Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్ధిక మాంద్యం ఏర్పడడం తరచూ జరుగుతుంది. సరుకుల వినిమయం తగ్గిపోవడం దీనికి కారణం. అదే విధంగా ద్రవ్యోల్బణం పెరుగుతూవుంటుంది. మన రూపాయి విలువ పడిపోయినా, సరుకుల ధరలు పెరిగినా అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఈ రెండు లక్షణాలూ - అంటే, ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్బణం మామూలుగా ఒకదాని వెంట ఇంకొకటి వస్తాయి. అదే రెండూ ఒకేసారి జమిలిగా వస్తే? దానిని ఇంగ్లీషులో స్టాగ్ఫ్లేషన్ (స్టాగేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్) అని అంటున్నారు. మనం తెలుగులో మాంద్యోల్బణం అని అందామా ?
ప్రస్తుతం దేశ ఆర్ధిక వ్యవస్థ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నదీ తెలియజేసే సూచికలు చూస్తే అవి ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం 8శాతం దాటింది. టోకు ధరల సూచి జనవరి 2021తో పోల్చితే జనవరి 2022 నాటికి 13శాతాన్ని దాటింది. వీటికి తోడు మన దేశ వార్షిక జీడీపీ వృద్ధి రేటు ముందు అంచనా వేసినట్టు 9.2శాతం కాకుండా 8.9శాతమే ఉండబోతుందని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆఖరి త్రై మాసికంలో వద్ధి 4.8శాతమే ఉండబోతున్నదని అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఒమిక్రాన్, ఉక్రెయిన్ యుద్ధం ఆర్ధిక వ్యవస్థమీద ప్రభావం చూపనున్నాయని అంటున్నారు.
వృద్ధిరేటు తక్కువగా ఉండడం, ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం, నిరుద్యోగం తీవ్రంగా ఉండడం నేటి పరిస్థితిలో కనిపిస్తున్న లక్షణాలు. వీటి వలన కార్మికుల నిజ వేతనాలు దెబ్బ తింటున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు 2019లో బాగా పెరిగాయి. నవంబరు 2020లో కాస్త తగ్గుముఖం పట్టినా మళ్ళీ 2021 చివర్లో పెరగడం ప్రారంభించాయి. వచ్చే ఏడాది ఆహారధాన్యాల ఉత్పత్తి బాగా పెరుగుతుందని, అందువలన ఆహార వస్తువుల ధరలు మళ్ళీ తగ్గుముఖం పడతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆ మాట ఒకవేళ వాస్తవరూపం ధరించినా, రవాణా, సమాచారం, ఇంటిలో వినియోగించే ఆహారేతర వస్తువులు, సేవలు, ఆరోగ్యం వంటి అవసరాల ధరలు మాత్రం వేగంగానే పెరుగుతున్నాయి.
ఇనుప ఖనిజం, సీసం, మాంగనీస్ వంటి ఖనిజాలు తగినంత మోతాదులో లభ్యం కాక వాటి ధరలు బాగా పెరిగిపో తున్నాయి. ఈ ఖనిజాలను ఉపయోగించి చేసే ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే మార్కెట్లమీద గుత్తాధిపత్యం కలిగివున్న బడా కార్పొరేట్లు ఆ పెరిగిన ధరలను వినియోగదారులమీదకు నెట్టివేయ గలుగుతూంటే అంతగా పట్టు లేని చిన్న, మధ్య తరహాఉత్పత్తిదారులు మాత్రం ఆ విధంగా చేయలేక పోతున్నారు. పర్యవసానంగా తమకు వచ్చేనష్టాలను భరించలేని స్థితికి చేరుకుంటూ ఉత్పత్తులను తగ్గించుకోవడమో, లేక ఏకంగా పరిశ్రమలను మూసివేయడమో చేస్తున్నారు. అందువలన పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. నిరుద్యోగం మరింత పెరుగుతోంది.
క్రూడాయిల్, సహజవాయువులను ఉత్పత్తి చేసే బడా కంపెనీల అమ్మకాల విలువ డిసెంబర్ 2020తో పోల్చితే డిసెంబర్ 2021 నాటికి 68.2శాతం పెరిగింది. ఐతే వాసత్వంగా అమ్మిన చమురు, సహజవాయువుల పరిమాణం 1.2 శాతం పడిపోయింది! తాజాగా సాగుతున్న ఉక్రెయిన్ష్రష్యా యుద్ధం కారణంగా ఈ చమురు, సహజవాయువుల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇవే గాక, ఖాద్య తైలాల సరఫరా కూడా దెబ్బ తినే అవకాశం ఉన్నందున ఇప్పటికే పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సోయా నూనె, వనస్పతి ధరలు కూడా పెరగడం మొదలెట్టాయి.
గతేడాది ముడి చమురు ధరలు కనిష్టంగా 47.62 డాలర్లు, గరిష్టంగా 84.65 డాలర్లు ఉంది. ఈ ఏడాది అప్పుడే 140 డాలర్లకు చేరుకుంది. మనదేశ చమురు ఉత్పత్తుల వినియోగంలో 85 శాతం దిగుమతులపై ఆధారపడి జరుగుతుంది. గతేడాది కరోనా వలన, ఇతర కారణాల వలన చమురు ఉత్పత్తుల వినియోగం తగ్గింది. కాని పెరిగిన ధరల వలన వాటికి వెచ్చించే మొత్తం మాత్రం పెరిగింది. ధర పెరిగినంత మాత్రాన పెట్రోలు, డీజెల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించలేం. కనుక వాటికోసం మనం వెచ్చించే మొత్తం పెరిగింది. అయితే కార్మికుల, ఉద్యోగుల వేతనాలు మొత్తం మీద పెరగలేదు. అంటే మనం ఇతర వస్తువుల వినియోగాన్ని ఆటోమేటిక్గా తగ్గించి వేస్తున్నామన్నమాట. ఇతర సరుకుల వినియోగం ఎప్పుడైతే తగ్గిందో, ఆ మేరకు ఆ యా రంగాలలో మాంద్యం ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రభుత్వం పూనుకోవాలి. కాని అలా జరగడం లేదు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడల్లా వాటిమీద వసూలు చేసే పన్నుల మొత్తం కూడా పెరుగుతోంది. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రో ధరల పెరుగుదల వలన అదనపు ఆదాయం సమకూరుతోంది. ఆవిధంగా వచ్చిన అదనపు ఆదాయాన్ని ఉపాధి కల్పన వంటి పద్దులకు ఖర్చు చేయడం బదులు, కార్పొరేట్లకు మరిన్ని రాయితీల్విడానికో, వారి పారు బకాయిలను మాఫీ చేయడానికో వినియోగిస్తోంది.
వాస్తవానికి మన దేశంలో పెట్రోలు ధరలో 45.5శాతం, డీజిల్ ధరలో 39.8శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులకే పోతుంది. పన్ను రూపంలో వసూలు చేసేదానిలో కేంద్రం రాష్ట్రాలతో భాగం పంచుకోవాలి. అందుచేత మోడీ ప్రభుత్వం నేరుగా పన్ను రూపంలో కాకుండా స్పెషల్ డ్యూటీ, రోడ్ సెస్, ఇన్ఫ్రా స్ట్రక్చర్ సెస్ వంటి పేర్లతో వసూలు చేస్తోంది. ఆ విధంగా వసూలు చేసిన భాగం రాష్ట్రాలతో పంచుకోనవసరం లేదు. రాష్ట్రాల వాటా తగిక్గపోయినందువలన రాష్ట్రాలు కూడా శ్రామిక ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దిశగా చర్యలు చేపట్టడానికి పరిమితులు ఏర్పడుతున్నాయి.
పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వలన దాని ప్రభావం రవాణా రంగం మీద పడుతుంది. దాని కారణంగా ఇతర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ కలిసి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీని పర్యవసానంగా శ్రామిక ప్రజల కొనుగోలుశక్తి తగ్గిపోతుంది. దానివలన సరుకుల వినియోగం తగ్గిపోతుంది. మార్కెట్ లోని సరుకులు చెల్లుబాటు కావు. అందువలన ఆర్ధిక మాంద్యం ఏర్పడుతుంది. ఆ విధంగా ఏకకాలంలో అటు ద్రవ్యోల్బణం, ఇటు ఆర్ధిక మాంద్యం, రెండూ ఏర్పడుతాయి.
ఈ ద్రవ్యోల్బణం వలన, ఆర్ధిక మాంద్యం వలన చిన్న ఉత్పత్తిదారులు చిక్కుల్లో పడతారు. వారి పరిశ్రమలు నడవలేని పరిస్థితి వస్తుంది. ఆ చిన్న పరిశ్రమలు మూతబడితే మరింత ఎక్కువమంది కార్మికుల ఉపాధి పోతుంది. అది మాంద్యోల్బణాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. అయితే దీని వలన బడా కార్పొరేట్లకు ఏ విధంగానూ ఇబ్బందులు లేవు. వారికున్న గుత్తాధిపత్యం వలన పెరిగిన ధరల భారాన్ని వారు వినియోగదారుమీద వేయగలుగుతున్నారు. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో కార్ల ధరలు పెరిగాయి. అయినా వాటి వినియోగం తగ్గలేదు. అదే కార్ల విడిభాగాల ఉత్పత్తి దారులు మాత్రం నష్టపోయారు.
ప్రస్తుత సంక్షోభాన్ని నివారించాలంటే శ్రామిక ప్రజల కొనుగోలుశక్తిని పెంచే మార్గాలు అన్వేషించాలి. ఉపాధికల్పన మార్గాలను అన్వేషించాలి. కనీసం పెట్రో ఉత్పత్తుల మీద పన్నులను పెంచడం మాని తగ్గిస్తే శ్రామిక ప్రజల కొనుగోలుశక్తి పెరుగుతుంది.ఐతే కార్పొరేట్లకోసమే పని చేస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అటువంటి విజ్ఞతను ఆశించడం అత్యాశే ఔతుంది.
- సుబ్రమణ్యం
(సంజరు రారు వ్యాసం ఆధారంగా)