Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవనిలో సగమైన మహిళా లోకానికి అన్నిట్లో సగం అవకాశాలు కల్పించాల్సిన (పురుష) సమాజం, పాలకవర్గం ఉద్దేశపూర్వకంగానే మహిళల్ని వెనక్కి నెడుతూ అణచి వేస్తున్నది. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆనాటి విజయాన్ని ఎలుగెత్తి చాటి చెప్పుకుంటున్నాం. నేటి మహిళలు సమానత్వం గూర్చి, హక్కుల గురించి నినదిస్తున్నారు. అణచివేతపై, హత్యాచారాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో మహిళల అణచివేతపై, వివక్షపై, అత్యాచారాలపై ఎన్నో పోరాటాలు జరిగి ఎన్నో హక్కులను సాధించగా ఇండియాలో మాత్రం ఆ హక్కులు, అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. వర్గ అసమానతలతో పాటు కుల అసమానతలు కలిగిన ఇండియా సమాజంలో లింగ వివక్ష కూడా ఎక్కువే. స్వాతంత్ర పూర్వం నుండి అణచివేయబడిన మహిళలు స్వాతంత్రం సిద్ధించి 75ఏండ్లు దాటినా, ఎన్నో చట్టాలను రూపొందించుకున్నా నేటికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వం లభించలేదు. గత రెండు వేల ఏండ్ల క్రితం నుండి ప్రత్యక్షంగా, పరోక్షంగా అమలవుతున్న మనుధర్మ శాస్త్రం వల్లనే ఇండియాలో మహిళలు నేటికీ అణచివేయ బడుతూ ఇంటా, బయటా ఎన్నో హింసలకు గురవుతున్నారు.
ప్రపంచ దేశాల్లో మహిళలు హక్కులు సాధించి విముక్తి పొందడానికి వారికి విద్య ఒక ఆయుధంగా మారింది. అదే ఇండియాలో వేల సంవత్సరాలు స్త్రీలకు విద్య నిషేధించబడింది. మనుధర్మ శాస్త్ర ప్రకారం దేశ మూలవాసులకు, స్త్రీలకు విద్య, ఆస్తి, అధికారం నిషేధించబడింది. బ్రిటిష్ వారు ఇండియాకు వచ్చేంతవరకు స్త్రీలకు విద్య నిషేధించబడింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే చొరవతో కింది కులాలకు విద్యతో పాటు అన్ని వర్గాల స్త్రీలకు విద్య బోధన జరిగింది. స్త్రీలకు ప్రత్యేక పాఠశాలలు నిర్వహించి విద్య నేర్పించడంలో, వారిని చైతన్యం చేయడంలో సావిత్రి బాయి ఫూలే సేవలు కూడా చాలా గొప్పవి. స్త్రీలకు విద్య లేకపోవడంతో బాల్య వివాహాలు జరగడం, వంటింటికి పరిమితమవడం, బాలింత మరణాలు ఇండియాలో ఎక్కువగానే జరిగాయి. వరకట్న దురాచారం వల్ల గృహ హింసతో పాటు మహిళల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. పురుషాధిక్య సమాజం వల్ల ఇండియాలో స్త్రీలు ఎంత పెద్ద చదువులు చదివినా నేటికి విద్య, ఉద్యోగంతో పాటు వంటింటి వెట్టిచాకిరి తప్పడం లేదు. ఉన్నత విద్యావంతులై వివాహాలు చేసుకున్న తర్వాత సమానత్వం, సరైన గౌరవం లభించకపోవడంతో నేడు ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులకు గురికావడమే కాకుండా కోర్టులు, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రమాదాల్లో కుటుంబ యజమాని మరించినా ఆ కుటుంబ బాధ్యతల్లో స్త్రీ పడే యాతన వర్ణనాతీతం. దేశ రక్షణ కోసం, పాలకుల రక్షణ కోసం పనిచేస్తున్న రక్షకబటుల మరణాల వల్ల కూడా ఆ కుటుంబాల స్త్రీలు ఎన్నో బాధలకు గురవుతున్నారు. దేశంలో అసమానతలు, పేదరికం వల్ల కూడా స్త్రీలు బలిపశువులుగా మారుతున్నారు. ఈ మధ్యకాలంలో పాలకులు మద్యం ద్వారా ఆదాయాన్ని రాబట్టడం కోసం విచ్చలవిడి అమ్మకాలను ప్రోత్సహించడం వల్ల మద్యం మరణాలు సంభవించి ఎంతో మంది మహిళలు వారి పిల్లలను సాదలేక ఎన్నో బాధలకు గురవుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సందర్భంలో నేడు ఎక్కువగా హింసకు గురవుతుంది మహిళనే. వర్గ అసమానతలు పెరిగి, విద్య, వైద్య ఖర్చులు పెరిగి, వ్యవసాయంలో నష్టాలు, అప్పులతో వలసలు, ఆత్మహత్యలు ఎక్కువ కావడం వల్ల కూడా స్త్రీలు ఎక్కువగా హింసకు గురవుతున్నారు.
జర్మనీ దేశంలో 1857లో జన్మించిన మార్క్సిస్టు ఉద్యమకారిని క్లారా జెట్కిన్. 1880లో జర్మనీ పాలకులు తీసుకొచ్చిన సోషలిస్టు వ్యతిరేక చట్టాలపై రచనలు చేసిన కార్లా జెట్కిన్ను జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో ప్రవాస స్వీయ నిర్బంధానికి గురైనారు. పాలకుల నిర్బంధాన్ని లెక్కచేయని కార్లా ఇతర సోషలిస్టు ఉద్యమాలతో కలిసి నడిచి అంతర్జాతీయ సోషలిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలకపాత్ర వహించారు. 1892 నుండి 1917 వరకు సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఈక్వాలిటీ పత్రికకు సంపాదకురాలిగా పనిచేసి ఎన్నో చైతన్య రచనలు చేశారు. 1910లో అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళా కాంగ్రెస్కు కో ఫౌండర్గా నియామకమైన కార్లా అంతర్జాతీయ స్థాయిలో మహిళా హక్కుల కోసం, మహిళా చైతన్యం కోసం ఎంతో కృషి చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఫిబ్రవరి 28న మహిళా దినోత్సవం జరపాలని మొట్టమొదటగా కార్లా జెట్కిన్ ప్రతిపాదించగా 20వ శతాబ్దం మొదట్లో మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1911 ఫిబ్రవరి 28న జరిగింది. మొట్టమొదటి మహిళ దినోత్సవ సదస్సుకు 17 దేశాల నుండి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రష్యాకు చెందిన మహిళా ఉద్యమకారులు బ్రెడ్ అండ్ పీస్ (రొట్టె, శాంతి) కోసం, ఓటు హక్కు కోసం నాలుగు రోజుల సమ్మె చేయగా అక్కడి జారు ప్రభుత్వం మహిళలకు హక్కులు కల్పించారు. సమ్మె మొదలైన మార్చి 8వ తేదీని 1993 నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలని నిర్ణయించి ఆనాటి నుండి నేటివరకు ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచ దేశాల్లో ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మహిళల పోరాటాలతో మహిళలు హక్కులు సాధించడానికి సూచికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళ తన సజనాత్మకతతో ఇంటి నుండి పని ప్రదేశాలు, సమావేశాల వరకు అన్ని స్థాయిల్లో ఎంతో క్లిష్టమైన సేవలు అందించడాన్ని కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎత్తిపడుతుంది. అంతర్జాతీయ మహిళా దినాన్ని మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ లక్ష్యాలను సాధించిన రోజుగా, లింగ సమానత్వాన్ని వేగవంతం చేయడం కోసం, మహిళ చైతన్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వర్గాలు సంఘటితమై ర్యాలీలు నిర్వహించే ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమంగా అంతర్జాతీయ మహిళా దినోత్సావాన్ని సాక్షంగా చెప్పవచ్చును.
- సాయిని నరేందర్
సెల్:9701916091