Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ భూగ్రహానికి గల పెద్ద ప్రమాదం ఏమిటంటే దీన్ని ఎవరో వచ్చి రక్షిస్తారన్న విశ్వాసంతో ఉండటం - ఈమాట అన్నది రాబర్ట్ ఛార్లెస్ స్వాన్. తొలిసారి ఉత్తర ధృవం (1989) దక్షిణ ధృవం (1986) వెళ్ళి, అక్కడ గడిపి, పరిశీలించి వచ్చిన బ్రిటిష్ పౌరుడు. ఈ భూమిని, ఇక్కడి వాతావరణాన్ని, ప్రకృతిని, జీవరాసుల్ని, మానవాళిని మొత్తానికి మొత్తంగా అన్నింటినీ పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని బలంగా చెప్పినవాడు. అలాంటి వారి అనుభవాల్ని తెలుసుకుని, అందులోంచి మనం గ్రహించాల్సిన విషయం గ్రహించి, మనల్ని మనం మన సమాజాన్ని మనం పునరుద్దరించుకుంటూ ఉండాలి. ప్రపంచ ప్రసిద్ధ రష్యన్ రచయిత లియోటాల్స్టారు అంటాడు ''ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు, మార్పు మనతోనే మొదలయితే - ప్రపంచం అదే మారుతుంది!'' అని!
వృద్ధాప్యంలో కన్న బిడ్డలు వదిలేసినా, పూర్వ విద్యార్థులు పూనుకుని, తమ ఉపాధ్యాయురాలిని చేరదీసిన సంఘటన కేరళలోని మలప్పురంలో జరిగింది. అక్కడ ఒక ప్రయివేటు పాఠశాలలో ఒకప్పుడు ఎంతో తెలివైన ఉపాధ్యాయురాలిగా పేరున్న ఒక టీచర్ కాలక్రమంలో వీధిపాలైంది. స్వంత కొడుకులు, కూతుళ్ళు ఆమెను వదిలేశారు. జీవిత చరమాంకంలో ఆమె చాలా కష్టాలపాలైంది. కూడూ, గూడూ లేక వీధుల్లో తిరగాల్సి వచ్చింది. తన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో ఎక్కడ ఉన్నారో కూడా ఆమెకు తెలియదు. చివరకు బతకడానికి రైల్వే స్టేషన్ ముందు బిచ్చమెత్తుకోవలసి వచ్చింది. ఎందరి ఛీత్కారాలకో గురవుతూ, మొండిగా అక్కడక్కడే కాలం గడుపుకోసాగింది. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఒక పూర్వ విద్యార్థిని ఆమెను గమనించింది. అతి కష్టం మీద గుర్తుపట్టింది. దగ్గరికి వచ్చి వివరాలు అడిగింది. అంతే! ఆమె తనకు పాఠాలు చెప్పిన విద్యా టీచర్ అని పూర్తిగా నమ్మింది. తనను దివ్యగా పరిచయం చేసుకుంది. తనది ఏ బ్యాచో, తన బ్యాచిలో ఎవరెవరు ఉండేవారో చెప్పుకుంది. సంభాషణలు సంబంధాన్ని మరింత బలపరిచాయి. ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికిన విద్యా టీచర్ జీవితం అలా కావడం ఆ పూర్వ విద్యార్థినికి నచ్చలేదు. ఎంతగానో బాధపడింది. ఊరికే బాధపడితే లాభమేమిటీ? ఏదో చేయాలని అనుకుంది. ఒకప్పటి ఆ విద్యార్థిని దివ్య - ఇప్పుడు ఐఎయస్ అధికారి. వెంటనే ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళి స్నానం చేయించి, వేరే శుభ్రమైన బట్టలిచ్చి, భోజనం పెట్టి పడుకోబెట్టింది. అధికారంలో ఉన్న అధికారి గనుక, దగ్గరలో అన్ని వసతులు ఉన్న చిన్న ఇల్లు వెతకండని మనుషుల్ని పంపింది.
తనతో చదువుకున్న పూర్వ విద్యార్థినీ విద్యార్థుల్ని సంప్రదించింది. విషయం వారందరికీ తెలియ జేసింది. అంతే కాదు, తన సర్కిల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకు చెప్పి, అందరినీ కదిలించింది. తన విద్యాటీచర్ భవిష్యత్ కోసం కొంత నిధి ఏర్పాటు చేసింది. అలా తమ స్కూలు టీచర్కు మంచి జీవితం అందించాలన్న పూర్వ విద్యార్థుల సంకల్పం నెరవేరింది. తను చొరవ తీసుకుని, అందరినీ కలుపుకుని సమిష్టిగా ఒక ప్రయత్నం చేసి విజయురాలైంది ఐఏయస్ దివ్య. కన్నవాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఆమె ఆస్థి కాజేసి, నిస్సహాయురాలిని చేసి రోడ్డున పడేసినా, ఒక టీచర్, తన విద్యార్థుల సహకారంతో మళ్ళీ గౌరవప్రదమైన జీవితంలోకి రావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. విద్యాటీచర్ తను ఉద్యోగంలో ఉన్నప్పుడు బోధించిన పాఠాల సారాంశం, అందించిన సంస్కారం ఆ పూర్వ విద్యార్థుల్లో పనిచేసింది. ఆమె ఎంత నిజాయితీగా నిబద్దతతో పాఠాలు చెప్పకపోతే, ఆమె తన విద్యార్థినీ విద్యార్థులకు అంత ప్రీతిపాత్రురాలు కాగలదూ? అలా పదేండ్ల తర్వాత కూడా వాళ్ళు ఎందుకు తరలివచ్చారూ? ప్రతివారిలో మానవీయ విలువలు నిక్షిప్తమై ఉంటాయి. వాటిని మనం జాగృతం చేసుకుంటూ ఉండాలి. మానవవాదులు మనలోనే ఉన్నారు. అంటే... మన మధ్యే ఉన్నారని అర్థం. అంతేకాదు, మనలో అంటే ప్రతి ఒక్కరి మనసుల్లో ఉంటారు. స్వార్థం, కుత్సిత బుద్ధి పక్కన పెడితే, మనుషులంతా మానవవాదులే.. కదా? డబ్బూ, అధికారం చాలా మంది దగ్గర ఉంటాయి. అయితే వాటిని మానవత్వ కోణంలోకి మార్చి, తమ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని బాగుచేయాలనుకోవడం గొప్ప సామాజిక సేవ!
మన సమాజంలో ఇలాంటి పనులు ఎంతమంది చేస్తున్నారూ? అని నిట్టూర్పులు విడిచి, నిరాశపడకుండా ''మనమేమైనా చేయగలమా?'' అని ఎవరికి వారు కార్యాచరణకు పూనుకోవాలి. వారి పరిధిలో వారు చేయగలిగింది చేయడానికి సిద్ధపడాలి. మానవవాదులంటే ఎవరో ప్రత్యేకంగా ఉండరు. మన''లోనే'' ఉంటారు. మన ఆలోచనల్లోనే ఉంటారు. చేయవల్సిందల్లా 'వారిని' బయటికి తీయడమే. అంటే ఆ ఆలోచనలతోనే మరో పదిమందికి స్ఫూర్తినందించడం. జిలుగు వెలుగుల సినిమా రంగంలో ఉండి కూడా ప్రజల పక్షాన నిలిచిన నటులు కొందరు మనకు ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవాడు నానాపాటేకర్. తన ఆదాయంలో తొంభయి శాతం ఛారిటీలకు ఇచ్చారు. గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో సైన్యానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. తన ఆదాయంలో ఎక్కువ మొత్తం రైతుల అభ్యున్నతికి ఖర్చుపెట్టారు. కరువుకు గురైన నాలుగు గ్రామాల్ని దత్తతకు తీసుకున్నారు. పేద ప్రజల కొరకే తన జీవితం అన్నట్లుగా అన్ని వేళలా వారికి అండగా ఉంటున్నారు. ఉదాహరణకు ఇక్కడ ఒక్క నానాపాటేకర్ గురించి చెప్పుకున్నాం. కానీ, సమాజంలో అక్కడక్కడా ఇలాంటి వారు ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం మనలోంచే ప్రారంభం కావాలి! అలాగే ఇటీవల కరోనా లాక్డౌన్ సమయంలో వలసకార్మికులకు రవాణా సౌకర్యరం కల్పించి, స్వంత ఖర్చుతో వారిని వారి వారి గమ్యాలకు చేర్చిన ఘనత నటుడు సోనూసూద్కు చెందుతుంది. వెండితెర మీద విలన్లుగా నటించినా, నిజ జీవితంలో గొప్ప హీరోలుగా నిలిచారు.
''ప్రయత్నిస్తూ ఉండే వారికి సాధ్యం కానిది ఏదీ ఉండదు'' అని అన్నాడు అలెగ్జాండర్ ద గ్రేట్.
''జీత్ తొ పతా నహీఁ లేకిన్ యె చరాగ్
కంసెకం రాత్క నుక్సాన్ బహుత్ కర్తాహై'' ఉరుదూ కవి ఇర్ఫాన్ సిద్దీఖి. విజయం సంగతి తెలియదు కానీ, ఈ దీపం రాత్రికి చాలా నష్టం కలిగిస్తుంది - అని అర్థం. ఇందులో రాత్ అంటే రాత్రి. అమానవీయత - రాత్రిగాక మరేమిటీ? ఆశ అనే దీపం - ప్రయత్నమనే దీపం పట్టుకుని పోతూ ఉంటే చీకట్లు వాటికవే తొలగిపోతుంటాయన్న ఆశావాద దృక్పథం ఈ చరణాలలో ఉంది. సమకాలీనంలో జరుగుతున్న ఘోరాల్ని చూసి బెంబేలెత్తిపోవడం కాదు, ప్రయత్నించి ఎదుర్కొంటూ పోతేనే విజయం వరిస్తుంది.
కేరళ కొజికోడ్ జిల్లాకు చెందిన శశి తల్లితో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు. కొన్నేండ్ల క్రితం బ్యాగుల పరిశ్రమ పెట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి యాభైవేలు లోన్ (అప్పు) తీసుకున్నాడు. అసలూ, వడ్డీ ఏదీ చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఇంటిని జప్తు చేసేందుకు వెళ్ళారు. శశి నిస్సహాయత, కూలిపోయే అతని పాత ఇంటిని చూసి చలించిపోయారు. తొమ్మిది మంది ఉద్యోగులు కలిసికట్టుగా తమ స్వంత డబ్బుతో అతడి ఇల్లు బాగు చేయించి ఇచ్చారు. అంతే కాదు, ఆ బ్యాంకు ఉద్యోగులే తమ స్వంత డబ్బుతో అతడి బ్యాంకులోన్ చెల్లించారు. దేశంలో ఇలాంటి వారు కూడా ఉన్నారు. ప్రతి దేశస్థుడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానన్నవాడు రెండుసార్లు ప్రధానిగా వెలిగిపోయాడు గానీ, ఇలాంటి ఏ చిన్న పాటి సహాయమూ దేశంలో ఎవరికీ చెయ్యలేదు. ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. రైతు తీసుకున్న అప్పు సకాలంలో బ్యాంకుకు తిరిగి చెల్లించలేదని ఒక బ్యాంకర్ కోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ను జస్టిస్ చంద్ర చూడ్ కొట్టేశారు. ''రైతు అప్పు చెల్లించలేదని అతన్ని కోర్టుకు లాగుతారా? ముందు అప్పు ఎగ్గొట్టి పారిపోయిన ''పెద్ద దొంగలను''... పట్టుకోండి!'' అంటూ ఆయన తన తీర్పులో సూచించారు. ప్రకృతి పరిరక్షణ కార్యకర్త డాక్టర్ వందనా శివ అంటారు - ''భూమి హక్కులను రక్షించుకోవడమన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఇదే మన కాలంలో మనం జరిపే అతిపెద్ద శాంతి ఉద్యమం. సామాజిక న్యాయాన్ని, మానవ హక్కులను రక్షించడం అందులో భాగమే!'' ఒక స్థాయికి ఎదిగి ఆలోచించే వారికి మాత్రమే ఆమె మాటలు అర్థమవుతాయి. భూమితో రైతుకు మాత్రమే కాదు, మనుషులందరికీ ఉన్న సంబంధం గూర్చి అవలోకించగలగాలి. అది మానవవాదు లయితే గాని చేయలేరు!
ఇండోనేషియాలో ముస్లింలు తొంభైయి శాతం. హిందువులు రెండుశాతం. మిగతా ఎనిమిదిశాతం ఇతర మతస్థులు. అలాగే అమెరికాలో డెబ్బయిశాతం క్రైస్తవులు, ముప్పయి శాతం ఇతర మతస్థులు. అయినా, ఆయా దేశాల్లో అల్లర్లు లేవు. అక్కడ మతాన్ని అడ్డుపెట్టుకుని ఎవరూ రాజకీయాలు చేయడంలేదు. మెజారిటీలదే రాజ్యం అని కూడా అనడం లేదు. మన భారతదేశంలో ఆరెస్సెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ దేశం హిందువులదేనని అంటున్నారు. మిగతా మతస్థులపై దాడులు చేస్తున్నారు. ఇక్కడ మరొక విచిత్రం జరుగుతూ ఉంది. ఆవుపాలు నేల పాలు చేస్తారు. ఆవు నెయ్యి నిప్పులో తగలేస్తారు. ఆవు మూత్రం మాత్రం తాగుతారు. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేదు. కొందరికి - ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని అనిపిస్తుంది. మరి కొందరికి - హిందువులు ప్రమాదంలో ఉన్నారని తోస్తుంది. అసలు విషయమే మంటే... దేశమే ప్రమాదంలో ఉందన్నది అందరూ గ్రహించాల్సి ఉంది. దీనికి ఒక్కటే పరిష్కారం - జాతి, మత, కుల, ప్రాంతీయ భేదాల్ని పక్కకునెట్టి కలిసి మెలసి జీవించడమే!
మానవ వాదులన్న వారు కుల మతాల్ని తప్పని సరిగా త్యజించాలి. ఆర్థిక స్థోమతల్ని పట్టించుకో గూడదు. మానవాభ్యుదయమే ధ్యేయంగా ఆధునిక స్త్రీ పురుషు లందరూ కలసికట్టుగా ఒక మానవవాద ప్రపంచాన్ని సృష్టించుకోవాలి! పోయిన తరాల వారికి ఈ అవకాశం లేదు. వాళ్ళంతా ఏదో ఓ మతంలో ఏదో ఓ కులంలో పుట్టారు. ఆ చట్రంలోనే పెరిగారు. వాటికి అతీతంగా ఆలోచించడం ప్రారంభించే సరికి, వారు మధ్య వయస్సులో, వృద్ధులో అయిపోయి ఉంటారు. అప్పటి పరిస్థితులు కూడా వేరుగా ఉండేవి. కానీ, ఇప్పటి ఈ తరం నవ యువతీ యువకులకు అన్ని బంధాల్ని తెంచుకుని స్వేచ్ఛాలోచనతో ఆ చట్రం లోంచి బయటపడే అవకాశాలు ఎక్కువ!
డెన్మార్క్ వంటి దేశాల్లో విచిత్రమైన గ్రంథాలయా లున్నాయి. అక్కడ మీరు పుస్తకానికి బదులు ఒక వ్యక్తిని తీసుకోవచ్చు. అతను మీ ఎదురుగా కూర్చుని, మీ బాధలు, వ్యధలు ఓపిగా వింటాడు. మిమ్మల్ని పూర్తిగా చదివేస్తాడు. అంటే ఓపికగా వింటూ, మీ మానసిక ఒత్తిడిని, వేదనను అతను స్వీకరిస్తూ ఉంటాడన్న మాట! అంతే కాదు, దీనివల్ల మీ అహం, కోపం కూడా తగ్గుముఖం పడతాయి. వీటిని ''మానవ గ్రంథాలయాలు'' అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి మానవ గ్రంథాలయాలు ఎనభై అయిదు దేశాలలో ఉన్నాయి. చురుకుగా పనిచేస్తున్నాయి. ఎదుటివాడి బాధలు విని, అర్థం చేసుకుని, గాయపడ్డ అతని / ఆమె మనసు తేలికపడటంలో సహాయ పడటమంటే అది మానవత్వమే కదా? మానవీయ విలువల్ని నిలబెట్టడమే కదా? అలాంటి గ్రంథాలయాల్లో మీకు ఎదురుగా వచ్చి కూర్చునే వ్యక్తులు మానవవాదులు కాకపోతే మీ వేదనను పోగొట్టలేరు కదా?
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు