Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలోని కొందరు చక్రవర్తులు తమ మంత్రులుగా, సేనాపతులుగా ఎవరిని ఎంచుకున్నారో, ఎవరిని నియమించుకున్నారో గమనించండి. వ్యక్తిగత అభిప్రాయాలు ఏవి ఉన్నా, వాటిని ఒక్కక్షణం పక్కనపెట్టి, సమదృష్టితో ఆలోచించి చూడండి. అక్బర్ చక్రవర్తి ముస్లిం రాజు కదా? అతని దగ్గర పనిచేసిన వారు హిందువులైన తోడర్మల్, బీర్బల్, మాన్సింగ్! ఛత్రపతి శివాజీ హిందూ రాజు కదా? అతని దళపతిగా పనిచేసినవాడు దర్యాసారంగ్. సేనాపతులు ఇబ్రహింఖాన్, దౌలత్ ఖాన్లు అయినప్పుడు వీరు మతవాదులవుతారా? లౌకికవాదు లవుతారా? ఏ కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నవారికైనా విషయం బోధపడుతుంది. ఆ తర్వాత ఔరంగజేబు సర్వసైన్యాధిపతి జయసింగ్. ఇక దక్షిణ భారతదేశంలో టిప్పుసుల్తాన్ దగ్గర ప్రధానిగా ఉన్నది పూర్ణయ్య. హైదరాబాదు తానీషా దగ్గర మంత్రులు అక్కన్న, మాదన్నలు. మరి వీరిని లౌకికవాదులందామా? మతవాదులందామా?
సరే, ఈ విషయాలు అలా ఉండనిచ్చి - వీరశైవులు, వీరవైష్ణవుల మధ్య హౌరాహౌరిగా పోట్లాటలు ఎందుకు జరిగాయి? ఇద్దరూ వైదిక మతాచారాలు పాటించినవారే కదా? మరి వీరి మధ్య మారణహౌమాలు ఎందుకు జరిగాయి? వీరిలో మతవాదులెవరు, లౌకికవాదు లెవరన్నది ఇప్పుడు ఆలోచించి తేల్చుకోండి! మనువాదులు అఘాయిత్యాలకు, అత్యాచారాలకు పాల్పడి, వారి తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి గత కాలపు ముస్లిం పాలకుల్ని, ఈ కాలపు ముస్లిం పౌరుల్ని దుయ్యబడు తుంటారు. అర్థరహితమైన వాదనలు చేస్తూ, అభాసుపాలవు తుంటారు. ఒక క్రమ పద్ధతిలో విశ్లేషించుకుంటూ వస్తే, గతంలోనూ, ప్రస్థుతంలోనూ మనువాదులు చేసిన, చేస్తున్న దుర్మార్గాలు స్పష్టంగా కళ్ళముందుంటాయి. ఇలాంటి వాస్తవ స్థితిగతులు నెమరువేసుకుంటూ దేశం విశ్వగురువు కాలేదు. వీలైనంత వరకు అభూత కల్పనలు ప్రచారం చేసుకుంటూ, 'విశ్వగురువు' అయ్యానని అనుకుంటోంది.
దేశం విశ్వగురువుగా నిలబడాలంటే ఇదిగో ఇలాంటి కట్టుకథలు నమ్ముతూ బతుకు తుండాలి! ఉదాహరణకు కొన్ని చూద్దాం!! రాముడు పాయసానికి పుట్టాడు. సీత భూమికి పుట్టింది. వినాయకుడు నలుగుపిండికి, పార్వతి మంచుకొండకు పుట్టారు. శ్రీశుకుడు చిలుకకు, మాండవ్యుడు కప్పకు, శౌనకుడు కుక్కకు, అశ్వద్థామ గుర్రానికి, విశ్వామిత్రుడు గాడిదకు, వాల్మికి పుట్టకు, రుష్యశృంగుడు జింకకూ పుట్టారు! విష్ణుమూర్తి బొడ్డులోంచి బ్రహ్మ పుడితే, బ్రహ్మ మనసులోంచి సరస్వతి పుట్టింది. ఇకపోతే, ఆదిశక్తి గుడ్లుపెట్టగా త్రిమూర్తులు పుట్టారు కదా? మహాలక్ష్మి పాల సముద్రానికి, కర్ణుడు సూర్యుడికి పుట్టారు. కట్టుకథల కల్పిత పురాణాల్లో జన్మవృత్తాంతాలు చాలా విచిత్రంగా ఉంటాయి. సరే, గొప్ప సృజనాత్మక రచనలంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, అవన్నీ నిజం, వాటిని మనస్ఫూర్తిగా విశ్వసించాలి. విశ్వసించి పూజించాలి, పూజించి మోక్షం సాధించాలి, జన్మ రాహిత్యం సాధించాలి - అని మత పండితులు, మత బోధకులు చెపుతూ ఉంటేనే చోద్యంగా ఉంటుంది. వారి అజ్ఞానానికి జాలి కలుగుతుంది. ఒకవైపు ఆధునిక మానవులుగా జీవిస్తూ, మరోవైపు విచక్షణా జ్ఞానం లేని, మానవ జాతి 'తొలిదశలోని వారిగా' ఆలోచిస్తూ ఉంటే, బాధకలుగుతుంది! వీరెప్పుడు ఆధునికుడి ఆలోచనను అందుకోగలరూ? అని, అనిపిస్తుంది. వారి మెదళ్లను చుట్టుకుని ఉన్న మూఢత్వాన్ని బద్దలుకొట్టుకుని బయటపడితే గాని వారికి వాస్తవాలు అర్థం కావు. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశ ప్రజలు బయటపడరు. ఈ దేశ నాయకులు బయటపడనీయరు. బయట పడితే దేశం విశ్వగురువు కాకుండా పోతుందే మోనని... వారికి బెంగ, బుగులు. తాము ఎలా చచ్చినా ఫరవాలేదు కానీ దేశం మాత్రం మూర్ఖత్వానికి బ్రాండ్ ఎంబాసిడర్గా నిలబడాలన్నదే వారి కోరిక! ప్రపంచం నవ్విపోతున్నా పట్టించుకోకుండా 'తామే విశ్వగురువులమ'ని చెప్పుకు తిరుగుతుండాలి!
''వేదాలు 1.96కోట్ల పూర్వం వెలువడ్డాయి. ఓం-అనే శబ్దతరంగాలే ప్రపంచంలోని అన్ని శబ్దతరంగాలకు మూలం - స్తబ్దుగా ఉన్న ప్రకృతి ఓం శబ్దంతోనే చైతన్యవంతమవుతుంది. మానవ మస్తిష్క చైతన్యానికి ఓం-శబ్ద తరంగాలే ముఖ్యం!'' అని చెప్పుకుంటూ ఆత్మద్రోహం చేసుకోవడం తప్పిస్తే... ఏదీ రుజువు కాలేదు. ఇలాంటి మూర్ఖత్వం వ్యాప్తిచేస్తూ పాపం దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలని తాపత్రయ పడుతుంటారు. గత కాలపు పురాణాలే కాదు, వాటి సారాంశాన్ని నేటి వ్యాపార సినీమాలు కూడా తమ శాయశక్తులా ప్రచారం చేస్తున్నాయి. అఖండ, దేవి, నాగదేవత, పాతాళభైరవి, దయ్యం, పిశాచం, ఆత్మ మొదలైన ఫాంటసీ ఫిక్షన్కు సంబంధించినవి - ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చూపించే సినిమాలన్నీ సమకాలీన సమాజాన్ని తప్పుదారి పట్టించేవే. దర్శక, నిర్మాతల, సినీ హీరోల నమ్మకాలకు మరింత మూర్ఖత్వాన్ని మూఢత్వాన్ని జోడించి- ముఖ్యంగా సైన్సును వాడుతూ, సైంటిఫిక్ స్పిరిట్కు వ్యతిరేకంగా సినిమాలు తీయడం - జనావళిని అంధవిశ్వాసాల్లో ముంచడం క్షమించరాని నేరం! సమాజ ద్రోహం!! బహుశా దేశం విశ్వగురువు కావాలంటే ఇలాంటి అసందర్భమైన, అసంగతమైన అబద్దాల ప్రచారం కొనసాగాల్సిందేనేమో?
అనాదిగా స్తవము, సుప్రభాతం, సంకీర్తనం - దేవాలయ గోపురాల మీద, గోడల మీద అంతా శృంగారమే! ప్రపంచంలో ఇంతటి పచ్చి శృంగార భావనలు మరో చోట ఎందుకు లేవూ? ఈ సనాతన / వైదిక / బ్రాహ్మణ సంస్కృతిలో మాత్రమే ఎందుకు ఉన్నాయీ? ఆలోచించాల్సి విషయం. దేశం విశ్వగురువు కావాలంటే ఈ పచ్చి శృంగారం తప్పదా? కన్నతల్లి లాంటి అమ్మవారిని 'జగడపు చనువుల జాతర' చేయించిన అన్నమయ్యను ఏమనాలీ? కన్నతల్లిలో కూడా శృంగారం చూసిన అన్నమయ్య, తరతరాల భక్తులకు కూడా ఆ శృంగారాన్నే చూయించాడు కదా? ఆమాట అన్న అన్నమయ్యను తప్పుపట్టరు. ఆయనో భక్తాగ్రేసరుడయి పోయ్యాడు. ఆమాటలో ఉన్న అసలైన అర్థం ఇదీ.. అని చెప్పిన వాడిది మాత్రం తప్పువుతుంది? వారెవ్వా సనాతనమా? అయ్యారే ఛాందసమా? మరి దేశం విశ్వగురువు కావడమంటే మాటలా మరి? ఆధునిక నాస్తికోద్యమ నిర్మాత గోరా (15.11.1902- 26.7.1975) ఏమన్నారో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అంతేకాదు, సీరియస్గా ఆలోచించండి... ''దేవుడనేది మానవుడు కల్పించిన అబద్ధం! చాలా అబద్ధాలవలెనే గత కాలంలో అది కొంత వరకు ప్రయోజనకరంగా ఉంటే ఉండిందేమో! కానీ, అన్ని అబద్దాల వలెనే ఇది కూడా రాను రాను జీవితాన్ని కల్మషం చేసింది. కనుక, మానవ సంఘంలో అవినీతి కడిగివేయబడి, నీతి పెరగాలంటే దైవవిశ్వాసం పోవాలి! పోక తప్పదు!!'' అబద్ధాలతో దేశం విశ్వగురువు ఎన్నటికీ కాలేదన్నది గ్రహించాల్సిన సారాంశం.
భారత్ 'విశ్వగురువు' ఎలా అయ్యిందంటే... కొన్ని ఉదాహరణలు చూద్దాం! పేదరికంలో భారత్ నైజీరియాను అధిగమించింది. 2018లో నైజీరియాలో 8.7కోట్ల కటిక పేదలుంటే భారత్లో 7.3కోట్ల కటిక పేదలు మాత్రమే ఉన్నారు. 2022లో నైజీరియాలో పేదలు 7కోట్లకు తగ్గిపోతే, భారత్లో కటిక పేదల సంఖ్య విపరీతంగా పెరిగి 8.3కోట్లకు చేరింది. ఈ దేశ ప్రధాని రోజుకు 18గంటలు అవిశ్రాంతంగా పనిచేసి, దేశంలో దారిద్య్రాన్ని ఘనంగా పెంచుతున్నారు. తమ హిందూత్వ భావజాలంతో దేశాన్ని విశ్వగురువు చేయాలని తాపత్ర పడుతున్నారు. డాలర్తో మన రూపాయి మారకం 2014లో 59గా ఉంటే, 2022లో 80కి చేరింది. రూపాయి విలువ ఎంత పడిపోయిందో, దేశం అంత విశ్వగురువు అవుతుందన్న మాట! వంటగ్యాస్ 2014లో రూ.410 ఉంటే, 2022 నాటికి అది రూ.1053కు పెరిగింది. సామాన్యుడి జీవితం ఎంత భద్రంగా ఉందో అంచనా వేసుకోవచ్చు. 2014లో ఈ దేశానికి అప్పు 58లక్షల కోట్లు ఉంటే, 2022లో దాన్ని గణనీయంగా 139లక్షల కోట్లకు పెంచిన ఘనత బీజేపీ సూపర్ మ్యాన్, కాపలాదారు, చారువాలా అయిన మోడీదే! ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్లో జులై 2022 నాటికి ఇంకా కొనసాగుతున్న విషయం చూడండి... ఆ రాష్ట్రంలో పాఠశాలల్లో కులం పేరుతో వివక్ష ఇంకా కొనసాగుతూ ఉంది. అక్కడ నిమ్నజాతుల పిల్లల్ని విడిగా దూరంగా కూర్చోబెడు తున్నారు. హీనంగా చూస్తున్నారు. 'మేం జంతువులం కాదు గదా? మనుషులమే కదా?' అని ఆ జాతుల ప్రజలు ఆక్రోషిస్తున్నారు. అయితే, వినేవారే లేరు. ఎందుకంటే... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పెద్దలు దేశాన్ని విశ్వగురువు చేసే పనిలో తలమునకలై ఉన్నారు కదా!
సాధారణ శకం 600నాడు ధర్మకీర్తి అనే ఒక బౌద్ధదార్శనికుడు ఇలా అన్నాడు... ''కులాన్ని చూసుకుని గర్వపడటం - వేదాలను ప్రమాణంగా భావించడం - స్నానం ద్వారా పుణ్యం సంపాదించడం - ఉపవాసాల ద్వారా శరీరాన్ని బాధించడం... ఇలాంటి వన్నీ బుద్ధిహీనులు చేసే పనులు.'' దీనికి అనుగుణంగా చార్వాకులు చెప్పిన అంశం గూర్చి కూడా ఆలోచించాలి! ''ప్రతిమా అల్ప బుద్దినాం'' అని అన్నారు వాళ్ళు. అంటే... విగ్రహాలు చేసింది అల్పబుద్ధిగల వారికోసమే! అని అర్థం! ఈసారి వర్షాకాలంలో వర్షాలు విపరీతంగా పడ్డాయి. ఫలితంగా భద్రాచలంలో రాముడు మునిగిపోయాడు. పట్టిసీమలో శివుడు కొట్టుకుపోయినంత పనైంది. కానీ, పొంగే గోదాట్లో పడి చిన్న కుక్కపిల్ల ఒకటి ఈదుకుంటూ ఈదుకుంటూ వచ్చి గట్టెక్కింది. బతికి బయటపడ్డానన్న సంతోషంలో నదివైపు గర్వంగా చూసింది. ఆ దేవుళ్ళకు రాని ఈత - వచ్చిన ప్రాణి గొప్పదా? కాదా? ఆలోచించాలి కదా? ఏమైనా, జీవుల విలువ, మనుషుల విలువ తెలుసుకుని మసలుకోవడం మంచిది... అని మనం అంటు న్నాం! అంతే!! దేశం ప్రపంచ దేశాలలో మానవత్వంతో తలెత్తు కు నిలబడితే చాలు... ''విశ్వగురువు'' కావాల్సిన పనేలేదు.
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ విజేత, జీవశాస్త్రవేత్త.