Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు అయ్యింది. ఆ పేరుతో ఏడాది పాటు సంబురాలు కూడా జరిగాయి. మరి డెబ్భై ఐదేండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా మహిళల పరిస్థితి దేశంలో ఎలా ఉంది? మహిళలకు దక్కాల్సిన సమాన అవకాశాల పరిస్థితి ఏంటి? ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అనే నినాదం ఇంకా అలాగే ఎందుకు మిగిలింది. అన్ని రంగాల్లో సమాన హక్కులు సరే, చట్టాలు చేసి దేశాన్ని ముందుకు నడిపించే చట్టసభల్లో మహిళలకు ఏ మేరకు భాగస్వామ్యం దక్కింది? మన దేశ రాజకీయాల్లో మహిళలు అస్థిత్వం నిలుపుకోవాలంటే ఎన్నో దశాబ్దాలు పోరాడాల్సిన పరిస్థితులు కనిపిస్తు న్నాయి. ఎందుకంటే మహిళలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప, వారి అస్థిత్వం, హక్కులు, ప్రాణాలకు ఇక్కడ విలువే లేదు. నిర్ణయాధికారంలో మహిళలకు సమ భాగస్వామ్యం కల్పించాలని అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు ప్రతి యేటా చెపుతున్నా పాలకులకు పట్టింపు లేదు. వాస్తవంగా దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు 25 ఏండ్లుగా ఆమోదం పొందడం లేదు. 1996లో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మహిళలకు మంచి రోజులు వచ్చినట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ బిల్లుకు ఆమోదమే లభించలేదు. నిర్ణయాధికారంలో మహిళలకు సగ భాగస్వామ్యం అన్న నినాదం కాగితాలకే పరిమితం అవుతోంది. చట్టసభల్లో మగవారితో సమానం కాదు కదా కనీసం మూడోవంతు రిజర్వేషన్లు కల్పించే విషయంలోనూ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది స్పష్టమవుతోంది.
ఇది అర్థ ప్రపంచపు హక్కైనా దాని చుట్టూ పరిభ్రమిస్తున్న రాజకీయాలు చిత్తశుద్ధి లేకుండా, మోసపూరితంగా, లింగ వివక్షతో ఉన్నాయి. దేశ రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు కల్పించాలన్న ప్రతిపాదన 1975లో తొలిసారిగా లోక్సభలో ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర విద్య, సాంఘిక సంక్షేమశాఖ ఓ కమిటీని నియమిం చింది. ఈ కమిటీ ముందుగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు అవకాశం కల్పించాలని ప్రతిపాదిస్తూ, వారికి ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. 1993లో 73, 74వ అధికరణలను అనుసరించి నియోజకవర్గ చట్ట సవరణ చేశారు. దీని ప్రకారం పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించారు. 1996 సెప్టెంబర్ 12న మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారిగా లోక్సభలో ప్రవేశట్టింది అప్పటి దేవెగౌడ ప్రభుత్వం. అయితే ఆయన ప్రభుత్వం మైనారిటీలో పడటంతో బిల్లు అటకెక్కింది. 1998లో రెండోసారి ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది వాజ్పేయి సర్కార్. పూర్తి గడువు తీరకుండానే లోక్సభ రద్దు కావటంతో మహిళా బిల్లు మరోసారి మరుగున పడింది. 1999 డిసెంబర్ 23న దిగువ సభలో బిల్లును ప్రవేశ పెట్టినట్టే పెట్టిన ఎన్డీఏ ప్రభుత్వం, రాజకీయ ఏకాబి óప్రాయం లేదంటూ వెనక్కి తగ్గింది. 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మహిళా బిల్లును మళ్లీ తెర మీదికి తీసుకువచ్చింది. 14వ లోక్సభ గడువు ముగిసినా లేక రద్దయినా బిల్లు యాక్టివ్గా ఉండేలా మార్పులు చేసింది. 2010 మార్చి 8న మహిళా రిజర్వేషన్బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. తీవ్ర వ్యతిరేకతల మధ్య అట్టుడుకిపోయే వాతావరణంలో మార్చి 9న బిల్లు ఆమోదం పొందింది. దీంతో చట్టసభలకు పోటీ చేసేందుకు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కుతుందని అందరూ ఆశించారు. అయితే బిల్లును లోక్సభలో అడ్డుకుంటామని కమ్యూనిస్టులు పలువురు నేతలు ప్రకటించారు. బిల్లు విషయంలో మొండిగా ముందుకెళితే కాంగ్రెస్ మినహా అన్ని పార్టీల నుండీ మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. కొందరు నేతలు బెదిరించారు. దీంతో ఆ బిల్లు లోక్సభలో పెండింగ్లో ఉండిపోయింది.
ప్రయివేటీకరణ, బ్యాంకుల్లో వాటా, వడ్డీ తగ్గింపు, బీమా, కార్మిక చట్టాల సవరణ బిల్లు, సెజ్ చట్టం, అణు ఒప్పందం, పేటెంట్ చట్టం, ఎఫ్డీఐ, ఉపాధి చట్టం ఇలా ఎన్నో బిల్లులకు ఏకాభిప్రాయం లేకున్నా ఆమోదం లభించింది. కానీ మహిళా బిల్లుకు మాత్రం ఏకాభిప్రాయం ఉండాలంటున్నారు. దీన్ని బట్టి మహిళా బిల్లుకు ఇప్పట్లో ఆమోదం లభించే సూచనలు లేవు. ప్రపంచ దేశాల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం సగటున 22శాతం ఉంది. మన దేశంలో సగటు ప్రాతినిధ్యం 12శాతమే. రువాండా లాంటి చిన్న దేశ చట్టసభల్లో 63.8శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేశారు. స్కాండినే వియన్ దేశాల్లో సగానికి ఎక్కువగా మహిళా ప్రాతినిధ్యం ఉంది. పశ్చిమ దేశాల్లో కూడా తమకు సముచిత ప్రాతినిధ్యం కావాలంటూ మహిళలు పోరాడుతున్నారు. అల్జీరియా, దక్షిణ సుడాన్, లిబియా వంటి దేశాలు మనకంటే మెరుగ్గా మహిళలకు స్థానం కల్పిస్తున్నాయి. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాల్లో కూడా మహిళలకు చట్టసభల్లో గణనీయమైన ప్రాతినిధ్యం దక్కుతోంది. చట్టసభల్లో మహిళల సగటు ప్రాతినిధ్యంలో మనదేశం చివరి స్థానంలో ఉండటం బాధపడాల్సిన విషయం.
- అజ్మీర సమీర
సెల్:8519836308