Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనుషులను చంపే శక్తి మంత్రాలకు ఉంటే, దేశ రక్షణ కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి సైన్యాన్ని, ఆయుధాల్ని, ఫైటర్ విమానాల్ని సమకూర్చుకోవడం ఎందుకూ? మంత్రాలు చదివేవాళ్ళను ఓ నలుగుర్ని పంపితే పని అయిపోతుంది కదా? నలుగురు కాకపోతే నలభైమందో, నాలుగు వందల మందో... అయినా సరే మనకు వేలకోట్లు మిగులుతాయి. పైగా మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. శ్రీ వెంకటేశ్వర సామ్రాజ్యమైన తిరుమల తిరుపతి నగరాన్ని ఇటీవల వరదలు ముంచెత్తడం విడ్డూరం! వాస్తు ప్రకారం కట్టిన ఇండ్లు కూడా వరసబెట్టి కూలిపోవడం విషాదం. ప్రభుత్వ యంత్రాంగమంతా కదిలివెళ్ళి వరదల్ని అదుపు చేయడం, జనాన్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేయడం జరిగింది. మరి దేవుడి మహిమల గూర్చి మాట్లాడే ప్రవక్తలు, వాస్తు పండితులు, జ్యోతిషులు అంతా ఎక్కడికి పోయారూ? ఒక్కరూ నోరు మెదపలేదేమీ? రాగల ప్రమాదం గూర్చి ముందే చెప్పి, జనాన్ని అప్రమత్తం చేయలేదేమీ చెప్మా? ఆ దేవ దేవుడి మహత్మ్యాన్ని ప్రదర్శనకు పెట్టాల్సింది కదా?
కానీ ''భక్తులైనా, దేవుడైనా ఎవరూ భయపడల్సిన పనిలేదు. వరదల్లోంచి మిమ్మల్ని రక్షించి బయట పడేయడానికి మేమున్నాం'' అంటూ ఆర్మీ రంగ ప్రవేశం చేసింది. పోలీసుశాఖ నడుం బిగించింది. ఇంతకూ మనుషుల్ని మనుషులు రక్షించుకోవడమే గానీ, ఏదో శక్తి వచ్చి ఎవరినీ రక్షించింది లేదు. అసలు దేవుడి ఆభరణాలు దొంగలెత్తుకుపోతేనే ఆయనేం చేయలేక మిన్నకున్నాడు కదా? అంతా ప్రచారాల మహిమ, దేవుడి మహిమ కాదు. మహిమల ప్రచారం ఎంత ఎక్కువ జరిగితే అంత ఆదాయం ఉంటుంది. ప్రేయర్ ఇండిస్టీ - భక్తి వ్యాపారంలో అది కీలకం!
ఒక్క విషయం నిజాయితీగా ఆలోచిద్దాం! ప్రార్థనలు గనక నిజంగా పనిచేస్తే అంబులెన్స్లు రోగుల్ని, బాధితుల్ని చర్చ్లకు, మసీదులకు, దేవాలయాలకు తీసుకెళ్ళాలి. అనవసరంగా ఆసుపత్రులకు తీసుకుపోతున్నా యెందుకూ? ప్రార్థనలకు శక్తి లేదా? వైద్య శాస్త్రం చదువుకున్న వారే ఎందుకు కావల్సి వస్తోంది? ఇక, అంతా దైవేచ్ఛే అయితే సహజంగా ముంచుకొచ్చే తుపానులు, వరదలు, కరువులు, కాటకాలు, రోడ్డు ప్రమాదాలు వంటివన్నీ కేవలం హేతువాదుల్ని, నిరీశ్వరవాదుల్ని, చార్వాకుల్ని చంపేయాలి. ప్రార్థనలు, భజనలు, పూజలు చేసే భక్త జనాన్ని బతికించాలి. కానీ అలా జరగడం లేదెందుకూ? ప్రార్థనలకు, పూజలకు ఫలితం ఉండదా? సహజ ప్రమాదాల్ని తెలివిగా తప్పించుకో గలవారు, లేదా ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగిన వారు మాత్రమే నెగ్గుకొస్తున్నారు. అంతా ఆపైవాడే చూసుకుంటాడు, అంతా మంచే చేస్తాడు అని అనుకునే విశ్వాసకులకు ఎల్లప్పుడూ మంచే జరగడం లేదు. అందరిలాగా మంచీ చెడూ రెండూ జరుగుతున్నాయి. దైవ విశ్వాసకులు చదువు పరిక్షలో, జీవిత పరిక్షలో అన్నింటా విజయులు అవుతూనే ఉండాలి. మరి అలా కావడం లేదు కదా?
''కేవలం రమణ మహర్షి మాత్రమే చనిపోయిన తర్వాత తిరిగి వచ్చారు. ప్రపంచంలో ఇది మరెవరికీ సాధ్యం కాలేదు'' అని సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రకటించారు. ఆయన నమ్మకం ఆయనది. కానీ, దానితో క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇళయరాజా భేషరతుగా తమకు క్షమాపణ చెప్పాలని తమిళనాడులో క్రైస్తవులు డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వ్యక్తిగత విశ్వాసాలు ఎవరికైనా, ఏవైనా ఉండొచ్చు. కాని వాటిని బయట పెట్టేప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి. ప్రశ్నను తట్టుకుని నిలబడతాయా లేదా అని విశ్లేషించుకోవాలి. ప్రశ్నను ఎదుర్కోలేని విశ్వాసం వృధా! ప్రగతిశీల భావాలు గల వారంతా సంతోషించే సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. నారాయణరావుపేట మండలం, బంజేరుపల్లి గ్రామంలో ''ఈ పురోహితుడు మాకొద్దు'' అని దేశంలోనే మొదటిసారి ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. గ్రామ సభ నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామస్థులంతా 2021 డిసెంబర్ ఒకటి, బుధవారం రోజున ఊళ్ళో ఒకచోట గుమిగూడి ఆ నిర్ణయం తీసుకున్నారు. పురోహితుడి దోపిడి సహించలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్ళికి ఇరువైపులా 25వేలు, తులం బంగారం తీసుకుంటున్నాడనీ, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు జరిగినా సంభావనపేరుతో దోపిడీ నిరాఘాటంగా కొనసాగుతూ ఉందని వాపొయ్యారు. దేవుడొక విశ్వాసమెలాగో, పురోహితుడి అవసరం కూడా విశ్వాసమే. అంధవిశ్వాసాలు వదులుకుంటే, మనుషుల ఆరోగ్యంతో పాటు సమాజ ఆరోగ్యం కూడా బాగు పడుతుంది. 'ఈ పురోహితుడు మా కొద్దు' నిర్ణయంతో సమాజం కొంత వరకు ముందు కొచ్చినట్లే.. ఈ పురోహితుడే కాదు, ఏ పురోహితుడూ వద్దు. ఏ మత పెద్దా మాకు అవసరం లేదు.. అని గ్రామస్థులు నిర్ణయించుకునే రోజు రావాలి! అలాంటి ఆశాభావాన్ని నిజం చేసుకోవడానికి ఈ తరం యువతీ యువకులు అన్ని విధాలా కృషి చేస్తూనే ఉండాలి!
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో బ్రహ్మపురి, కండాడ గ్రామంలో సునీల్ బన్కర్, ప్రమోద్ బన్కర్ అనే ఇద్దరు మూర్ఖులున్నారు. వారి దృష్టి ఆడుకునే పిల్లలపై పడింది. అందులో ఒక పిల్లవాడి తలలో మూడు సుడులు కనిపించాయి. అంతే-వాళ్ళు ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుపోయారు. పిల్లవాడి పేరు యుగ్ మేశ్రామ్. రెండేండ్ల పసివాడు. ఆడుకుని, చీకటి పడ్డా ఇంట్లోకి రాలేదేమని పిల్లవాడి తండ్రి అశోక్ మేశ్రామ్ ఊరంతా వెతికాడు. కనబడకపోయేసరికి, పోలీసులకు తెలియజేశాడు. పోలీసుల అన్వేషణలో సునీల్, ప్రమోద్లు దొరికారు. విచారణలో తేలిందేమంటే.. వాళ్ళే పిల్లవాణ్ణి చంపారని! ఎందుకూ అంటే... తలలో మూడు సుడులు ఉన్న పిల్లవాణ్ణి బలిఇచ్చి, క్షుద్రపూజలు చేస్తే గుప్తనిధులు దొరుకుతాయని.. ఒక మూఢ విశ్వాసం! పోలీసుల ట్రీట్మెంట్ తర్వాత, చంపింది తామేనని నేరం ఒప్పుకున్నారు. గుప్తనిధులకూ ఒక అనామకుడి తలలోని సుడులకూ సంబంధం ఎలా ఉంటుంది?
ఆడది స్వేచ్ఛగా బతకగూడదని, కట్టుబాట్లన్నింటినీ తమతమ మత గ్రంథాలలో రాసుకున్నప్పుడే మతాలు చచ్చిపోయాయి. ఆ చచ్చిన మతాలను ఇప్పుడు ఈ బతికున్న మనుషులు గుడ్డిగా నమ్ముతున్నారు. చిత్రం. విచిత్రం! ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గూటి మండలంలో షేక్ బషీర్ అతని భార్య సదిక సంజారి ఉంటున్నారు. భార్య సదిక సంజారికి పాటలు పాడటం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం. ఆమె అక్కడ జరిగే ఉగాది ఉత్సవాల్లో పాల్గొన గూడదని భర్త భార్యకు ముందే ఆర్డర్ వేశాడు. అయినా ఆమె తన ఉత్సుకతను, ఉత్సాహాన్నీ ఆపుకోలేక - వెళ్ళి, అన్ని కార్యక్రమాలలో పాల్గొంది. అంతే కాక, ఇతర గాయనీ గాయకులతో కలిసి ఖవ్వాలీ కూడా పాడింది. ప్రేక్షకుల్లో ఉండి గమనించిన భర్త షేక్ బషీర్ ఉక్రోషం ఆపుకోలేకపోయాడు. తన ఆడది తన మాట వినకుండా అవమానించిందని... తన మీద తానే కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకున్నాడు. వేదిక మీద భార్య ఖవ్వాలీ పాడుతుండగా వేదిక కింద ఓర్వలేని భర్త ఆ పని చేశాడు. చుట్టూ ఉన్నవారు ఇసుక చల్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. అప్పటికే అతని శరీరం 70శాతం కాలిపోయింది. ఇవి గూటి పోలీస్ సబ్ ఇన్సిఫెక్టర్ వెల్లడించిన వివరాలు. భార్యల్ని ప్రోత్సహించకపోయినా ఫరవాలేదు. మూర్ఖంగా అడ్డుకోవడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం ఏం సబబూ? భార్యను ఒక వ్యక్తిగా గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటారూ? ఆమె అభిరుచులను అర్థం చేసుకునే పనిలేదా? ఇలాంటి పనులు మత పిచ్చిగాళ్ళే చేస్తారు.
ఇక్కడ ఒక చిన్న సంఘటన గూర్చి చెపుతాను. ఒక రోజురాత్రి దుకాణ దారుడు దుకాణం కట్టేసి వెళ్ళిపోదామనుకునే సమయానికి, ఒక కుక్క, ఒక సంచి నోట కరుచుకుని వచ్చి నిలబడింది. సామాను కోసం వచ్చినట్లుంది అనుకుని, దాని నోటి నుండి సంచి తీసి తెరచి చూశాడు. అందులో సామాను చీటి, డబ్బులూ ఉన్నాయి. తనలో తానే నవ్వుకుంటూ, దుకాణదారు సామాన్లు సంచిలో వేసి డబ్బులు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వాల్సిన చిల్లర సంచిలో వేశాడు. సంచి కుక్క నోటికి అందించాడు. అది వెనుదిరిగింది. షట్టరు మూసి దుకాణదారు కూడా కుక్కను వెంబడించాడు. కుక్క ఎక్కడికి వెళుతుంది? దాని యజమాని ఎవరూ? చూడాలన్న ఉత్సుకత అతనిలో పెరిగింది. కుక్క బస్స్టాండ్లో నిలబడి ఎదురు చూసింది. బస్సురాగానే ఎక్కింది. దుకాణదారుడూ ఎక్కాడు. కుక్క కండక్టర్ దగ్గర నిలబడి మెడ వంచింది. దాని మెడ మీద నెక్ బెల్ట్ కింద డబ్బులున్నాయి. దిగాల్సిన స్టేజి ఏదో చిన్న చీటి మీద రాసి ఉంది. కండక్టర్ డబ్బులు తీసుకుని, టికెట్ చింపి మళ్ళీ దాని నెక్బెల్ట్ కింద పెట్టాడు. స్టేజీ రాగానే కుక్క ముందుకు వెళ్ళి నిలబడింది. తోకాడించింది. తల ఊపింది. డ్రైవర్ బస్సు ఆపాడు. కుక్క సంచిని జాగ్రత్తగా పట్టుకుని బస్సు దిగింది. దుకాణదారుడు కూడా బస్సు దిగి, దాన్ని అనుసరించాడు. కుక్క ఒక వీధిలో చివరిదాకా వెళ్ళి, సంచి అరుగుమీద పెట్టింది. ముందుకాళ్ళతో తలుపుతట్టింది. మళ్ళీ మళ్ళీ తట్టిన తర్వాత ఒకతను తలుపు తెరిచాడు. కోపంతో కుక్కను విపరీతంగా బాదడం ప్రారంభించాడు. కొద్ది దూరంలో నిలబడి గమనిస్తున్న దుకాణదారు అది భరించలేకపోయ్యాడు. ''ఆగవయ్యా! ఆగు - ఎందుకు దాన్ని కొడుతున్నావ్?'' అని అరిచాడు. కుక్క యజమాని విసుగ్గా చూసి ''వెధవ కుక్క దీనికి బుద్దిలేదు. తాళం చెవులు తీసుకుపోవచ్చు కదా? అనవసరంగా నా నిద్ర పాడు చేసింది!'' అని కోపం వెళ్ళగక్కాడు. బుద్ధి ఎవరికి లేదో దుకాణదారుడికి బాగా అర్థమయ్యింది. ఇక్కడ కుక్క మనిషిలా మారుతుంటే, మనిషే కుక్కలా ప్రవర్తించాడు.
దేవుడు అన్నీ చేస్తాడన్న విశ్వాసం ఎంత తప్పో... కుక్క కూడా అన్ని పనులు చేయాలనుకోవడం అంతే తప్పు. మనిషికైనా, జంతువుకైనా కొన్ని పరిమితులుంటాయి. లేని దేవుడికే పరిమితులుండవు. భ్రమలో ఏదైనా సాధ్యమే! విశ్వాసలుండడం అవసరమే. కానీ, అవి విశ్వసించదగ్గవిగా ఉండాలి.
- డాక్టర్ దేవరాజు మహారాజు
[కేంద్ర సాహిత్య అకాడమి విజేత, జీవశాస్త్రవేత్త]