Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళల గురించి మనుస్మృతి భావనలు, మన రాజ్యాంగంలోని లింగ సమానత్వం ఒకటి కాదనే విషయాన్ని జడ్జీలు, ప్రధానమంత్రి, దేశ రాజకీయ నాయకులు, న్యాయవ్యవస్థ, సమాజం అర్థం చేసుకోవాలి.
దేశం కోసం చట్టాలను, నియమనిబంధనలను తయారు చేసే కార్యనిర్వహక శాఖను కలిగి ఉన్న ఒక రాజకీయ వ్యవస్థ భారత దేశానికి ఉంది. భారత రాజ్యాంగంలో పొందుపరచిన విలువలను కాపాడడానికి, భారత రాజ్యాంగ మార్గాన్ని అనుసరించేందుకు కార్యనిర్వహక శాఖకు న్యాయ వ్యవస్థ హామీ ఇస్తుంది. ప్రస్తుతం న్యాయవ్యవస్థ, కార్యనిర్వహక శాఖ నుంచి వచ్చే ఒత్తిడిలో ఉందనీ, కార్యనిర్వహక శాఖ తన మార్గాన్ని తప్పుతుందనే భావన ఉంది. ఇటీవల ధర్మాసనం నుండి, రాజకీయాల నుండి వచ్చిన కొన్ని ప్రకటనలు ఈ భావనకు తోడయ్యాయి. మనం చూస్తే ఈ సమస్య చాలా లోతైనది.
ఇటీవల కాలంలో, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిభా ఎం సింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆన్లైన్ లీగల్ జర్నల్ 'బార్ అండ్ బెంచ్'లో కథనాలుగా వచ్చాయి. ఒక బిజినెస్ చాంబర్ సంఘటనకు సంబంధించి, భారతీయ మహిళలు మతపరమైన గ్రంథాల కారణంగా చాలా అదృష్టవంతులని ఆమె వ్యాఖ్యానించింది. ఆమె మనుస్మృతిని ఉదహరిస్తూ, మత గ్రంథాల మూల పాఠం ఎల్లప్పుడూ మహిళలకు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చిందని పేర్కొంది. ఆమె చెప్పిన దాని ప్రకారం ఒకవేళ మహిళలు గౌరవించ బడకపోతే, ఇతర మతాచారాలకు అర్థం ఉండదని ఈ మతగ్రంథాల మూలపాఠం చెపుతుంది. మన పూర్వీకులకు, వేద పాఠాలకు మహిళలను ఎలా గౌరవించాలో బాగా తెలుసని ఆమె అభిప్రాయ పడింది.
ఎక్కడ మహిళలు గౌరవించబడతారో ఆ ఇళ్ళల్లో దేవుళ్ళు చాలా సంతోషంగా నివాసం ఉంటారని మనుస్మృతిలోని 3/56వ శ్లోకం చెపుతుంది. కానీ ప్రస్తుత సమాజంలో మహిళల వాస్తవ పరిస్థితిని ఈ అభిప్రాయం ప్రతిబింబిస్తుందా? మనుస్మృతి చెప్పిన ఇలాంటి కొన్ని విషయాలనే హిందూ జాతీయవాద సిద్థాంతకర్తలు పునశ్చరణ చేస్తున్నారు. కానీ మనుస్మృతి మహిళల అధమస్థానం గురించి చెప్పిన ఇతర అభిప్రాయాలను ఎక్కడా ప్రస్తావించడంలేదు. ''ఆఖరికి ఆమె ఇంట్లో కూడా మహిళ ఏదైనా పనిని స్వతంత్రంగా చెయ్యడానికి వీలు లేదు. ఒక శిశువుగా ఆమె తన తండ్రి అదుపులో, ఒక యువతిగా తన భర్త అదుపులో, భర్త మరణానంతరం తన కొడుకుల అదుపులో ఉండాలని'' మనుస్మృతిలోని ఐదవ అధ్యాయంలోని 148వ శ్లోకం చెపుతుంది.
సమస్యేమంటే, ఆఖరికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటీవల మహిళలకు ''రక్షణ'' కల్పించాలనే విషయం గురించి మాట్లాడినప్పుడు పితృస్వామిక నిఘంటువును ఉపయోగించాడు. భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి ప్రసంగించే సమయంలో ఆయన దానిని పేర్కొన్నాడు. తమ ప్రీతిపాత్రమైన గ్రంథం, వాస్తవానికి లింగ(జెండర్), కులం మధ్య సంబంధాన్ని నిర్దేశిస్తుందని, బ్రాహ్మణవాదం సమర్థించే క్రమానుగత (హైరార్కియల్) విలువలకు రూపం ఇస్తుందని, సావర్కర్ నుండి గోల్వాల్కర్ వరకు, మనుస్మృతిని అనుసరించే వారెవరూ పేర్కొనరు. ''అతడు సుగుణాలు లేని వాడైనప్పటికీ, కామాంధుడైనప్పటికీ, మంచి లక్షణాలు లేనివాడైనప్పటికీ, మంచి మహిళ తన భర్తను నిత్యం దైవంగా పూజించాలని'' మనుస్మృతిలోని ఐదో అధ్యాయంలోని 149వ శ్లోకం చెపుతుంది. అగ్రకులానికి చెందిన మహిళతో నిమ్నకులానికి చెందిన పురుషుడు లైంగిక సంబంధం కలిగి ఉంటే అతనికి మరణశిక్ష విధించాలని కూడా మనుస్మృతి చెపుతుంది. ప్రధానమంత్రి చేసిన అలాంటి ప్రకటనలు, స్వాతంత్య్రోద్యమ కాలంలో మహిళలు మనుస్మృతిని కాపాడుకోవాలని పోరాటం చేయలేదనీ, కుల క్రమానుగత వ్యవస్థను కాపాడడానికి పోరాటం చేయలేదనీ, 'రక్షణ'ను కోరుతూ పోరాటం చేయలేదనే విషయాన్ని మనం మరచిపోయేట్లు చేస్తాయి.
మనుస్మృతి దైవ మూలం యొక్క బహిర్గతం చేయబడిన పాఠంగా చూపే ప్రమాదకరమైన ధోరణి ఉంది కాబట్టి దానిని మనం సవాల్ చేయలేం, మార్చలేం. అటువంటి ప్రయత్నాలు, ఆధునిక అవగాహనలో ఉన్న చట్టానికి, మతపరమైన మూల గ్రంథాల్లో పొందుపరిచిన పూర్వ ఆధునిక మత చట్టానికి మధ్య వైరుధ్యాలను సృష్టిస్తుంది. మనుస్మృతిని 170 బీసీఈ, 150 బీసీఈ మధ్య కాలంలో, అంటే బౌద్ధమతం పైన, బౌద్ధుల పైన బ్రాహ్మణీయ రాజైన పుష్యామిత్ర శృంగ దాడులు చేసిన కాలంలో రాసి ఉంటారని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన రచనలు, ప్రసంగాల మూడో సంపుటిలో పేర్కొన్నాడు. బౌద్ధమతం సమానత్వ విలువలను వ్యక్తీకరించింది కానీ భారతదేశంలో అనేక దాడులను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. భారతదేశంలో ఆధునిక విద్యను వలస కాలంలో ప్రవేశపెట్టారు, సాంఘిక సంస్కరణలు భావనాత్మకం కావడం మొదలయ్యాయి. అది, సావిత్రీబాయి ఫూలే లాంటి సంఘసంస్కర్తలు ఆడపిల్లల కోసం పాఠశాలలు ప్రారంభించినప్పుడే వాస్తవానికి మహిళల సమానత్వం కోసం పోరాటం ప్రారంభమైంది. మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించే సామాజిక సాంప్రదాయవాదుల నుండి అనేక దాడులు ఎదురైనప్పటికీ ఫూలే, ఫాతిమా షేక్లు పాఠశాలలో బోధించారు. ఫూలేపై ద్వేషభావం ఎంత తీవ్రంగా పెరిగిందంటే, ఆమె పాఠశాలకు వెళ్ళే మార్గంలో ఆమె పైన బురద, ఆవుపేడతో దాడులకు పాల్పడ్డారు.
అన్ని కులాలు లేదా సామాజిక సమూహాలకు చెందిన సభ్యులందరూ, మహిళల సమానత్వంతో పాటుగా సామాజిక సమానత్వం కోసం పనిచేసిన వారందరిలో అంబేద్కర్ ముందు వరుసలో నిలుస్తాడు. ఆయన ఆలోచనలు, గాంధీజీ, ఇతర అనేకమంది నాయకత్వంలో సాగిన జాతీయోద్యమానికి చాలా ముఖ్యమైన లక్షణాలుగా ఉన్నాయి. కానీ హిందూ మత రాజ్య స్థాపన కోసం పోరాడుతున్న వారి ఆలోచనలకు అంబేద్కర్ ఆలోచనలు భిన్నమైనవి. ఇతర మతాల విశ్వాసాలను ఆచరించే జాతీయవాదులు కూడా ఇందుకు భిన్నంగా ఉండరనే విషయాన్ని మనం చెప్పుకోవాలి. ఈజిప్ట్లోని ముస్లిం సోదరుల నుండి ఆఫ్ఘనిస్తాన్లోని తాలీబాన్ల వరకు, 'మహిళలకు రక్షణ అవసరం' అని అందరి గొంతులు ప్రతిధ్వనిస్తాయి. ఇక్కడ 'రక్షణ' అంటే, మహిళలను అదుపు చేసే వ్యూహం తప్ప మరొకటి కాదు.
భారత రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షునిగా వ్యవహరించిన అంబేద్కర్, మనుస్మృతిలో రూపొందించబడిన అసమానతలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక నిరసన జరిగిన సందర్భంలో మనుస్మృతి కాపీలను దహనం చేశాడు.
ఆసక్తికరంగా హిందూ ముస్లిం మతాలు రెండింటిలో సాధారణంగా పురుషులే ప్రచారకులుగా ఉంటారు. నేటికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ులోనూ పురుషులే ప్రచారకులుగా కొనసాగుతున్న వ్యవస్థ ఉంది. మతప్రాతిపదికన హిందూ మత రాజ్యాన్ని స్థాపించే ప్రణాళికను విస్తృతం చేసేందుకు, కేవలం మహిళల కోసం మాత్రమే ఆరెస్సెస్, 'రాష్ట్ర సేవికా సమితి'ని ప్రారంభించింది. దాని పేరే పితృస్వామిక విలువలను తెలియజేస్తాయి. స్వయం సేవకుడు అంటే స్వచ్ఛంద సేవకుడు, సేవికా అంటే సేవ చేసే వారని అర్థం. 'స్వయం' అనే పదం అంటే 'తాను' అనేది అక్కడ లేదు. మహిళలు పురుషుల చేత రక్షించబడాలనే మనుస్మృతి ఆజ్ఞకు అది సరిపోతుంది.
మతపరమైన గ్రంథాలు స్పష్టంగా ఉండవు. మత విశ్వాసకుడు కోరుకునే విధంగా వివరణలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మత గ్రంథాల నుండి ఎవరైనా తన సౌకర్యానుసారంగా ఏ భాగాన్నైనా తీసుకొని, మిగిలిన భాగాన్ని వదిలేసే స్వేచ్ఛ ఉంటుంది. ఇందుకు భిన్నంగా జాతీయోద్యమం సమయంలో మహిళలు డిమాండ్ చేసింది, నేడు చేస్తున్నది చట్టబద్ధమైన సమానత్వాన్ని మాత్రమే. కుటుంబంలో, సమాజంలో వివక్షత లేకుండా చేయడం, ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల నిరంకుశ చర్యల నుండి భద్రత కల్పించడం, అదే మన భారత రాజ్యాంగం మనకు చేసిన వాగ్దానం.
భారత స్వాతంత్య్రోద్యమ విలువలను ప్రతిబింబించేది భారత రాజ్యాంగం మాత్రమే. ఫూలే కాలం తర్వాత పండిత రమాబాయి, ఆనందీ గోపాల్ లాంటి ప్రముఖులు వెలివేతలను, నిషేధాలను ప్రతిఘటించి, సమానత్వ భావన కోసం పోరాడారు. ఆ తరువాత సరోజినీ నాయుడు నుండి అరుణా అసఫ్ అలీ, భికాజీకామా, ఉషా మెహతా వరకు అనేకమంది మహిళలు జాతీయోద్యమ పోరాటంలో భాగస్వాములయ్యారు. వీరితో పాటు వేల సంఖ్యలో ఇతర మహిళలు, స్వాతంత్య్ర పోరాట వెలుగు రేఖలుగా మారేందుకు పితృస్వామిక దాస్య శృంఖలాలను తెగ్గొట్టారు.
శతాబ్దాలుగా భారతదేశం, లింగ, కుల క్రమానుగత వ్యవస్థ చేతిలో బందీ అయి ఉంది. దీనిని అధిగమించడానికి, అనేక మహిళా సంఘాలు సుదీర్ఘ పోరాటం చేయడానికి అంకితమై పని చేస్తున్నాయి. సమాజంలో వారికి రెండో స్థానాన్ని ఇచ్చారు. మన సమాజంలో ఉన్న ఈ భయంకరమైన వ్యత్యాసాన్ని నిష్ణాతులైన మన న్యాయమూర్తులు, రాజకీయనాయకులు అర్థం చేసుకోవాలి. ఒకవైపు మనకు మనుధర్మ శాస్త్రం సమర్థించే పితృస్వామ్యం ఉండగా, మరోవైపు సమానత్వాన్ని సమర్థించే అంబేద్కర్ మనకు అందించిన రాజ్యాంగం ఉంది. లింగపరమైన న్యాయం కోసం భారతదేశం నడుస్తున్న తరుణంలో న్యాయ వాదులు, న్యాయమూర్తులు, నాయకులు ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుంటారని ఆశిస్తున్నాను.
- రామ్ పునియాని
(వ్యాసరచయిత: మానవహక్కుల కార్యకర్త,
ఐఐటీ బాంబేలో విశ్రాంత ప్రొఫెసర్)
అనువాదం: బోడపట్ల రవీందర్,
9848412451