Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వచ్చే ఆదివారానికి మనం 2023లో ప్రవేశిస్తాం. అది ఎన్నికల సంవత్సరం కూడా అవుతుంది. లోక్సభ ఎన్నికలు 2024 మొదట్లోనే పూర్తి కావాలి. పాలకపార్టీలన్నీ ఎన్నికల జ్వరంలో మునిగిపోయాయి. నిజానికి ఇప్పటికే ఆ వాతావరణం చూస్తున్నాం. వివాదాలు పరాకాష్టకు చేరాయి. రాజకీయ సామాజిక జీవితంలోని ప్రతిరంగమూ ప్రకంపనలకు గురయింది. గతంలో ఎంత చెప్పినా అర్థం కాని అంశాలు ఇప్పుడు కొంత బోధపడు తున్నాయి. కొల్కతాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బిగ్ బి అమితాబ్ బచన్ దేశంలోప్రాథమిక హక్కుల పరిస్థితి గురించి, భావస్వేచ్ఛ గురించి ఆవేదన ప్రకటించడం అందులో ఒకటి. గోవా చిత్రోత్సవంలో జ్యూరీ చైర్మన్ ఇజ్రాయిలీ దర్శకుడు లిపిడ్ కాశ్మీర్ ఫైల్స్ కేవలం చవకరకం ప్రచార చిత్రమని ధైర్యంగా కొట్టిపారేయడం మరొకటి. అత్యున్నత న్యాయస్థానం పౌరహక్కుల రక్షణచేయలేకపోతే మేమెందుకని జస్టిస్ చంద్ర చూడ్ కేంద్రాన్ని ప్రశ్నించడం ఇంకోటి. ఈ మూదు సందర్భాలు కూడా దేశం ముందున్న ప్రధాన సవాలును సూటిగా చెబుతున్నాయి. తెలుగునాట చూస్తే గురజాడ పురస్కారాన్ని చాందస ప్రవచనకారులకు ఇవ్వడంపై విస్తృత స్థాయిలో నిరసన వ్యక్తం కావడం పునరుద్ధరణవాదశక్తులపై ప్రగతివాదుల కదలికను చెబుతుంది. ఇదే సమయంలో సినిమా రంగంలో మతతత్వ భావాలతో కూడిన పునరుద్ధరణవాద సినిమా ప్రపంచ స్థాయికి చేరడం అందోళనా పెంచుతున్నది. మీడియా మోడియాగా మారే క్రమం కొనసాగింది. ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన సోషల్ మీడియాను కూడా పెద్దపార్టీలు వ్యాపారశక్తులు పక్కదోవ పట్టిస్తున్నాయి.
మార్కెట్శక్తుల చెలగాటం, ప్రపంచ కుబేరుల జాబితాలోని భారతీయ మహాసంపన్నులు లక్షల కోట్లకు ఎగబాకడం శరవేగంగా జరిగింది. బ్యాంకులు వారికి 13లక్షల కోట్లకు పైగా కట్టబెట్టిన ఉదంతం అధికారికంగానే వెల్లడైంది. ఇక విశాఖ ఉక్కుబేరం కొనసాగుతున్నది. స్వయంగా కేంద్ర నేతలు ఖండించినా సింగరేణి గనులలో కొంత భాగం వేలానికి పెట్టడం ఈ కాలంలోనే జరిగింది. ఓడరేవులు, గనులు, విమానాశ్రయాలు అన్నీ ప్రయివేటు చేతుల్లోకి వెళుతున్నాయి. సంఫ్ు పరివార్ మతతత్వం, మార్కెట్ శక్తుల విశృంఖలత కలగలసిన మోడీ పాలన ఈ ఏడాది మరింత వెర్రితలలు వేసింది.
ఎన్నికలలో కొత్త పరిణామాలు
దేశంలోని వివిధ ప్రాంతాలలో ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ అయిదు తెచ్చుకుంది. గుజరాత్లో కాంగ్రెస్ బలం మూడోవంతుకు పడిపోతే, బీజేపీ బలం బాగా పెంచుకొంది. హిమచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ విజయం కొంత ఊరట, ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో విజయం, అంతకు ముందు పంజాబ్లోనూ అధికారం చేపట్టి గుజరాత్లో 13శాతం ఓట్లు తెచ్చుకోవడంతో ఆప్కు జాతీయహోదా లభించింది. బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించకుండా మామూలు మాటలకే ఆప్ రాజకీయ విధానం పరిమితమవడం సందేహాలు కలిగించింది. కేరళలో సీపీఐ(ఎం) రెండోసారి విజయం సాధించి సుదీర్ఘకాల వరవడిని మార్చింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ ఏడాదిలో బీజేపీతో తెగతెంపులు చేసుకుని మళ్లీ తేజస్వియాదవ్ ఆర్జేడీతో కలిశారు. బీజేపీపై తీవ్రవిమర్శలు చేయడం మొదలెట్టారు. ఆయనకు ప్రధాని కావాలనే ఆశలు కొనసాగు తున్నాయి. టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చి మోడీ విధానాలపై విరుచుకుపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ వెళ్లినప్పుడు కూడా ఈ ప్రసక్తి రాగా ఆయన దాటవేశారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కేసీఆర్తో నడుస్తున్నారు. బిఆర్ఎస్ ఏపీకి విస్తరించేందుకు అడుగులేస్తోంది.
ప్రాంతీయ పార్టీల పాట్లు
మరో వంక తెలంగాణలో అస్త్రసన్యాసం చేసి ఏపీకే పరిమితమైన చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ ఖమ్మం సభతో పునఃప్రారంభం చేశారు. ఆరెస్సెస్ బాధ్యులొకరు ఇచ్చిన సలహా మేరకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఏపీ ఎన్నికలలో బీజేపీతో మెప్పుకోసమేనని కూడా చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో కలిస్తేనే తమకు గట్టి మెజార్టి వస్తుందని టీడీపీ అంతర్గత సర్వేతేల్చిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏమైనా టీడీపీ రాజకీయం అక్కడే పరిభ్రమిస్తున్నది. మరోవైపున వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం కూడా రాజకీయ ప్రశ్నలకు దారితీసింది. వైసీపీ ప్రభుత్వం బీజేపీకి కేంద్రంలో అనుకూలంగా ఉంటూనే తెలంగాణపై ఆసక్తిలేదని ప్రకటించింది.్ జనసేన పవన్ కళ్యాణ ఇప్పటికీ ఓట్లు చీలనివ్వబోనని ఒకసారి, ప్రజల మద్దతు ఉంటే తనే ముఖ్యమంత్రి అవుతానని మరోసారి రకరకాలుగా మాట్లాడుతూ తమ శ్రేణులనూ ఇతరులనూ కూడా తికమక పెట్టారు. ప్రధానంగా కాపులను తమవైపు తిప్పుకోవడానికి వివిధ రాజకీయపార్టీలు తమతమ వ్యూహాలతో హంగామా చేస్తున్నాయి. ఇతరత్రా కూడా కులరాజకీయాలు బాగా పెరిగాయి. తెలంగాణ ఏపీ మళ్లీ కలిసే అవకాశముంటే తాము ముందుంటామని వైసీపీ చేసిన ప్రకటన, దానిపై తెలంగాణ నేతల దాడి మరోసారి విభజన రోజులను గుర్తు చేసింది. ఏపీ ప్రభుత్వం విభజన సమస్యల పరిష్కారంలో జాప్యంపై సుప్రీం కోర్టులో తెలంగాణపై కేసు వేసింది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ, ఆరునెలల గడువులో అమరావతినే కట్టాలంటూ ఏపీహైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ఆ మేరకు నిలిపేసింది. మార్గదర్శికీ వైసీపీకీ ఘర్షణ పునరావృతమైంది. తెలంగాణలో బిఆర్ఎస్ ఎంఎల్ఎల కొనుగోలుకై బీజేపీ దళారులు దిగిపోవడం సంచలనం సృష్టించింది. మునుగోడు ఉప ఎన్నికలలో కమ్యూనిస్టుల మద్దతుతో బిఆర్ఎస్ గట్టెక్కడమే గాక భవిష్యత్ సమీకరణాలను గురించి ప్రశ్నలు లేవనెత్తింది. కేసీఆర్ కుమార్తె కవితను ఢిల్లీ ఉపముఖ్యమంత్రితో పాటు లిక్కర్ స్కామ్ ఛార్జిషీట్లో చేర్చడం, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గర బంధువు లను దాంట్లో ముద్దాయిలుగా చేర్చడం దేశం దృష్టిని ఆకర్షించింది.
అంతర్జాతీయ రంగంలో..
అంతర్జాతీయంగా ఫిబ్రవరిలో మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. భారతదేశం యుద్ధవిరమణ జరగాలంటూనే రష్యా దగ్గర చమురు కొనే హక్కును నిలబెట్టుకుంది. జి20 నాయకత్వం దేశానికి రావడం, దానిపై ప్రధాని అఖిలపక్ష చర్చ నిర్వహించడం బట్టి చూస్తే ఎన్నికలలో దీన్ని కూడా ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకోవడం తథ్యమని స్పష్టమైంది. భారత చైనా సరిహద్దులలో కొన్ని ఘర్షణలు పునరావృతమైనా రెండు దేశాలు వాటిని శృతి మించకుండా జాగ్రత్త పడ్డాయి. ఈ విషయంలో బీజేపీ దాగుడుమూతలు ఒకవైపు, కమ్యూనిస్టేతర ప్రతిపక్షాల అతి స్పందన మరోవైపు, మీడియా అత్యుత్సాహం ఇంకోవైపు వివాదాన్ని పెద్దగా చూపుతున్నా అదే సమయంలో ఇరుదేశాల సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయి. చైనా అధ్యక్షుడుగా సీ జింగ్ పింగ్ మరోసారి ఎన్నిక కావడం గురించి బడా మీడియా ఉధృత కథలు వదలినా చైనా కమ్యూనిస్టుపార్టీ మహాసభ వాటిని వమ్ము చేసింది. ఇప్పుడు మళ్లీ కరోనా ఆంక్షలపై తిరుగుబాటు అనీ, వాటిని సడలించిన తర్వాత విచ్చలవిడిగా కరోనా విజృంభణ అని గతంలో లాగే విపరీత ప్రచారం కొనసాగుతోంది. గొప్ప సంపదగా ప్రచారమైన క్రిప్టోకరెన్సీ ఇంతలోనే కూలిపోయింది. రిజర్వు బ్యాంకు భారతీయ డిజిటల్ నోట్ను లాంచనంగా విడుదల చేసింది. కరోనా కాలంలో ఎన్నో ఒడుదుడుకులు చూసిన ఐటిరంగంలో 2008 మాంద్యాన్ని మించిన తొలగింపులు ఖాయమంటున్నారు. దేశంలో కోవిడ్ వేరియంట్ ప్రవేశం ఘటనలు పెరగడంతో గతానుభవాల నేపథ్యంలో తీవ్రమైన సందేహాలు అలుముకుంటున్నాయి. ప్రధాని మోడీ తనదైన శైలిలో భిన్నసంకేతాలు ఇస్తూ ఉత్కంఠ పెంచుతున్నారు..
వివిధ రంగాల పరిస్థితి
మతసామరస్యంపైనా లౌకిక వాదులపైనా దాడులు ఈ కాలంలో పెరిగాయి. ప్రార్థనా స్థలాల చట్టం1991 ఉన్నా కాశీ, మధుర మందిరాలపై కోర్టులు విచారణ చేశాయి. కాశ్మీర్ 370 రద్దు, పౌరసత్వ సవరణచట్టం సమీక్ష, ఎన్నికల బాండ్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంలో లొసుగులు, నగదు రద్దు నిర్ణయం సమీక్ష వంటి కేసులన్నీ ఇంకా విచారణలోనే ఉన్నాయి. బీజేపీయేతర పార్టీలపై ఇడి, ఐటి, సిబిఐలను ప్రయోగించే త్రిశూల వ్యూహం తీవ్రంగానే అమలైంది. రాష్ట్రాలకు నిధుల కోత, హక్కులపై కేంద్రం దాడి మరింత ఉధృతమైంది. గవర్నర్ల జోక్యం పరాకాష్టకు చేరింది. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసే ప్రయత్నం పెద్ద ఎత్తున సాగుతున్నది. సుప్రీం కోర్టు ఈ ఏడాదిలో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులను చూసింది. ప్రజల తరపున పోరాడే కొద్ది మందికి ఉపశమనం లభించినా అనేక మంది నిర్బంధంలోనే ఉన్నారు.
భారతీయ సినిమారంగం కరోనా దెబ్బ నుంచి కోలుకుని మళ్లీ ఉత్సాహం పుంజుకోవడమేగాక ఓటీటీ ప్రభావం పెరిగింది. సినిమా రంగంలో ఆర్ఆర్ఆర్, పుష్ప, కెజిఎఫ్2, కాంతార వంటివి అంతర్జాతీయ రికార్డులు సాధించి బాలీవుడ్నే గాక హాలివుడ్ను కూడా కుదిపేశాయి. కాకుంటే మొదట ప్రస్తావించుకున్నట్టు వీటిలో పునరుద్ధరణవాద ధోరణులూ పెరిగాయి. కొద్దో గొప్పో సామాజిక న్యాయభావనను దిగువ వర్గాల అభ్యున్నతిని చెప్పిన దర్శకులు కూడా వ్యాపార అవసరాల కోసం వాతావరణంలో ఇమిడిపోవడం కోసం ఇలాంటి సినిమాలకు పట్టం కట్టడం ఆందోళనకరం. హీరో కృష్ణ, కృష్ణంరాజు, సత్యనారాయణ వంటి దిగ్గజాలు ఈ ఏడాది దూరమైనారు. మధురాంతకం నరేంద్ర నవలకూ వారాల ఆనంద్ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు దక్కడం హర్షం కలిగించింది. వివిధ రంగాల్లో ప్రతిభావంతులు, యువశక్తులు ప్రతికూల పరిస్థితులలోనూ పలు విజయాలు సాధించారు.
విపరీతంగా పెరిగిన నిరుద్యోగం, పెరిగే ద్రవ్యోల్బణం, అధిక ధరలపోటు వీటి మధ్య మోడీ సర్కారు గొప్పలు కుప్పకూలు తున్నాయి. పాలకవర్గాలు తమ జీతభత్యాలపైనా, గతంలో సాధించుకున్న హక్కులపైనా, ఉపాధి ఉద్యోగ భద్రతలపైనా చేస్తున్న దాడులను కార్మికవర్గం గట్టిగా ప్రతిఘటించింది. గత ఏడాది మోడీ హామీలతో తీవ్ర ఆందోళన విరమించిన రైతాంగం హామీలు వమ్ము చేసిన కేంద్రంపై మరోసారి పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. మహిళలు తమపై కొనసాగుతున్న దాడులనూ అవకాశాల నిరాకరణనూ నిరసిస్తూ ఆందోళనబాట పడుతున్నారు. చివరగా ముంచుకొస్తున్న కరోనా ముప్పును ఎదుర్కొవడానికి ప్రతివారూ సన్నద్ధమవుతున్నారు. అందుకే అనేక విధాల 2022 కొత్త సవాళ్లకు సమాయత్తం చేసిన కాలంగా మిగిలిపోనుంది.
- తెలకపల్లి రవి