Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో తాము హ్యాట్రిక్ సాధిస్తామని, దక్షిణ భారతంలో ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ ధీమావ్యక్తం చేశారు. మరోవైపున ప్రధానితో సహా బీజేపీ నాయకులంతా విచ్చేసి తమ ముఖ్యమంత్రే కొత్త సచివాలయానికి వెళతారని ఢంకా బజాయించారు. ఇదిలా ఉంటే కాలూ చేయి కూడదీసుకుంటున్న టి.కాంగ్రెస్ నిజంగా వచ్చేది తామేనని, ఎన్నికలు త్వరగా రావాలని ఉవ్విళ్లూరు తున్నామని అంటోంది. వచ్చే ఎన్నికల్లో తాము శాసనసభలోని మొత్తం నూటడెబ్బయైదు స్థానాలు తెచ్చుకుంటామని వైఎస్ఆర్సిపి హడావుడిచేస్తున్నది. వారి ప్లీనరీలోనూ అదే నినాదమైంది. ఇక తెలుగుదేశం నాయకులైతే తమను ఎన్నుకోవాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని చెబుతూ రెండేండ్లలో తిరిగివచ్చి అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని ప్రకటించు కుంటున్నారు. తానెందుకు వెనకబడాలని జనసేనాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్నారు. ఈ పోటాపోటీ ఆశల మధ్య వివిధ సర్వే సంస్థలు, పత్రికల అభిప్రాయ సేకరణలు అంటూ వెలువడుతున్నాయి. సమస్యలపై న్యాయమైన సమ్మెలూ, ఆర్థిక సంక్షోభాలు, ఆఖరుగా వరద ముప్పు చుట్టుముట్టినవేళలోనూ ఎప్పుడొస్తాయో తెలియని ఎన్నికలే ఎజెండా అయినట్టు పార్టీలు ప్రవర్తించడం, మీడియా చర్చలన్నీ ఆ వైపేమరలడం యాదృచ్చికం కాదు. రాజకీయ పార్టీలు తామే గెలుస్తామని చెప్పుకోవడంలో వింతేమీ లేదు గానీ, దేశం ముందూ రాష్ట్రాల ముందూ ఉన్న సమస్యలు పక్కన పెట్టి అధికారం చుట్టూనే ప్రదిక్షణలు చేయడం, తమకు తామే విజేతలైపోయినట్టు ప్రవర్తించడం మటుకు ఆశ్యర్యం కలిగిస్తుంది. మతతత్వం, ఏకపక్ష నిరంకుశత్వంతో దేశాన్ని పాలించే పార్టీ సమావేశాలు ఇక్కడే జరిగినా ఈ రాష్ట్ర సమస్యలపై పెదవి మెదిపింది లేదు. టీఆర్ఎస్ వామపక్షాలను మినహాయిస్తే మిగిలిన పార్టీలకు(చాలా వరకూ టికాంగ్రెస్ కూడా) అది ప్రధాన సమస్య కూడా కాలేదు. గతవారం.
ఏపీ, తెలంగాణ సర్వేల సారాంశం
వైసీపీ ప్లీనరీ భారీఎత్తున తలపెట్టినప్పుడు రాష్ట్ర భవిష్యత్తుకు దశ దిశ చూపిస్తుందని నాయకులు చెప్పారు. కానీ జరిగిందంతా జగన్నామ స్మరణే. జగనే సత్యం, మంత్రులూ ఎంఎల్ఎలు మిథ్య అన్నస్థాయిలో ప్రముఖ నాయకులే మాట్లాడారు. ఆ ప్టీనరీలో జగన్ భజన, సంక్షేమ పథకాల గొప్పలు, వ్యతిరేక రాజకీయశక్తులపై దాడి, విజయమ్మ రాజీనామా-జగన్కు జీవిత కాల అధ్యక్షపదవి, 175 స్థానాలూ తెచ్చుకోవడం... అంతే, అయిదే అంశాలు. తీర్మానాలు అంటున్నా భజనతో కలిపి 10.15 నిముషాలకన్నా మాట్లాడింది లేదు. మూడు రాజధానుల మాట మానిందీ లేదు. బీజేపీ సమావేశాలు, వైసీపీ సమావేశాల నేపథ్యంలో మొదలైంది సర్వేల సందడి. ఎస్ఎఎస్ గ్రూపుగా పేరుమార్చుకున్న ఆత్మసాక్షి ఎంఎల్ఎల గడపగడప కార్యక్రమం సందర్బంలో అభిప్రాయ సేకరణ విడుదల చేసింది. వైసీపీకి 75-77, టీడీపీకి 60-62, జనసేన 6-7, ఇతరులకు 1వస్తాయని అంచనావేసింది. 18-23 తీవ్రపోటీ ఉంటుందన్నది. అదే సంస్థ తాజాగా తెలంగాణపై జరిపిన సర్వేలోనూ టీఆర్ఎస్కు 56-59 స్థానాలు వస్తాయని, మజ్లిస్కు ఏడువస్తాయని చెప్పింది. కాంగ్రెస్ 37-39 స్థానాలతో రెండో స్థానంలో ఉంటుందని, బీజేపీ 14-16తో మూడోస్థానానికే పరిమితమనీ పేర్కొంది. మరో సంస్థ ఆరా కూడా మీడియా గోష్టి జరిపి మరీ ప్రకటించిన సర్వేలోనూ టీఆర్ఎస్కు ఓటింగు 46శాతం నుంచి 38.88 శాతానికి తగ్గినట్టు, బీజేపీకి 23శాతం నుంచి 30.48శాతానికి పెరిగినట్టు చెప్పింది. కాంగ్రెస్కు 23.71, ఇతరులకు 6.93 ఓట్లు చూపించారు. ఆరా అధినేత మస్తాన్రావు గతంలో బీజేపీ ఎబివిపిలతో సంబంధంకలిగిన వారు గనక వారిని పెంచి చూపినట్టు కాంగ్రెస్ ఎదురు దాడి చేసింది. టీవీ చానల్ విడిగా జరిపిన చర్చలో మస్తాన్ గతంలో తన రాజకీయ అనుబంధం నిజమేనని ఒప్పుకున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ క్షేత్రస్థాయి అధ్యయనం మేరకు తమకు అనుకూల అంచనాలు అందాయని ప్రకటించింది. ఏమైనా ఒకటి బీజేపీకి, ఒకటి కాంగ్రెస్కు అనుకూలమైన రెండు సర్వేలు తమకే ప్రథమస్థానం ఇచ్చాయి గనక కేసీఆర్ హ్యాట్రిక్ సిఎం అవుతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ విధంగా చెప్పడం ద్వారా ఊహాగానాలు కూడా తోసిపుచ్చి ఆయనే కొనసాగుతారని చెప్పినట్టయింది.
వైసీపీ బలం తగ్గనున్నట్టు ఎస్ఎఎస్ సర్వే ఇచ్చిన అంచనా 'గడపగడపకు' సమయంలో చేసిందైతే, ప్లీనరీ తర్వాత సిఎన్వోఎస్ అనే జాతీయసంస్థ జరిపిన అభిప్రాయసేకరణ విడుదలైంది. రాష్ట్రంలో జగన్ పట్ల జనాదరణ బాగాతగ్గినట్టు, ఆయన ముఖ్యమంత్రుల జాబితాలో 20వ స్థానంలో ఉన్నట్టు సిఎన్ఎస్వో వెల్లడించింది. ఆయనకు 39శాతం అనుకూలంగా 29 శాతం వ్యతిరేకంగా ఉంటే 32శాతం ఎటూచెప్పలేదన్నది సర్వే సారాంశం. ఇందులో కేసీఆర్ 9వ స్థానంలో ఉన్నారు. మోడీకి పట్ట ఆదరణ పెరిగినట్టు, నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలోనూ, యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలోనూ, రాజీనామా చేసిన ఉద్ధవ్ థాక్రే మూడో స్థానంలోనూ ఉన్నట్టు పేర్కొంది. మొత్తం మీద ఇది ప్రధానంగా మోడీని, ఆ తరువాత బీజేపీ దాని మిత్రులను పైకిలేపడం కనిపిస్తుంది.
విషయంలేని వివాదం
ఈ సర్వే విడుదల కాగానే వైసీపీ నేతలూ మంత్రులూ ఇది టీడీపీ చేయించిందని, చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్న వ్యూహకర్త రాబిన్ శర్మ దీని వెనక ఉన్నారని ఎదురుదాడి మొదలెట్టారు. అయితే ఆయన మొన్న ఫిబ్రవరి వరకే ఉన్నారని టీడీపీ వాదిస్తోంది. రాబిన్ శర్మకు సిఎన్ఎస్వోకు సంబంధంలేదనీ, షోటైమ్ కన్సల్టన్సీ (ప్రై)లిమిటెడ్ అన్న సంస్థలో ఆయన పేరును వైసీపీ వారు ఇక్కడ ఉన్నట్టు చూపిస్తున్నారని ప్రత్యారోపణ చేసింది. సంస్థలు ప్రత్యక్ష పరోక్ష సంబంధాలే గాక రాజకీయాల్లో కూడా వేలు పెడుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఈ వివాదాలు తెగేవి కావు. ప్రశాంత్ కిశోర్ వంటివారు నేరుగా రాజకీయ పార్టీల్లో చేరడం చూశాం. గతంలో సెఫాలజిస్టుగా సర్వేలు వెలువరించిన జీవీఎల్ నరసింహా రావు ఇప్పుడు బీజేపీ ఎంపిగా, ఏపీ బాద్యుడుగా ఉన్నారు.
పెద్ద తేడా ఏమిటి?
ఇక్కడ విశేషమేమంటే జగన్ ప్రజాదరణ 40శాతానికి అటూ ఇటుగా ఉన్నట్టు జనవరిలో ఇండియా టుడే సర్వేలోనూ వచ్చింది. పీకే బృందం ఆధ్వర్యంలో వైసీపీ స్వయంగా నిర్వహించిన ఏప్రిల్ సర్వేలోనూ జగన్కు 65శాతం పైన ఆదరణ ఉన్నట్టు చెప్పినా ఎక్కువమంది ఎంఎల్ఎలు 40-45శాతం దగ్గరే ఉన్నారు. వారిని ఆయన కఠినంగా హెచ్చరించినట్టు కూడా చూశాం. అంతమంది ఎంఎల్ఎలపై అసంతృప్తి ఉంటే దాని పొడ ముఖ్యమంత్రికి కూడా సోకాలి కదా! ఇప్పుడు 39శాతం అనుకూలం, 32శాతం తటస్థం అంటే అందులో సగం తీసుకున్నా యాభై అవుతుంది. సర్వేల సంగతి అటుంచి క్షేత్రస్తాయిలో ధరలు, పన్నుల పెరుగుదల కోర్టులలో మొట్టికాయలు, అప్పులు, సంక్షేమ పథకాలలో కోతలు, విద్యారంగంలో సవాళ్లు, ఉద్యోగులు కార్మికుల ఆందోళనలు, అరెస్టులు, నిర్బంధాలు చూస్తూనే ఉన్నాం. కనుక అసంతృప్తి పెరిగి ఆదరణ తగ్గడంలో ఆశ్చర్యం లేదు. నవరత్నాలొక్కటే సమగ్రాభివృద్ధికి దారితీయదు. ప్లీనరీలోనూ వారు ఆవిష్కరించిన ప్రణాళిక ఏమీ లేదు. ఎంఎల్ఎలనూ మంత్రులనూ మందలించి అప్రమత్తం చేసే ముఖ్యమంత్రి మొత్తంగా తన పాలన తీరును సమీక్షించుకోవడం సరిదిద్దుకోవడం జరక్కపోతే ఇది మరింత తీవ్రమవడం అనివార్యం. ప్రధాన ప్రతిపక్షం ప్రజాసమస్యల కన్నా రాజకీయ వివాదాలు, వ్యక్తిగత అంశాలపై కేంద్రీకరించడం వల్ల మీడియాలో ఒక భాగం వాటికే ప్రచారం ఇస్తుండవచ్చు. కాని అంతిమంగా పనిచేసేది ప్రజల జీవిత సమస్యలే. ఈసర్వేలలో కూడా. 42అంశాలు 37సమస్యలు అని అవే అడిగనట్టు చెబుతుంటారు. సర్వేలతో ప్రజలను ప్రభావితం చేయడం మోడీ హయాంలో మరింత పెరిగింది. అనేక సార్లు అవి విఫలమవడం సఫలమవడం కూడా చూశాం. దీనికి పరాకాష్ట ఆంధ్రా ఆక్టోపస్ అని ప్రచారం పొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రహసనమే. ఏమైనా ప్రజాస్వామ్యంలో వాటిని సంకేతాలుగా తీసుకుని తప్పులు దిద్దుకునే బదులు ఎదురుదాడి చేసి ఉపయోగంఏమిటి?
సర్వేల విశ్వసనీయత అలా ఉంచితే ఈ సమయంలో ముందస్తు ఎన్నికల ముచ్చట కూడా హోరెత్తుతున్నది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ముందే ఎన్నికలకు వెళతాయని ఒక ప్రచారం. తెలంగాణలో 2018లో ముందే ఎన్నికలు జరిగాయి. లోక్సభతో సంబంధం లేకుండా జరగాలనే కేసీఆర్ వ్యూహం అందుకు కారణం. నిజంగానే లోక్సభ ఎన్నికల్లో వారి బలం తగ్గింది. ఇప్పుడు కూడా ఆదాటున ఎన్నికలు ప్రకటించి కేసీఆర్ ప్రతిపక్షాలను దెబ్బతీస్తారని ప్రచారం సాగుతోంది. బీజేపీ నేతలైతే వెంటనే ఎన్నికలు పెట్టు అని సవాళ్లు విసురుతున్నారు కూడా. మీరు లోక్సభ రద్దు చేసి ఎన్నికలకు వెళితే మేమూ రెడీ అంటోంది టీఆర్ఎస్. ఏపీలో కూడా అడపాదడపా అలాంటి కథనాలే మీడియాను ఆక్రమిస్తుంటాయి. మొన్న ప్లీనరీలో కూడా వైసీపీ వారు ముందస్తు ఉండదని ఖండించారు. అయినా సీఎం ఇప్పటి నుంచి జనంలో ఉండి ఎన్నికలకు సిద్ధం కావాలని చెబుతున్నారు. అంటే రెండేండ్లు వచ్చే ఎన్నికల సన్నాహాలలోనే మునిగితేలతారా అనేది ప్రశ్న. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇప్పటికే జిల్లాల వారి పర్యటిస్తూ ఎన్నికలు అభ్యర్థులు ఇన్ఛార్జిలు వంటివి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎంజిఆర్ తరహాలో కొన్ని దానధర్మాలు చేస్తూ రాజకీయాలు జోడిస్తున్నారు. ఈ మూడు పార్టీల రాజకీయాల్లో పరస్పర దూషణలు తప్ప కేంద్రాన్ని, మోడీని ప్రశ్నించడం మాత్రం అస్సలస్సలు జరగదు. ఆ విధంగా ఏపీ రాజకీయ ఎజెండాలో కీలకమైన భాగం లేకుండా పోతోంది. తెలంగాణలో కేసీఆర్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నా ఎవరితో కలసి ఏ మేరకు పనిచేస్తారనేది ప్రశ్నార్థకమే. హ్యాట్రిక్ స్వప్నం నిజం కావాలంటే కేంద్రంపై విమర్శతో పాటు టీఆర్ఎస్ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది.
- తెలకపల్లి రవి