Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారు కార్మికులు! శ్రామికులు! రెక్కలు తప్ప ఆస్తులు లేని నిరుపేదలు! వారే ఈ దేశ పురోగతికి మూలవాసులు!
మనదేశంలో తొంబైశాతానికి పైగా శ్రామికశక్తి అసంఘటిత రంగంలోనే ఉంది. తమ రక్తాన్ని చెమట చేసి, తమ కండలు కరిగించి, ఈ సమాజ అవసరాలకు కావలసిన సకల వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఒకనాడు పనిగంటల నియమం లేకుండా, వారాంతపు సెలవులు లేకుండా, ఉండటానికి ఇల్లు లేకుండా, రోగం వస్తే మందులు లేకుండా, పనిలో రక్షణలు లేకుండా, ఉద్యోగాలకు భద్రతలు లేకుండా, సమ్మె హక్కులు లేకుండా, సంఘం పెట్టుకునే స్వేచ్ఛ లేకుండా, గొడ్డు చాకిరి చేసినోళ్ళు ఈ కార్మికులు! నిజంగా ఈ దేశ పురోగతికి మూలవాసులు వాళ్ళు.
అంతర్జాతీయ కార్మికోద్యమ ప్రభావంతో స్వాతంత్య్రానికి పూర్వమే వీరి సంఘటిత పోరాట ఫలితంగా 1926లో ట్రేడ్ యూనియన్ చట్టాన్ని తీసుకువచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం! ఆ కార్మికోద్యమ స్ఫూర్తితోనే భారతదేశ కార్మికశక్తులు... ఎర్రజెండా పోరు దారిలో, ప్రాణాలను ఫణంగా పెట్టి వీరోచిత కార్మిక ఉద్యమాలు చేసారు! భారత స్వాతంత్య్రోద్య మాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అనేక సమ్మెలు చేసారు. అరెస్టులను జైల్లనూ ఎదుర్కొన్నారు! తత్ఫలితంగా దేశ స్వాతంత్య్రతో పాటు, అనేక కార్మిక సంక్షేమ చట్టాలను కూడా సాధించుకున్నారు!
కానీ, ఏం ఫలం? ఈ దేశ సౌభాగ్యానికి కారణమైన వాళ్ళ జీవితాల్లో నేడు చీకట్లు అలుముకుంటున్నాయి! పోరాడి సాధించుకున్న కార్మికహక్కులు, కార్మిక చట్టాలు కాల రాయబడుతున్నాయి! 2019 ఆగస్టు నెలలో పార్లమెంటు సమావేశాల్లో 'నూతన శ్రామిక నియమావళి-2019' పేరుతో 'లేబర్ కోడ్' బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష పార్టీల ఆమోదం లేకుండానే ఈ బిల్లును ఏకపక్షంగా సభలో నెగ్గించుకున్నారు. భారతదేశంలో 90శాతానికి పైగా ఉన్న కార్మికుల శ్రమశక్తిని కారుచౌకగా వినియోగించు కోవాలన్నదే దీనివెనుక ఉన్న కుటిల పన్నాగం!
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ''నూతన శ్రామిక నియమావళి - 2019'' ప్రకారం... గతంలో ఉన్న నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దుచేసి, ఇప్పుడు నాలుగు లేబర్కోడ్లుగా విభజించారు. ఈ కొత్త చట్టాల ద్వారా గతంలో ఉన్న ఏ ఏ పాత కార్మిక చట్టాలు రద్దయ్యాయో పరిశీలిద్దాం...
1) నూతన వేతన నియమావళి - 2019
ఈ చట్టంతో నాలుగు పాత చట్టాలు రద్దయ్యాయి. 1936 - వేతన చట్టం, 1948 - కనీస వేతనాల చట్టం, 1965 - బోనస్ చెల్లింపు చట్టం, 1976 - సమాన వేతన చెల్లింపుల చట్టం,
2) నూతన సామాజిక భద్రతా నియమావళి - 2020
ఈ చట్టంతో ఎనిమిది పాత చట్టాలు రద్దయ్యాయి. 1948 - ఉద్యోగుల రాష్ట్ర భీమా చట్టం, ఉద్యోగుల భవిష్య నిధి చట్టం,
ఉద్యోగ నమోదు కార్యాలయాలు చట్టం, 1961 - అసూతి ప్రయోజన చట్టం, 1972 - గ్రాట్యుటీ చెల్లింపు చట్టం, సినీ కార్మికుల సంక్షేమ చట్టం, 1996 - భవన ఇతర నిర్మాణ రంగాలలోని పని వారి యోగక్షేమశిస్తూ చట్టం, అసంఘటిత కార్మికుల సామాజిక బాధ్యత చట్టం.
3) నూతన పారిశ్రామిక సంబంధాల నియమావళి - 2020
ఈ చట్టంతో మూడు పాత చట్టాలు రద్దయ్యాయి. 1926 - ఉద్యోగ కార్మిక సంఘాల చట్టం, 1945 - పారిశ్రామిక ఉద్యోగ స్టాండింగ్ ఆర్డర్ చట్టం, 1947 - పారిశ్రామిక వివాదాల చట్టం.
4) పని ప్రదేశంలో సురక్ష ఆరోగ్య స్థితిగతుల నియమావళి - 2020
(ఆక్యుపేషన్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్)
ఈ చట్టంతో 13 పాత చట్టాలు రద్దయ్యాయి. 1948 - పరిశ్రమల చట్టం, 1951 - ఉద్యానవన కార్మిక చట్టం, 1952 - గనుల చట్టం, 1955 - పాత్రికేయ, వృత్తి విలేఖరి, ఇతర వార్త పత్రిక ఉద్యోగుల పని స్థితిగతుల చట్టం. 1958 - పత్రికా వృత్తి, విలేఖరి జీతభత్యాల నిర్ణయ చట్టం, 1961 - మోటార్ వాహనాల చట్టం, 1966 - బీడి పొగచుట్టల కార్మికుల స్థితిగతుల చట్టం, 1970 - కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ చట్టం, 1976 - వస్తువు అమ్మకు ఉద్యోగుల చట్టం, 1979 - అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం, 1981 - సినీ వర్కర్స్, సినిమా ధియేటర్ కార్మికుల చట్టం, 1986 - రేపు (డాక్) పని వారి సురక్ష ఆరోగ్య చట్టం, 1996 - భవన, ఇతర నిర్మాణరంగ పని వారి పరిస్థితిల పర్యవేక్షణ చట్టం.
ఈ విధంగా 44 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్కోడ్లుగా మార్చి, పోరాడి సాధించుకున్న కార్మిక సంక్షేమ చట్టాలన్నీ రద్దు చేశారు. దీంతో కార్మికులు మళ్ళీ పాతకాలపు శ్రమదోపిడీకి, వెట్టిచాకిరికీ గురయ్యే దౌర్భాగ్యకాలం దాపురించబోతోంది!
ఈ నూతన పారిశ్రామిక సంబంధాల నియమావళి - 2020 ప్రకారం కార్మికులకు జరుగబోయే నష్టాలు అనేకం... 8గంటల పని విధానానికి బదులుగా, 12గంటల పని విధానం అమలు అవుతుంది. ఆరోగ్యపరంగానూ, ఆర్థిక పరంగాను తీవ్ర దుష్ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక భవిష్యత్తులో క్రమంగా వారి పని రోజులను మరింతగా తగ్గించి శాశ్వతంగా ఇంటికి పంపించే కుటిల ఆలోచన ఇది!
'ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్' కోడ్కు సంబంధించి... సెక్షన్ 25 (11) ప్రకారం, కార్మికులు ఎనిమిది గంటలకు మించి పని చెయ్యకూడదు అని ఉంది. ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీ పెట్టేవాళ్లకు, ఈ కోడ్ నుంచి మినహాయింపు ఉంటుంది! ఇది ఎంత దారుణం! మళ్లీ కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలు.. కనీస మైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు లేకుండా నరక కూపాలు కాబోతున్నాయని అర్థం!
సెక్షన్ 26 (1) ప్రకారం కార్మికులు వారంలో ఆరు రోజులు మాత్రమే పని చేయాలి. కానీ సెక్షన్ 26 (2) పై నిబంధనలను సడలించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది.
సమ్మె నోటీసు కాలం ఇదివరకు రెండు వారాలుగా ఉంటే, ఇప్పుడు 60రోజులకు పెంచారు. అంటే ఈ 60 రోజుల్లో సమ్మెను విచ్చిన్నం చేసే కుట్రలు చేయడానికి యాజమాన్యానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఇది సమ్మె హక్కును కాలరాచే కుటిల చర్య!
పాత నిబంధనల ప్రకారం ఇంతకుముందు 100 మందిలోపు కార్మికులు ఉన్న కంపెనీలో మాత్రమే ఆ కంపెనీ యజమాని ప్రభుత్వ అనుమతి లేకుండా కార్మికులను తొలగించే నిబంధన ఉండేది. కానీ, ఈ నూతన పారిశ్రామిక సంబంధాల నియమావళి - 2020 ప్రకారం 100 మంది ఉన్న కార్మికుల సంఖ్య 300 అయ్యింది! అంటే 300 మంది కార్మికులు ఉన్న కంపెనీలో కూడా యజమాని ఇప్పుడు ప్రభుత్వ అనుమతి లేకుండా తొలగించవచ్చు! 300 కంటే ఎక్కువ కార్మికులు ఉన్నప్పుడు మాత్రమే కార్మికులను తొలగించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది! అంటే 'హైర్ అండ్ ఫైర్' విధానం. వాడుకొని వదిలెరు అనే విధానం అన్నమాట. దీన్నిబట్టి ఈ నూతన లేబర్ కోడ్ల విధానం కార్మికుల బతుకులను ఎంత దుర్భరం చేయనున్నదో ఆలోచించండి!
దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఏనాడు పాల్గొనని వాళ్ళు... ఈ దేశ శ్రామిక ప్రజలను ఏనాడు గౌరవించని వాళ్ళు... నేడు ఈ దేశపాలకులై కూర్చున్నారు! ఈ దేశ ప్రజల జీవన వికాసానికి, ఈ దేశ సార్వభౌమత్వానికి కారణమైన ప్రభుత్వరంగ సంస్థలను చట్టసభల సాక్షిగా, న్యాయస్థానాల సాక్షిగా అంగట్లో అమ్మేస్తున్నారు. బడా పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్నారు. కార్మికులను రోడ్డుపాలు చేస్తున్నారు! చివరకు కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక సంక్షేమ చట్టాలను కూడా కాలరాస్తూ వారి బతుకుల్లో చీకట్లు నింపుతున్నారు!
అందుకే ఇప్పటికైనా కార్మికవర్గం ఈ నిజాలను గ్రహించి కళ్ళుతెరవాలి! కార్మికవర్గ చైతన్యాన్ని తిరిగి పెంపొందించుకోవాలి! అంతిమంగా కార్మికవర్గం సంపూర్ణంగా విముక్తి చెందాలంటే... శ్రమ దోపిడీ నిర్మూలనా సిద్ధాంతం అయిన 'మార్క్సిస్టు చైతన్యాన్ని' కార్మికులు తప్పకుండా అలవరుచుకోవాలి! తమ భవిష్యత్తు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం పాలకులు అవలంభిస్తున్న ఈ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికవర్గం, శ్రామిక ప్రజలందరితో కలిసి ఐక్య ఉద్యమాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది!
- సుభాష్
సెల్:9000904284