Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూస్ క్లిక్లో ప్రచురితమైన ఒక వ్యాసంలో ప్రముఖ జర్నలిస్టు వి.శ్రీధర్ ఎల్ఐసి షేర్ ధర నిర్ణయం ఒక పెద్ద భారీ కుంభకోణమని అభివర్ణించారు. ఎల్ఐసి యొక్క నిర్ణీత (ఎంబెడెడ్) విలువ రూ.5.39 లక్షల కోట్లని మిల్లిమాన్ అనే అమెరికన్ ఆక్చువేరియల్ కంపెనీ నిర్ణయించింది. ఇదే కంపెనీ, గతంలో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసిన ఇతర ప్రయివేట్ జీవిత బీమా కంపెనీల విలువను కూడా మదింపు చేసింది. అప్పుడు ఈ ప్రయివేటు కంపెనీల ఆఫర్ ప్రైస్ను ఎలా లెక్క కట్టారు?
నిర్ణీత విలువ (ఎంబెడెడ్ వాల్యూ)ను 2.5 నుండి 4.05 వరకు ఫ్యాక్టర్తో గుణించి లెక్క కట్టారు. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ను 4.05 రెట్లు, ఎస్బిఐ లైఫ్ను 3.1 రెట్లు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ను 2.5రెట్లు గుణించి లెక్కగట్టారు.
ఒక నెల క్రిందట యల్ఐసి విలువను కూడా అదే పద్ధతిలో నిర్ణయిస్తారని కధనాలు వచ్చాయి. అలా చేసివుంటే, యల్ఐసి విలువ రూ.13.5 లక్షల కోట్ల నుండి రూ.16.2 లక్షల కోట్ల వరకు నిర్ణయించేవాళ్లు. కానీ అలా జరగకుండా దాన్ని కేవలం 1.1తో గుణించి ఎల్ఐసి విలువను రూ.ఆరు లక్షల కోట్లుగా నిర్ణయించారు. దీనితో, యల్ఐసిలో షేర్ల అమ్మకం ద్వారా రూ.47250 నుండి రూ.56700 కోట్ల రూపాయలు రావాల్సింది బదులు, సుమారు రూ.21,000 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అసలు మిల్లిమాన్ సంస్థ ఎల్ఐసి కున్న లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ విలువను పరిగణనలోకి తీసుకోకుండానే, ఎంబెడెడ్ విలువ నిర్ధారించిందని, ఇదంతా భారీ కుంభకోణం కాక మరేమిటని శ్రీధర్ ఆరోపించారు.
పాలసీదారులకు మిగులు (బోనస్) పంపిణీ విధానాన్ని 95:5 నుండి 90:10కు మార్చారు. ఈ విధానాన్ని మార్చే చట్టబద్ధ సవరణలు అమలులోకి రాకముందు విక్రయించిన పాలసీలకు సర్ ప్లస్లో అధిక వాటాలను ఆయా పాలసీదారులకు అందించాల్సిన ఒప్పందపర బాధ్యత (జశీఅ్తీaష్బaశ్రీ శీbశ్రీఱస్త్రa్ఱశీఅ) ప్రభుత్వంపై లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే నాన్ పార్టీసిపేటివ్(బోనస్ వర్తించని)పాలసీల నుండి సర్పస్ను పాలసీదారులకు గాక, షేర్ హౌల్డర్లకు వర్తించేలా మార్చడం ఎవరి ప్రయోజనాల కోసం? 31 మార్చి 2021 నాటికి 73.25శాతంగా ఉన్న పార్టిసిపేటింగ్ పాలసీల శాతం, 30 సెప్టెంబర్ 2021 కల్లా 61.67శాతానికి పడిపోయింది. ఇదే కాలానికి నాన్ పార్టిసిపేటింగ్ పాలసీలు 24.82శాతం నుండి 37.03శాతానికి పెరిగాయి. దీనిని విశ్లేషిస్తే భవిష్యత్తులో పాలసీదారుల కంటే షేర్ హౌల్డర్లకు అధిక లాభాలు చేకూర్చే విధంగా వ్యాపార సేకరణ విధానాలు అమలు జరిగే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది.
ఐపీఓ ప్రవేశపెట్టిన తర్వాత గ్రామీణ ప్రాంతాలను, బలహీన వర్గాలను ఎల్ఐసి పట్టించుకోదేమో అన్న ఆందోళన ఏఐఐఈఎఫ్కు మొదటినుంచీ ఉంది. గ్రామీణ ప్రాంతాల నుండి ఎల్ఐసికు 48.22శాతం ఏజెంట్లు ఉండగా, వారి ద్వారా ఎల్ఐసికు మొత్తం పాలసీలలో 21.46శాతం, ప్రీమియంలో 15.6శాతం వ్యాపారం వస్తుంది. గ్రామీణ ప్రాంతాలను, బలహీన వర్గాలను విస్మరిస్తే తలెత్తే ప్రతికూల ప్రభావం ఈ గణాంకాల ద్వారా అర్థమవుతుంది. ఎల్ఐసి వ్యాపారాన్ని గమనిస్తే 28.89శాతం పాలసీదారులు సాలీనా లక్ష కంటే తక్కువ సంపాదన గల వారు. 43శాతం పాలసీదారుల వార్షిక ఆదాయం రూ.లక్ష నుండి రెండు లక్షల మధ్యలో ఉన్నది.
2021-22ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసి పాలసీల సగటు ఏడాది ప్రీమియం రూ.25,000 కాగా, ప్రయివేటు కంపెనీలలో ఇది రూ.95,000గా ఉంది. దీనిని విశ్లేషించినప్పుడు ప్రయివేటు బీమా కంపెనీలు పెద్ద పాలసీలపై దృష్టి పెడితే, ఎల్ఐసి సంస్థ ఒక్కటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బీమా రక్షణ కలిగిస్తుందని స్పష్టమవుతుంది. పెద్ద ప్రీమియం పాలసీలు, అర్బన్ వ్యాపారం బీమా సంస్థలకు లాభసాటిగా ఉంటుందనేది నిస్సందేహం. కాబట్టి ఎల్ఐసిలో వాటాలు కొన్న పెట్టుబడిదారులకు అధిక లాభాలను తెచ్చి పెట్టే వ్యాపారం వైపు సంస్థ సహజంగానే మొగ్గు చుపాల్సివస్తుంది. ఇది భారతదేశ గ్రామీణ పేద, బలహీన వర్గాల పట్ల తిరోగమన చర్యగానే భావించాలి.
ఎల్.ఐ.సిలో వాటాలు అమ్మకం చట్టపరమైన, నైతిక ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయీకరణ చేసింది. ఎల్.ఐ.సి సంస్థను నెలకొల్పింది పాలసీదారుల పొదుపును పరి రక్షించడం కోసమే. ఇందులో ప్రభుత్వం ధర్మకర్తగా తన పాత్రను పోషించింది. 1956లో ఎల్.ఐ.సిలో ప్రభుత్వం పెట్టుబడి పెట్టిన ప్రారంభ మూలధనం రూ.5కోట్లు. అప్పటి నుండి నేటి వరకు ఎల్.ఐ.సి.లలో వ్యాపార విస్తరణ, అభివృద్ధి, జోనల్, డివిజనల్, బ్రాంచి కార్యాలయాల ఏర్పాటు అంతా పాలసీదారుల సొమ్ముతోనే జరిగింది. ఒక్కపైసా కూడా ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించలేదు. కాబట్టి ఎల్.ఐ.సి సంస్థకు తను యజమానిని అని ప్రభుత్వం చెప్పుకోవడం అనైతికం. ఎల్ఐసి వేసిన ప్రతి ముందడుగు, కేవలం పాలసీదారుల నుంచి సేకరించిన నిధుల వల్లనే సాధ్యమైంది. కాబట్టి, ఈ సంస్థకు నిజమైన యజమానులు పాలసీదారులే.
కేవలం తన బడ్జెట్ లోటును భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం ఎల్ఐసి ఐపిఓను తీసుకొస్తోందన్న మాట కేవలం పైపై విశ్లేషణ మాత్రమే. విషయం అంతకంటే పెద్దది! పేదల కష్టం నుండి ధనికుల లోగిళ్ళలోకి సంపదను దారి మళ్ళించే ఒక విధానంలో భాగంగానే ప్రభుత్వం ఈ పని చేస్తున్నది. అందుకు ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ప్రయివేటీకరణ. ఐపిఓ అన్నది ఎల్ఐసి సంస్థ సృష్టించిన సంపదని సంపన్నుల చేతుల్లోకీ, లాభాల వేటలో ఉన్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల జేబుల్లోకి తరలించడం ప్రధానమైన ఉద్దేశ్యం.
ఎటొచ్చీ పాలసీదారులను శాంతింప చేసేందుకు మొత్తం పదిశాతం షేర్లని వారికి తగ్గింపు ధరతో ఇస్తామని ప్రకటించారు. దేశంలో 20కోట్ల మంది వ్యక్తిగత ఎల్.ఐ.సి పాలసీలు కలిగిన పాలసీదారులు ఉన్నారు. కానీ వాళ్ల కోసం కేటాయించిన షేర్లు 2.21కోట్లు మాత్రమే. ఇది కోట్లాది మంది పాలసీదారులను మభ్య పెట్టడం తప్ప మరొకటి కాదు.
ఎల్ఐసి ఐపిఓ అన్నది సంస్థను ప్రయివేటీకరించే దిశగా తొలిమెట్టు అన్నది ఏఐఐఈఏ అభిప్రాయం. అందుకే ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఏఐఐఈఏ నాయకత్వంలో జరిగిన పోరాటం ఎల్ఐసి సంస్థను ప్రయివేటుపరం కాకుండా 28ఏండ్ల పాటు నిలువరించింది. ప్రభుత్వాల విధానాన్ని ఒక ట్రేడ్ యూనియన్ ఇంత సుదీర్ఘకాలం ఆపిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడాలేదు. ప్రభుత్వం ఒడిగట్టిన ఈ ప్రయివేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా, రాబోయే రోజుల్లో కూడా ఏఐఐఈఏ ఆధ్వర్యంలో ఉద్యోగులు తమ పోరాటాన్ని కొనసాగించాలన్న ధృడ నిశ్చయంతో ఉన్నారు. ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్, ప్రొఫెసర్ జయతీ ఘోష్ వంటి మేధావులతో ఉన్న పీపుల్స్ కమిషన్, ఎల్ఐసి ఐ.పి.ఓ ప్రక్రియలో పారదర్శకత లేదని, దాన్ని నిలుపుదల చేయాలని ప్రధానమంత్రికి, ఆర్థికమంత్రికి లేఖలు రాసింది. కాని ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు.
భారతదేశం ఆత్మ నిర్భరత సాధించాలంటే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో ప్రముఖమైన కీలకపాత్ర పోషించాలి. అయితే కేంద్రం మొండిగా ప్రయివేటీకరణ విధానాలను అమలు చేస్తుండటంతో ఈ దివాళాకోరు విధానాలను వ్యతిరేకించాలని, 2022 మార్చి 28-29న దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో ఎల్ఐసి ఉద్యోగులు పాల్గొని ఐపిఓ దుష్ప్రభావాలపై దేశవ్యాప్తంగా బలంగా చర్చకు పెట్టగలిగారు.
తాజాగా ఎల్ఐసి ఐపిఓ సబ్ స్క్రిప్షన్ ప్రారంభమయ్యే మే 4న వాక్ ఔట్ సమ్మెకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ బీమారంగాన్ని పరిరక్షించుకోవడం కోసం జరుగుతున్న ఈ సమ్మెకు పాలసీదారులు, దేశభక్తులైన ప్రజానీకం తప్పక మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం.
- పి. సతీష్
సెల్: 9441797900