Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆదిమ కాలపు నిగూఢ భయం ఆధునిక యుగంలో నిరుద్యోగ భీతిగా మారింది. సమాజంలో మనిషికి ఉపాధి లేదంటే ప్రాణం లేనట్లే'' అంటారు బ్రిటిష్ ఆర్థికశాస్త్రవేత్త బార్బరా వార్డ్.
మేధో శ్రమ, శారీరక శ్రమ సంపూరకాలు. ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ కాదు. కాని మేధో శ్రమకు ఎక్కువ జీతం. శారీరక శ్రమకు తక్కువ కూలి. భారీ శారీరక శ్రమను యంత్రంతో ఒక్క మనిషి చేయవచ్చు. మేధో శ్రమలో యంత్రాలు వాడినా మేధస్సు ముఖ్యం. యాంత్రీకరణ నిరుపాధికి, వేతన కోతలకు, అసమానతలకు, చైతన్య రాహిత్యానికి దారితీస్తోంది. కంప్యూటర్, ఎలెక్ట్రానిక్ పరిశ్రమల ఉద్యోగులు, సాంకేతిక ప్రవక్తలు, మేధావులు, సామాజిక విశ్లేషకులను ఆందోళనకు గురిచేస్తోంది. సాంకేతిక ప్రగతి ఆదాయాలను, జీవన ప్రమాణాలను పెంచింది. సంపన్నులకు సాయపడింది. పేదల కడుపుకొట్టింది. ఆక్స్ఫార్డ్ విశ్వవిద్యాలయ విద్యావేత్తలు యాంత్రీకరణ దుష్ఫలితాలపై వందల అధ్యయన పత్రాలు సమర్పించారు. 702 వృత్తులు పరిశీలించి వేతనాలు, విద్యార్హతల లక్ష్యాలపై ఆధునిక సాంకేతికత వ్యతిరేక ప్రభావాన్ని నిర్ధారించారు. యాంత్రీకరణతో 20ఏండ్లలో అమెరికాలో 47శాతం, ఐరోపాలో 54శాతం ఉద్యోగాలు ఊడే ప్రమాదముంది. డ్రైవర్ లేని కార్లు, ధ్వని స్పందనా యంత్రాలతో వైద్యం వగైరా కృత్రిమ మేధస్సు ప్రక్రియలు అపాయాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. 1900లో 31శాతానికి, 2000లో 3శాతానికి రైతులు దిగారు. నేడు రైతులు, పశుపోషకులు కలిసి 1.3శాతంతో 26 లక్షలే. 1990 నుండి కంప్యూటరీకరణ ఉపాధిని మింగేసింది. 2030 నాటికి వారానికి 15గంటల పనే దొరుకుతుందని ప్రఖ్యాత బ్రిటిష్ క్యాపిటలిస్టు ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ అంచనా. కాని పెరిగిన చదువులు, జనాభా, నిరుద్యోగాల కారణంగా 1980 నుండి లభించిన కొద్ది ఉద్యోగాలలో రోజుకు 15గంటలు బానిసల్లా పనిచేస్తున్నారు. రేయింబవళ్ళు సాగే పని భార్యాభర్తల విడాకులకూ దారితీస్తోంది.
హార్వర్డ్ బిజినెస్ రెవ్యూ 2013లో 12 వేల వృత్తి నిపుణులను సర్వే చేసింది. 50శాతం మా ఉద్యోగం అర్థం, ప్రాముఖ్యత లేనిదన్నారు. 50శాతం యాజమాన్య లక్ష్యాలకు మా పనికి పొంతన లేదన్నారు. 42 దేశాల్లో 2.30లక్షల మందిని సంప్రదించిన మరొక సర్వేలో 13శాతం మాత్రమే తమ ఉద్యోగం మీద మక్కువ చూపారు. ఇటీవలి బ్రిటిష్ ఉద్యోగుల సర్వేలో 37శాతం తమ పని ప్రపంచ అవసరాలను తీర్చడం లేదన్నారు. అద్భుత ఉద్యోగాల, విజయవంత వృత్తినిపుణతల, ఆకర్షణీయ జీతాల వృత్తి పనితో ప్రయోజనం శూన్యమని అందరూ అసహ్యంతో గొణిగేవారేనని లండన్లో స్థిరపడ్డ అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త డేవిడ్ గ్రీబర్ అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇలాంటి ఉద్యోగాలనే సృష్టిస్తారు. పారిశ్రామిక, పారిశుధ్య కార్మికులు, ఉపాధ్యాయులు ఒప్పంద ఉద్యోగులే. వీళ్ళు సమ్మెచేస్తే జనజీవితం నరకమే. కాని నిరుద్యోగ సైన్యం సమ్మెను సమ్మెట పోటుకు గురిచేసింది. ఒప్పంద ఉద్యోగ నియామకాలతో రాజకీయులు, అధికారులు, దళారీలు ధనవంతులవుతున్నారు. కార్మికులు జీవశ్చవాల్లా బతుకుతున్నారు. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు లక్షల ఉద్యోగాలు ఊడబీకాయి. ప్రజలు పట్టని స్వార్థపరులు, కార్పొరేట్ల పక్షపాతులు, మత్తెక్కిన మతమదాంధులు, మెదళ్ళు కుళ్ళిన రాజకీయులు చచ్చేదాకా దేశ భవిష్యత్తును నిర్ణయించే పదవుల్లో కొనసాగుతారు. ఉద్యోగులు మాత్రం 50ఏండ్లకే, చిన్న పనులకే అనర్హులు! వదంతులు వదలడం ప్రజాస్పందనను గమనించి చర్యలను పరిమితించడం లేదా ఉధృతించడం ప్రభుత్వాలకు పరిపాటి.
''విద్య లక్ష్యం భవిష్యత్తులో నిరర్థక వ్యాపక కల్పన కాక జీవిత సార్థకతను పెంచేదిగా ఉండాలి. పని, జీతాలను నిర్ణయించేది కాక జీవిత సంతోషాలు, మానవత్వ విలువలను పెంచేదిగా ఉండాలి'' అని డచ్ చరిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత రట్గర్ బ్రెగ్మన్ అభిప్రాయం. ప్రపంచాన్ని సుందరంగా, సంతోషకరంగా, ఆసక్తిదాయకంగా తీర్చిదిద్దడమే జీవితం. ఇది శ్రమశక్తితోనే సాధ్యం. మన పని-నిర్వచనం సంకుచితం. డబ్బు సంపాదన పనులనే స్థూల జాతీయోత్పత్తిలో చేర్చారు. పొట్టకూడే చదువు లక్ష్యం, ధనమే జీవితమను కుంటారు. సమాజ నిర్మాణానికి మూలమైన జ్ఞానసంపదను గుర్తించరు. పెరిగిన సాంకేతికత ఈ సమస్యను మరింత తీవ్రం చేసింది. యాంత్రీకరణ యుగంలో సామర్థ్యం, ఉత్పత్తి పెరిగినా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల మానవ శ్రమకు విలువ లేదు. సంపన్నుల సంఖ్య, వారి వృథా సమయం పెరిగాయి. సాంకేతికతల ఫలితాలు పేదలు పొందాలంటే శ్రమ పరిగణన తీరు మారాలి. మనం అసహ్యించుకునే ఉద్యోగాలనే చేస్తూ అనవసర వస్తువులను కొంటూ ఉంటామని అమెరికన్ చిత్రం 'ఫైట్ క్లబ్' లో నాయకుడు బ్రాడ్ పిట్ అంటారు.
ఉత్పత్తిలో శ్రామిక భాగస్వామ్యం తగ్గితే సామాజిక అస్థిరత్వం దాపురిస్తుంది. కొనుగోలు శక్తి నశించి వినియోగదారులు తగ్గితే ఆర్థిక అస్థిరత్వం నెలకొంటుంది. ప్రజల ఆకలి తీర్చలేని సాంకేతికత నిష్ప్రయోజనం. ఈ సమస్యకు పరిష్కారంగా స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, కెనడాలలో 'సార్వత్రిక ప్రాథమిక ఆదాయ' పథకం చేపట్టారు. ఇది పనితో సంబంధం, ఇతర షరతులు లేకుండా ప్రతి పౌరునికీ కొంత నెలసరి ఆదాయాన్నిస్తుంది. దీంతో యాంత్రీకరణ దుష్ఫలితం కొంత తగ్గచ్చు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల లాభాల నుండి ఈ పథకానికి నిధులు ఇస్తారు. మన దేశంలో ఈ సంస్థల రాజకీయ అధికారులు లబ్ధిపొందారు. సంస్థలు లాభాలులేని రోగ పరిశ్రమలుగా మార్చబడ్డాయి. నూతన ఆర్థిక విధానాల ఊబిలో దిగిన ప్రభుత్వాలు ఈ సంస్థలను అమ్ముతున్నాయి. పన్నుల ద్వారా వనరులు చేకూర్చుకొని అనేక పెట్టుబడిదారీ దేశాలు ఈ సార్వత్రిక ఆదాయ పథకాన్ని అమలుచేశాయి. వస్తు సేవల పన్నులతో కేంద్ర ప్రభుత్వ ఆదాయం పెరిగింది. అయితే ఈ డబ్బును అమెరికా ఆదేశాల అమలుకు కేటాయించారు. వివిధ సేవల సర్చార్జీలు, సెస్సులను ప్రభుత్వం నిర్దేశిత రంగాలకు కాక రాజకీయ లబ్ధికి వాడుకుంటోంది. ప్రపంచ మితవాద ప్రభుత్వాలు ఇస్తున్న సార్వత్రిక ఆదాయ పథకాన్ని మన మతవాద కేంద్రం ప్రస్తావించింది. కాని తేలుకుట్టిన దొంగలా మౌనంగా ఉంది. శ్రమ సంస్కృతి నశించిన మన సమాజాన్ని ఈ పథకం మరింత సోమరితనం, దురలవాట్ల వైపు లాగే అపాయముంది. ఎన్నికల్లో వాగ్దానించిన నిరుద్యోగ భృతిని నిర్లక్ష్యంచేసి, ఉన్న రాయితీలను, పెన్షన్లను, సాంఘిక సంక్షేమాలను రద్దుచేస్తున్న ప్రభుత్వాల నుండి కార్పొరేట్ల ప్రయోజనాలు తప్ప ప్రజా సంక్షేమాన్ని ఆశించలేం. శాస్త్రీయత మరిచి, మధ్యయుగాల మతమౌఢ్యంలో మునిగి, ప్రపంచ వంచక అమానవీయ అమెరికా పంచన చేరిన పాలకులు భారతాన్ని వంచిస్తున్నారు.
''శ్రమ సంతోషాన్ని కలిగిస్తే జీవితం ఆనందమయమవుతుంది. శ్రమ మొక్కుబడిగా మారితే జీవితం బానిసత్వమవుతుంది'' అని రష్యన్ రచయిత, సామాజిక ప్రజాస్వామ్య ఉద్యమ కార్యకర్త మాక్సిమ్ గోర్కీ అన్నారు. ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్న ఆర్థికసంపన్నత అభివృద్ధి కాదు. 'పనులు యంత్రాలకు, జీవితాలు మనుషులకు' అన్న సూక్తిని పాటించాలి. మెరుగైన భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ ప్రణాళికల రూపకల్పన చేయాలి. ఊహలు నిజమై జీవితాలు సంతోషమయం కావడం అభివృద్ధి.
- ఎస్. హనుమంతరెడ్డి
సెల్: 9490204545