Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలిపే అవకాశాలు, నిలపాల్సిన అవసరం గురించి గతవారం ఇదే శీర్షికలో చర్చిం చాం. అందులో అనేక చిక్కులు ఉన్నా మోడీసర్కారు ఏక పక్షపోకడలూ, రాష్ట్రాలపైదాడి, మతతత్వ రాజకీయాలకు ప్రతిగా ప్రజల్లోకి సంకేతాలు పంపడం అవసరమనేది నిర్వివాదాంశం. ఇప్పటి వరకూ ఒక్కసారి మినహా రాష్ట్రపతి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భం లేదు. ప్రతిపక్షాల మధ్య అనైక్యత కారణంగా ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉండదని బీజేపీ నాయకత్వం భావించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ విషయమై ప్రాథమికంగా చర్చలు జరిపినప్పటికీ, మరో వైపున బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఉమ్మడి అభ్యర్థిపై చర్చల కోసం ప్రతిపక్షాలకు లేఖ రాశారు. ఈ విధమైన సమావేశాలు ముందుగ చర్చించుకోవాలి గాని తమకు తామే తేదీ నిర్ణయించి ఇతరులు రావాలనడం సరికాదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభ్యంతరం తెలిపారు. తర్వాత ఆమెకు రాసిన లేఖలోనూ ఈ వ్యాఖ్యను పునరుద్ఘాటిస్తూనే రాజ్యసభ సభ్యుడు ఎలగారం కరీమ్ హాజరవుతున్నట్టు తెలిపారు. బుధవారం జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్తో సహ పదిహేడు పార్టీలు చర్చలు జరిపి ప్రతిపక్షం తరపున ఒక అభ్యర్థిని ఎంపిక చేసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయం చేసిన పార్టీలు బెంగాల్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, చత్తీస్ఘర్, మహా రాష్ట్రలలో అధికారంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటక, హర్యానా పాండిచ్చేరి వంటిచోట్ల బలమైన ప్రతిపక్షాలుగా గణనీయమైన సంఖ్యాబలం కలిగివున్నాయి. ఇంతమంది కలసి ఒకేనిర్ణయానికి రావడం కీలకమైన రాజకీయ పరిణామం.
విభేదాలున్నా విశాల ఐక్యత
ఈ పార్టీలలో అనేకం రాష్ట్రాల స్థాయిలో పరస్పరం తీవ్రంగా ఘర్షణ పడుతున్నా, మోడీ విధానాలను ఎదుర్కొ వలసిన అవసరంపై అంగీకారానికి రావడం ఇక్కడ ప్రధానాంశం. ఇటీవలికాలంలో వాస్తవరూపం దాల్చిన ఒక విశాలమైన అవగాహన ఇది. ఎన్సీపీ అధినేత శరద్పవార్ పేరు మొదటివరసలో వచ్చినా, క్రియాశీల ప్రభావశీల రాజకీయవేత్తగా ఆయన అందుకు నిరాకరించారు. తర్వాత మాజీ బెంగాల్ గవర్నర్, మహాత్ముని మనవడు గోపాలకృష్ణ గాంధీపేరు వచ్చింది. మరో ప్రతిపాదన కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. వీటిలో ఏది తుది నిర్ణయమైనప్పటికీ, ఉమ్మడి అవగాహనకు రావడం లౌకికశక్తులు ఆహ్వానిం చదగిన పరిణామం. ఈ ప్రక్రియ గమనించిన కేంద్రం కూడా ఏకాభిప్రాయంతో రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సంప్రదింపులకోసం సీనియర్ మంత్రి రాజ్నాథ్సింగ్ మరో ఇద్దరితో కమిటీనీ వేసింది. మీరే మా అభ్యర్థిని బలపర్చితే బాగుం టుందని కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే బదులిచ్చారు. ఇంత ఆలస్యంగా, అది కూడా ప్రతిపాదన లేకుండా చర్చ అనడం మొక్కుబడి వ్యవహారమేననీ, ప్రతి పక్షాలను నిందించే తంతు అనీ అందరికీ తెలుసు. గతంలో నీలం సంజీవరెడ్డి, కెఆర్ నారాయణన్ వంటివారి పేర్లపై ఏకాభిప్రాయం వచ్చింది. మరికొన్నిసార్లు పాలకపక్షం ప్రతి పాదించిన అభ్యర్థిని ప్రతిపక్షాలు బలపర్చిన ఉదాహరణలున్నాయి. ఉదాహరణకు శంకర్దయాళ్ శర్మ, ప్రణబ్ ముఖర్జీ వంటివారిని వామపక్షాలతో సహా పలు పార్టీలు బలపర్చాయి. ఇక్కడ ముఖ్య మైంది అభ్యర్థి నేపథ్యం, విశ్వసనీయత, రాష్ట్రపతి స్థానానికి తగిన అర్హతలు. ఇప్పుడైనా ఏకాభిప్రాయానికి వ్యతిరేకత లేకున్నా అభ్యర్థి పేరు చెప్పకుండా చర్చలు జరగడం అసాధ్యమని సీతారాం ఏచూరి స్పష్టంగానే చెప్పారు. నామినేషన్లకు మరోవారంపైగా గడువు ఉంది గనక ఆలోగా పాలకపార్టీ వ్యూహం తేలిపోతుంది.
పాల్గొనని టీిఆర్ఎస్, ఆప్
ఈ సమావేశానికి మమతా బెనర్జీ ఆహ్వానం పంపినా హాజరవని పార్టీల పరిస్థితి ఏమిటి? ఈ జాబితాలో వైసీపీ, బీజేడీ, టీఆర్ఎస్, ఆప్ ఉన్నాయి. (తెలుగుదేశంను పిలవలేదు) ఇందులో మొదటి రెండు పార్టీలు బీజేపీతో సఖ్యంగా ఉంటున్నాయనే విషయం దేశమంతటికీ తెలుసు. ఈ ఎన్నిక అనగానే ప్రధాని మోడీ ముందుగా పిలిచి మాట్లాడింది వారితోనే గనక వారు రాకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇటీవలి కాలంలో కేసీఆర్ బీజేపీ విధానాలపై విమర్శల హోరెత్తిసూ,్త దేశాభివృద్ధిలో పార్టీలన్నీ విఫలమైనాయని ఆరోపిస్తున్నప్పటికీ టీఆర్ఎస్ కూడా హాజరు కారాదని నిర్ణయిం చారు. తెలంగాణలో తమను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్తో కలసి పాల్గొనరాదు గనక ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆపార్టీ ప్రతినిధులు మీడియా చర్చల్లో చెప్పారు. మమత సమావేశం ఏర్పాటు చేసిన తీరు బాగాలేదనీ కేసీఆర్ చెప్పినట్టు కథనాలు విడుదలైనాయి. సీపీఐ(ఎం), కాంగ్రెస్ మరికొన్ని పార్టీలు కూడా ఇదే విమర్శ చేసినా, రాష్ట్రపతి ఎన్నికపై ప్రతిపక్షాలు ఉమ్మడి వైఖరి తీసుకోవాలన్న వాస్తవానికి అనుగుణంగా వ్యవహరిం చాయి. సీపీఐ(ఎం)కు కేరళలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. బెంగాల్లో తృణమూల్ తీవ్ర నిర్బంధం సాగిస్తున్నది. అయినా సరే ఈ విషయంలో బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్యత అవసరం గనక పాల్గొన్నది. నిర్మాణాత్మక సూచనలు చేసింది.
చెప్పే కారణాలు నిజమా?
అధికారికంగా ఎలాటి ప్రకటన చేయకుండా కాంగ్రెస్ పేరిట దూరంగా ఉన్న టీఆర్ఎస్ తన విధానం మాత్రం వెల్లడించలేదు.19వ తేదీన తమ విస్త్రతసమావేశంలో చర్చ జరుగుతుందని చెబుతున్నారు. కాంగ్రెస్పై ఎన్ని విమర్శలు చేసినా అదీ బీజేపీ ఒకటేనని చెప్పడం వాస్తవికత కాజాలదు. ఆ పార్టీ బాగా బలహీనపడినప్పటికీ ఎక్కువ రాష్ట్రాలలో ఎంఎల్ఎలు ఎంపీలు ఉన్నది వారికే. కాంగ్రెస్ ప్రధాన పాత్రధారిగా నాయక స్థానంలో ఉండాలనే వారి కోర్కె, షరతు నిలిచేదికాదని ఇప్పటికే తేలిపోయింది. కాని అసలు ఆపార్టీ ఉండే ఏ వేదికలోే పాల్గొనబోమని చెప్పడమంటే బీజేపీపై విశాల పోరాటానికి గండి కొట్టడమే అవుతుంది. మోడీకి అంతకంటే ఆనందం ఉండదు.కేసీఆర్ గతంలో కాంగ్రెస్ నాయ కత్వంలోని మొదటి యూపీఏలో మంత్రిగా ఉన్నారు. 2018లో ఆకస్మిక ఎన్నికలు ప్రకటించి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు ముందుగా మమతా బెనర్జీనే కలుసుకున్నారు. కాంగ్రెస్తో మిశ్రమ ప్రభుత్వం నడుపుతున్న మహారాష్ట్ర ముఖ్య మంత్రినీ, దాని మిత్రపక్షమైన డిఎంకె ముఖ్యమంత్రినీ కలిసి వచ్చారు. కనుక అది ప్రధాన సమస్యగా ఆయన భావించలేదు.
కేసీఆర్ ఒక్కరితోనే చెక్నిజమా?
ఈ సందర్భంగానే కేసీఆర్ జాతీయస్థాయిలో పార్టీ పెడతారని టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవుతుందని అనధికారికంగా చర్చ తీసుకొచ్చారు. ఆ పార్టీ రూపురేఖల వివరాలు చెబుతున్నారు.19వ తేదీ సమావేశం తర్వాత స్పష్టత వస్తుందంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్తో కెేసీఆర్ ప్రత్యేకంగా పిలిచి చర్చించారు. ఆ తర్వాత ఉండవల్లి కేసీఆర్ సమర్థతపైన వాక్పటిమపైన ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు బలహీనపడిన ప్రస్తుత పరిస్థితిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రస్తుతం దీటుగా పొరాడగలిగింది ఆయన ఒక్కరేనని కితాబునిచ్చారు. బీజేపీ అనర్థదాయక విధానాలపై కేసీఆర్ చేసిన అధ్యయనం గురించి ఆకాశానికెత్తారు. ఈ విషయమై మొదటి నుంచి అపారమైన సమాచారం వెలువరించి నికరంగా పోరాడుతూ నిలవరించిన వామపక్షాల పాత్ర మాత్రం ప్రస్తావించలేదు. మూడు భాషలలోనూ అద్బుతంగా మాట్లాడతారు గనక కెేసీఆర్ ఒక్కరే మోడీకి చెక్ పెట్టగలరని విపరీతంగా పొగిడారు. టీఆర్ఎస్ ప్రస్తుత విధానం, బిఆర్ఎస్గా మార్చే యోచన వంటివాటిపై మాట్లాడలేదని దాటేయడం అన్నిటికన్నా విడ్డూరం. ఇంకోవైపున ప్రగతిభవన్ కనుసన్నలలో మసలే మేధావులు, మాజీ సంపాదకులు కొందరు దేశానికి ఆయన నాయకత్వం ఎంత అవసరమో నిగ్గడిస్తున్నారు. ఉండవల్లితో సహా ఇట్లాంటివారు ఏం చెప్పినప్పటికీ టీఆర్ఎస్కు చాలాపరిమితులున్నాయి. గతంలో మోడీని అతిగా పొగిడిన నేపథ్యముంది. బీజేపీకి గట్టి వ్యతిరేక వైఖరి వినిపిస్తున్నప్పటికీ టీఆర్ఎస్ కార్యాచరణ అస్పష్టంగా ఉన్నది. ద్వంద్వభాషణం సందేహాలకు కారణమవుతున్నది. కేంద్రం దాడుల నేపథ్యంలో ఇతర చోట్ల కూడా పోటీ చేసి జాతీయపార్టీకి కావలసిన కనీస ఓటింగు సమకూర్చుకుందా మనుకుంటున్నారా? లేక జాతీయ నాయకత్వం పేరిట తెలంగాణలో గెలవాలని వ్యూహరచన చేస్తున్నారా అనేది అందరిమదిలో ప్రశ్న. 2018కి ముందు కూడా దేశ్కీ నేత కేసీఆర్ నినాదాలు విన్నాం. 2019తర్వాత మళ్లీ అది వెనక్కుపోయి ఇప్పుడు ఎన్నికల ముందు బీజేపీ వ్యతిరేక వైఖరితో ముందుకు వచ్చారు.
విస్త్రత ఏకాభిప్రాయం
దేశాభివృద్ధికి అమోఘమైన ప్రణాళిక తీసుకురావడం కీలకం తప్ప మోడీని గద్దెదింపడం చెత్త ఎజెండా అని తమ పార్టీ విస్త్రత సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం కమ్యూనిస్టు నాయకులతో కలవలేనని చెప్పానన్నారు. జాతీయ పార్టీల పని అయిపోయింది ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ అని గతంలో అనేవారు. ఇప్పుడు ఆఘమేఘాల మీద జాతీయ పార్టీ ఏర్పాటు చేసి మోడీని ఒంటరిగా ఢకొీంటానంటున్నారు. జాతీయపార్టీ అంటే ఇతర రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఆహ్వానించే సమస్యే ఉండదు. దేశంలో ఇంతవరకూ ఒక ప్రాంతీయ పార్టీ ఉన్న ఫళాన జాతీయపార్టీ అయిన ఉదాహరణా లేదు. టీఎంపీ, ఎస్పీ, బీఎస్పీ వంటివి జాతీయ పార్టీలంటున్నా ఒక రాష్ట్రంలోనే ప్రధానంగా పనిచేస్తున్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆప్ పంజాబ్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాట నిజమే అయినా దానికి అనేక కారణాలున్నాయి. ఇతరచోట్ల ఇప్పటికీ కాలూనిందిలేదు. ఆప్కూడా ఈసమావేశంలో పాల్గొనలేదు. ప్రతిపక్ష కూటమి నాయకత్వం కోసం మమత, కేజ్రీవాల్, కేసీఆర్ పోటీ పడుతున్నారంటూ రాజకీయవర్గాలలో ఉన్న భావన సరైందేనని ఈ సమావేశం స్పష్టంచేసింది. ఎవరి ఆశలూ ఆలోచనలూ అవసరాలూ వారికి వుండొచ్చుగానీ, రాష్ట్రపతి ఎన్నిక సమయంలో ఉమ్మడి వైఖరికి అవి అవరోధం కావడం విచారకరం. ఇవన్నీ ఎవరికి సంతోషంకలిగిస్తాయో చెప్పనవసరం లేదు.
ఏదిఏమైనా ఎవరు గైర్ హాజరైనా 16 పార్టీలు ఒకే అభ్యర్థిని నిలపాలని నిర్ణయించడం ఆహ్వానించదగింది. ఈ సందర్భంలో వారు రాలేదు గనక ఐక్యత లేదని కొందరు చిత్రించం చెల్లుబాటు కాదు. నిజానికి ప్రతిపక్ష ఐక్యతా సూచి (అపోజిషన్ యూనిటీ ఇందెక్స్) మెరుగుదలనే ఇది ప్రతిబింబిం చింది. భవిష్యత్తులో బీజేపీపై జరగాల్సిన పోరాటానికీ, అంతి మంగా 2024 ఎన్నికలపోరాటానికీ అది దోహదపడుతుంది.
- తెలకపల్లి రవి