Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేశ్ : మీరు పార్టీ జాతీయ మహాసభ ప్రారంభ, ముగింపు ప్రసంగాల్లో పెరుగుతున్న ప్రజల ఆర్థిక ఇబ్బందులు (ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభం) పెరుగుతున్న నిరుద్యోగం, హిందూత్వ మతతత్వ విభజనలు, బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంవత్సరంకాలం పాటు సాగిన రైతు నిరసనలతో పాటు ప్రజా ఉద్యమాల గురించి నొక్కి చెప్పారు. మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మీరు వీటి పరిష్కారానికి ఏమి చేయబోతున్నారు?
ఏచూరి : సీపీఐ(ఎం) ఈ సమస్యలపై స్థిరంగా పనిచేస్తూ వస్తుంది. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంవత్సరం పాటు సాగిన రైతుల ఆందోళనలను, గడచిన దశాబ్ద కాలంలో వ్యవసాయ రంగ సంక్షోభానికి వ్యతిరేకంగా సాగిన అనేక పోరాటాలకు పరాకాష్టగా చెప్పవచ్చు. హైదరాబాద్ జాతీయ మహాసభల్లో వ్యవసాయ రంగానికి చెందిన పోరాటాల గురించి ప్రత్యేకంగా చర్చించాం. 2018లో అఖిల భారత కిసాన్సభ నేతృత్వంలో 'భూమి అధికార్ ఆందోళన్'లో 165 సంఘాలు ఐక్యంగా పనిచేసిన తీరును మహాసభ వివరించింది. నాలుగేండ్ల కాలంలో ఈ రైతాంగ పోరాటాలు, రైతు సంఘాలను, క్షేత్రస్థాయి ఉద్యమాలను, వామపక్ష పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలను బలోపేతం చేసి, రైతాంగ ఐక్య ఉద్యమాలను తీవ్రతరం చేశాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంవత్సర కాలం సాగిన రైతుల ఆందోళన, పోరాటాల్లో అది ప్రతిబింబించింది.
పెరుగుతున్న నిరుద్యోగ సంక్షోభం, భారతదేశ జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. జనాభా పరంగా అధిక సంఖ్యాకులుగా ఉన్న యువతను మోడీ ప్రభుత్వం, బీజేపీ నమ్మించి మోసం చేశాయి. ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. వారి నమ్మక ద్రోహం పట్ల మొత్తం యువత ఆగ్రహావేశాలు దేశంలో అనేకసార్లు రుజువయ్యాయి. అనేక సందర్భాల్లో ఏ సంస్థల ప్రమేయం లేకుండా, అప్రయత్నంగానే ఆ ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాలతో పాటు నిరుద్యోగ సమస్య, సంక్షోభాల గురించి కూడా జాతీయ మహాసభ చర్చించింది.
మనకు తెలిసిన విధంగా, కరోనా మహమ్మారి ఉపాధి అవకాశాలను లేకుండా చేసి, ఉన్న ఉద్యోగాలను భారీగా తగ్గించి, నిరుద్యోగ సమస్య తీవ్రతను పెంచింది. కష్టాలు, బాధలను అనుభవిస్తున్న ప్రజలకు ఉపశమనం కలిగించకుండా, బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ ఉత్పత్తులపై నిత్యం ఆర్థిక భారాలను పెంచుతూ, ద్రవ్యోల్బణాన్ని పెంచింది. నిరుద్యోగం, పేదరికం, ఆకలి సూచికలలో పెరుగుదలలు ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నవి. కానీ మోడీ ప్రభుత్వం ఈ సమస్యల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా, నిర్లక్ష్యం చేస్తున్నది. సీపీఐ(ఎం) జాతీయ మహాసభ, ఈ సమస్యలపై విశాల ప్రాతిపదికన భావసారూప్యత గల సంస్థలు, పార్టీలతో కలిసి పనిచేెయాలని తీర్మానం చేసింది. ఇంకా రైతుల సమస్యలతో పాటు మోడీ ప్రభుత్వం మోసపూరితంగా నెరవేర్చని వాగ్దానాల అమలు కోసం పోరాటాలను ఉధృతం చేయాలని నిర్ణయించాం.
వెంకటేశ్ : అనేక దశాబ్దాలుగా, సీపీఐ(ఎం)తో పాటు వామపక్ష పార్టీల నాయకులు, ఎర్రజెండా ఆధ్వర్యంలో అనేక ప్రజా పోరాటాలు, ఆందోళనలు జరిగాయంటున్నారు కానీ, అదే ప్రజా పోరాటాలలో పాల్గొన్న వారు పచ్చ జెండా లేదా కాషాయ జెండాకు ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందనే విషయం నిజం కాదా? రైతుల ఆందోళనా పోరాటాల్లో ఎంతో చైతన్యంతో కిసాన్సభ పాల్గొన్నప్పటికీ, గత ఎన్నికల్లో వామపక్షాలు రాజకీయంగా లబ్దిపొందలేదు కదా!
ఏచూరి : సీపీఐ(ఎం) చేపట్టిన విప్లవ కార్యాచరణ విజయవంతం అవడానికి దగ్గర మార్గాలేవీ లేవని పార్టీకి తెలుసు. ప్రజల్లో హిందూత్వ గుర్తింపునకు సంబంధించిన కథనాలను సృష్టించడంలో ఆరెస్సెస్, బీజెపీలు విజయం సాధించాయి. హింస, ద్వేషాల ద్వారా పదునెక్కుతున్న మతతత్వ ధృవీకరణలు భారతీయ సమాజాన్ని విభజిస్తున్నాయి. ఈ పదునెక్కిన మతతత్వ ధృవీకరణే రాజకీయంగా, ఎన్నికల్లో ఆరెస్సెస్, బీజెపీలకు లబ్ది చేకూర్చే ముఖ్యమైన ఆయుధం. వాస్తవానికి ప్రజల ముఖ్యమైన సమస్యలు, ఆర్థిక సంక్షోభాలపై ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తూనే, మతతత్వ విభజనకు వ్యతిరేకంగా కూడా పోరాడుతున్నాం కానీ, ఆరెస్సెస్ నాయకత్వంలోని సంఫ్ుపరివార్ ప్రచార యంత్రాంగం, దేశంలోని భిన్న ప్రాంతాల్లో ప్రజలను విభజించే భిన్నమైన సమస్యలకు ఒక క్రమపద్ధతిలో మద్దతు పలుకుతుంది.
కేవలం మూడు నెలల కాలంలో కర్నాటకలో హిజాబ్ సమస్యను ముందుకు తెచ్చి, దాన్ని దేశ వ్యాప్తంగా వ్యాపింప చేస్తుంది. మేధోపరమైన కేంద్రంగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సంఫ్ుపరివార్ గూండాలు దాడులు చేస్తున్నారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా మాంసాహారాన్ని తినకూడదనే పేరుతో వరుస దాడులు చేశారు. ప్రతీచోట ప్రజల ప్రజాస్వామిక హక్కులపై దాడులకు పూనుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వారిపై కొన్ని దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ, మోడీ పాలనను వ్యతిరేకించే వారిని దేశ ద్రోహులని ముద్ర వేస్తూ, నిర్బంధాలకు గురి చేస్తున్నారు.
ఈ పరిస్థితిల్లో, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, అనేక మంది త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన హక్కులను రక్షించుకోడానికి బీజేపీని ఒంటరిని చేసి, ఓడించాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ, ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా ఈ పోరాటం విజయవంతమవడానికి దగ్గర మార్గాలేవీ లేవు.
వెంకటేశ్ : మీరు బీజేపీని ఒంటరిని చేసి ఓడించాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పినప్పటికి కూడా హిందూత్వ విషయంలో తన వైఖరిని స్పష్టం చేసి, స్వంత ఇంటిని సరి చేసుకోమని కాంగ్రెస్ పార్టీని కూడా హెచ్చరించారు కదా!
ఏచూరి : అనేక రూపాల్లో కొనసాగుతున్న మతతత్వం, ముఖ్యంగా సంఫ్ుపరివార్ దూకుడుగా ప్రచారం చేస్తున్న హిందూత్వ మతతత్వం పట్ల రాజీలేని వ్యతిరేకత, లౌకికతత్వం పట్ల దృఢమైన నిబద్ధతల బలంతోనే మేమలా చెప్పాం. హిందూత్వపై వారి వైఖరిని, లేదా హిందూత్వ పట్ల మెతక వైఖరితో ఉన్నారా, లేదా అనేది స్పష్టం చేయడానికి అంతగా గందరగోళ పడాల్సిన అవసరం లేదు. మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం (మతతత్వ, కార్పోరేట్ బంధంతో) ప్రజలపై బహుముఖంగా దాడులు చేస్తుంది కాబట్టి ఈ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంటుంది. బీజెపీ, దాని మిత్రులతో పోరాటం చేస్తున్న అందరూ ఈ పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
వెంకటేశ్ : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీ రాజకీయ అభిప్రాయాలకు బాగా విలువ ఇస్తారని విన్నాం. మీ వ్యక్తిగత సంభాషణల్లో కూడా ఆయన మిమ్మల్ని 'బాస్' అని సంబోధిస్తారని చెప్పారు. అయినప్పటికీ మీరు మతతత్వం పట్ల కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాలని అంటున్నారు!
ఏచూరి : లౌకిక పార్టీల నాయకులందరితో నాకు స్నేహం ఉంది. మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని వారికి చెపుతున్నాను. నాకు, నా పార్టీకి, నా పార్టీ సహచరులకు సంబంధించి నంతవరకు హిందూత్వ మతోన్మాద శక్తులను ఓడించడమే మా మౌలిక కర్తవ్యం. ఈ పోరాటంలో కలిసి వచ్చే ఎవరినైనా కలుపుకొని పోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.
వెంకటేశ్ : 2024 సాధారణ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో లౌకిక ప్రత్యామ్నాయం సాధ్యం కాదని అనుకోవచ్చా?
ఏచూరి : మనదేశ చరిత్రలో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటములు ఎన్నికల ఫలితాల తర్వాతే ఏర్పడ్డాయి. 1989, 1996, 2004లో ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు అదే జరిగింది. 1989లో వీపీ సింగ్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం నుండి మొదలు ముఖ్యంగా 1996లో అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం 13రోజుల తరువాత పడిపోయిన తరువాతనే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రత్యామ్నాయ ఫ్రంట్ను రూపొందించాలని సీపీఐ(ఎం) ఆనాడే స్పష్టం చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జీత్ నాయకత్వాన 'ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని' రూపొందించడంలో మా పార్టీ చాలా ప్రముఖ పాత్రను పోషించింది. వాజ్ పారు నాయకత్వంలోని ఆరేండ్ల బీజేపీ పాలనకు ప్రత్యామ్నాయంగా 2004లో యూపీఏ ఏర్పడినప్పుడు కూడా ఇదే జరిగింది.
వెంకటేశ్ : బీజేపీకి ప్రత్యామ్నాయంగా లౌకిక ఫ్రంట్ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ పాత్రపై, సీపీఐ(ఎం) హైదరాబాద్ జాతీయ మహాసభ నుండీ తీవ్రమైన చర్చ లకు, గందరగోళానికి దారి తీస్తుంది. ఈసారి కూడా లౌకిక ప్రత్యామ్నాయ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉండకూడదని చర్చించినట్లు సమాచారం ఉంది!
ఏచూరి : కాంగ్రెస్ పార్టీ పాత్ర విషయంలో సీపీఐ(ఎం)కు ఎటువంటి గందరగోళం లేదు. వాస్తవానికి కన్ననూర్ పార్టీ జాతీయ మహాసభ, హైదరాబాద్ జాతీయ మహాసభ రూపొందించిన పార్టీ వైఖరినే పునరుద్ఘాటించింది తప్ప ఎటువంటి కొత్త వైఖరిని సూచించలేదు. కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి అవగాహనకానీ, ఎన్నికల పొత్తులు కానీ ఉండకూడదనే రాజకీయ తీర్మానాన్ని హైదరాబాద్ మహాసభ మార్చింది. ఆనాటి నుండి కాంగ్రెస్ పార్టీతో రాజకీయ పొత్తులు లేవు. కానీ, ప్రజా సమస్యలపై పార్లమెంటు లోపల, పార్లమెంట్ బయట, ప్రజా ఆందోళనల్లో కాంగ్రెస్ పార్టీతో ఎలా ఉండాలనే విషయాన్ని హైదరాబాద్ మహాసభ తెలియజేసింది. ఆ ప్రమాణాల మేరకే మేం కలిసి పని చేస్తాం.
ఎన్నికలకు సంబంధించినంతవరకు బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా అవసరమైన ఎత్తుగడలను తగిన సమయంలో మా పార్టీ రూపొందిస్తుంది. పార్టీ గత రెండు జాతీయ సభల నుండి వివరిస్తున్న సీపీఐ(ఎం) వైఖరిని ఆమోదిస్తున్న లౌకిక పార్టీల సంఖ్య పెరుగుతున్న విషయం మీరు తెలుసుకోవాలి. ఈ ప్రమాణాలపైన ఐక్యమైన ప్రతిపక్షం 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొంటుందని నా నమ్మకం. ఇది రాష్ట్రాల్లో జరిగిన తరువాత జాతీయ స్థాయిలో 'ఉమ్మడి కనీస కార్యక్రమం' పై ఒక సంఘటన ఏర్పడుతుంది. ఇది ప్రతీ రాష్ట్రంలో జరిగి, 2024 ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లౌకికశక్తుల ఐక్య ఫ్రంట్ ఏర్పడుతుంది.
అనువాదం: బోడపట్ల రవీందర్
సెల్: 9848412451