Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మన నాగార్జునసాగర్ డ్యామ్ ప్రారంభోత్సవ సమయంలో ముహూర్తాలు, మంత్రాలు, పూజలు, కొబ్బరికాయలు లేకుండా కేవలం సింబాలిక్గా ఒక దీపం వెలిగించి... ''ఈ ఆధునిక దేవాలయాన్ని జాతికి అంకితం చేస్తున్నానని'' ప్రకటించారు. ఆయన దేవాలయాలకు కొత్త నిర్వచనం ఇచ్చారు. ప్రాజెక్టుల్ని, పరిశోధనాశాలల్ని, ఆసుపత్రుల్ని ఆయన ఆధునిక దేవాలయాలని అన్నారు. ఇక 2022 జులై నెలలో తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రభుత్వ కార్యాలయానికి ముఖ్య అతిథిగా వచ్చిన పార్లమెంట్ సభ్యుడు సింథిల్ అక్కడి పూజాకార్యక్రమాల్ని ఆపేశారు. దాంతో పూజారి వెనక నుండి వెనక్కే పారిపోయాడు. లౌకికవాద ప్రభుత్వం కాబట్టి ఇలాంటివి చేయకూడదని ఎం.పి. సెంథిల్ హెచ్చరించారు. ఒక్క హిందూమతం ప్రకారం పూజలు చేస్తే మిగతా మతాల్ని అవమాన పరిచినట్లు అవుతుందనీ... అక్కడ ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు లౌకికవాదాన్ని అమలు పరిచే విధంగా ఉండాలన్నది ఈ దేశంలో సామాన్యుడికి కూడా తెలుసు. కానీ అధికారంలో ఉన్న మన ప్రధాన మంత్రిగారికే తెలియటంలేదు. ప్రతిపక్షాలు లేకుండా తను ఒక్కడే హిందూ మతానుసారంగా కొత్త పార్లమెంట్ భవనంలో అశోక స్థూపానికి ప్రారంభోత్సవ పూజలు చేశాడు. దానిమీద ఉన్న సింహాలు అశోకుని సింహాల్ని ప్రతిబింబించడం లేదని, అవి ఆరెస్సెస్ క్రూర స్వభావాన్ని గుర్తుచేస్తున్నాయని దేశం యావత్తూ దుయ్యబట్టింది. అయితే నేం? అన్నీ వదిలేసిన వారికి ప్రజల ఆక్రోశాలు అర్థం కావుకదా!
''లాక్డౌన్ కాలంలో ఒక వలస కార్మికురాలు తన పిల్లలతో నడిచి వెళుతున్న దృశ్యాన్ని శిల్పంగా మలచి ఆమెనే దుర్గామాతగా సంభావిస్తూ దసరా ఉత్సవాల్లో నిలిపిన బెంగాల్ కళాకారుడు పల్లవ్ భౌమిక్ ప్రతిభ, సృజనాత్మకత అపూర్వం. సమాజం పట్ల బాధ్యతను చాటే అలాంటి కళ అజరామరం'' అని ప్రశంసించారు ఆర్థిక వేత్త కౌశిక్ బసు. కరోనా వైరస్ను అరికట్టడంలో అశావర్కర్ల పాత్ర ఎంతో కీలకమైంది. కానీ, హరియాణా, మధ్యప్రదేశ్లలో వారు జీతాలు అడుగుతున్నారని, తమ సర్వీసును క్రమబద్ధం చేయమన్నారని, రోగుల వద్దకు వెళ్ళేప్పుడు అవసరమైన రక్షణ ఉపకరణాలు ఇమ్మన్నారని ఆగ్రహించి... కేసులు పెడుతున్నారు. ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారు. ఈ విషయం బాధ్యత గల ఒక సీనియర్ జర్నలిస్ట్, సమర్ హలర్న్కర్ అక్కడి నుంచి రిపోర్ట్ చేశారు. మోడీ మీడియా ప్రచారం చేస్తున్న అబద్దాలకు విరుగుడుగా, కొంతమందైనా ఇలా వాస్తవాలు నిర్భయంగా వెల్లడిస్తున్నందుకు మనం సంతోషించాలి!
సమకాలీన సమాజంలో దేశాన్ని పాలిస్తున్న మనువాద పాలకుల ప్రకటనలు, చేష్టలు ఎంత దుర్మార్గంగా ఉంటున్నాయో గమనించండి. ''మా కార్యకర్తలకి కరోనా అంటే భయం లేదు. ఎందుకంటే వారు అంతకంటే ప్రమాదకరమైన మమతా బెనర్జీతో తలపడుతున్నారు'' అని అన్నాడు బీజేపీ మాజీ లోక్సభ సభ్యుడు అనుపమ్ హజ్రా. ఈ పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత అక్కడితో ఆగితే బాగుండేది. కానీ, ఇంకాముందుకు వెళ్ళి, తనకు గనక కరోనా వస్తే వెళ్ళి మమతను హత్తుకుంటానని అన్నాడు. 'మా బీజేపీ వారి సంస్కారం ఇదీ' అని ఆయన స్వచ్ఛందంగా ప్రకటించుకున్నట్టు అయ్యింది. ''వ్వావ్ 50కోట్ల రూపాయల విలువైన గర్ల్ ఫ్రెండ్ని ఎక్కడైనా చూశారా?'' ఇది మన మహౌన్నత నాయకుడు నరేంద్రమోడీ మాట. ఒక ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ నేత శశిథరూర్ని విమర్శించేందుకు అతని భార్య సునంద పుష్కర్ను గుర్తుచేశాడు మోడీ. వేసుకున్న బట్టలతో ఎవరు ఏమిటో గుర్తు పట్టొచ్చునని ముస్లింలను ఉద్దేశించి ఓ సభలో వ్యాఖ్యానించింది ఈ సంస్కారవంతుడే! అధికారంలో ఉండి, ఇతర పార్టీ నాయకులకు ఆదర్శప్రాయంగా, హుందాగా ఉండటమంటే ఇదేనా? కనీసం నిర్వహిస్తున్న ఆ ప్రధాని పదవి పరువైనా కాపాడాలి కదా? ఇతర పార్టీ నాయకులెవరూ అనుచితమైన వ్యాఖ్యలు చేయడం లేదని కాదు. రిపబ్లికన్ పార్టీ నాయకుడు జయదీప్ కవాడె స్మృతిఇరానీ గురించి ఏమన్నాడో చూడండి... ''స్మృతి ఇరానీ నితిన్ గడ్కరీ పక్కన కూర్చుని రాజ్యాంగాన్ని మార్చే విషయం గూర్చి మాట్లాడుతుంది. అయితే ఆమె బొట్టు నానాటికీ పెద్దదవుతోంది గమనించారా? భర్తను మార్చేవాళ్ళే అలా తరచూ బొట్టు పెద్దది చేస్తుంటారని జనంలో ఒక అభిప్రాయం ఉంది!'' అని అన్నారు జయదీప్ కవాడే. వ్యక్తిగత అభిప్రాయాలుయ ఎవరివి ఎలా ఉన్నా... వాటిని ప్రజాజీవితంలోకి తేకుండా సంయమనం పాటించడం అవసరం. సామాన్య పౌరుల కంటే కూడా దిగజారి నేలబారు వ్యాఖ్యాలు చేయడం అవస రమా? కనీసం ఆత్మవిమర్శ కూడా చేసుకునే పనిలేదా?
అసలయితే తప్పులు చేయమనివారు ఎవరూ ఉండరు. తప్పులు సరిదిద్దుకుంటే వారు మహానుభావులవుతారు. దిద్దుకోనివారు అలాగే మూర్ఖులుగా మిగిలిపోతారు. జాతిపిత అయినా కూడా, ఈశ్వర్ అల్లా తేరోనామ్ అంటూ హిందూ, ముస్లిం ఐక్యతను చాటి చెప్పినా కూడా... గాంధీజీ పొరపాట్లకు అతీతుడని ఎవరమూ భావించనక్కరలేదు. తన కుమారుడు మణిలాల్ ఒక ముస్లిం యువతిని ప్రేమించినప్పుడు ఆయన ఆగ్రహించి, అతనితో తనకు ఇక ఎలాంటి సంబంధమూ ఉండదని... చెప్పడం తప్పేకదా? ఇది, గాంధీజీ మనవడు తుషార్ గాంధీ చెప్పిన విషయం! గాంధీజీ మనువాదుల భావజాలానికి లొంగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకసారి ఒక ఆలయం ముందున్న వీధిలో దళితులు నడవగూడదని ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలు సడలించాల్సిందేనని పెరియార్ సత్యాగ్రహం చేపట్టారు. పెరియార్ని బుజ్జగించడానికి గాంధీజీ ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి... అన్న మాట ఏమిటంటే... ''మీరు ఇప్పుడు దళితులకు దేవాలయం వీధిలో నడవడానికి అనుమతి ఇప్పిస్తారు... కానీ రేపొద్దున వారు ఆలయ ప్రవేశానికి అనుమతి అడిగితే ఎలా?'' అని...
ఎవరో కోడిని అడిగారట... అదేమిటీ? అలా నిర్దాక్షిణ్యంగా నీ గొంతు కోసేస్తున్నారూ? అని!
అందుకు కోడి ఇలా చెప్పిందట... ''అది అంతే! జనాన్ని మేలుకొలిపే వారికి అదే పరిస్థితి ఎదురవుతుంది!'' అని!
కాలాలు మారుతూ ఉండొచ్చు. మనిషి కుత్సిత బుద్ధి మారనంత వరకు మేలుకొలిపే వారి గొంతుకు ఉరి బిగుస్తూనే ఉంటుంది! సమకాలీనంలో కూడా మనం ఈ విషయం గమనిస్తూనే ఉన్నాం! నాస్తికత్వాన్ని అర్థం చేసుకోలేని ఆస్థికులు ఒక హాస్య ప్రధానమైన సవాల్ విసురుతారు. ''దేవుడు లేడు... అని మీరు నిరూపించండి!'' అని. దీనికి బెట్రెండ్ రస్సెల్ ఒక వివరణ ఇచ్చారు. ''నేను ఆకాశంలో శుక్రుడికీ, గురుడికీ మధ్య ఓ టీకప్పు తిరుగుతోందని చెప్పాననుకోండి, అప్పుడు ఎవరైనా ఆకాశమంతా గాలించి ''ఆ టీకప్పు లేదు'' అని నిరూపిస్తారా? లేదు కదా? టీకప్పు తిరుగుతోందని చెప్పే నాపైనే, దాన్ని చూపించే బాధ్యత ఉంటుంది. అందువల్ల 'దేవుడు లేడు అని నిరూపించండని నాస్తికులను అడగడం సరికాదు. ఉన్నాడని వాదించే ఆస్థికుల మీదే - దేవుడు ఉన్నాడని నిరూపించే బాధ్యత ఉంటుంది... అని!
టీవీ తెర మీద, సోషల్ మీడియాలో కొందరు అమ్మలు-అయ్యలు జనానికి చిట్కాలు బోధిస్తుంటారు. అలా చేస్తే వారి జీవితాలు దివ్యంగా ఉంటాయని ఊదరగొడుతుంటారు. అలాంటి ఓ సూక్తి పాటించిన యువకుడు తన స్నేహితుడితో ఇలా చెప్పుకున్నాడు. ''బీరువాలో దాల్చిన చెక్క - పర్సులో యాలకులు పెట్టి మూడు నెలలయ్యిందిరా! వాసన తప్ప డబ్బులేం రాలేదు. ఇప్పుడయితే వాసన కూడా రావడం లేదు'' అని వాపోయ్యాడు. కాకమ్మ కబుర్లను నిజమని నమ్మించే వాళ్ళంతా ప్రబుద్ధులే! ఇక్కడ జార్జి మెక్లారిన్ను గుర్తు చేసుకోవడం అవసరం.
1948లో ఒక్లహౌమా విశ్వవిద్యాలయంలో చేరిన మొట్టమొదటి నల్లజాతీయుడైన విద్యార్థి - జార్జ్ మెక్లారిన్. శ్వేత జాతీయులకు దూరంగా ఒక మూల కూర్చోబెట్టేవారు. అతణ్ణి తోటి విద్యార్థులంతా ఒక జంతువులాగా చూసేవారు. ప్రొఫెసర్లు కూడా హీనంగా చూసేవారు. ఎవరూ మాట్లాడేవారు కాదు. అతని అనుమానాలు ఎవరూ తీర్చేవారు కాదు. లేచి అడిగినా ప్రొఫెసర్లు పట్టించుకునేవారు కాదు. క్లాసులో ఓ మూల ఇంత చోటివ్వడమే ఎక్కువ... అన్నట్లు ఉండేవారు. తర్వాత కొంత కాలానికి పరిస్థితి మారింది. జార్జ్ మెక్లారిన్ శ్రద్దగా ఇంట్లో చదువుకోవడం ప్రారంభించాడు. క్లాసులో పాఠాలు కూడా జాగ్రత్తగా వినేవాడు. కష్టపడడానికి ప్రత్యామ్నాయం ఏదీ ఉండదు కదా? ఇవన్నీ మంచి ఫలితాలిచ్చాయి. క్రమంగా తెలివైన విద్యార్థిగా గుర్తింపుకొచ్చాడు. అది అలాగే కొనసాగి, యూనివర్సిటీ టాపర్స్లో ఒకడయ్యాడు. అప్పటి నుండి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తోటి విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు అందరూ జార్జ్ మెక్లారిన్ ఎక్కడున్నాడని వెతకడం ప్రారంభించారు. తమ అనుమానాలు తీర్చుకోవడానికి, విషయం మరింత లోతుగా చర్చించుకోవడానికీ అందరికీ మెక్లారిన్ అవసరమయ్యాడు. అతని రూపురేఖలూ, నల్లరంగూ, అతని మూలాలు అన్నీ కనుమరుగయ్యాయి. అతని తెలివీ, ప్రతిభ మాత్రమే వెలుగులోకి వచ్చాయి. అందుకే ''ప్రపంచాన్ని మార్చగల ఏకైక ఆయుధం - విద్య!'' అని జార్జ్ మెక్లారిన్ స్వీయ అనుభవం లోంచి చెప్పాడు. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. మార్పు సహజం. మనదేశంలో దళితులూ బహుజనులూ ఏకమై మనువాద సంప్రదాయాలను బహిష్కరిస్తూ, స్వతంత్రంగా హేతుబద్ధంగా ఆలోచిస్తేగానీ... మనువాదం మట్టికరవదు! లౌకికవాదం బలపడదు!!
- డాక్టర్ దేవరాజు
మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.