Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుపమ కటకం
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు భగవద్గీతను తప్పనిసరి బోధనాంశంగా స్టేట్ బోర్డు పాఠశాలలలో ప్రవేశ పెట్టాలని ప్రణాళికను సిద్ధం చేసింది. గుజరాత్ రాష్ట్రం ఈ ప్రణాళికను ప్రకటించిన వెంటనే, అదే బీజేపీ ప్రభుత్వం ఉన్న కర్నాటకలో కూడా 700 పద్యాలతో మహాభాగవత ఇతిహాసంలో భాగంగా ఉన్న మత గ్రంథాన్ని తరగతి గదులలో ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలిస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి మొదటి వారంలో మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కూడా భగవద్గీతను తమ ప్రాధమిక పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశ పెడతామని ప్రకటించింది.
ఈ ధోరణి పట్ల లౌకిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ చర్య వెనుక ఎజెండా కుట్ర పూరితంమైనదిగా, ప్రమాదకరమైనదిగా అభివర్ణించారు. గుజరాత్లో చేయబడిన నిర్ణయాన్ని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆమోదించినట్లు తెలిసి వారు మరింత ఆందోళనకు గురయ్యారు. గుజరాత్ విద్యాశాఖమంత్రి జితు వాఘాని ఈ చర్యను సమర్థిస్తూ, శ్రీమద్భగవద్గీత యొక్క విలువలను, సూత్రాలను దాని ప్రాధాన్యతలను అన్ని మతాల వారు అంగీకరించారించారని తెలిపారు. విద్యార్థులలో ఆసక్తిని పెంచే విధంగా గీతను 6వ తరగతిలో ప్రవేశ పెడతామనీ, పిల్లలకు భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను, ప్రాథమిక దశలో బోధించి, వారి ఆసక్తిని సజీవంగా ఉంచడానికి శ్లోకాల రూపంలో కథలను ప్రవేశపెట్టాలని, శ్లోకాలతోపాటు, పాటలు, వ్యాసాలు, డిబేట్స్, నాటికలు, క్విజ్ లాంటి కార్యక్రమాలు రూపొందిస్తామని, అదేవిధంగా 9వ తరగతి నుండి ఈ గ్రంథాన్ని అధునాతన స్థాయిలో బోధిస్తామని అసెంబ్లీకి తెలియ జేశారు.
జులై 2020 నాడు విడుదల చేయబడిన నూతన విద్యా విధాన లక్ష్యాల ప్రకారమే ఈ ప్రణాళికను రూపొందించామని కూడా ఆ విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈ విధానం ద్వారా గర్వించదగ్గ సాంప్రదాయాలను నేర్పే ఉద్దేశ్యంతో జూన్ 2022లో ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరంలో, ఈగ్రంథాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికను రూపొందించామని గుజరాత్ ప్రభుత్వం అధికారిక సర్క్యులర్ ద్వారా తెలియజేసింది.
భగవద్గీతను నేరుగా అనువదించిన ప్రకారం ''దేవుని గీతమని అర్థం''. ఇది హిందూ గ్రంథాలలో పవిత్ర మైనదిగా భావించబడుతూ, మహాభాగవతంలో 6వ భాగంలో 23-40 అధ్యాయాలలో వివరించబడింది. ఈ వర్ణన ముఖ్యంగా యుద్ధవీరుడైన అర్జునుని చుట్టూ పరిభ్రమిస్తుంది. యుద్ధభూమిలో తన ఎదురుగా కనిపిస్తున్న తన సోదరులను (దాయాదులను) చూసి అతను పడిన సంఘర్షణను గురించి వర్ణిస్తుంది. ఈ నేపథ్యంలో తెరవెనుక శ్రీకృష్ణుని దేవతల అవతారంగా, ప్రపంచం యొక్క సత్యాన్ని, అర్జునునికి తెలియ జేయడానికి ఉపయోగించుకున్నారు. శ్రీకృష్ణునికి, అర్జునికి మధ్య జరిగిన సంభాషణ, జీవిత గమనాన్ని గూర్చి ప్రభోదిస్తుంది.
మొహాలీలో ఇండియన్ ఇన్సిట్యూట్ట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ మరియు రిసెర్చ్(IISER) సంస్థలలో మానవీయ శాస్త్రాలను, సామాజిక శాస్త్రాలను బోధించిన విశ్రాంత తత్వశాస్త్ర ప్రొఫెసర్ యస్.కె అరుణ్ మూర్తి పాఠశాల సిలబసులో గీతను ప్రవేశ పెట్టాలనే ఆలోచన గూర్చి విస్తృతంగా రాశారు. వారి అభిప్రాయం ప్రకారం ఒక విద్యార్థికి విమర్శనాత్మక, విశ్లేషణాత్మక ఆలోచనలను అభివృద్ధి చేయడమే విద్య యొక్క ముఖ్యమైన అంశం. గీతను బోధించడం వలన అది గ్రంథంలోని పద్యాలను కంఠస్థం చేయడానికి మాత్రమే పరిమితం చేస్తుంది. ఆ విధంగా వల్లెవేసి నేర్చుకునే పద్ధతి చర్చను నిరుత్సాహ పరచడమేకాక, హేతువాద దృక్పథాన్ని ప్రక్కదారి పట్టిస్తుంది. దీనిపై ప్రాఫెసర్ అరుణ్ మూర్తి మరింత వివరణ ఇస్తూ... కృష్ణునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ క్రమంలో గీత అనేకమైన పిడివాద సిద్ధాంతాలను చెపుతుంది. (భగవంతుని చేత చెప్పబడినదిగా) అది ఒక పిడివాద సిద్ధాంతాన్ని, మరొక పిడివాద సిద్ధాంతం ద్వారా సమర్థిస్తుంది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్దేశ్యపూర్వకంగానే వాటిలో మూడు అంశాలపై వివరణ ఇస్తాడు. దానిలో మొదటిది యుద్ధాన్ని సమర్థించడం, రెండవది చాతుర్వర్ణమని చెప్పబడే నాలుగంచెల కుల వ్యవస్థను సమర్థించడం, మూడవది కర్మ లేదా క్రియ. ఇదే ప్రముఖంగా కర్మయోగాగా ప్రసిద్ధి చెందింది.
ఫ్రొఫెసర్ అరుణ మూర్తి ఉద్దేశ్యంలో ఈ పిడివాదాలన్నీ పద్య రూపంలో ప్రవేశ పెట్టబడతాయి. అనేక మంది వీటిని విశదీకరిస్తూ అతిశయోక్తులతో, కపటంతో కూడిన పాండిత్యంతో, ఉపన్యాస ధోరణులతో, గీత యొక్క వ్యాఖ్యానంగా, వివరణలతో, వ్యాఖ్యానాలతో, హింసను, కులాన్ని సమర్థిస్తారని చెప్పారు.
కర్మ సిద్ధాంతాన్ని ఉపయోగించి, కుల వ్యవస్థను సమర్థిస్తారు. ఉదాహరణకు, అర్జునునికి ఆయుధాలు చేపట్టమని, క్షత్రియునిగా అది అతని కర్తవ్యమని ఉద్బోధించారు. ఒక వ్యక్తి యొక్క సహజ సిద్ధమైన స్వభావాన్ని, గుణాలను, అతని చర్యలను బట్టి, కులభావనను, భిన్నరీతులలో మెలితిప్పి సమర్థించారు. భగవంతుని వాక్యమని చెప్పబడే ఈ గ్రంథాన్ని చర్చ లేకుండా తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే అది భవిష్యత్తులో హింసను, కుల వ్యవస్థను శాశ్వతంగా నిలిపి ఉంచడానికి దోహదం చేస్తుంది.
విద్యకు సంబంధించిన అంశంపై ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ... హిందూ సంప్రదాయంలో గీత లాంటి గ్రంథాలు జ్ఞానానికి మూలాలుగా పరిగణింపబడతాయి. అవి ప్రశ్నించడానికి వీలులేని విధంగా ఉంటాయి. అందువల్ల అవసరమైన, కనీస చర్చకు గానీ, విశ్లేషణకుగానీ తావుండదు. గీత మత గ్రంథం కాదని, సార్వజనీన స్థాయిగల గ్రంథమని కొందరు వాదించవచ్చు. కానీ, గీత భగవంతుని గూర్చి, ప్రపంచాన్ని గూర్చి, వ్యక్తిగతమైన సంబంధాలకు అతీతమైన విషయాలను గురించి స్పష్టంగా చెపుతూ ఒక మత గ్రంథంగా నిర్దిష్ట అధికారాన్ని చలాయిస్తుంది. అది ఒక చట్టబద్ధమైన మతగ్రంథంగా రూపొందుతుందని చెపుతారు.
కాబట్టి, గీతను ప్రవేశ పెట్టడంలో తన అభ్యంతరమేమంటే... తాను లౌకిక విద్యను కోరుకుంటున్న వాడిగా, అదీకాక, దేవుడు వంటి భావనతో, వ్యక్తిగత, ప్రపంచాన్ని గూర్చి విమర్శనాత్మక భాగస్వామ్యంతో, హేతుబద్ధమైన చర్చకుగానీ, విశ్లేషించడానికి గానీ వీలు లేనప్పుడు తానెందుకు మతపరమైన గ్రంథాన్ని చదవాలని ప్రొఫెసర్ మూర్తి ప్రశ్నిస్తారు.
అహమ్మదాబాదులో విద్యా బోధన చేస్తున్న జసూట్ మానవ హక్కుల కార్యకర్త ఫాదర్ సెంట్రిక్ ప్రకాష్ మాట్లాడుతూ... మతగ్రంథాలనుండి పాఠాలు నేర్చుకునే అభిలాషే ఉంటే, ప్రభుత్వం గీత వద్దే ఆగిపోకూడదు. అది ప్రపంచ మతానికి సంబంధించిన కోర్సును ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. అన్ని మతాలలో ఉన్న మంచిని గురించి బోధించాలని అభిప్రాయపడ్డాడు. బైబిల్, ఖురాన్, గురు గ్రంధ్ సాహిబ్, అవెష్టా(జురాష్ట్రియన్ల పవిత్ర గ్రంథం) నుండి కూడా బోధించాలని అభిప్రాయపడ్డాడు. భారత దేశ బహుళత్వానికి దేశ లౌకిక తత్త్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలన్నారు. ఒకవేళ వారు సమగ్రమైన విద్యను సమకూర్చాలని భావిస్తే నైతిక శాస్త్రం విలువలతో కూడిన విద్యను, రాజ్యాంగానికి సంబంధించిన విద్యను సమకూర్చవచ్చని చెప్పారు.
2002 నుండి గుజరాత్లో మతపరమైన ఘర్షణలను, విభజన రాజకీయాలను, గమనిస్తూ వస్తున్న సెడ్రిక్ ప్రకాష్ ఏ ఫాసిస్టు అయినా మొదట చేసే పని విద్యా విధానంలోకి చొరబడడమేనని గమనించాలని చెప్తాడు. విద్యావిధానం ద్వారానే వారు మోసపూరితమైన, అమాయకమైన మనసులకు రూపకల్పన చేస్తారు. భగవద్గీతే ప్రత్యేకంగా ఎందుకంటే, హిందూ నమ్మకాలకు తాము ప్రాముఖ్యతను ఇస్తున్నామని హిందువులకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నమే. ప్రజలను విభజించే క్రమాన్ని, కేంద్రీకరణను కొనసాగించడానికి దీనిని మోసపూరితమైన ఉపాయంతోకూడిన ఆలోచనగా గమనించాలి.! అహ్మదాబాదులో కేంద్ర ప్రత్యామ్నాయ అభివృద్ధి కేంద్రంలో పనిచేస్తున్న ప్రముఖ ఆర్థిక వేత్త ఇందిరా హిర్వే.. ఫాదర్ సెడ్రిక్ ప్రకాష్ అభిప్రాయాలకు మద్దతిచ్చాడు. భారతదేశం తనను తాను లౌకిక రాజ్యంగా నిర్వచించుకున్నట్లయితే, అన్ని పవిత్రమైన గ్రంథాలలో ఉన్న సూత్రాలను బోధించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సమస్యేమంటే... మత పరమైన విభజన. హిందువులు ఈ ప్రయత్నాలను సమర్థిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విషాదకరమైన విషయమేమంటే... విద్యావంతులనుండి కూడా వ్యతిరేకత లేకపోవడం. ఇది ఒక తప్పుడు ధోరణి. తానూ గీతను అనుసరించే వాడినేనని, వాస్తవంగా గీతను గౌరవిస్తాననీ అంటున్న ఆయన భయమేమంటే... వారు బోథించేటప్పుడు హిందూయిజమే ఉన్నతమైన మతమని బోధించినట్లయితే, ప్రస్తుతం ఉన్న విభజిత వాతావరణంలో ప్రమాదకరమైనదిగా మారి హాని చేస్తుందని. స్పష్టంగా చెప్పాలంటే... వారి ఉద్దేశ్యంలో హిందూ రాష్ట్రాన్ని నిర్మించడమే. ఈవిషయంలో అత్యున్నత విద్యావంతులు కూడా ఆవైపు మొగ్గు చూపుతున్నారు.
కేంద్ర అధ్యయన, లౌకికతత్వ అధ్యయన కేంద్రంలో.. ముంబాయిలో పనిచేస్తున్న ఇఫ్రాన్ ఇంజనీర్, ఈ ప్రభుత్వాలు, భగవద్గీతలోని నీతిని, విలువలను బోధించడం లేదని, వారు సమాజానికి, రాజకీయ సందేశం పంపించడం పైన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఇది హిందూ సమాజమనే సందేశం ఇస్తారన్నారు. ఆయన అభిప్రాయంలో గీతలో కొన్ని అర్హతలగల విలువైన పాఠ్యాంశాలను తప్పని సరిగా బోధించాలని తెలిపాడు. వాస్తవానికి మైనారిటీ సంస్థలు కూడా ప్రపంచ మతాలను గురించి చెప్పాలని అభిప్రాయ పడ్డాడు. ఏది ఏమైనా హిందూ ఎజెండా అతి వేగంగా వ్యాపిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఉదాహరణకు, స్కూలు పాఠ్య ప్రణాళికలో ఇంతకు ముందు నుండే హిందువులు ఒక ఆధిపత్య సమాజంగా పేర్కుంటూ.. ఉపవాచకాలలో నెమ్మదిగా.. పరోక్షంగా జొప్పించారు. ఇటీవలి తాను ఒక పాఠ్యపుస్తకాన్ని చదివానని, దీపావళిని వర్ణిస్తూ... మనం మన దీపావళిని ఈవిధంగా జరుపు కుంటామనీ, వారు వారి ''ఈద్''ను ఆవిధంగా జరుపు కుంటారని రాయబడిందని తెలిపాడు. ముస్లిములు కూడా ఈ దేశానికి సంబంధించిన వారు కాదా? (who is going to comb through all Of this?) ఇలాంటి పరిస్థితి రావడానికి కారుకులెవరు?
భగవత్గీత మరియు భారతీయ తత్వశాస్త్రంలో ప్రసిద్దిగాంచిన ఉపాధ్యాయిని నీమా ముజుందార్, హేతువాదుల వాదనలను పూర్వ పక్షం చేస్తూ, ఏ సంస్కృతిలోనైనా మానవాళికి అందించగల మంచి ఉంటుందని, మతపరమైన అంశాన్ని ప్రక్కన పెడితే గీత ప్రపంచానికి ఇవ్వగలిగినది చాలా ఉందని తెలిపారు. దానిని బోధించేవారెవరైనా సక్రమంగా బోధించాలనే దానితో తాను అంగీకరిస్తాని తెలిపారు.
గీతా బోధనలను నేర్చుకునే విషయంలో గ్రంథాన్ని సవ్యంగా బోధించకపోయినా లేదా తప్పుడు ఆలోచనలతో బోధించినా దాని వల్ల మంచికంటే ఎక్కువ నష్టం జరుగుతుందని అధికారిక యంత్రాంగం యొక్క సమిష్టి అభిప్రాయంగా కూడా ఉన్నది. ఈ గ్రంథాన్ని ప్రవేశ పెట్టే విషయంలో సమగ్రమైన చర్చ జరుగవలసిన అవసరం ఉంది.
(ఫ్రంట్ లైన్ సౌజన్యంతో..)
అనువాదం:మల్లెంపాటి