Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మౌలానా అబుల్ కలాం ఆజాద్... 1930 గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయి ఒక సంవత్సరంన్నర పాటు మీరట్ జైల్లో శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా లాంటి మహౌద్య మాల్లో పాల్గొని పదేండ్లపాటు జైలుశిక్ష అనుభవించాడు. స్వాతంత్య్రం తరువాత భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖా మంత్రిగా 11ఏండ్ల పాటు సేవలందించి, ఖరగ్పూర్ ఐఐటిని స్థాపించి ఎందరో మేధావులను దేశానికి అందించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ త్యాగాన్ని నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా వంచించి అవమానిస్తుంది. మైనారిటీ కమ్యూనిటీలుగా ఉన్న ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు, సిక్కులు ఎంఫిల్, పిహెచ్డి ప్రోగ్రామ్లను కొనసాగించడానికి ఐదేండ్ల పాటు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో 2009లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (యంఎయన్ఎఫ్)ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తుంగలోకి తొక్కింది. 2022-23 నుండి మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (యంఎయన్ఎఫ్)ను రద్దు చేస్తున్నామని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ ఇటీవల పార్లమెంట్లో ప్రకటించారు. ఇది పూర్తిగా మైనారిటీ వర్గాన్ని ఉన్నత విద్య నుండి దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రే. ఈ కుట్రతో దేశంలోని పేద, మైనారిటీ విద్యార్థులకు శాపంగా మారి స్కాలర్షిప్లకు బ్రేక్ వేస్తూ వారిని చదువులకు దూరం చేస్తున్నది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ల కోసం యువ పండితులను ఎంపిక చేయటానికి ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ పరీక్షకు లక్షలాది మంది హాజరైనా కూడా ప్రతీ ఏడాది 25 వేల మంది మాత్రమే ఫెలోషిప్ను పొందు తున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నప్పటికీ మతపరంగా మైనారిటీలకు చెందినవారికి ఉపయోగపడే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ను మోడీ సర్కార్ నిలిపివేసి వారిని ఉద్దేశ్యపూర్వకంగానే అంధకారంలోకి నెడుతున్నది. దేశంలోని ముస్లింలు, ఇతర వర్గాల మధ్య విద్యాపరమైన అంతరాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్థిష్ట చర్యలు తీసుకోవాలని ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు చేసిన తర్వాతనే 2009లో మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ప్రారంభించబడింది. 2019లో నిర్వహించిన ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకారం దేశ జనాభాలో ముస్లింలు 14.2శాతం మంది ఉన్నారు. అయితే దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో చేరిన వారిలో కేవలం 5.5శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇది కేవలం ముస్లింల కోసమే తీసుకొచ్చిన పథకం కాకపోయినప్పటికీ దీని ద్వారా లబ్ది పొందే వర్గంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. మతపరమైన రాజకీయాలకు అలవాటు పడిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ ఫెలోషిప్ను రద్దు చేసి మైనారిటీల విద్యా అవకాశాలపై దాడి చేయాలనే ఆ పథకాన్ని గత కొన్ని సంవత్సరాల నుండి నీరుగారుస్తూ వస్తుంది. గత 2019-20లో 1,251 మందికి ఈ ఫెలోషిప్ అందజేయగా, 2020-21 నాటికి 1,075మందికి కుదించింది. ఆ పథకానికి ఇచ్చే నిధులను కూడా 100కోట్ల రూపాయల నుంచి 74కోట్ల రూపాయలకు తగ్గించి ఇప్పుడు ఏకంగా ఆ ఫెలోషిప్నే ఎత్తేసింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలోని యూనివర్సిటీలకు నిధులను తగ్గించి ప్రభుత్వ యూనివర్సిటీ వ్యవస్థను నాశనం చేస్తున్నది. ఇప్పుడు యంఎయన్ఎఫ్ను ఆపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మైనారిటీలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షను నులిమేస్తున్నది. ప్రస్తుత బీజేపీ పాలనలో మైనారిటీల సంక్షేమం అన్న పదానికి కూడా విలువ లేకుండా పోయింది. దళితులు, గిరిజనులు, అల్ప సంఖ్యాక వర్గాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమం బీజేపీ ఎజెండాలోనే లేవు. అగ్రవర్ణాల ఆధిపత్యంతోనే సమాజం నడవాలని బీజేపీ సైద్ధాంతికంగా నమ్ముతున్నది. మనువాదాన్ని, మనుస్మృతిని మనసారా నమ్ముతున్న సంఫ్ు పరివార్ పాలనలో అణచివేతకు గురవుతున్న అట్టడుగు తరగతుల ప్రజల సంక్షేమాన్ని వీరు పట్టించుకోరనేది ఆచరణలో కనబడుతున్నది. బీజేపీ పాలనలో మైనారిటీల సంక్షేమాన్ని వెతకడం అంటే ఎండమావుల్లో నీటి కోసం వెతకటమే. స్వాతంత్య్రానంతరం ముస్లిం మైనారిటీల ఆర్థిక, సామాజిక అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యంపై అనేకమార్లు సర్వేలు జరిగాయి. గోపాల్సింగ్ కమిషన్, రాజేంద్ర సచార్ అధ్యక్షతన ఏర్పడిన సచార్ కమిటీ, జస్టిస్ రంగనాథ్ మిశ్రా అధ్యక్షతన పని చేసిన మైనారిటీ కమిషన్లు మైనారిటీల సమస్యలపై, విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలు, వ్యాపారం తదితర రంగాలపై లోతైన అధ్యయనం చేశాయి. విద్య, ఉపాధి రంగాల్లో దేశంలోని ఇతర ప్రజలతో పోల్చితే ముస్లిం ప్రజలు చాలా వెనకబడి ఉన్నారని, ఉన్నత విద్యలో దళితులు, గిరిజనుల కంటే కూడా అధ్వాన్నమైన స్థితిలో ఈ ముస్లిం ప్రజలు ఉన్నారని సచార్ కమిటీ నివేదిక వెల్లడించింది. అంతే కాదు విద్యలో ముస్లిం మహిళలు దేశంలోనే అందరికంటే వెనుకబడి ఉన్నారని, వ్యాపార రంగంలో ఈ తరగతి ప్రజలకు జాతీయ బ్యాంకులు చేస్తున్న సహాయం నామమాత్రంగా ఉందని కూడా పేర్కొంది. ఈ పరిస్థితి మారనట్లయితే భవిష్యత్తులో ముస్లిం మైనారిటీలు దేశ ప్రధాన స్రవంతి నుండి వేరుపడతారని కూడా హెచ్చరించింది. వారి సంక్షేమానికై ప్రత్యేక నిధులు, విద్య, ఉపాధి రంగాల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని కూడా తన నివేదికలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయినా అభివృద్ధిలోని చివరి ఫలాలు కూడా మైనారిటీ ప్రజలకు దక్కటంలేదు. ప్రత్యేకించి బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం ప్రజల సంక్షేమం మాట అటుంచితే వారి జీవితాలకే ప్రమాదం వచ్చింది. గో రక్షణ దళాల దాడులు, ముమ్మారు తలాఖ్ పేరిట జైలు శిక్షలు వేయటం, లవ్ జిహాద్ పేరిట విద్వేషాన్ని రెచ్చగొట్టటం, ఏకపక్షంగా జమ్ము-కాశ్మీర్ను విడగొట్టడం, ఆ ప్రజలకిచ్చిన హామీ ఆర్టికల్ 370 రద్దు చేయటం, వారి ఆస్తులు కాజేయటానికి 35 (ఎ)ను రద్దు చేయటం ఈ దేశంలో మైనారిటీలకు తీవ్రమైన అభద్రతా వాతావరణాన్ని సృష్టించాయి. మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని ఇచ్చేలా చట్టాన్ని సవరించటమే గాక ముస్లింలకు పౌరసత్వాన్ని ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించట మంటే రాజ్యాంగ మౌలిక విలువలను తుంగలో తొక్కటమే. కాబట్టి దేశంలోని లౌకిక శక్తుల మద్దతును కూడగట్టి మైనారిటీ ప్రజల మౌలిక హక్కులకై పోరాడటం దేశంలో ఓ ప్రధాన కర్తవ్యంగా ముందుకొచ్చింది.
- యం.ఎ. జబ్బార్
సెల్: 9177264832