Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత జాతీయోద్యమం లక్ష్యం కేవలం బ్రిటిష్ వలసపాలన నుండి విముక్తి పొందడానికే పరిమితం కాలేదు. ఆ తర్వాత ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించగల దేశాన్ని నిర్మించడం కూడా ఆ ఉద్యమ లక్ష్యంలో భాగమే. రెండు శతాబ్దాలకు పైగా సాగిన వలస పాలన ఫలితంగా కడు పేదరికంలో కూరుకుపోయిన ప్రజానీకాన్ని ఆ స్థితి నుండి బైటకు తీసుకురాలేకపోతే స్వాతంత్య్ర ఫలాలు చేదుగానే మిగులుతాయి. స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములైన వివిధ స్రవంతుల నాయకత్వం-వామపక్ష నాయకులనుండి నెహ్రూ, అంబేద్కర్, బోస్ వరకూ- అందరూ ఈ విషయంలో ఒక ఉమ్మడి అభివృద్ధి దృక్పథంతో వ్యవహరించారు. దేశంలోని ఉత్పాదక శక్తుల అభివృద్ధి జరగాలంటే అందుకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడం అత్యంత ఆవశ్యకం అని వారంతా గుర్తించారు.
స్వాతంత్య్రానికి పూర్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్లానింగ్ కమిటీ గాని, అనంతరం ఏర్పడిన ప్లానింగ్ కమిషన్ గాని భారత దేశాభివృద్ధికి సంబంధించి ఈ దృక్పథాన్నే అనుసరించాయి. ఆర్థికాభివృద్ధి ప్రణాళికలో, దేశంలోని మౌలిక వసతుల అభివృద్ధి క్రమంలో భాగంగా సిఎస్ఐఆర్ (కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండిస్టియల్ రిసెర్చ్), ఐసిఎఆర్ ( ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రిసెర్చ్) వంటివి ఏర్పడి మన దేశ స్వంత సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడానికి దోహదం చేశాయి. సైన్స్, టెక్నాలజీతో బాటు ఉన్నత విద్యను పెంపొందించే ఐఐటిల వంటి కొత్త సంస్థలు ఏర్పడ్డాయి.
అయితే, మోడీ ప్రభుత్వం రాగానే ఇందుకు పూర్తి వ్యతిరేక దిశలో వ్యవహరించడం మొదలైంది. ప్లానింగ్ కమిషన్ను ఎత్తివేసింది. ఉన్నత విద్యా సంస్థలను అంతకంతకూ ప్రయివేటు రంగానికి అప్పజెప్పడమే గాక, విదేశీ యూనివర్సిటీలకు సైతం అప్పజెప్తోంది.
ఉన్నత స్థాయి విద్యాసంస్థల నిర్వహణను విద్యారంగం పట్ల ఏ అవగాహనా లేనివాళ్ళకి అప్పజెప్పింది. బీజేపీ అనుసరించిన ఈ విధ్వంసక వైఖరికి జెఎన్యుని నాశనం చేసిన తీరు అద్దం పడుతోంది. అయితే, బీజేపీ ప్రభుత్వం కేవలం సామాజిక శాస్త్రాల వరకే తన దాడిని పరిమితం చేసిందనుకుంటే పొరపాటు. లేదా, కేవలం జెఎన్యు వరకే దాని దాడి పరిమితం అనుకున్నా పొరపాటే. వాళ్ళు మొత్తంగా విజ్ఞానం మీదనే తమ దాడిని ఎక్కుపెట్టారు. విద్యార్హతలు కాని, సరైన దృక్పథం గాని లేని వాళ్ళని తెచ్చి అధికార పదవుల్లో కూచోబెట్టారు. వాళ్ళకి విజ్ఞానాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా లేదు. విశ్వవిద్యాలయాలను, విద్యార్ధులను బీజేపీ-ఆరెస్సెస్ సిద్ధాంతం ప్రభావంతో ముంచెత్తడమే లక్ష్యం.
'ఒకే రక్తం-ఒకే జాతి' అనే జాతి సిద్ధాంతం యూరోపియన్ జాతీయవాదానికి ప్రాతిపదిక. ప్రపంచంలో జరిగిన వివిధ జాతీయోద్యమాల అనంతరం ఆయా దేశాల్లో దేశ పునర్నిర్మాణానికి పూనుకున్నప్పుడు ఈ యూరోపియన్ జాతి సిద్ధాంతం ఆ దేశాల్లో ఉపయోగపడలేదు. వివిధ మతాలతో, భాషలతో, తెగలతో కూడిన బహుళ అస్థిత్వాలు ఆ దేశాల్లో కొనసాగుతున్నాయి. తమ పెత్తనాన్ని కొనసాగించడానికి ఈ తేడాలను 'విభజించి పాలించు' విధానంతో వలస పాలకులు ఉపయోగించుకున్నారు. బహుళ అస్థిత్వాలతో ఉన్న ప్రజలను ఐక్యం చేసి ముందుకు నడిపించడం జాతీయోద్యమాలకు ప్రధాన కర్తవ్యం అయింది.
వామపక్ష నాయకులు, ఇతర జాతీయోద్యమ నేతలు దేశ ఆర్థిక వ్యవస్థ స్వతంత్రంగా నిలదొక్కుకోగలిగినప్పుడే స్వాతంత్య్రోద్యమం తన లక్ష్యాన్ని నెరవేర్చగలుగు తుందన్న అవగాహన ఉద్యమం ముందుకు నడవడానికి కీలకమని గ్రహించారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో తొలి మెట్టు వలసాధిపత్యంపై పోరాటం అయింది. ఈ పోరాటం ప్రజలనందరినీ ఐక్యం చేసింది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయ చైతన్యాన్ని రగిల్చింది. లౌకిక ప్రాతిపదికన ప్రజలందరినీ ఐక్యం చేయడం, దేశాన్ని స్వతంత్ర ఆర్థిక అభివృద్ధి పథాన నడిపించడం అనే రెండు అంశాలూ ప్రపంచంలో వివిధ దేశాల్లో సాగిన వలస విముక్తి పోరాటాల దిశను, కార్యాచరణను నిర్దేశించాయి. భారతదేశంలోనూ అదే జరిగింది.
అయితే ఆరెస్సెస్కి బ్రిటిష్ పాలకులు కాదు శత్రువులు. జాతీయోద్యమ నేతలు, లౌకికవాదులు, ముస్లిములు వారి దృష్టిలో శత్రువులు. సావర్కార్, హెగ్డేవార్, గోల్వాల్కర్ వంటి హిందూత్వ సిద్ధాంత ప్రతిపాదకులకు స్ఫూర్తి నాజీ జర్మనీ, లేదా ఫాసిస్టు ఇటలీ. జాతులను విడగొట్టి, ఒకరికొకరిని శత్రువులుగా నిలిపే తెగల జాతీయవాదం వారి జాతి సిద్ధాంతానికి పునాది. జాతీయోద్యమం అన్ని జాతులనూ కలుపుకునిపోయే సిద్ధాంతంతో నడిచింది. అందుకే ఆ దృక్పథాన్ని ఆరెస్సెస్ వ్యతిరేకించింది. వలస పీడన నుండి విముక్తి పొందాలన్న కోరిక నుండి రూపొందే జాతీయ దృక్పథాన్ని వారు అంగీకరించలేదు. దానికి భిన్నంగా ''తమ సనాతన జాతిని తిరిగి పునరుద్ధరించడం'' భారత జాతీయతకు ప్రాతిపదిక కావాలన్నది వారి అభిలాష. సావర్కార్ రూపొందించిన దృక్పధం ఇదే. ఆర్య జాతి, హిందూ సంస్కృతి, సంస్కృత భాష ప్రాతిపదికన హిందూత్వ జాతీయత ఉండాలన్నది ఆ దృక్పథం సారాంశం. హిందూ మతం వేరు, హిందూత్వ ప్రాతిపదికన ఏర్పడే జాతి వేరు అని సావర్కర్ స్వయంగా వివరించాడు. సావర్కార్ రూపొందించిన ఈ భావననే ఆరెస్సెస్ నాయకులు స్వీకరించారు. ''దేశం యొక్క భౌగోళిక స్వరూపం, జాతి, మతం, సంస్కృతి, భాష అనే ఐదు అంశాల ప్రాతిపదికన జాతీయతా భావం రూపొందుతుంది'' అని గోల్వాల్కర్ తన గ్రంథం (మనం, మన జాతీయత నిర్వచనం)లో పేర్కొన్నాడు.
భారత జాతీయత గురించి సావర్కార్ ప్రతిపాదించిన భావన అతని స్వంతం కాదు. అది జర్మన్ జాతీయతావాద సిద్ధాంతం నుండి ఎరువు తెచ్చినది. 19వ శతాబ్దం చివరిదశలో, 20 శతాబ్దపు తొలి దశలో ''పవిత్ర రక్తం, పవిత్ర భూమి'' పేరుతో తలెత్తిన జర్మన్ జాతీయ వాదాన్ని నాజీలు తలకెత్తుకున్నారు. అందుకే సావర్కార్ రచనలన్నింటిలోనూ అంతర్లీనంగా ఈ రక్తం, జాతి ప్రస్తావనలు వస్తూనే ఉంటాయి.
జాతి దురహంకారంతో కూడిన యూరోపియన్ జాతీయవాదం దేశాల సరిహద్దుల విస్తరణకై యుద్ధాలు జరగడానికి, ఇతర దేశాలను ఆక్రమించి వలసలుగా మార్చడానికి దారి తీసింది. స్పెయిన్, పోర్చుగల్ దేశాలు అమెరికా, ఆఫ్రికా ఖండాలలో పలు దేశాలను ఆక్రమించడానికి, అక్కడి ప్రజలను తమ కట్టుబానిసలుగా మార్చడానికి దోహదం చేసింది. ఈ దుర్మార్గాన్ని 'డాక్ట్రిన్ ఆఫ్ డిస్కవరీ' పేరుతో సమర్ధించుకున్నారు. 1493లో పోప్ అలెగ్జాండర్-6 ప్రకటించిన సిద్ధాంతం ఇది. క్రైస్తవులు తప్ప తక్కినవారెవరూ పూర్తిస్థాయి మానవులు కారని, కనుక వారి భూముల్ని స్వాధీనం చేసుకోవడం కాని, వారిని బానిసలుగా మార్చడం కాని, అవసరమైతే వారిని చంపడం కాని ఎంతమాత్రమూ పాపం కాదని ఆ సిద్ధాంతం చెపుతుంది. క్రైస్తవుల 'ఆధిక్యత'ను పూర్తిగా ప్రదర్శించడానికి యూరోపియన్ వలసవాదులు తక్కిన ప్రాంతాలలోని క్రైస్తవేతర ప్రజల్ని లొంగదీసుకుని ఆ తర్వాత వారిని సంపూర్ణ మానవులుగా క్రైస్తవీకరించి సంస్కరించాలని ప్రయత్నించారు. ఆ క్రమంలో భాగంగానే నల్లజాతి ప్రజల్ని బానిసలుగా చేశారు. మానవ హననానికి పాల్పడ్డారు. సంపదలను కొల్లగొట్టారు, ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఈ క్రూరమైన సామ్రాజ్యవాద విస్తరణకు మతం, శాస్త్రం ముసుగులు వేశారు.
అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో సాగించిన ఈ విచ్చలవిడి దోపిడీ ఫలితంగా పశ్చిమ దేశాలు సంపన్నవంతంగా తయారైనాయి. తమ ఆక్రమణలోని వలసలను కొల్లగొట్టడం వలనే ఈ సంపద పోగుబడింది. కేవలం ఒక్క భారత దేశాన్ని కొల్లగొట్టినందువల్ల బ్రిటిష్ పాలకులు 44లక్షల కోట్ల డాలర్ల సంపదను పోగేసుకోగలిగారని ప్రొఫెసర్ ఉత్సా పట్నాయిక్ తన పరిశోధన ద్వారా వెల్లడించారు. 18వ శతాబ్దం వరకూ ప్రపంచ సంపదలో దాదాపు 50శాతం కేవలం ఇండియా, చైనా దేశాల నుండే వచ్చేది. వలసదోపిడీ కారణంగా అది ఆ తర్వాత 200ఏండ్లలో 10శాతానికి పడిపోయింది. ఆఫ్రికా నుండి పట్టుకొచ్చిన బానిసలు, ఇండియా నుండి కొట్టుకొచ్చిన సంపదలు ఐరోపాలోని 'పారిశ్రామిక విప్లవానికి' పెట్టుబడిగా ఉపకరించాయి. ''తల నుండి కాలి దాకా సకల రంధ్రాల నుండీ రక్తాన్ని, ధూళిని స్రవిస్తూ పెట్టుబడి వస్తుంది'' అని మార్క్స్ అభివర్ణించారు.
దేశ నిర్మాణం
కేవలం విదేశీ పాలనను తుదముట్టించడం మాత్రమే చాలదని, దేశ ప్రజానీకానికి మెరుగైన స్థితిగతుల్ని కల్పించడమే నిజమైన స్వాతంత్య్రానికి పరమావధి అని జాతీయోద్యమం భావించింది. ఈ భారతదేశం దేశ ప్రజలందరికీ చెందాలి అన్న లక్ష్యాన్ని, మానవ వనరులతో సహా దేశంలోని వనరులను పెంపొందించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకుని వ్యవహరించింది.
938లో బోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్లానింగ్ కమిటీని ఏర్పరిచాడు. దానికి నాయకత్వం వహించాల్సిందిగా ఆయన నెహ్రూను కోరాడు. అక్టోబర్ విప్లవానంతరం సోవియట్ రష్యా చేస్తున్న ప్రయోగాల పట్ల ఆ ఉభయులూ ఆకర్షితులయ్యారు. స్వతంత్రం వచ్చాక ఏర్పడిన ప్లానింగ్ కమిషన్ కాంగ్రెస్ ప్లానింగ్ కమిటీ దృక్పథాన్నే ఆచరణలో ముందుకు తీసుకుపోడానికి ప్రయత్నించింది. బ్రిటిష్ పాలకులు మనకు మిగిల్చి వెళ్ళిన పేదరికాన్ని, అసమానతలను తొలగించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయోద్యమ నేతలు ప్రభుత్వ రంగాన్ని ఒక ఆవశ్యకతగా పరిగణించారు. పారిశ్రామికంగా, వ్యవసాయికంగా దేశాన్ని పునరుజ్జీవింపజేయడానికి మాత్రమే గాక, అభివృద్ధి ఫలాలను అన్ని తరగతుల ప్రజలకూ అందేలా పునఃపంపిణీ చేయాలంటే అందుకు ప్రభుత్వ రంగం తప్పనిసరిగా ఉండాలని వారు భావించారు.
స్వాతంత్య్రానంతరం దేశ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని పెంపొందిచుకోవడం భారత ప్రభుత్వానికి ఒక ప్రాధాన్యతగా మారింది. అందుకే సిఎస్ఐఆర్ ప్రయోగశాలలను, ఐదు ఐఐటిలను, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ)ని, అనేక శాస్త్ర పరిశోధనా కేంద్రాలను నెలకొల్పింది. భారతీయ పెట్టుబడిదారీ వర్గం రూపొందించిన బాంబే ప్లాన్ సైతం దేశాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పన జరగాలంటే అది కేవలం భారత ప్రభుత్వం పూనుకుంటేనే సాధ్యపడుతుందని అంగీకరించింది. దేశ సత్వరాభివృద్ధికి ఇది కీలకం అని అందరూ గుర్తించారు గనుకనే పంచవర్ష ప్రణాళికలు వరసగా ఒకదాని తర్వాత ఒకటిగా ఈ దృక్పథాన్నే అనుసరించాయి.
(ముగింపు తదుపరి సంచికలో)
- ప్రబీర్ పురకాయస్థ
(స్వేచ్ఛానుసరణ)