవాది? మొత్తం ఎయిర్లైన్స్ అమ్మి, ఒకే ఒక్క విమానం కొన్న తొలి ప్రధాని మోడీ అని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. రాబోయే రోజుల్లో మన పిల్లలకు లెక్కల పరీక్షలో ప్రశ్నలు ఇలా వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఉదాహరణకు - ''మూడు ఎయిర్ పోర్ట్లను అమ్మి ఎనమిది మంది పార్లమెంటు సభ్యుల్ని కొన్నచో - ఇరవై రెండు మందిని కొనాలంటే ఎన్ని ఎయిర్పోర్టులను అమ్మాలీ?'' అని...
వాస్తవాల్ని వాస్తవాలుగా స్వీకరించే లక్షణం మన కుండాలి. వాస్తవాల్ని కూడా సినిమాగా తీసి చూపిస్తే తప్ప, మన జనం స్పందించరు, చలించరు. 'జై భీం' సినిమాకు గొప్పగా స్పందించిన మనం - సురేంద్ర గాడ్లింగ్; సుధా భరర్వాజ్; అరుణ్ ఫరేరా... మొదలైనవారు ఆదివాసీల విడుదల కోసం తమ జీవితాల్ని ఫణంగా పెట్టిన విషయం తెలుసుకోం. అదే ఆదివాసీల గూర్చి మాట్లాడినందుకు జైల్లోనే మగ్గుతున్న ప్రొఫెసర్ సాయిబాబా గురించి గానీ, మన కండ్ల ముందే తిరిగిన వరవరరావుకు జరిగిన, జరుగుతున్న అన్యాయం గురించి గానీ అదేమిటో... ఎవరమూ మాట్లాడం. అసలు విషయమేమిటో కనీసం తెలుసుకుందామన్న ఉత్సుకత కూడా ఉండదు. మన జీవితాల్లోని సంఘటనలు ఎవరైనా తెరకెక్కిస్తే మాత్రం, ప్రేక్షకులుగా మనకు ఎక్కడలేని ఆవేశం పొంగుకొస్తుంది. ప్రేక్షకులం 'ప్రేక్షకుల్లా' ఉండిపోకుండా బాధ్యతగల పౌరులమన్నది గుర్తుంచు కోవాలి! కేవలం మన దేశంలోనే ఇలా ఎందుకు జరుగుతోందన్నది ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి! మార్పుకోసం ప్రయత్నిస్తూ ఉండాలి!!
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమి విజేత, జీవశాస్త్రవేత్త.