Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 1950 నుంచి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుతూ, ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది. తగిన వైద్య సేవలు అందించుటకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అన్ని దేశాల ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యా, చైనా వంటి దేశాల ఆర్థిక సహకారం మీదనే ఈ సంస్థ పని విధానం, కార్యక్రమాలు ఆధారపడి ఉంటాయి. ప్రపంచంలో చాలా వెనుకబడిన మరియు మధ్య ఆదాయ దేశాల్లో వివిధ ఆరోగ్య సేవలు అందిచాలన్నా, పౌష్టికాహారం, వివిధ రకాల వ్యాక్సిన్లు అందించాలన్నా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, యుద్ధాలు సంభవించినప్పుడు వివిధ రకాల సహాయ సహకారాలు అందిచాలన్నా అన్ని దేశాలు అందించే ఆర్థిక సహకారం మీదనే ఈ సంస్థ ఆధారపడి ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం మానవతా దృక్పథంతో పౌరులకు వైద్య సేవలు అందించేందుకు ఈ సంస్థ ఏర్పాటు చేశారు. అయితే, ఇటీవల అమెరికా వంటి దేశాల ఆర్థిక సహకారం సరిగా లేకపోవడం వల్ల అనుకున్న కార్యాలు నేరవేరటం లేదు. ఈ నేపథ్యంలో మన దేశ ఆరోగ్య వ్యవస్థను పరిశీలిద్దాం...
''ఆరోగ్యమే మహాభాగ్యము'' అన్నారు పెద్దలు. ముఖ్యంగా మన భారతదేశంలో పేదరికం, అవిద్య, సామాజిక అసమానతలు, అపరిశుభ్రమైన వాతావరణం వల్ల అనేక వ్యాధులు సోకి ప్రతీ సంవత్సరం అనేక మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పూర్వ కాలం నుంచి నేటి వరకూ అందరికీ నాణ్యమైన వైద్య సేవలు మనదేశంలో అందుబాటులో లేకపోవడం గమనార్హం. స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తి కావస్తున్నా, ఆరోగ్య రంగానికి నేటికీ స్థూల జాతీయ ఉత్పత్తిలో 1.82శాతం నిధులు మాత్రమే మంజూరు చేయుట శోచనీయం. ప్రపంచంలోనే 18శాతం జనాభా మనదేశంలో ఉన్న ప్రస్తుత తరుణంలో కనీసం 6శాతం జీడీపీ నిధులు మంజూరు చేయాలి. నేటికి మూడు పూటలా తిండి లేని ప్రజలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఆకలి చావులు తరుచూ దేశాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సామాజిక సమస్యగా ఉంటోంది. పౌష్టికాహార లోపంతో రక్తహీనతతో బాధపడే బాలికలు మహిళలు ఎక్కువగా ఉన్నట్లు తాజా జాతీయ ఆరోగ్య నివేదిక తెలిపింది. ప్రభుత్వాలు ఆరోగ్య రంగం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మన ఆరోగ్య వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో కరోనా మొదటి/రెండు దశల్లో మనం కళ్ళారా చూసాం. కొన్ని లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీనికి ప్రధాన కారణం విద్య, వైద్య రంగాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడమే. తగిన నిధులు మంజూరు చేయకపోవడమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతీ వెయ్యి మంది జనాభాకు ఒక ఎంబిబిఎస్ డాక్టర్ ఉండాలి. కానీ మనదేశంలో నేటికీ 1456 మందికి ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారు. వీరులో ఎక్కువ మంది నూటికి 80శాతం పట్టణాల్లో పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు చాలా తక్కువ. ఇక గిరిజన ప్రాంతాల్లోనైతే వైద్య సదుపాయాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. ప్రసవ వేదన పడుతున్న గర్భిణీ స్త్రీలను అనేక కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి ''డోలీ''లపై మోస్తూ తీసుకుని వెళుతున్న సంఘటనలు అనేకం...
నేటికీ మన దేశంలో వైద్య సీట్లు 90,825 మాత్రమే. అందులో 46శాతం మాత్రమే ప్రభుత్వ కళాశాలల్లో ఉండగా, మిగిలిన సగం పైబడి సీట్లు ప్రయివేటు కళాశాలల్లో ఉండటం వలన వైద్య విద్య సామాన్యులకు అందుబాటులో లేదు. ప్రయివేటు కళాశాలల్లో చదవడానికి సుమారు ఒక కోటి రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య విద్య అందుబాటులో లేకపోవడం వల్ల తక్కువ ఫీజు తీసుకుంటున్న ఉక్రెయిన్, రష్యా, చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లి చదువుతున్నారు. ప్రస్తుతం ''రష్యా-ఉక్రెయిన్ యుద్ధం'' వలన అనేక మంది వైద్య విద్యార్ధులు ప్రాణాలు చేతుల్లో ఉంచుకుని, వైద్య విద్య మధ్యలో ఆపేసి మనదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. వీరి భవిష్యత్తు ఏమిటో... అర్థంకాని పరిస్థితి. ఇకనైనా మన దేశంలో వైద్య సీట్లు 1,50,000 వరకూ పెంచాలి. ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించాలి.
ప్రతీ సంవత్సరం మలేరియా, ఎయిడ్స్, రక్తహీనత, సీజనల్ వ్యాధులతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ ఇచ్చే స్థితిలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులు లేకపోవడం శోచనీయం. పారిశుద్ధ్య కార్మికులకు కావలసిన సౌకర్యాలు, మురుగు కాల్వలు ఏర్పాటు చేయలేక పోతున్నారు. రక్షిత మంచినీరు అందించుటలోనూ వైఫల్యం కొనసాగుతోంది. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు వేళ్ళమీద లెక్కించే పరిస్థితి. ఏదైనా విపత్తు సంభవిస్తే... (ప్రస్తుతం కరోనా కాలంలో వలే) ప్రభుత్వాలు చేతులు ఎత్తేసి, మీ ఆరోగ్యం మీరే చూసుకోండి అని చేతులు దులుపుకుంటున్నాయి. మందులు, ఆసుపత్రిలో గదులు దొరక్క, ఆక్సిజన్ సిలిండర్ లభించక అనేక మంది ప్రాణాలు కోల్పోయిన భయానక స్థితిని మనం కోవిడ్ సమయంలో చూశాం. భవిష్యత్తులో కరోనా ఫోర్త్ వేవ్'' అంటున్నారు...! అప్పటికైనా ప్రభుత్వాలు పలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటాయా? నార్డిక్ దేశాల వలే మన దేశం కూడా విద్యా, వైద్య రంగాలకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలి. బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి. అప్పుడే ఆరోగ్య భారత్ ఆవిర్భవిస్తుంది.
(7.4.22న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా...)
- ఐ. ప్రసాదరావు
సెల్:9948272919