Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిలుపై పన్నులు తగ్గించినప్పటికీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గించలేదని, ఇప్పటికైనా తగ్గించాలని ప్రధాని నరేంద్రమోడీ బుధవారంనాడు ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో కరోనా పరిస్థితి గురించి సమీక్ష సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఈ ప్రస్తావన చేశారు. దేశ ప్రయోజనాల కోసం పన్ను తగ్గించా లన్నారు. ఇలాంటి సుభాషితాలు చెప్పటానికి మోడీకి సర్వహక్కులూ ఉన్నాయి. నీతులెందుకు గురువా అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా అన్నది తెలిసిందే కదా..! జనంలో ప్రతిపక్ష పార్టీలపై వ్యతిరేకతను రేకెత్తించేందుకు ఒక రాజకీయ నేతగా మోడీ తన చాణక్యాన్ని ప్రదర్శించారు. ఎనిమిది సంవత్సరాలుగా ఏదో ఒక సాకుతో వీరబాదుడు కొనసాగిస్తున్న ప్రధాని రాష్ట్రాల మీద ఎదురుదాడికి దిగారు.
ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న స్థితిలో అవి మరింతగా పెరిగేంతగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచినప్పుడు గుర్తులేని దేశ ప్రజలు ఇప్పుడు గుర్తుకు రావటం గమనించాల్సిన అంశం. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నెల నెలా ప్రభుత్వం విడుదల చేసే అశాస్త్రీయ గణాంకాలు కూడా పెరుగుదలను చూపు తున్నాయి. వాటిని కొంత మేరకైనా అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చమురుపై పన్నులను తగ్గించాలని ఆర్థికవేత్తలు చెబుతున్న తరుణంలో నరేంద్రమోడీ దాన్ని ప్రస్తావించకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మీద పడ్డారు. ఏప్రిల్ 27వ తేదీ ఎకనమిక్ టైమ్స్ పత్రిక సమాచారం ప్రకారం ఆ రోజు బీజేపీ ఏలుబడిలోని భోపాల్లో లీటరు పెట్రోలు రూ.118.14, పాట్నాలో రూ.116.23, బెంగలూరులో రూ.111.09, లక్నోలో రూ.105.25 ఉంది. ఒకే పార్టీ పాలిత ప్రాంతాల్లో ఇంత తేడా ఎందుకున్నట్లు? ముందు వాటిని సరి చేస్తారా లేదా? గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డాట్కామ్ సమాచారం ప్రకారం పక్కనే ఉన్న రావణరాజ్యం శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతున్నది. అక్కడ ఏప్రిల్ 25న పెట్రోలు రేటు రూ.373, అదే మన కరెన్సీలోకి మార్చితే రూ.80.39. సీతాదేవి పుట్టిన నేపాల్లో రూ.100 ఉంది. మన రామరాజ్యంలో రూ.105 నుంచి 120 వరకు ఉంది. ఇక పాకిస్తాన్లో రూ.61.41, బంగ్లాదేశ్లో రూ.79.09 ఉందంటే ''ప్రజాప్రయోజనం'' గురించి మాట్లాడేవారికి ఆగ్రహం రావటం సహజం.
పన్నులు అసలే వద్దని ఎవరూ అనరు. గత ఎనిమిది సంవత్సరాల్లో కార్పొరేట్లకు పన్ను తగ్గింపు, రాయితీలు పెంపు. సామాన్యులకు సబ్సిడీల కోత-పన్నుల వాత తెలిసిందే. కాంగ్రెస్ ఏలుబడిలో చమురు సంస్ధలకు పెట్టిన బకాయిలను తీర్చేందుకు తాము పన్ను మొత్తాన్ని పెంచవలసి వచ్చిందని చెప్పారు. నిజం ఏమిటి? ప్రభుత్వాలు బాండ్లను జారీ చేయటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. వినియోగదారు లకు ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాలను చెల్లించకుండా చమురు కంపెనీలకు ప్రభుత్వం ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వటాన్నే బాండ్లు అంటున్నారు. వడ్డీ కూడా చెల్లించాలి. ఈ మొత్తాలను పది నుంచి 20ఏండ్ల వ్యవధిలో చెల్లించే అవకాశం ఉంది. దాని వలన చమురు కంపెనీలకు నష్టం ఉండదు, ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది. ఈ చమురు బాండ్లను వాజ్పేయి సర్కార్ కూడా జారీ చేసింది? జనానికి ఇచ్చిన దానికి ఏడుపెందుకు?
2002-03 సంవత్సర బడ్జెట్ ప్రసంగంలో నాడు వాజ్పారు సర్కార్ ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత సిన్హా ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేయనున్నదని చెప్పారు. 2014-15 సంవత్సర బడ్జెట్ పత్రాలలో పేర్కొన్నదాని ప్రకారం 2013-14 సంవత్సరం నాటికి చెల్లించాల్సిన బాండ్ల విలువ మొత్తం రూ.1,34,423 కోట్లు. 2018లో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ''కాంగ్రెస్ హయాంలో కొనుగోలు చేసిన రూ.1.44లక్షల కోట్ల చమురు బాండ్లు మాకు వారసత్వంగా వచ్చాయి. ఈ మొత్తమే కాదు, వీటికి గాను 70వేల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాం. చమురు ధరలు ఎక్కువగా ఉండటానికి చెల్లించాల్సిన చమురు బాండ్లు దోహదం చేశాయి'' అని చెప్పుకున్నారు. వడ్డీతో సహా ఈ మొత్తం వినియోగదారులకు ఇచ్చిన రాయితీ తప్ప మరొకటి కాదు. జనానికి ఇచ్చిన ఈ మొత్తం గురించి బీజేపీ మంత్రి చెప్పిన తీరు జనం నుంచి వసూలు చేసే పన్ను భారాన్ని సమర్థించుకొనేందుకు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు. ఈ మొత్తాన్ని చెల్లించేశాం అని చెప్పటం పెద్ద అబద్దం. తొలుత కాంగ్రెస్ అప్పులను తీర్చటం కోసమే పన్నులు పెంచామన్నారు. తరువాత బాణీ మార్చి సరిహద్దులో చైనాతో వివాదం కారణంగా తలెత్తిన ఖర్చు జనం గాక ఎవరు భరించాలి? అందుకే పన్నులను కొనసాగించక తప్పదు అని వాదించారు. ఇప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నట్లు అంటే అభివృద్ధి పనులకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే వారని చెప్పాల్సి వస్తోంది. ఇప్పటి వరకు చెల్లించింది పోగా 2023 నవంబరు, డిసెంబరు మాసాల్లో మరో 26,150కోట్లు, 2024 ఫిబ్రవరి- డిసెంబరు మాసాల మధ్య 37,306.33 కోట్లు, 2025లో 20,553.84 కోట్లు, చివరిగా 2026లో 36,913 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఇక ఈ బాండ్ల పేరుతో పెంచిన పన్నులతో కేంద్రానికి వచ్చిన రాబడి ఎలా ఉందో చూడండి. 2014-15నుంచి 2021-22 వరకు కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగం నుంచి వచ్చిన డివిడెండ్, ఆదాయపన్ను మొత్తం రూ.4,07,190 కోట్లు. ఇవిగాక కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగం నుంచి వచ్చిన ఇతర పన్ను ఆదాయం రూ.21,82,198 కోట్లు, రెండింటినీ కలిపితే రూ.25,89,388 కోట్లు? కాంగ్రెస్ ఏలుబడిలో జారీ చేసిన బాండ్ల మొత్తం ఎంత? అ పేరుతో జనాన్ని బాదింది ఎంత? గుండెలు తీసే బంట్లకు తప్ప ఇది మరొకరికి సాధ్యమా?
ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఉంది. 2014-15లో కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగంలో వచ్చిన పన్ను ఆదాయం రూ.1,26,025 కోట్లు కాగా 2020-21కి అది రూ.4,19,884 కోట్లకు చేరింది. ఖరారు కాని వివరాల ప్రకారం 2021-22లో అది రూ.3,10,155 కోట్లు. దీనికి కేంద్రం తగ్గించిన సెస్ కారణం కావచ్చు. ప్రధాని రాష్ట్రాలను పన్ను తగ్గించాలని కోరారు. ఇక్కడ రాష్ట్రాలు రాష్ట్రాలే, బీజేపీవా, ఇతర పార్టీలవా అని కాదు. కేంద్రం తగ్గించిన స్వల్ప మొత్తాల గురించి చెబుతున్నది తప్ప పెంచిన భారాన్ని తెలివిగా తెరవెనక్కు నెట్టాలని చూస్తున్నది. ఇదే కాలంలో రాష్ట్రాలన్నింటికి చమురు మీద వచ్చిన వాట్ మొత్తం రూ.13,70,295 కోట్లు, అంటే కేంద్రానికి వస్తున్నదానిలో సగం. 2014-15లో రాష్ట్రాలకు చమురు రంగంలో వచ్చిన పన్ను ఆదాయం రూ.1,60,526 కోట్లు కాగా కేంద్రానికి వచ్చింది రూ.1,26,025 కోట్లు మాత్రమే. 2020-21కి రాష్ట్రాలకు రూ.2,17, 221 కోట్లకు పెరగ్గా అదే కేంద్రానికి రూ.4,19,884 కోట్లకు చేరింది. ఇవన్నీ ప్రతిపక్షాలు చెప్పిన అంకెలు కాదు, కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ సెల్(పిపిఏసి) విడుదల చేసినవే. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు మోడీ సర్కారు పెట్టిన టోపీ ఏమిటంటే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన పన్ను కాకుండా ఇవ్వనవసరం లేని సెస్సులను పెంచి అన్యాయం చేశారు. బీజేపీ పాలిత నేతలు నోరు మూసుకున్నారు. ఏప్రిల్ 27 నాటి సీఎంల సమావేశంలో ప్రధాని మోడీ పన్ను తగ్గించిన తమ పార్టీ పాలిత కర్నాటకకు ఐదువేల కోట్లు, గుజరాత్కు 3,500-4,000 కోట్ల మేరకు ఆదాయం తగ్గిందని చెప్పారు. బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలు తగ్గించకపోవటం వలన ప్రజలకు అన్యాయం, ఇతర రాష్ట్రాలకు హాని జరుగుతున్నదని అన్నారు. అన్ని రాష్ట్రాలకు సెస్లో వాటా ఎగవేసి కేంద్రం కలిగించిన నష్టం గురించి కూడా చెబితే నిజాయితీగా ఉండేది. కానీ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మీద దాడి ప్రారంభించి అసలు అంశాన్ని ప్రధాని తెలివిగా మరుగుపరచారు.
- ఎం. కోటేశ్వరరావు
సెల్:8331013288