Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితమే ఓ ప్రశ్న అని ఎవరైనా తాత్విక దష్టితో చెప్పొచ్చు. అసలు ప్రశ్నించడమే జీవితం అని ఇంకో హేతువాది చెప్పొచ్చు. జీవితాన్ని ఎదుర్కోవాలన్నా తప్పించు కోవాలన్నా కూడా ఈ ప్రశ్న గురించిన ప్రశ్నలు జవాబులూ చాలా ఉంటాయి. అందుకే ప్రశ్నకు మన జీవితంలో అంత ప్రాముఖ్యత ఉంది. ప్రశ్న ఎంత ముఖ్యమో దాని సమాధానమూ అంతే ముఖ్యం.
చెట్టుపైనుండి పడిన యాపిల్ పండును న్యూటన్ హాయిగా తినేసి ఇంటికిపోయి నిద్రపోయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆయనకు ఓ ప్రశ్న తలెత్తింది. చెట్టుపై నుండి పడిన పండు కిందికే ఎందుకు పడింది, పైకి పోవచ్చు లేదా అలాగే మధ్యలో ఉండొచ్చు, ఇవేవీ కాకుండా కిందికే ఎందుకు పడింది అన్న ఆ ప్రశ్న మానవుల జీవితాల్నే మార్చేసింది. భూమికి ఆకర్షణ శక్తి ఉందని తెలిశాక విజ్ఞాన శాస్త్రం పరుగులు పెట్టింది. నేడు సైన్సుపై ఆకర్షణ తగ్గి ఇంకేవేవో విషయాలపై పెరిగి మనల్ని వెనక్కి తీసుకుపోతున్నవారిని మనం ప్రశ్నించాలి. నీవు చెప్పేది ఎంత తప్పో చూడు, ముందు ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పు అని నిలదీయాలి. ప్రశ్నలంటే అవి. అలా కాకుండా కాలాన్ని సాగనంపే టైం పాస్ ప్రశ్నలు వృధా. మనిషిని ప్రగతినుండి వెనక్కు తీసుకుపోయే ప్రశ్నలు ఇంకా ఇంకా వృధా. అయితే వాటికి సరైన సమాధానాలు చెప్పి మార్చవలసింది ఇప్పుడు సమాజ అభివృద్ధిని కోరే వారే.
ప్రశ్నపత్రంలో కింది ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలకు సమాధానం రాయండి అని చూసిన ఓ మేధావి అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాసి, ఈ సమాధానాల్లో ఏ ఐదు సమాధానాలనైనా తీసుకొండి అని రాశాడట. అలా అన్ని ప్రశ్నలకూ సమాధానాలు తెలిసిన వాళ్ళు, తెలిసి రాయగలిగిన వాళ్ళు ఉన్నారు. ప్రశ్నించేవాడికి రాసేవాడు ఎప్పుడూ లోకువే అన్న మాటలో కొంత నిజం ఉన్నా, రాసేవాడికీ ప్రశ్నించే వారు లోకువగా కనిపించవచ్చు.
ఓ సినిమాలో అధ్యాపకుడు ఓ విద్యార్ధికి చెబుతుంటాడు... ఫలానా ప్రశ్నకు నీవు రాసిన సమాధానం తప్పు అని. అప్పుడే అటుగా పోతున్న ప్రిన్సిపాల్ క్లాస్లోకి వస్తాడు. ప్రశ్న సమాధానం రెండూ చూస్తాడు. వాడు రాసిన సమాధానమే కరెక్టు, నీవు వేసిన ప్రశ్నే తప్పు అంటాడు. ఇది హాస్యం పండించడానికి చెప్పి ఉండొచ్చు కాని నేటి పరిస్థితులను చూస్తుంటే ఇందులో చాలా సమాధానాలు కనిపిస్తాయి మనకు.
ప్రశ్న పత్రం లీక్ అయ్యింది, అందులో తప్పులొచ్చాయి, ఒకే ప్రశ్న రెండుసార్లు కనిపించింది, సిలబస్లో లేని పాఠాలనుండి కూడా ప్రశ్నలున్నాయి, ఇలాంటి వార్తలు మనకు కొత్తేం కాదు. అయితే సంవత్సరమంతా కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో ఇంతగా ఆడుకుంటారా, ఆమాత్రం శ్రద్ధ చూపరా అని బాధ, కోపం రెండూ ఒకేసారి కలుగుతాయి. వారి అలసత్వాన్ని చూసి వళ్ళు మండిపోతుంది. యువతను ఆకర్షిస్తున్న మంత్రి, యువ వ్యాపారవేత్తలను టార్గెట్గా పెట్టుకున్న మంత్రి, ప్రోత్సహిస్తున్న యువ మంత్రి అన్న పత్రికల హెడ్డింగులూ చూస్తుంటాం. మరి నేటి బాలలే రేపటి పౌరులు కదా! అది పట్టదా వీళ్ళకు? వాళ్ళ భవిష్యత్తు దేశ భవిష్యత్తు కదా, ఎందుకు ఈ ద్వంద్వ విధానాలు అన్న ప్రశ్నలు మన మనసుల్లో తలెత్తుతాయి. ఈ వ్యవస్థే ప్రశ్నార్ధకంగా మారింది, ఓ ప్రశ్నలా కనిపిస్తోంది అన్న దాంట్లో సందేహమే లేదు. దేశ ప్రగతి అంటే పైనున్నోళ్ళ ప్రగతి అని అందరికంటే పెద్దాయన చేసే పనులు చూస్తే మనకు తెలిసిపోతుంది. అటువంటి సమయంలో ఇతరులు కూడా దాన్ని ఆచరించడం, అలాగే చేయాలనుకోవడం ఎందుకు అని అభివృద్ధిని కోరే వారు ప్రశ్నిస్తారు.
మన చట్టాల్లోనే లొసుగులున్నాయి ముందు వాటిని సరి చేయాలి అని చెప్పేవారి మాటల్లో ఎంతో నిజముంది. ఏదైనా తప్పు జరిగితే శిక్ష పడే విధానంపై కూడ ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. శిక్ష సరిగా అమలు జరిగితే తప్పులు మళ్ళీ మళ్ళీ జరగవన్న కనీస జ్ఞానం ఉండాలి. అలా తప్పులు జరిగినప్పుడు మహా అయితే కొన్ని రోజుల సస్పెన్షన్, లేదా ఒక ఊరినుండి ఇంకో ఊరికి, లేదా ఇంకో శాఖకు బదిలి చేస్తే అప్పటికి సద్దుమణిగి పోతుంది. మరి విద్యార్థుల జీవితాలు ఈ తప్పులవల్ల గాడి తప్పుతుంటే దానికి ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు తప్పులు చేసినవారికి శిక్ష వేయాలి. ఇది ఇలాగే అంతుపట్టని ప్రశ్నలా సాగిపోవలసిందేనా, ఎక్కడో ఒక చోట దీనికి క్వశ్చన్ మార్కు తీసేసి ఫుల్ స్టాప్ పెట్టేది ఎప్పుడు అని మన మనసు మనల్ని ప్రశ్నిస్తుంది. తప్పులు జరిగాయని ప్రతిపక్షం వాళ్ళు చెబితే మీరు ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది కదా అన్న సమాధానం దీనికి చెబితే అంతకంటే అన్యాయం ఇంకోటి లేదు. తప్పుకు తప్పు ఎప్పుడూ సమాధానం కాదు. దాన్ని సరిచేయడమెలా అన్నదే ప్రశ్న.
కరోనా మన జీవితాలకి ఎన్నో ప్రశ్నలు వేసి పోయింది. ఇంకా పోలేదు అని వైద్యులు చెబుతున్నారు. అలా కరోనా సమయంలో విద్యార్థులు ఎంతో నష్టపోయారు. ఇప్పుడిప్పుడే విద్యా వ్యవస్థ ఒక గాడిలో పడుతోంది. ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన సమయం, సందర్భం. కొన్ని రాష్ట్రాల్లో ప్రశ్న పత్రాల లీకులు, ఇంకొన్ని చోట్ల తప్పులు దొర్లాయని, అలాంటి చోట్ల మళ్ళీ పరీక్షలు పెడతామని, మార్కులు ఇచ్చే క్రమంలో ఆ తప్పును సరి చేస్తామని చెబితే మంచిదే కాని, జరిగిన నష్టానికి ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు అన్న ప్రశ్నకి కంటితుడుపు చర్యలు సమాధానం కాదు. నిబద్ధతగా పనిచేయడం, పిల్లల భవిష్యత్తు పై నిజంగా గౌరవం ఉండడం సరైన సమాధానం. తప్పు ఎలా జరిగిందన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కంటే ప్రశ్న రాకుండా చూసుకోవడం మంచిది. ఎన్ని సురుకులేసినా వేడి తగలనంతగా, నొప్పి తెలియనంతగా చర్మం మందమైపోతే ఆ చర్మాన్ని ఎలా వలుస్తామన్న ప్రశ్న యువతలో వస్తుంది. అందుకే ప్రశ్నను, ప్రశ్న పత్రాన్ని గౌరవించడం మంచిది.
- జంధ్యాల రఘుబాబు
సెల్:9849753298