Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత సామాజిక ఉద్యమ చరిత్రలో మరుపురాని మహనీయుడు జోతిభా ఫూలే. మూడు వేల ఏండ్ల మనువాద మానసిక చట్టాలను ప్రతిఘటించి, సమానత్వ సమాజానికి శ్రీకారం చుట్టిన దీశాలి ఆయన. మనువాదుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న విద్య, విజ్ఞానం మనుషులందరికి సమానంగా దక్కాలని తపించాడు. మెజార్టీ ప్రజలకు చదువెందుకు లేదు, ఇండ్లు, భూములెందుకు లేవు, బట్టలెందుకు లేవు, కనీస ఆహారం కూడా ఎందుకు దొరకడం లేదు, సంపద సృష్టిస్తున్న వారికి అందులో వాటా ఎందుకు దక్కడం లేదు... ఇలాంటి అసమానతలపై తిరుగుబాటుతోపాటు సమాజానికి చదువు ప్రాధాన్యతను ప్రబోధించిన సామాజిక విప్లవ స్ఫూర్తి శిఖరం ఫూలే.
1827 ఏప్రిల్11న జోతిభాఫూలే మహారాష్ట్రలోని మాళి కులంలో జన్మించాడు. స్వతంత్ర దృష్టి, సమగ్ర దృక్పథం, ఆధునిక సమాజపు ఆకాంక్ష కలిగినవాడు ఫూలే. ఆయన రచనలు, ఉపన్యాసాలు, జీవితం అంతా ప్రత్యక్ష అనుభావాలతో నిండి ఉంటుంది. కులవివక్ష ప్రత్యక్షంగా అనుభవించిన ఆయన... దాన్ని రూపుమాపడానికి తుది శ్వాస వరకు కృషి చేశాడు. ఒక బ్రాహ్మణ మిత్రుడి వివాహ ఊరేగింపులో పాల్గొన్నందుకు బ్రాహ్మణులు ఆయన పట్ల చూపిన వివక్షతో రగిలిపోయాడు. ''అదనా మాళి కులస్థుడివి దైవజనులైన బ్రాహ్మణ వివాహంలో ఎలా పాల్గొంటావు, అపచారం అపచారం'' అంటూ ఆ ఊరేగింపు నుండి గెంటివేశారు. ఈ సంఘటన ఆయన హృదయాన్ని గాయపర్చింది. నాటి నుండే అతడు పోరుబాట పట్టాడు. వేల సంవత్సరాల మనువాదుల కుతంత్రాలను, అమానవీయ పద్ధతులను తుదముట్టించాలని భావించాడు. తన భార్య సావిత్రి భాయి ఫూలేకు తానే గురువై ఈ దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయినిగా తీర్చిదిద్దాడు. ఆ వెలుగులో అపూర్వ సాహసంతో అందరికీ విద్య కోసం పాటుపడింది సావిత్రిభాయి ఫూలే. అవమానాలకు, నిందలకు గురైన వితంతువులారా అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి. మీకు మేము అండగా ఉంటామంటూ బ్రాహ్మణ వితంతువులకోసం కూడా ప్రత్యేక శరణలయాలను నెలకొల్పారు.
1848లో ప్రపంచంలో పెను మార్పులు సంభవించాయి. ప్రపంచ మానవాళి విముక్తి సిద్ధాంతం కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను కారల్ మార్క్స్ ప్రపంచానికి అందించిన సంవత్సరం అది. అమెరికాలో స్త్రీల విముక్తి ఉద్యమమం కూడా ముమ్మరమైన రోజులవి. ఆ స్ఫూర్తితో ఫూలే మొట్టమొదటి బాలికల ఉన్నత పాఠశాలను నెలకొల్పారు. ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం సత్యాగ్రహాన్ని ఆచరణలో పెట్టడం ఆయన అలవాటు. ఆయన ప్రతి లేఖపై ''సత్యమేవజయతే'' అని రాసి ఉంటుంది. అన్యాయం అసత్యంతో ఆయన ఏనాడు రాజీ పడలేదు. ప్రత్యేకించి స్త్రీలు, కార్మికులు, రైతులు, శూద్రులు, అతి శూద్రుల సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడాడు. వయసులోనూ కాలంలోనూ గాంధీ కంటే ఫూలే చాలా ముందు వాడు. ఎరవాడ జైలులో జోతిభా చర్చ వచ్చినప్పుడు గాంధీజీ ఆయనను ఎంతో శ్లాఘించాడు. సర్వమానవ సమతాభావమే మానవాళి విముక్తికి మార్గమన్నాడు. పేదల పట్ల ఫూలే అచంచల ప్రేమ వెలకట్టలేనిది. బ్రాహ్మణ మంత్రాలను సంపూర్ణంగా వ్యతిరేకించి 1873 డిసెంబర్ 12న పురోహితుడు లేకుండా ప్రమాణ పత్రాలు తానే స్వయంగా తయారు చేసి కేవలం పూలదండలతోనే ఆయన ఆదర్శ వివాహాలకు నాంది పలికాడు.
''రోజువారీ రెక్కల కష్టంతో బతికేవారు... పండుగలు, దేవుళ్ళ పేరుతో భారీగా ఖర్చులు పెట్టడడం మానుకోవాలి. బానిసత్వం ఆధిపత్యం నుండి అందరూ విముక్తి కావాల''ని ఆయన 1973లోనే గులాంగిరి అనేపుస్తకం రాశాడు. 1880లో బొంబాయి నూలు మిల్లు కార్మికుల పోరాటం ప్రముఖ కార్మిక నాయకుడు నారాయన్ లోఖాండే నిర్వహిస్తుండగా ఆయనతో కలిసి కార్మిక సమస్యలపై పోరాడాడు.
1873లో ''సత్యశోధక్ సమాజ్ను'' స్థాపించాడు. ప్రజలను బానిసత్వం నుండి విముక్తి చేయడమే ఈ సమాజ్ లక్ష్యమని చెప్పాడు. పరమత సహనం పాటించడం, మూఢనమ్మకాలు, జ్యోతిష్యం, జాతకాలు, దెయ్యాలు, భూతాలు వంటి వాటి నుండి ప్రజలను కాపాడడం, కులవ్యవస్థ, విగ్రహారాధనలను వ్యతిరేకించడం, మనుషుల మధ్య సోదరభావం పెంచడం వంటి సామాజిక చైతన్య కార్యక్రమాలు ఈ సత్యశోధక్ సమాజ్ చేపట్టింది.
1877లో తీవ్ర కరువు సంభవించింది. కరువు కోరల్లో చిక్కుకున్న అనాథ పిల్లలను కాపాడేందుకు 1877 మే 17న అనాథ శరణాలయం నెలకొల్పాడు. స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలను స్థాపించాడు. సతీసహగమనం, అంటరానితనం, పురోహిత వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. కార్మిక కర్షక హక్కుల పోరాటాల్లో పాల్గొన్నాడు. అందుకే ఆయనను అంబేద్కర్ వంటి మహనీయులు ఎందరో స్ఫూర్తిగా తీసుకోవడమే గాక గురువుగా ప్రకటించుకున్నారు.
ఫూలే ఆశయాలు నేటికీ పూర్తిగానెరవేర్చబడలేదు. బీసీ ప్రధాని అయ్యాడని దేశంలో 50శాతం మంది సంబురపడి చంకలు గుద్దుకున్నారు కానీ ఆయన విదేశాలు తిరగడం, దేశం బయట సరిహద్దు వివాదాలు సృష్టించడం, దేశంలోపల హిందూత్వాన్ని రెచ్చగొట్టడడం, మన జాతీయ జెండాను కాషాయ జెండాగా మార్చజూడడం, భావోద్వేగాలను రెచ్చగొట్టడం, మతోన్మాద దుష్ట చర్యలకు పాల్పడటంలో నిమగమయ్యారు. బీజేపీ పాలకులు ఫూలే ఆశయాలకు బొంద తీసి పాతి పెడుతున్నారు. అందరికీ విద్య కోసం ఆయన తుదిశ్వాస వరకు కృషి చేస్తే... నూతన విద్యావిధానం పేరుతో ప్రయివేటు కార్పొరేట్ విద్య విధానాన్ని తెచ్చిన బీజేపీ సర్కార్ కొన్నవారికే విద్యను అమ్ముతున్నది. బలహీనవర్గాలు, దళితుల హక్కుల కోసం ఆయన అనునిత్యం శ్రమిస్తే... ఆ హక్కులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నది. అంబానీ ఆదానీ ఆస్తులు పెంచడమే తమ పార్టీ విధాన లక్ష్యంగా బీజేపీ కృషిచేస్తున్నది. కోటీశ్వరులను మరింత కోటీశ్వరులుగా పేదలను మరింత పేదలుగా మార్చుతున్నది. ఇప్పటికే 16 కీలక ప్రభుత్వ రంగ సంస్థలను పట్టపగలే అడ్డికి పావుశేరు లెక్కన అమ్మింది. దళితులు బలహీన వర్గాలకు ఉండబడిన రిజర్వేషన్లకు సమాధి చేస్తున్నది. కక్ష్య పూరితంగానే దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, మైనార్టీలకు అన్ని రకాల హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నది.
మన దేశం అనే దేహానికి శ్రామికులు రక్త నాళాల వంటి వారు అని ఆయన పేర్కొంటే... నేటి పాలకులు మాత్రం ఆధిపత్య శక్తులను, సంపన్న పెట్టుబడి దారి శక్తులను అభివృద్ధి చేసి అణగారిన వర్గాలను అథఃపాతాళంలోకి తొక్కేస్తున్నారు. సామాజిక సేవకు ఫూలే నేటికీ ఒక రోల్ మోడల్లే. నాటి ఫ్రెంచి విప్లవాన్ని చూసి ప్రభావితుడైన ఆయన భారత దేశములో ఆ స్ఫూర్తిని నింపారు. దానిని మనం అందిపుచ్చుకోవాలి. సెల్: 9177549646 (ఏప్రిల్ 11 జోతిభాపూలే జయంతి సందర్భంగా)
- టి. స్కైలాబ్ బాబు