Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాత ఇనుప సామాను కొంటాం... పాతా ఇనుప సామాను కొంటాం... కిలోల లెక్క కొంటాం... గుండు గుత్తగా కొంటాం... అంటూ ఊర్లల్లో పొద్దుగాల నుంచి పొద్దుం దాక ఓ నలుగురైదుగురు బేరగాళ్లయినా వచ్చిపోతుంటరు. రోజంతా తిరిగి ఓ ఆటో నింపుకుని పోతరు. ఎంత విలువ వస్తువునైన అగ్వ రేటుకు కొనేందుకు ప్రయత్నిస్తారు. అమ్మేవారేమో.. ఇంకో ఆయన వస్తే పైసల్ మంచిగ ఇచ్చిపోతడు. నువ్వైతే అడ్డికి పావుసేరు లెక్క అడుగుతున్నవ్. ఇయ్యంపో అని మొహం మీదనే చెప్పి ఎళ్లగొడ్తరు. పోటీ బేరగాడు వచ్చి దానికంటే రూపాయి ఎక్కువ ఇస్తనన్నా.. పొద్దుగాల వచ్చినాయన నీకంటే రెండు రూపాయలు ఎక్కువ ఇస్తానన్న ఇయ్యలే.. నీకేట్ల ఇస్తాం అని తిప్పి పంపుతరు. బేరగాళ్లు కూడా మనుషులను బట్టి నడుచుకుంటారు. ఒక్కో కాడ ఒక్కో రేటు పెట్టి కొని వ్యాపారం చేస్తుంటారు. ఇప్పుడు ఈ వ్యాపారం లెక్కనే మునుగోడులో ఓటర్లను కొనే తంతంగం నడుస్తున్నది. ఓట్లు కొంటాం.. ఓట్లు కొంటాం... విడివిడిగా కొంటాం.. గంప గుత్తగా కొంటాం... అంటూ రాజకీయ బేరగాళ్లు ఊర్ల మీద పడి మనుషులనాగం చేస్తున్నారు. లేని ఆలోచనలు మెదళ్లలోకి విషంలా ఎక్కించి కలుషితం చేస్తున్నారు. పాత ఇనుప సామాను లెక్క ఓట్లకు విలువ గట్టి నేతలు అమ్ముకుంటున్న దౌర్భాగ్యస్థితి ఎటువైపు దారితీస్తుందో... కొసమెరుపు ఏంటంటే అరె బై పోయినసారి నువ్వు పైసలు ఖర్చు పెట్టినందుకే ఓడినవ్ అని ఓ పార్టీ అగ్రనేత అంటే.. కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న మరో పార్టీ అగ్రనేతనేమో నీకు 22 వేల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చినం.. అందులో 1000 కోట్లు నాయిగావు అనుకోని ఖర్చు పెట్టు పార్టీని గెలిపించు.. పైసలు మొఖం చూడొద్దు. 100 కోట్లు ఖర్చు పెడతావా.. 200 కోట్లు ఖర్చు పెడతావా.. 500కోట్లు ఖర్చు పెడతావా.. 1000 కోట్లు ఖర్చు పెడతావా నీ ఇష్టం గెలిచి రాకపోతే మాత్రం మామూలుగా ఉండదు మరి... అని హెచ్చరించి పంపాడంట. ఓ ప్రజలారా మీ ఓట్లను తూకం వేసి కొంటున్న బూరాపా బేరగాళ్లు లాభం చూసుకుంటరు గాని బాగోగులు చూడరనే విషయాన్ని జర యాది మరవకండి.. ప్లీజ్...
-అచ్చిన ప్రశాంత్