Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత దేశవ్యాప్తంగా 1,043 విశ్వవిద్యాలయాలు విస్తరించి ఉన్నాయి. వీటిలో 54 సెంట్రల్ యూనివర్సిటీలు, 416 స్టేట్ యూనివర్సిటీలు, 125 డీమ్డ్ యూనివర్సిటీలు, 361 ప్రయివేటు విశ్వవిద్యాలయాలు, 159 జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఉన్నాయి. కానీ అంతర్జాతీయంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన తొలి 500 విశ్వవిద్యాలయాల్లో భారతదేశానికి చెందిన ఎనిమిది యూనివర్సిటీలు మాత్రమే ఉండటం, తొలి 1,000 విశ్వవిద్యాలయాల్లో కూడా 35 మాత్రమే ఉండటం మన ఉన్నత విద్యాసంస్థల విద్యా ప్రమాణాలను ఎక్కిరిస్తున్నాయి. ఉన్నత విద్యకు ప్రభుత్వ నిధుల కేటాయింపులు గత దశాబ్దకాలంగా బడ్జెట్లో 1.5శాతం కంటే పెరగడం లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2,482 కోట్లు ఉండగా, 2022-23లో 2,078 కోట్లు మాత్రమే కేంద్ర విద్యాశాఖ కేటాయించడం విచారకరమే కాదు ప్రమాదకరం కూడా. కేటాయింపులు తగ్గడంతో పాటు 25శాతం విద్యార్థుల ప్రవేశాలను పెంచడం, అధ్యాపకుల సంఖ్యను మాత్రం పెంచకపోవడం విచారకరం.
సమస్యలతో సంసారాలు
దీనికి తోడుగా యూనివర్సిటీల్లో పరిశోధనలు, వినూత్న ఆవిష్కరణలకు 8శాతం నిధుల కోతను విధించడంతో గోరుచుట్టుపై రోకలి పోటులా యూనివర్సిటీ విద్య, పరిశోధనలు మౌలిక వసతులు కొరవడి వెలవెలబోతూ యువతను ఉన్నత విద్యతో ప్రయోజకులను చేసే యజ్ఞంలో విఫలం అవుతున్నాయి. భారతీయ విశ్వ విద్యాలయాలు, కళాశాలల్లో అర్హతగల అధ్యాపకుల కొరత, లైబ్రరీ నిధుల కోతలతో జర్నల్స్, పుస్తకాల కొరత, జీత భత్యాల చెల్లింపులో జాప్యం, సౌకర్యాల కొరత, తరగతి గదుల్లో అతిగా విద్యార్థుల సంఖ్య, వసతులులేని హాస్టల్స్, పారిశుధ్యలేమి లాంటి అనేక సమస్యలు చుట్టు ముట్టి విద్యాబోధన అంతంత మాత్రమే అవుతుండగా, పరి శోధనలు అంతరించే స్థాయికి చేరడం దేశ ప్రగతికే గొడ్డలిపెటు. ప్రతి పైసాకు రాష్ట్ర, కేంద్ర, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు శ్రమపడాల్సి వస్తున్నది. దేశ రాజధానిలోని పలు యూనివర్సిటీలు కూడా నిధుల కొరతతో నేడు కొట్టుమిట్టాడుతున్నాయి. యూజీసీ నుంచి మేజర్, మైనర్ పరిశోధనలకు, ప్రాజెక్టులకు కేటాయింపులు 2016-17లో 42.7 కోట్లు ఉండగా, 2020-21లో 38 కోట్లకు కుదించడం జరిగింది. దేశవ్యాప్త విశ్వవిద్యాలయాల్లో 2.7శాతం మాత్రమే పిహెచ్డి ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నాయి. బలహీనమైన పాలనా వ్యవస్థల నిర్మాణాలు, రాజకీయ ఒత్తిడిలు, పారదర్శకత, జవాబుదారీతనం లోపించడం, మౌలిక వనరుల అగాధాలు, అధ్యాపకుల ప్రమాణాల్లో కొరతలు, విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తిలో వ్యత్యాసాలు, పరిశోధనా నిధుల కోతలు, పిహెచ్డి ప్రోగ్రామ్స్ లేకపోవడం, కనీస అవసరాలకు నిధులు లేకపోవడం లాంటి అనేక తీవ్ర సమస్యల వలయంలో చిక్కుకున్న విశ్వవిద్యాలయాలు యువభారతానికి ఆశించిన స్థాయిలో ఉన్నత విద్యను అందించడంలో విఫలం అవుతున్నాయి.
అవినీతి నీడలు
క్రమేణా ప్రమాణాలు అడుగంటుతున్నాయి. నకిలీ డిగ్రీలు, పేపర్ లీకేజీలు, కలుషిత మూల్యాంకన కథనాలు, అవినీతి రాజ్యమేలడం, క్యాంపస్లలో మత కలహాలు చెలరేగడం, పోలీసు స్టేషన్లు వెలువడం, భావప్రకటనా స్వేచ్ఛను హరించడం, యువత చుట్టు కంచె కట్టి మేధో విస్తృతిని కుదించడం, ప్రజాస్వామ్య హక్కులకు కత్తెర వేయడం, విశ్వవిద్యాలయాలు అధికార పార్టీల స్థావరాలు కావడం, వీసీలు అధికార పార్టీలకు లొంగిపోవడం లాంటివి దేశ ప్రగతికి విఘాతం కలిగిస్తున్నాయి.
విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని కాపాడడం, అవసర నిధులను కేటాయించడం, విద్యను పరిశోధనలకు ముడిపెట్టడం, విద్యా ప్రమాణాలు పెంచడం, విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తిని కాపాడటం, పాలనా సంస్కరణలు తేవడం, క్యాంపస్లలో ప్రగతిశీల వాతావరణాన్ని నెలకొల్పడం, అధ్యాపకుల నియమకాల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించడం, ఆధునిక డిజిటల్ యుగ మేధో వికాసం ఫలించడం, నైపుణ్య యువత దేశాభివృద్ధి లో భాగస్వామ్యం కావడం, భారతీయ యువత ప్రపంచానికి జ్ఞాన వెలుగులు పంచడం నేటి అవసరమని గుర్తించాలి. పౌర సమాజం మేల్కొవాలి. ఇదే విధంగా ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తే యువశక్తి నిర్వీర్యం కావడం ఖాయం! ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన దేశానికి ఇది అవాంఛనీయం.
- డాక్టర్ బుర్ర మధుసూదన్రెడ్డి
సెల్: 9949700037