Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ఎనిమిదిన్నర ఏండ్ల పాలన చూస్తోంటే ''ఈ దేశ ప్రజలపై ఈ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష'' అని అనిపించకమానదు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశ ప్రజలపై మోయలేని భారాలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే మంచి పని చేయకపోవడం విస్తుగొలిపే విషయం. బీజేపీ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, దివాలాకోరు ఆర్థిక విధానాలు దేశాన్ని అధోగతిలోకి నెట్టాయి.
ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణం. 2016 నవంబర్ 8న పెద్దనోట్లను అకస్మాత్తుగా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. నల్లధనం వెలికి తీయడం, నకిలీ కరెన్సీని అరికట్టడం, తీవ్రవాదానికి నిధులు ఆపడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసమే ఈ చర్య చేపట్టామంటూ మోడీ చెప్పిన మాటలు అన్నీ అవాస్తవాలే అని ఆచరణలో తేలిపోయింది. రద్దు అయిన పెద్దనోట్లలో 99.3శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని ఆర్బీఐ గణాంకాలతో సహా ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో లక్షల కోట్ల నల్లధనాన్ని పట్టుకోవడానికి నోట్లరద్దు అస్త్రం ప్రయోగించామంటూ ప్రకటించుకున్న కేంద్రం ఏమీ తేలేక చివరకు తెల్ల మొఖం వేయాల్సివచ్చింది.
నోట్లరద్దుతో పాటు కరోనా వల్ల దేశంలో పెద్దఎత్తున సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల మొదలుకొని భారీ పరిశ్రమల దాకా అనేకం మూతపడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఈ క్రమంలో 2016 నుండి 2019 మధ్య సుమారు 50లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏటా రెండు కోట్ల కొలువులు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ఈ దేశ నిరుద్యోగ యువతను నిండా ముంచింది. ఎనిమిదిన్నర ఏండ్లలో ఇవ్వాల్సిన 16.05కోట్ల ఉద్యోగాలు లెక్క చెప్పమని ప్రశ్నిస్తే పకోడీలు, బజ్జీల బండ్లు పెట్టుకోని అమ్ముకోండని నిస్సిగ్గుగా చెపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వివిధ శాఖల్లో 16లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయకుండా కాలం గడుపుతూ దగా చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ హౌల్సేల్గా పప్పు బెల్లాల్లా బడా కార్పొరేట్లకు అమ్మేస్తున్నారు. రైళ్ళు, విమానాలు, పోర్టులు, ఎల్ఐసీ, బాంకులు, నవరత్నాలు, జాతీయ రహదారులు, ఉక్కు ఫ్యాక్టరీలు, బొగ్గు గనులు తదితర రంగాలన్నిటినీ తెగనమ్ముతున్నారు. డిజిఇన్వెస్టిమెంట్ పేరుతో 3లక్షల 72వేల కోట్ల రూపాయల విలువైన 35సంస్థలను, ఆస్తులను అమ్మేశారు. పేదలను కొట్టి పెద్దలకు పెడుతూ కార్పొరేట్ ట్యాక్సును ఒకేసారి 10శాతం తగ్గించి బడాబాబులకు వరాలు గుప్పిస్తున్నారు. బ్యాంకులను ముంచి వేల కోట్ల రూపాయల బకాయిలను ఎగవేసిన వారిపై జాలి పడి ఏకంగా 12లక్షల కోట్ల రుణాలను మాఫీ రైటాఫ్ చేసి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ గద్దల రుణం తీర్చుకుంది. కానీ ఓట్లేసి గెలిపించిన సామాన్య ప్రజలకు ఆసరానిచ్చే అనేక సంక్షేమ పథకాలను మాత్రం ఉచితాలుగా ప్రచారం చేస్తూ వాటిని రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నది. చివరికి నిత్యావసర వస్తువులైన పాలు, పెరుగు, పప్పు, ఉప్పులను కూడా వదిలిపెట్టకుండా జీఎస్టీ వేసి సామాన్యుల నడ్డి విరిస్తోంది. 2014లో రూ.410లు ఉన్న గ్యాస్ సిలిండర్ల ధర ఇప్పుడు రూ.1100లు దాటింది. అడ్డగోలుగా ఎక్సైజ్ సెస్సులు వడ్డించి పెట్రోల్, డీజిల్ ధరలను హద్దు పద్దులేకుండా పెంచి ఎనిమిదేండ్లలో 30లక్షల కోట్ల రూపాయలను ప్రజల ముక్కు పిండి దండుకున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ యువత రిజర్వేషన్ కోటాకు గండికొట్టారు. హైదరాబాద్కు ముంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి లక్షలాది ఐటీ ఉద్యోగాలకు గండి కొట్టి తెలంగాణ యువతకు తీరని ద్రోహం చేసింది మోడీ సర్కార్. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న బ్లాక్మనీని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రప్పిస్తానని రంకెలు వేసి చెప్పిన మోడీ ఇప్పుడు నల్లధనం ఎక్కడా అని అడిగితే తెల్ల మొఖం వేస్తున్నాడు. ప్రతి ఒక్కరి జన్ ధన్ ఖాతాలో ధన్ధన్ మంటూ రూ.15లక్షలు వేస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడేమో నిస్సిగ్గుగా అదంతా జుమ్లా అని కొట్టి పారేస్తున్నారు. భారతదేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద ఎన్నికల మోసం. దేశానికి అన్నం పెట్టే రైతన్నల పొట్టగొట్టడానికి మూడు వ్యవసాయ నల్లచట్టాలను తెచ్చి వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను దేశ ద్రోహులుగా ఉగ్రవాదులుగా చిత్రీకరించి వారిపై కేసులు పెట్టి నిర్బంధించి ఉద్యమకారులపై కారుతో తొక్కించి చంపేశారు. ఆ సందర్భంగా జరిగిన పోరాటంలో 750మంది రైతుల ప్రాణాలు బలిగొన్నారు. చివరికి తెచ్చిన నల్లచట్టాలను ఏడ్చుకుంటూ వెనక్కి తీసుకొని మద్దతు ధర చట్టం తీసుకురాకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాల ఫలితంగా మన దేశ రూపాయి విలువ గింగిరాలు తిరిగి రూ.83లకు పడిపోయింది. దీనితో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నది. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లకు బైబై చెప్పి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. మేకిన్ ఇండియా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దేశం అప్పుల కుప్పగా తయారయ్యింది. స్వాతంత్ర భారతదేశంలో 67ఏండ్ల కాలంలో పాలించిన ప్రధానులందరూ చేసిన అప్పు 55.87 లక్షల కోట్ల రూపాయలు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదిన్నర ఏండ్లలో చేసిన అప్పు అక్షరాల 80లక్షల కోట్లు. ఇప్పుడు మొత్తం దేశం అప్పు 135.87లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. అయినప్పటికీ అంతర్జాతీయ ఆకలి సూచిలో భారతదేశ ర్యాంకు దారుణంగా దిగజారి 107వ స్థానానికి చేరుకుని మన చుట్టూ ఉన్న దేశాల కంటే ఘోరంగా పడిపోయింది. రైతుల వ్యవసాయ బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని నెల నెలా రైతులు కరెంట్ బిల్లులు కట్టాల్సిందేనని మెడల మీద కత్తిపెట్టి బెదిరిస్తుంది మోడీ సర్కార్. ఉచిత విద్యుత్తును రైతులకు ఇవ్వొద్దని ఆదేశిస్తోంది. కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా రాజకీయం చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య తగువు పెంచుతోంది. దీనితో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి హక్కులు రాకపోవడంతో అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది.
ప్రత్యేకించి తెలంగాణపై కేంద్రం కక్షగట్టినట్టుగా వ్యవహరించడం ఆందోళన కలిగించే అంశం. దేశంలో కొత్తగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన మోడీ ప్రభుత్వం అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వకుండా వివక్షతో ద్రోహం చేసింది. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టం చెబుతున్నా తెలంగాణలోని కొత్తజిల్లాల్లో ఒక్క నవోదయ పాఠశాల కూడా ఏర్పాటు చేయకుండా కక్ష పూరితంగా వ్యవహరించింది. ఎనిమిదిన్నరేండ్లలో ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ లాంటి 36 ప్రీమియర్ విద్యా సంస్థలను వివిధ రాష్ట్రాల్లో నెలకొల్పిన కేంద్రం తెలంగాణలో ఒక్క ఉన్నత విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేయలేదు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో నయవంచనకు పాల్పడింది మోడీ సర్కారు. ఇక్కడ పెట్టాల్సిన కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్, లాతూర్కు తరలించి రాష్ట్రంలోని ప్రజల దశాబ్దాల కలల్ని కూల్చేసింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై తుక్కు వాదనలు చేస్తూ చివరికి ఫ్యాక్టరీ పెట్టడం కుదరదని చావు కబురు చల్లగా చెప్పారు. ట్రైబల్ వర్సిటీ విషయంలో కూడా గిరిజన ప్రజల ఆశల్ని అవకాశాల్ని ఆవిరి చేశారు. పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హౌదా ఇస్తున్న కేంద్రం పాలమూరు రంగారెడ్డి, కాలేశ్వరం ప్రాజెక్టులకు హౌదా అడిగితే కుదరదంటూ తెలంగాణ రైతాంగంపై పగ పట్టినట్టు వ్యవహరిస్తున్నది. ఏదో ఒక ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెబుతున్న చట్టాన్ని చట్టుబండలు చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను ఎగ్గొడుతూ బకాయిల్ని విడుదల చేయకుండా తప్పించుకు తిరుగుతున్నది మోడీ ప్రభుత్వం. షెడ్యూలు 9, 10లోని సంస్థలను విభజించకుండా నాన్చుతూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తున్నది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అప్రజాస్వామికంగా గుంజుకుని పురిట్లోనే తెలంగాణకు తొలి ద్రోహం చేసింది బీజేపీ. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూల్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ, వ్యతిరేకించిన వారిని ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కేసులు పెట్టి వేదించి లొంగదీసుకుంటున్నారు. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. అప్రజాస్వామికంగా, నయా హిట్లర్ లాగా మోడీ దేశంపై దండయాత్ర చేస్తున్నాడు. ఒకే భాష, ఒకే మతం, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ ఉండాలనే లక్ష్యంతో ఫాసిస్టు పోకడలతో మోడీ ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో పాలన సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన సహాయం అందించకపోగా ఈ ప్రభుత్వాన్ని అక్రమ పద్ధతుల్లో పడగొట్టడానికి ఢిల్లీ బ్రోకర్ల ద్వారా వందల కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలకు ఎరజూపి కన్నంలో దొంగల్లా దొరికిపోయారు. తమ పప్పులు ఉడకకపోవడంతో గవర్నర్ని ఉపయోగించి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. దీన్ని ప్రజాస్వామ్యాన్నీ, దేశాన్ని కాపాడు కోవడం మనందరి కర్తవ్యం.
- జూలకంటి రంగారెడ్డి