Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ విషయంలో మరో హానికరమైన చర్యకు తెర తీసింది. ఇండియన్ ఆర్మీలో చాలా కాలంగా కొనసాగుతున్న రిక్రూట్మెంట్ విధానం మీద గురిపెట్టింది. కోవిడ్-19 మహమ్మారి పేరు చెప్పి 2020లో ఆర్మీలో సైనికులను నియమించే ప్రక్రియను నిలిపివేసింది. కాని నేవీలో, ఎయిర్ఫోర్స్లో నియామకాలను మాత్రం కొనసాగించింది. వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన రిక్రూట్మెంట్ కార్యక్రమాన్ని ఉన్నట్టుండి నిలిపివేయడంతో ఇండియన్ ఆర్మీలో ఇప్పుడు సైనికుల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇంతకు ముందే చాలా యూనిట్లలో మంజూరైన పోస్టులను పూర్తిగా భర్తీ చేయకపోవడంతో వాటి పని సామర్ధ్యం చాలా దెబ్బతింది. ఇప్పుడు ఏకంగా భర్తీ ప్రక్రియనే నిలిపివేయడంతో చాలా యూనిట్లలో పరిస్థితి మరింత దిగజారింది.
ఆర్మీ మీద వత్తిడి పెరగడమే కాదు, సైన్యంలో చేరి దేశానికి సేవ చేద్దామన్న ఉత్సాహంతో ఉన్న చాలామంది యువతీ యువకులంతా ఆశాభంగానికి గురయ్యారు. దేశాన్ని కాపాడే పనిలో ఉండవలసినవారు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
కాని మోడీ ప్రభుత్వానికి ఇదేమీ పట్టడంలేదు. తన నయా ఉదారవాద ఎజెండాను ఎలాగైనా అమలు చేసితీరాలన్న పట్టుదలతో అది వ్యవహరిస్తోంది. జాతీయసైన్యం బలాన్ని తగ్గించేసి, సైన్యం నిర్వర్తించవలసిన చాలా రకాల పనులను ప్రయివేటు రంగానికి అప్పజెప్పాలని, తద్వారా తన ఆశ్రితులైన కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చాలని చూస్తోంది. ఆ కార్పొరేట్ల వ్యాపార లింకులు విదేశీ మిలిటరీ లాజిస్టిక్ కంపెనీలతో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం 'టూర్ ఆఫ్ డ్యూటీ' అన్న కొత్త రిక్రూట్మెంట్ మోడల్ను అమలు చేయడానికి సిద్ధపడు తోంది. దీనికి సంబంధించిన ముసాయిదా సిద్ధం అయింది. ఈ మోడల్ ప్రకారం ఇండియన్ ఆర్మీకి ఎంపిక కాబడిన వారిలో 25 శాతం మంది మూడేండ్ల పాటు పని చేస్తారు. మరో 25శాతం మంది ఐదేండ్లపాటు పని చేస్తారు, తక్కినవారు రిటైర్మెంట్ వయస్సు వచ్చేదాకా పని చేస్తారు. ఇటువంటి మార్పు తీసుకురావాలని 2020 నుండే మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాని ఆర్మీ దానికి వ్యతిరేకంగా ఉండడంతో కాస్త ఆగింది.
స్వల్ప కాలం మాత్రమే ఆర్మీలో పని చేస్తే (3 లేదా 5ఏండ్లు) వారికి ఆయుధాలను ఏవిధంగా ఉపయోగించాలో అది మాత్రమే నేర్పడం సాధ్యపడుతుంది తప్ప సైన్యానికి కావలసిన అంకితభావం గాని, క్రమశిక్షణ గాని, ఆ విలువలు కాని నేర్పడం సాధ్యపడదు. సైన్యంలో పని చేయడం అనేది ఒక గర్వించదగిన గొప్ప వృత్తి అని వారు భావించేలా చేయడం కుదరదని ఆర్మీలో చాలామంది అధికారులు భావిస్తున్నారు. అంతేకాక, ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త విధానంతో ఖర్చు మిగిల్చేదేమీ ఉండదని వారు భావిస్తున్నారు. 'ఈతకాయ కోసం తాటికాయను ఒదులుకున్నట్టు' అవుతుందని వారి అభిప్రాయం.
అయితే ప్రభుత్వం మాత్రం సైనికుల జీతాల కోసం, పెన్షన్ల కోసం పెట్టే ఖర్చును తగ్గించి, ఆ క్రమంలో మిగిల్చిన దానితో మరికొంత మిలిటరీ పరికరాల కొనుగోలు చేయాలని యోచిస్తోంది. 17 సంవత్సరాలపాటు పని చేస్తేనే మిలిటరీలో పెన్షన్ పొందే అర్హత లభిస్తుంది. 50శాతం మందిని మూడేండ్లకో, ఐదేండ్లకో రిటైర్ చేసేస్తే వారికి పెన్షన్ చెల్లించనవసరం ఉందడు. దానితోబాటు, డ్రైవింగ్, హౌస్ కీపింగ్ వంటి పనులను ప్రయివేటీకరిస్తే ఇప్పుడు ఆ పనులు చేసే సైనికులకు ఇచ్చే జీతాలలో సగం కన్నా తక్కువకే పని చేయించుకోవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.
దేశంలోని గ్రామసీమల నుండి వచ్చి సైన్యంలో చేరి తద్వారా వారి జీవన స్థాయిని మెరుగుపరుచుకునే అవకాశాలు ఇప్పుడు గ్రామీళ యువతకు ఉన్నాయి. వాటిని తన కొత్త విధానం ద్వారా దెబ్బ తీయడమే మోడీ ప్రభుత్వ టూర్ ఆఫ్ డ్యూటీ విధాన పర్యవసానం. కార్పొరేట్లకు దోచిపెట్టడానికి గాని, తన ప్రచారార్భాటానికి గాని ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడని ఈ ప్రభుత్వం దేశ రక్షణకు సంబంధించి సైనికుల విషయంలో ఖర్చు చేయడానికి నిరాకరిస్తోంది. ఎంతసేపూ సామాన్య ప్రజలపై కొత్త, కొత్త భారాలను వేయడంమీదే దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో దీర్ఘకాలంలో ఏర్పాటు చేసుకున్న, కాల పరీక్షకు నిలిచిన కొన్ని వ్యవస్థలను తాను ధ్వంసం చేస్తున్నానన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అన్ని ఆర్థిక సమస్యలకూ ప్రయివేటీకరణే పరిష్కారం అన్న చందాన ఆలోచిస్తోంది తప్ప కార్మిక వర్గానికి దీర్ఘకాలం పాటు సామాజిక భద్రతను కల్పించే పెన్షన్ల వ్యవస్థను దెబ్బ తీయడం ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కుంగదీస్తుందని ఆలోచించడంలేదు.
17 సంవత్సరాలపాటు ఆర్మీలో పని చేసే సైనికుడు ఈ దేశ రక్షణ వ్యవస్థలో విడదీయలేని భాగంగా ఉంటాడు. ఆ సైనికుడేగాక అతని కుటుంబం మొత్తం ఆర్మీ తరహా జీవిత విలువను అలవరచుకుంటుంది. సైనికుల బిడ్డలకు మంచి విద్యను ఆర్మీ అందిస్తుంది. ఆ బిడ్డలలో చాలామంది మళ్ళీ సైన్యంలో చేరడానికి తయారవుతారు. వారు ఇతర వృత్తులలో చేరినా మంచి విలువలను కలిగివుంటారు. తన సిబ్బందిని, వారి కుటుంబాలను సంరక్షించడం పట్ల ఆర్మీకి ఉన్న శ్రద్ధ దీని వెనుక కీలకంగా పని చేస్తుంది. మోడీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త రిక్రూట్మెంట్ విధానంలో ఈ విధమైన సంరక్షణకి అవకాశమే లేదు. పైగా దీర్ఘకాలంలో రక్షణ వ్యవస్థ పటుత్వం దెబ్బతినే ప్రమాదముంది. కాని అధికారంలో ఉన్న హిందూత్వ-కార్పొరేట్ శక్తులకి ఇదేమీ పట్టడం లేదు. ఇప్పటికే ఆర్మీకి సరుకుల సరఫరా వ్యవస్థను, వైద్య విభాగాన్ని, ఇంజ నీరింగ్ అండ్ మెయింటినెన్స్ విభాగాన్ని ప్రయివేటీకరించింది.
ఆర్మీ యుద్ధరంగంలో వినియోగించే యుద్ధ ట్యాంకులను, యుద్ధ వాహనాలను, రికవరీ వాహనాలను, భారీ తుపాకులను మోసుకుపోయే వాహనాలను, మంచులో పని చేసే ప్రత్యేక వాహనాలను మరమ్మతు చేసే పనులను, వాటిని నిర్వహించే పనులను ప్రయివేటు రంగానికి అప్పగించింది. ''ఇది ఒక విధంగా చాలా కీలక ప్రాంతాల్లో నిర్మించబడిన ఆర్మీ బేస్ వర్క్షాపులను, వాటిలో నెలకొల్పిన యంత్రాలను, పరికరాలను అన్నింటినీ అప్పనంగా ప్రయివేటు రంగానికి సమర్పించడమే'' అని మిలిటరీ నిపుణులు భావిస్తున్నారు.
అంతేగాక టూర్ ఆఫ్ డ్యూటీ విధానంలో నియమించబడినవారిలో 3, లేదా 5ఏండ్ల తర్వాత సర్వీసు నుండి బైటకు వచ్చే మాజీ సైనికులు సమాజాన్ని సైనికీకరణ చేయడానికి, మత విభజనలను రెచ్చగొట్టడానికి దోహదం చేస్తారని కూడా నిపుణులు భావిస్తున్నారు. ''రెండవ ప్రపంచ యుద్ధంలో సైన్యంలో పని చేసి తిరిగి వచ్చిన మాజీ సైనికులలో చాలామంది 1947 దేశ విభజన సమయంలో నిర్వహించిన పాత్ర చాలా నష్టం కలిగించింది. వారిలో చాలామంది ఇతర మతస్థులను దేశం విడిచిపొమ్మనమని వత్తిడి చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. మరికొందరు తమ మతస్థులు తక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో వారినందరినీ ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎక్కువ సంఖ్యలో అదే మతస్థులు ఉన్న ప్రాంతాలకు తరలిపోయేలా వత్తిడి చేశారు. మొత్తం మీద మత ప్రాతిపదికన ప్రజలు విడిపోవడాన్ని మాజీ సైనికులు వేగవంతం చేశారు'' అని సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చికి చెందిన నిపుణుడు సుశాంత్సింగ్ అంటున్నారు. ''ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న టూర్ ఆఫ్ డ్యూటీ పర్యవసానాలు కూడా ఇదేమాదిరిగా ఆందోళనకరంగా పరిణమించవచ్చు'' అని ఆయన భావిస్తున్నారు.
విదేశాల నుండి దాడి జరిగే ప్రమాదం ఉందని ప్రజలలో భయాందోళనలను రెచ్చగొట్టి, సమాజంలో సైనికీకరణను వేగవంతం చేయడానికి, ఇంకోవైపు దూకుడుగా రెచ్చగొట్టే రీతిలో విదేశాంగ విధానాన్ని చేపట్టడానికి కూడా ఈ టూర్ ఆఫ్ డ్యూటీ విధానం దోహదం చేస్తుంది. హిందూత్వ శక్తులకు ఈ విధమైన బూటకపు జాతీయవాదం పట్ల, కండకావరాన్ని ప్రదర్శించే విదేశాంగ విధానం పట్ల ఉన్న మక్కువ మనకు తెలియనిది కాదు.
ఆత్మనిర్భరత పేరుతో ప్రధాని ప్రోత్సహించే ఈ తరహా విధానాలు అమెరికన్ మిలిటరీ ఇండిస్టియల్ కూటమికి భారీ లాభాలు తెచ్చిపెట్టడానికి మాత్రమే తోడ్పడతాయి తప్ప దేశాన్ని, రక్షణ వ్యవస్థను నిజంగా బలోపేతం చేయడానికి మాత్రం ఉపయోగపడవు. దేశ రక్షణ వ్యవస్థను ఆధునీకరించే పేరుతో మోడీ ప్రభుత్వం చేస్తున్నది నిజానికి దేశ సంపదను ప్రయివేటీకరించడమే.
- బి. అర్జున్
(స్వేచ్ఛానుసరణ)