Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్యరాజ్యసమితి నిరంతర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆమోదించిన వాటిని ఏమేరకు అమలు చేస్తున్నారో కొలిచేందుకు రూపొందిస్తున్నదే ప్రపంచ సంతోష సూచిక. ప్రతి ఏటా ప్రచురించే దీని వివరాల మేరకు 2022 సూచికలో 146 దేశాలకు గాను మనం 136వ స్థానంలో ఉన్నాం. గతేడాది కంటే 0.236 పాయింట్లు పెంచుకొని 139 నుంచి 136కు ఎగబాకాము. ఇది నిజంగా మోడీ భక్తులు పండగచేసుకొనే అంశమే. ఆగండి అప్పుడే రంగులు చల్లుకోవద్దు. 2013లో 111వ స్థానంలో ఉన్నది, 2015లో 117కు తరువాత 2020లో 144వ స్థానానికి దిగజారింది. తిరిగి పూర్వపు స్థానానికి ఎప్పుడు చేరుకుంటామో, జనాలకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చెప్పి మరీ పండగ చేసుకోవాలి. నూటపదకొండులో ఉన్నప్పుడే మన్మోహన్ సింగ్ పాలనను జనం భరించలేక పోయారు. తరువాత దిగజారినా మోడీకి మరొక అవకాశం ఇచ్చి చూద్దామని జనం భావించారు, భరిస్తున్నారు. గొర్రె కసాయిని నమ్ముతుందని ఎందుకు మన పెద్దలు అనుభవసారంగా చెప్పారో ఆలోచిద్దాం.
జనం ఆశించిన సంతోషానికి కారణమైన నరేంద్రమోడీ అచ్చేదిన్ నినాదం అసలు కథ తెలుసా? నినాదాలను కాపీ కొట్టటంలో నరేంద్రమోడీ పెద్ద మాస్టర్. కొందరికిది ఆగ్రహం కల్పించినా నిజం నిజమే కదా! కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ సంగతి చెప్పినట్లు 2016 సెప్టెంబరు 20న టైమ్స్ఆఫ్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. 2012 జనవరి ఎనిమిదిన జైపూర్లో జరిగిన ప్రవాస భారతీయ దినం సభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడారు. అంతకు ముందు తలెత్తిన ప్రపంచ మాంద్యం నుంచి భారత్ తప్పించు కున్నప్పటికీ తరువాత తలెత్తిన ఇబ్బందులను అధిగమిస్తామని ఎన్ఆర్ఐలకు భరోసా ఇచ్చారు. దేశంలో తలెత్తిన ద్రవ్యోల్బణం తమ ప్రభుత్వ ప్రతిష్టకు ఎలా మచ్చతెచ్చిందో చెబుతూ ఆరు సంవత్సరాల తరువాత ద్రవ్యోల్బణం తొలిసారిగా తిరోగమనంలో ఉందంటూ అబ్ అచ్చేదిన్ ఆనేవాలే హై (ఇప్పుడు మంచి రోజులు రానున్నాయి) అంటూ ఎన్ఆర్ఐలకు భరోసా ఇచ్చారు. వెంటనే నరేంద్రమోడీ ఆ మాటలను తనవిగా చేసుకొని మరుసటి రోజే దాడికి దిగారు. అదే సభలో జనవరి తొమ్మిదిన గుజరాత్ సిఎంగా మాట్లాడారు. ఆ సభలో ఉక్కు పరిశ్రమ దిగ్గజం ఎల్ఎన్ మిట్టల్ కూడా ఉన్నారు. మిట్టల్ను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు లండన్లో తినే టమాటాలు, బెండకాయలు కూడా గుజరాత్లో పండించినవే అని అతిశయోక్తులు చెప్పారు. తరువాత 2014 ఎన్నికల ప్రచారంలో అచ్చేదిన్ నినాదాన్ని ముందుకు తెచ్చారు. మన్మోహన్ సింగ్ రెండు సంవత్సరాలకు ముందు చెప్పిందాన్ని ప్రస్తావిస్తూ ''హా మైనే భీ కహతా హుం కి అబ్ జల్దీ హై అచ్చేదిన్ ఆనే వాలే హై'' (అవును నేను కూడా చెబుతున్నా ఇప్పుడు త్వరగా మంచి రోజులు రానున్నాయి) అని చెప్పారు. ఇప్పుడు ఆ నినాదమే తమ గొంతుల్లో పచ్చివెలక్కాయ మాదిరి ఇరుక్కుపోయిందని గడ్కరీ అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి రాశారు. మంచి రోజులు రావని తెలిసీ జనాలు చప్పట్లు కొడుతున్నారని ఇచ్చిన నినాదాన్ని అవసరం తీరింతరువాత పక్కన పెట్టేశారు. ఓట్ల కోసం కొత్త నినాదాలు, మనోభావాలను ముందుకు తెచ్చే కొత్త అవకాశాల కోసం చూస్తున్నారు.
ఇక సంతోష సూచికల గురించి చూద్దాం. వరుసగా గత ఐదు సంవత్సరాల పాటు ఫిన్లండ్ సంతోష సూచికలో మొదటి స్థానంలో వచ్చింది. మన దేశం చివరి పది స్థానాల్లో నిలిచింది. మనం ప్రతిదానికీ ఇరుగుపొరుగు దేశాలతో పోల్చుకుంటూ మన గొప్పలను చెప్పుకుంటున్నాం. సంతోష సూచికల్లో 2012 నుంచి(2014మినహా) 2022 వరకు తొమ్మిది సంవత్సరాల సగటు 128.8 కాగా కనిష్టం 111, గరిష్టం 144 ఉంది.
వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా సంతోష సూచికల్లో ప్రతి ఏటా మార్పులు ఉంటాయి. తలసరి జీడీపీ, ఆరోగ్య జీవితప్రమాణాలు, సామాజిక మద్దతు, జీవన విధాన ఎంపిక అవకాశం, ఉదారత, అవినీతి వంటి అంశాలను పరిగణనలోకీ తీసుకొని ఇచ్చే మార్కుల ఆధారంగా సూచిక నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాలలో కొత్త అంశాలను కూడా చేరుస్తారు. కొన్ని దేశాలను పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. అందువలన ప్రతి ఏడాదీ మార్కులు మారినా ఒక్కోసారి సూచికల్లో స్థానం మారకపోవచ్చు. మన జనాల్లో ఉన్న ఒక అవాంఛనీయ వైఖరి ఏమంటే మన కంటే దిగువన ఉన్నవారిని ఎద్దేవా చేయటం, మనం మరికొందరి కంటే చాలా దిగువన ఉన్నామని మరచిపోవటం.
నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త నినాదాలను ముందుకు తెచ్చి జనాన్ని ఆకర్షించటంలో, మభ్యపరచటంలో ఎంతో ముందుందనటం అతిశయోక్తి కాదు. చెప్పిన కథ చెప్పకుండా కొత్త కథలు చెబుతోంది. అచ్చేదిన్, గుజరాత్ నమూనా వృద్ది, నల్లధనం వెలికితీత, 2022 నాటికి నవభారతం, 2024నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జీడీపీ సాధన. 2022 ఆగస్టు పదిహేను నాటికి లేదా ఏడాది ఆఖరుకు సాధిస్తామని చెప్పిన అంశాల గురించి ఒక్కసారి చెప్పుకొని సంతోషిద్దాం.
1. జీడీపీ వృద్ధి రేటు 9-10శాతంగా ఉంటుంది. పెట్టుబడుల రేటు 2022-23 నాటికి 36శాతానికి పెంపుదల, పది నూతన కల్పనల జిల్లాల ఏర్పాటు. దాతలతో నైపుణ్యాల పెంపుదల, ఆరవ తరగతి నుంచి నైపుణ్య శిక్షణకు స్కూళ్లు. ప్రస్తుతం 5.4శాతంగా ఉన్న నైపుణ్య కార్మికులను కనీసం 15శాతానికి పెంచటం, మహిళాశ్రామిక శక్తి భాగస్వామ్యం 30శాతానికి పెంపు, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇరవై నుంచి 30లక్షలు, పర్యాటక రంగంలో నాలుగు కోట్ల ఉద్యోగాలు, గనుల రంగంలో 50లక్షల కొత్త ఉద్యోగాల కల్పన. 2. ప్రతి పౌరుడికి బ్యాంకు ఖాతా, జీవిత, ప్రమాద బీమా, పెన్షన్, ఉద్యోగానంతర ప్రణాళికల సేవలు అందచేత, 3. రైతుల ఆదాయాలు రెట్టింపు, పొలాలన్నింటికీ జలాల సరఫరా, పొలాల్లో వదలివేసిన గడ్డిని తగులబెట్టకుండా చూడటం, దేశంలో గాలి కాలుష్యాన్ని సగానికి తగ్గించటం, ప్లాస్టిక్ వాడకంపై నిషేధం. 4. ప్రతి కుటుంబానికి గాస్ సిలిండర్, రైలు ప్రమాదాల్లో ఒక్కరు కూడా మరణించకుండా చూడటం, ముంబై-అహమ్మదాబాద్ బుల్లెట్ రైలు పరుగులు(ఇప్పుడు దీనికి ఒక తుది గడువు అంటూ లేదు గానీ 2023 డిసెంబరుకు పూర్తి అని చెబుతున్నారు). 5. ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు, ఇళ్లలో మరుగుదొడ్లు, చేతులతో మలమూత్రాల ఎత్తివేత నివారణ, రోజంతా విద్యుత్ సరఫరా. 6. 2012-13లో ఉన్న 7.7శాతం పారిశ్రామిక ఉత్పాదకత రెట్టింపు. ప్రతిగ్రామానికి ఇంటర్నెట్, ప్రతివారూ దాన్ని ఉపయోగించేలా చర్యలు, ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా, పోషకాహారలేమి నివారణ. ప్రస్తుతం 21శాతంగా ఉన్న అడవులను 33శాతానికి పెంపు, పదవ తరగతి పూర్తి గాకుండా ఏ ఒక్క విద్యార్థీ మధ్యలో బడి మానకుండా చూడటం. ఉన్నత విద్యలో 25శాతంగా ఉన్న చేరికలను 35శాతానికి పెంచటం 7. ఏడువందల జిల్లా కేంద్ర ఆసుపత్రులు వైద్య కేంద్రాలుగా వృద్ధి. ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలో ఆరోగ్యనిపుణులకు ప్రయివేటు పరిశ్రమలవారితో శిక్షణ, మెడికల్ టూరిస్టులను ఆకర్షించేందుకు ఇరవై స్వేచ్ఛా జోన్ల ఏర్పాటు, దేశంలో 11,082 మందికి ఒక అలోపతి వైద్యుడు ఉన్న స్థితిని ప్రతి పద్నాలుగు వందల మందికి ఒకరుండేట్లు చూడటం, వెనుకబడిన ప్రాంతాల్లో వంద చోట్ల కొత్త విహార కేంద్రాల ఏర్పాటు. మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్యను 88లక్షల నుంచి కోటీ 20లక్షలకు పెంచటం, స్వదేశీ పర్యాటకుల సంఖ్యను 1,614 నుంచి 3,200 మిలియన్లకు పెంచటం. 8. చమురు, గాస్ దిగుమతుల పదిశాతం తగ్గింపు (2022-2023). 80 గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక ఇంధనాన్ని 175 గిగావాట్లకు పెంచటం. 9. 1.22లక్షల కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారులను రెండులక్షల కిలోమీటర్లకు పెంచటం. దశాబ్దాల తరబడి 2017 నాటికి పూర్తిగాకుండా ఉన్న ప్రాజెక్టుల పూర్తి. ఇలాంటి కబుర్లతో గతంలో కాంగ్రెస్ కాలక్షేపం చేసింది. ఇప్పుడు బీజేపీ చేస్తున్నది.
ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని, త్వరలో చైనాను అధిగమిస్తామని చెబుతున్నవారి ఏలుబడిలో సంతోష సూచిక ఇలా తగులడుతోందేం అన్నదే ప్రశ్న. సంతోష సూచిక లెక్కింపులోకి తీసుకొనే జీడీపీ తలసరి సగటు సూచికలో గత నాలుగు సంవత్సరాలుగా మనది 102-103 స్థానాల్లో, ఆరోగ్యజీవిత సూచికలో 104-107, సామాజిక మద్దతులో 141-145 స్థానాల్లో ఉన్నప్పుడు జనాల్లో ఆనందం ఎక్కడ ఉంటుంది. నేపాల్ కూడా పేదరికంలో తన స్థానాన్ని 48 స్థానాలు ఎగువకు గణనీయంగా మెరుగుపరుచుకోగా మన దేశం 28 స్థానాలు కోల్పోయింది.
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288