Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కీ లొంగుబాటు సూచనలు, మరోవైపు మంటను మరింత ఎగదోస్తూ అమెరికా, దాని మిత్రదేశాల చర్యలు.... రష్యా చమురును అమెరికా దిగుమతి చేసుకోవటంపై జోబైడెన్ నిషేధం విధించాడు. బ్రిటన్ దాన్ని అనుసరించింది. ఈ పరిణామా లతో అంతర్జాతీయ మార్కెట్లో పీపా ధర 139 డాలర్లు తాకి తరువాత తగ్గింది. ఫిబ్రవరి 24న యుద్దం ప్రారంభ మైనప్పటి నుంచి ధర ఒక్క రోజు కూడా నిలకడగా లేదు. మార్చి 9వ తేదీన 121.5 డాలర్లుగా ఉంది. తమ ఇంధనంపై ఆంక్షలు విధిస్తే మూడు వందల డాలర్లకు పెరగ వచ్చంటూ రష్యా హెచ్చరిక. మరోవైపున వెనెజులా చమురుపై ఆంక్షల ఎత్తివేత ఆలోచనల్లో అమెరికా. తమపై ఆంక్షలను ఎత్తివేసినా లేకున్నా రష్యా కు ఇచ్చే మద్దతుపై వెనక్కు తగ్గేదేలే అంటున్న వెనెజులా.
రష్యా ఇంధన దిగుమతులపై ఆంక్షలు విధిస్తే సామాజిక ఐక్యత కుప్పకూలుతుందని జర్మనీ హెచ్చరించింది. తాము ఆంక్షలను వ్యతిరేకిస్తామని కూడా జర్మనీ మంత్రి రాబర్ట్ హాబెక్ చెప్పాడు. సరఫరాలు తగ్గటం సామాజిక ఐక్యతకు ముప్పు తెస్తుందని కూడా అన్నాడు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది ఇంతకు మించి కొత్తగా చేసేదేమీ లేదని తదుపరి చర్యల గురించి మరొక మంత్రి క్రిస్టియన్ లెండర్ స్పష్టం చేశాడు. ఆంక్షల నుంచి రష్యన్ ఇంధన సరఫరాలను కావాలనే ఐరోపా మినహాయించింది, ఈ క్షణంలో మరోమార్గంలో ఇంధన సరఫరాకు అవకాశం లేదని జర్మన్ ఛాన్సల్ ష్కోల్జ్ చెప్పాడు. ఈ కారణంగానే బైడెన్ ఐరోపాతో నిమిత్తం లేకుండా తమ దేశానికి మాత్రమే వర్తించే నిషేధాన్ని ప్రకటించాడు. ఐరోపాయునియన్ నుంచి విడిపోయిన బ్రిటన్ వేరుగా నిషేధాన్ని ప్రకటించింది. రష్యా ఇంధనంపై ఆంక్షలు విధించటాన్ని తాము సమర్థించటం లేదని హంగరీ ఆర్థిక మంత్రి ప్రకటించారు. అమెరికా, సౌదీ అరేబియా తరువాత చమురు ఉత్పత్తిలో రష్యా మూడవ స్ధానంలో ఉంది. దాని ఎగుమతుల్లో 60శాతం ఐరోపా ఆర్ధిక సహకార మరియు అభివృద్ధి సంస్థ(ఓయిసిడి) దేశాలకే చేస్తున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటే వెంటనే జరిగేది కాదు. ఇటలీ గాస్ దిగుమతుల నిలిపివేతకు రెండున్నర సంవత్సరాలు పట్టింది. గతేడాది ఐరోపా యూనియన్ తన అవసరాల్లో 45శాతం రష్యానుంచి దిగుమతి చేసుకుంది.రష్యా ప్రతి రోజు 50లక్షల పీపాలు ఎగుమతి చేస్తుండగా దానిలో సగం ఐరోపాకే వెళుతుంది.
అమెరికా తన అవసరాల్లో రష్యా నుంచి ఎనిమిదిశాతం దిగుమతి చేసుకుంటుండగా దానిలో మూడుశాతం మాత్రమే ముడిచమురు, మిగిలినవి చమురు ఉత్పత్తులు. పశ్చిమ దేశాలు తమ మీద విధిస్తున్న ఆంక్షలకు ప్రతిగా రష్యా కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నది. పశ్చిమ దేశాల ఆంక్షలతో చమురు ధరలు పెరుగుతున్నందున అమెరికా, ఐరోపా దేశాలు కూడా వాటి ప్రతికూల పర్యవసాలను అనుభవించాల్సి ఉంటుంది. రష్యన్ చమురుపై నిషేధం విధిస్తే సరఫరా తగ్గి పీపా ధర 200 డాలర్లకు పెరగవచ్చని బాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకులు పేర్కొన్నారు.
రష్యాను దెబ్బతీసేందుకు గతంలో తాను వ్యతిరేకించిన, తిట్టిపోసిన దేశాలతో ఇప్పుడు చమురు అమ్ముతారా అంటూ తెరవెనుక సంప్రదింపులు జరుపుతోంది. దీని వెనుక రెండు కారణాలున్నాయి. ఐరోపా, ఇతర ప్రాంతాల్లోని తన మిత్రరాజ్యాల ఇంధన అవసరాలకు ఆటంకం కలగకుండా చూడటం, చమురు ధరలు మరింత పెరిగితే యురోపియన్లలో అమెరికా పట్ల ప్రతికూలత పెరుగుతుంది. తన ఆర్ధిక వ్యవస్ధకు సైతం తలెత్తే ముప్పు నివారణ అవసరం. లేనట్లయితే ఇంటా బయటా ప్రతికూల పరిస్థితులు బైడెన్కు ఎదురవుతాయి. అందువల్లనే అమెరికా ప్రతినిధులు గతవారంలో వెనెజులాను సందర్శించి చమురు సరఫరా గురించి చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్తో అణు ఒప్పందం చేసుకొని చమురు ఆంక్షలను ఎత్తివేసేందుకు సంసిద్దతను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉత్పత్తిని పెంచమని కోరేందుకు బైడెన్ స్వయంగా సౌదీ అరేబియాను సందర్శించవచ్చని వార్తలు వచ్చాయి. రష్యాపై విధించిన ఆంక్షలను సొమ్ము చేసుకొనేందుకు ఉత్పత్తి పెంచాలన్న సూచనలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు సౌదీ అందుకు సముఖత చూపలేదు. గతంలో రష్యాతో వచ్చిన అవగాహనకే కట్టుబడి ఉంటామని చెబుతోంది. అణు ఒప్పందం గురించి ఇరాన్తో రాజీకి వచ్చి ఆంక్షలు వెనక్కు తీసుకుంటే అక్కడి నుంచి కూడా సరఫరా పెరుగుతుంది. యుద్ధం ప్రారంభమైన తరువాత అమెరికా ఒక మెట్టు దిగుతున్నట్లుగానే ఈ పరిణామాలను చూడవచ్చు. జర్నలిస్టు ఖషోగ్గీ హత్య తరువాత సౌదీ-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. సౌదీ రాజును హంతకుడని బైడెన్ వర్ణించాడు. ఇప్పుడు చమురు ఉత్పత్తి పెంచాలని కోరుతున్నాడు. వారి సమావేశం జరుగుతుందా లేదా అన్నది సందేహమే. తాలిబాన్లతోనే ఒప్పందం చేసు కున్నప్పుడు సౌదీతో సయోధ్య కుదుర్చుకోవటంలో ఆశ్చర్యం ఉండదు. చమురు ధరలు తగ్గటం ప్రతివారికీ ప్రయోజన కరమేనంటూ అధికారులు చర్చలు జరుపుతున్నారు గానీ, బైడెన్ పర్యటన గురించి ఇప్పటికైతే ఖరారు కాలేదని పత్రికా కార్యదర్శి జెస్ సాకీ చెప్పారు. మరి వ్రతం చెడ్డా ఫలం దక్కుతుందా?
అనేక సంవత్సరాల తరువాత ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు వెనెజులా రాజధాని కారకాస్ వెళ్లి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించేందుకు కుట్రపన్నినందుకు గాను 2017లో అమెరికా ఇంధన అధికారులను అరెస్టు చేశారు. 2019లో ఆంక్షలతో పాటు, కారకాస్లో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. తమ వారిని వదలిపెట్టాలని కోరటంతో పాటు చమురు ఎగుమతి గురించి చర్చలు ప్రారంభించారు. అధికారులు వెళ్లటానికి ఒక రోజు ముందు వెనెజులాలో పెట్టుబడులు పెట్టిన రష్యా వ్యాపారి ఉస్మనోవ్ వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు తొలగించలేదు గానీ కంపెనీ లావాదేవీలు జరిపేందుకు అమెరికా ఆర్ధికశాఖ సాధారణ అనుమతి మంజూరు చేసింది. అతను పుతిన్ మద్దతుదారు. ఇది వెనెజులా పట్ల ఒక సానుకూల వైఖరి. దీనికి ప్రతిగా ఇద్దరు అమెరికన్లను వెనెజులా విడుదల చేసింది. బైడెన్ వైఖరి మార్చుకోవటాన్ని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ ఎంపీలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారితో కొందరు డెమోక్రాట్లు కూడా గొంతు కలిపారు. ఉక్రెయిన్పై సైనిక చర్యకు మదురో బహిరంగం గానే మద్దతు పలికాడు. ఇంతకాలం వెనెజులాను వ్యతిరేకించిన అమెరికా తన మాటలను తానే ఖండించుకున్నట్ల యింది. దీంతో మదురో మరింత బలపడతారని, వ్యతిరేకుల నడుంవిరిచి నట్లవుతుందని కొందరు వాపోతున్నారు. చమురు ధరలు పెరగటంతో దాన్ని సొమ్ము చేసుకోవాలని అమెరికాలో వాటాదార్లతో నిమిత్తం లేకుండా కుటుంబ సంస్ధలుగా ఉన్న కొన్ని చిన్న షేల్ ఆయిల్ కంపెనీలు ఉత్పత్తికి సిద్దం అవుతున్నాయి. నూటపది డాలర్లుంటే తమకు గిట్టుబాటు అవుతుందని అంటున్నాయి. పెరు గుదల ఎంత కాలం ఉంటుందో తెలీని స్థితిలో బడా కంపెనీలు ఉత్పత్తికి సిద్దం కావటం లేదు.
మన దేశంలో నవంబరు నాలుగవ తేదీ నుంచి స్తంభింపచేసిన చమురు ధరలను ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఏ రోజైనా తిరిగి సవరించే అవకాశం ఉంది. దీని గురించి ప్రభుత్వం రెండు నాలుకలతో మాట్లాడుతోంది. చమురు ధరలను నిర్ణయించేది చమురు కంపెనీలు తప్ప ప్రభుత్వం కాదని, అంతర్జాతీయ మార్కెట్ను బట్టి తగ్గటం, పెరగటం ఉంటుందని గతంలో చెప్పారు. ఇప్పుడు ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన ధరల గురించి నిర్ణయం తీసుకుంటామని చమురుశాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరీ మంగళవారంనాడు విలేకర్లతో చెప్పారు. నవంబరు నుంచి ధరల స్తంభనతో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధం లేదని కూడా చెప్పారు. రోజువారీ ధరల సవరణ చేసే కంపెనీలు గతంలో ఎన్నికల తరుణంలో, తాజాగా నవంబరు నాలుగునుంచి ఎందుకు స్తంభింప చేసినట్లో ఇంతవరకు ప్రకటించలేదు.
ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288