Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ అల్లర్లలో ఆరోపణలెదుర్కొంటూ, నిర్బంధంలో ఉన్న ఉమర్ ఖలీద్కు మార్చి 24న ఢిల్లీ సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించింది. యాభై మంది ప్రాణాలను బలిగొన్న ఫిబ్రవరి 2020 హింసలో కుట్రదారులలో ఉమర్ ఖలీద్ ఒకడని పోలీసులు ఆరోపించారు. అనేకమందితో పాటు ఉమర్ ఖలీద్పై నేరారోపణలు చేస్తూ అన్ లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ (యూఏపీఏ), 1967 చట్టాన్ని ప్రయోగించి విచారణలో ఉన్న కేసు కింద నిర్బంధంలో ఉంచారు. ఐదు వందల రోజులకు పైగా ఉమర్ ఖలీద్ జైలులోనే ఉంటున్నాడు, కానీ కేసు విచారణ ఇంకా ప్రారంభం కాలేదు.
ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసులో ఢిల్లీ పోలీసులు విచారణ, ప్రాసిక్యూషన్ చేపడుతున్న తీరు, అది సృష్టించిన తీవ్రమైన సమస్యల (ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్టం 2019ని వ్యతిరేకిస్తూ, చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని, ఆ నిరసన కార్యక్రమాలు హింసను సృష్టించాయని ఆరోపిస్తూ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే నెపంతో కొంతమంది వ్యక్తులపై నేరాలను ఆరోపించారు)పై అనేకమంది కథనాలు రాసారు. ఉమర్ ఖలీద్కు బెయిల్ నిరాకరణ కూడా అంతే తీవ్రమైన సమస్య : అంటే మన భారత శిక్షా స్మృతి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.
బెయిల్ వాదనలు, విచారణగా మారాయి
ముందుగా, జూలై 2021లో ఉమర్ ఖలీద్ తన బెయిల్ దరఖాస్తును కోర్టుకు సమర్పించిన వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అనేక గంటల తరబడి చేసిన అనేక వాదనలు, అనేక వాయిదాలు, ఉత్తర్వుల జారీకి మూడు పర్యాయాలు వాయిదాలు పడిన తర్వాత, అంటే ఎనిమిది నెలల తరువాత బెయిల్ను నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బెయిలు ఇవ్వాలా? లేదా? అనే నిర్ణయం చేయడానికి అనేక వాదనలు, వాయిదాలు, ఎనిమిది నెలల కాలం ఎందుకు తీసుకుంటుందో తెలుసు కోవాల్సిన ముఖ్యమైన విషయం. శిక్షాస్మృతి చట్టంలో, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా విచారణ కొనసాగుతూ, అతడు నేరం చేశాడని రుజువుకానంత వరకూ, అతని స్వేచ్ఛను అన్యాయంగా నిరాకరించకుండా హామీ ఇవ్వడమే బెయిల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. వాస్తవానికి సాధారణ పరిస్థితుల్లో, నేరారోపణలు ఎదుర్కొం టున్న వ్యక్తి పారిపోతాడా, లేదా రుజువులను తారుమారు చేస్తాడా, లేదా సాక్షులను బెదిరిస్తాడా అనే విషయాలను న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకుంటాయి. ఒకవేళ పైన ఉదహరించబడిన ప్రమాదాలు జరగవని అనుకున్నప్పుడు, తాను నేరం చేశాడనే విషయం న్యాయస్థానంలో రుజువు కావడానికి ముందు ఆ వ్యక్తికి స్వేచ్ఛను నిరాకరించడంలో ఎటువంటి అర్థం ఉండదు. ఇంకోమాటలో చెప్పాలంటే.. నేరం రుజువు కానంత వరకు అతడు నిరపరాధే అని భావించాలి.
పోలీసుల నివేదికను జాగ్రత్తగా చదివి, మొదట చూసినదాని ప్రకారం ఏర్పడిన అభిప్రాయం ఆధారంగా (ప్రైమా ఫేసీ) ఆరోపణలు నిజమే అని విశ్వసించే విధంగా జడ్జి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటే, అర్థంకాని న్యాయ భాషను స్వంతం చేసుకున్న 'ఉపా' చట్టం, జడ్జి వ్యక్తిగతమైన బెయిల్ మంజూరు చేయడాన్ని నిషేధిస్తుంది. దీని ప్రభావం వల్ల, 'ఉపా' చట్టం నేర విచారణకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను, బెయిలు మంజూరుకు సంబంధించిన అంశాలుగా మారుస్తుందని నేరన్యాయ నిపుణుడైన అభినవ్ శేఖరీ పేర్కొన్నాడు. 'ఉపా' చట్టం పరిధిలోకి రాని తీవ్రమైన నేరాల్లో కూడా ఇలాంటి ఆనవాళ్ళు ఇండియన్ పీనల్ కోడ్లో కూడా (బెయిలు మంజూరు విషయంలో) ఉన్నాయి. నేరం చేశాడా, లేక నిరపరాధా అనే నిర్థారణను, విచారణ జరిగి, రుజువులను పరిశీలించి, సాక్షులను విచారించి, వారిని ప్రశ్నించి, వాదనలు పూర్తి అయిన తరువాత నిర్ణయిస్తారు. నేరం చేశాడా, లేదా అనే ప్రశ్న బెయిల్ మంజూరు చేసే దశలో అవసరమైన వ్యవహారాలకు సంబంధించిన తీరును పక్కదారి పట్టిస్తుంది.
బెయిలు వాదనలను, ఒక చిన్నపాటి విచారణగా మార్చడం మాత్రమే ఇక్కడ సమస్య కాదు. ఈ చిన్నపాటి విచారణలో, ఒక పక్షం వారిని చాలా స్వేచ్ఛగా పోరాడమని అధికారికంగా అనుమతిస్తే, ఇతరులు మాత్రం (వత్తిపరమైన బాక్సింగ్లో నిబంధనలు పాటించిన విధంగా) నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని వారిని కోరే పద్ధతి ఈ చిన్నపాటి విచారణలో పెద్ద సమస్యగా మారుతుంది. వారి ముందు జడ్జి పూర్తిగా ఒకరి పక్షమే (అంటే పోలీసు వారు ఇచ్చే నివేదిక ఆధారంగా) వహిస్తారు. విచారణలో ప్రత్యర్థుల తరుపు సాక్షులను ప్రశ్నించే (క్రాస్ ఎగ్జామ్), వారి సాక్షాలలో పరస్పర విరుద్ధమైన అంశాలను నిర్ణయించి, వారి స్వంత సాక్షులను పరీక్షించి, తన స్వంత రుజువులను నివేదించే హక్కు ప్రతివాదికి ఉంటుంది, లేదా ఆ వ్యక్తికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు నిజం కాదని వాదించవచ్చు. బెయిలు వాదనల్లో ప్రతివాది అలాంటివి ఏమీ చేయకూడదు. 'పోలీసు వారి నివేదికలో ఉన్న విషయాలన్నీ నిజమే' అనే ఒక 'అవాంఛనీయమైన విశ్వాసం' కలిగి ఉండడం బెయిలు విచారణలోని మొదటి అంశం. అలాంటి విశ్వాసం పై ఆధారపడి ఇరుపక్షాలకు చెందిన వారు వాదించేదేమంటే, ఆ ''వాస్తవాల'' ప్రకారం నేరానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు ఉన్నాయా, లేక కొన్ని అరుదైన కేసుల్లో వాస్తవాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి, లేక పూర్తిగా నమ్మదగనివిగా ఉంటాయి, కాబట్టి బెయిలు దశలో కూడా వాటిపై ఆధారపడే పరిస్థితి లేదు. పోల్చి చూసినప్పుడు, ఇరువర్గాల మధ్య ఒక చర్చను నిర్వహించి, ఒక వర్గం వారు మాట్లాడిన తర్వాత వారిని ఆపి, మరో వర్గంవారు రెండు, మూడు ప్రశ్నలు సంధించడం (ఏమీ మాట్లాడకుండా), ఆ తరువాత తీర్మానం ఆమోదించారని నిర్ణయించడం లాంటిది.
ఇటువంటి పరిస్థితిలో, శిక్షా స్మృతి చురుకుగా, విశ్వసనీయంగా, సమర్థవంతంగా ఉన్నప్పుడు, ఇలాంటి వ్యవస్థ సమర్థించదగినది. ఉదాహరణకు, ఒకవేళ నేర విచారణలను సాధారణంగా ఆరు నెలల లోపు ముగిస్తే, తీవ్రవాదానికి సంబంధించిన కేసుల్లో విచారణకు ముందు ఆరు నెలల నిర్బంధం బాధాకరమైన విషయమని వాదించే అవకాశం ఉంటుంది. కానీ, భారతదేశంలో అలా కాదు. ఒక 'ఉపా' కేసు విచారణకు సంవత్సరాల సమయం, దాదాపు పది సంవత్సరాల పైగా సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో, బెయిలుపై కోర్టు నిర్ణయం వాస్తవానికి, కేసుకు సంబంధించిన నిర్ణయంగా మారుతుంది. విచారణ కొనసాగుతుంది కాబట్టి, బెయిలు నిరాకరణ అంటే, ఆ వ్యక్తి జైలులో ఒక దశాబ్దం లేదా అంతకంటే మించిన కాలం గడపుతాడని అర్థం చేసుకోవాలి. 'ఉపా' చట్టం కింద ఉన్న నేరాల రేటు గణనీయంగా తగ్గింది కాబట్టి, విచారణ (నిరపరాధులనే కారణంగా) ముగుస్తుంది.
కాబట్టి, చిక్కులతో కూడిన బెయిలు విచారణలు చేయడానికి ఎక్కువ సమయం ఎందుకు తీసుకుంటుందో ఇది వివరిస్తుంది. నేరారోపణలు చేసిన ప్రాసిక్యూషన్, ప్రతివాది(డిఫెన్స్) ఇరువురికీ, బెయిల్ విచారణ ఫలితమే, కేసు ఫలితంగా ఉంటుంది అనే విషయం తెలుసు. బెయిలు నిరాకరణ ఫలితమే, నేర పరిశోధన ఫలితం కూడా, అంటే ఒక దశాబ్దం పైగా జైలులో గడపడం. ముందుగా నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీసుల కథనాలను సవాల్ చేయకుండా నోరు మూయించి, పోలీసుల కేసు తప్పు అని రుజువు చేయలేకపోయాడని శిక్షిస్తారు.
'నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ' వర్సెస్ 'జహూర్ అహ్మద్ షా వటోలీ'(2019) తీర్పులో సుప్రీంకోర్టు, పోలీసు కేసును కింది కోర్టులు లోతైన పరిశీలన చేయకుండా అడ్డుకోవడం ద్వారా పరిస్థితిని మరింత అధ్వాన్నంగా తయారుచేసింది. ఇది ఉమర్ ఖలీద్ బెయిలు ఉత్తర్వులవలె హాస్యాస్పదమైన పరిస్థితికి దారి తీస్తుంది. కోర్టు ఉమర్ ఖలీద్కు వ్యతిరేకంగా కొన్ని ఆరోపణలను ఉదహరించింది, వాటిలో కొన్ని వదంతులు ఉన్నాయి. కాబట్టి, విచారణ జరుగుతున్న సమయంలో బెయిల్ మంజూరు అనుమతించడం కుదరదు, కొన్ని నమ్మదగిన విధంగా లేవు కాబట్టి ప్రతివాది సవాళ్ళను కొట్టివేసి బెయిల్ మంజూరు చేయకుండా నిరాకరించారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న న్యాయ వ్యవస్థలో కూడా ప్రాసిక్యూషన్ వారి కోసం, చెప్పింది రాసే స్టెనోగ్రాఫర్లుగా న్యాయస్థానాలు మారాలని 'ఉపా' కోరుకుం టుందని న్యాయవాదులు, న్యాయనిపుణులు తమ అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు.చర్చించిన కారణాలు ఏవైనప్పటికీ ఇక్కడ అన్యాయం జరిగిందనే విషయాన్ని గుర్తించాలి.
అనేక సంవత్సరాలుగా శిక్షా స్మృతిని సంస్కరించాల్సిన అవసరం ఉంది. సమీప భవిష్యత్తులోనైనా కనీసం 'ఉపా' చట్టం మనుషుల జీవితాలను ధ్వంసం చేస్తున్న తీరునైనా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. బెయిల్ నిషేధాలను కొట్టివేసి, బెయిలు విచారణ సమయంలో కఠినమైన పరిశీలన కోసం పోలీసు కేసును అదుపులో ఉంచుకోవడంతో అది ప్రారంభమవ్వాలి. అప్పుడు న్యాయవ్యవస్థకు చిత్తశుద్ధి ఉందా, లేదా అనే విషయం తెలుస్తుంది.
- గౌతం భాటియా
(''ద హిందూ'' సౌజన్యంతో)
(వ్యాసకర్త ఢిల్లీలో న్యాయవాది )
అనువాదం: బోడపట్ల రవీందర్,
9848412451