Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చక్రధర్ బుద్ధ, లావణ్యా తమంగ్
'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం' కింద పని చేస్తున్న కార్మికుల హాజరును ఈ జనవరి 1నుండి డిజిటల్ పద్ధతిలో నమోదు చేసే చర్యల్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించింది. పౌరబాధ్యత, పారదర్శకత పేరుతో మే, 2021లోనే ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్టు) నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్ఎంఎంఎస్) ఆప్ ద్వారా హాజరు నమోదును ప్రారంభించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్ఆర్ఈజీఏ) అమలులో పర్యవేక్షణ బాధ్యతను మెరుగుపరిచేందుకు, పారదర్శకతను పెంచేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ ఆప్ను ప్రారంభించింది. ఉపాధి పని ప్రదేశాలను పర్యవేక్షణ చేయడానికి పంచాయతీ స్థాయిలో ఎంపిక చేయబడి, శిక్షణ పొందిన స్థానిక మహిళలతో పాటు ఎన్ఆర్ఈజీఏ మేట్లు ఈ హాజరు నమోదు ప్రక్రియను అమలు చేయాలి. ప్రతీ కార్మికుడి హాజరుతో పాటు పని చేస్తున్న ఫొటో, పనికి హాజరైన వాస్తవ సమయాన్ని తీసుకోవడం ఈ ఆప్ లక్ష్యం. ఈ ఆప్లో ఉపాధి హామీ కార్మికులు, మేట్లు, ఇతర కార్యకర్తల అనుభవాలను తెలుసుకునేందుకు అనేక రాష్ట్రాల్లో మేం వారితో మాట్లాడాం.
స్థిరమైన పని సమయాలున్న కార్మికుల హాజరును పర్యవేక్షించేందుకు ఈ ఆప్ ఉపయోపడుతుండగా, అనేక రాష్ట్రాల్లో, ఉపాధి హామీ పనుల వేతనాలు ప్రతి రోజు చేసిన పని ఆధారంగా లెక్క కడతారు. కార్మికులు స్థిరమైన పని గంటలకు కట్టుబడి ఉండే అవసరం లేదు. ఈ సౌకర్యమే ఉపాధి హామీ పథకం పనికి ఉండే డిమాండ్కు కీలకమైనది. కానీ ఈ ఆప్ ద్వారా హాజరు నమోదు ప్రక్రియ, కార్మికులు రోజంతా పని ప్రదేశంలో అనివార్యంగా ఉండే పరిస్థితికి దారి తీస్తుంది. ఇది ఉపాధి కూలీల ఇబ్బందులకు కారణమవుతుంది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రియాదేవి తన ఉపాధి హామీ పనిని ఉదయం 9 గంటల కల్లా పూర్తిచేసి, తన తోటలో పండించిన ఉత్పత్తులను స్థానికంగా ఉండే మార్కెట్లో అమ్ముతుంది. ఈ ఎన్ఎంఎంఎస్ ఆప్ ప్రవేశపెట్టడంతో ఆమె పని ప్రదేశంలో రోజంతా ఉండాల్సి వస్తుంది లేదా తన హాజరు నమోదు కోసం పని ప్రదేశాలకు రెండుసార్లు వెళ్ళాల్సి వస్తుంది. తాను లేని సమయంలో తన ఉత్పత్తులుకొనే వినియోగదారులను కోల్పోవాల్సి వస్తుందని బాధను వ్యక్తం చేసింది. తాను చేయాల్సిన ఇంటి పనులన్నీ తన కూతురు చేయాల్సి రావడంతో తన కూతురు తరచుగా పాఠశాలకు వెళ్లకుండా ఉండే పరిస్థితి ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్కు చెందిన మరొక ఉపాధి హామీ కూలీ తెలిపింది.
ఎన్ఆర్ఈజీఏ కింద పనిచేసే మహిళా కూలీల సంఖ్య చాలా ఎక్కువగా (2021-2022 ఆర్థిక సంవత్సరంలో 54.7శాతం) ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పని పరిస్థితులను మార్చడంలో ఈ పథకం చాలా కీలకంగా ఉంటూ వస్తుంది. సాంప్రదాయంగా వస్తున్న కుటుంబ భారాన్ని మహిళలే మోస్తుండడంతో, కొత్తగా పుట్టుకొచ్చిన ఈ ఆప్ మహిళా కూలీలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నది. ఉపాధి హామీ హాజరు నమోదు ప్రక్రియ ఈ ఎన్ఎంఎంఎస్ ఆప్ ద్వారా జరుగుతుండడంతో కూలీల పరిస్థితి సందిగ్ధావస్థలో పడి, ఉపాధి హామీ పనిని వదులుకునే పరిస్థితికి చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా అనేక మంది ఉపాధి హామీ మహిళా కూలీలు తమ మానసిక స్థితిని మా ముందు వ్యక్తం చేశారు.
ఇతర సవాళ్ళు
ఈ ఎన్ఎంఎంఎస్ ఆప్ అమలులో కొన్ని ఇతర సవాళ్ళు కూడా ఉన్నాయి. వాస్తవ సమయం పర్యవేక్షణలో ఒక స్థిరమైన నెట్ వర్క్ అందుబాటులో ఉండాలి, దురదృష్టవశాత్తు అనేక గ్రామీణ భారత ప్రాంతాల్లో నెట్వర్క్ చాలా అసమానంగా ఉంటుంది. ఈ కారణంగా కూలీలు తమ హాజరును సరిగా నమోదు చేసుకోలేక పోవడంతో వారు తమ దినసరి వేతనాలను కోల్పోతున్నారు. ఈ నెట్ వర్క్ అందుబాటులో లేని కారణంగానే కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు తమ హాజరును నమోదు చేసుకోవడంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల 'న్యూస్ క్లిక్' నివేదిక కూడా తమిళనాడుకు చెందిన ఉపాధి హామీ కూలీలు ఈ ఆప్ ద్వారా తమ హాజరును నమోదు చేసుకోవడంలో ఇబ్బందుల్ని ఎదుర్కొన్న విషయాన్ని బయటపెట్టింది.
ఈ ఆప్ ఎన్ఆర్ఈజీఏ మేట్లపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చేసిన పనిని కొలిచి, కూలీల హాజరు నమోదు చేసే విధంగా పంచాయతీ స్థాయిలో స్థానిక మహిళలను సంసిద్ధం చేసే బాధ్యత మేట్లకు ఉంటుంది. కానీ ఇప్పుడు మేట్గా బాధ్యతలు స్వీకరించాలంటే ఆ మేట్కు ఒక స్మార్ట్ఫోన్ ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కొత్త నిబంధన వేల మంది మహిళలు మేట్లుగా మారకుండా అనర్హుల్ని చేసింది. ఈ కారణంగానే తాము మేట్లుగా అర్హత పొందకుండా ఉన్నామని ఇప్పటికే జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మహిళలు తెలిపారు. ఇప్పుడు స్మార్ట్ఫోన్లు ఉన్న పురుషులకు మేట్లుగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇక ఈ ఎన్ఎంఎంఎస్ ఆప్ను ఉపయోగించడంలో తమకు సరియైన శిక్షణ ఇవ్వలేదని ఎంపికైన అనేక మంది మేట్లు చెప్పారు. ఫలితంగా కార్మికుల హాజరు నమోదులో ఏర్పాడే దోషాల కారణంగా వారి వేతనాల చెల్లింపులు కోతకు, జాప్యానికి గురవుతాయి.
ప్రక్రియలో దోషాలు
ఈ ఎన్ఎంఎంఎస్ ఆప్ను పైలట్ ప్రాజెక్టుగా గత సంవత్సరం ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ ఆప్ అమలులో చాలా దోషాలున్నాయని అధికారులు, కార్యకర్తలు అనుభవపూర్వకంగా ధృవీకరించారు. కానీ వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలేవీ అందుబాటులో లేవు. సమాచార హక్కు దరఖాస్తులు కూడా ఎటువంటి సంతృప్తికరమైన పరిష్కారాలను చూపలేదు. ఈ ఆప్ అమలులో దోషాలు కొనసాగుతున్నప్పటికీ, మే 13,2022న ఎన్ఆర్ఈజీఏ పని ప్రదేశాల్లో (20మంది కంటే ఎక్కువ కార్మికులు ఉన్నచోట) ఎన్ఎంఎంఎస్ ఆప్ తప్పకుండా అమలు చేయాలనీ, ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప మాన్యువల్ హాజరుకు ఎలాంటి అవకాశం లేదని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఒక సర్క్యులర్ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ జారీ అయిన వారం రోజుల లోపు అనేక మంది, పైలట్ ప్రాజెక్టులో ఏర్పడిన దోషాల లాంటి దోషాల గూర్చి ఫిర్యాదులు సమర్పించారు. కానీ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఇంతవరకు ఎలాంటి పరిష్కారాల్ని చూపలేదు, ఎలాంటి హామీలు ఇవ్వలేదు.
భౌతికంగా లేని రికార్డులు
చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పథకాల పర్యవేక్షణకు హామీ ఇవ్వడం, పారదర్శకతను పెంచడం ద్వారా పౌరుల బాధ్యతను పెంచే లక్ష్యంతో ఈ ఆప్ ఏర్పడిందని చెపుతున్నారు. కానీ వాస్తవంలో దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నది. కార్మికులు సంతకాలు చేసిన హాజరు రికార్డులు లేకుంటే వారు చేసిన పనికి, పనికి హాజరైన రుజువులు ఎలాంటివి కార్మికుల వద్ద ఉండవు. ఎన్ఆర్ఈజీఏ ప్రాజెక్ట్లో పని చేసినవారి హాజరు రికార్డులు ఎన్ఆర్ఈజీఏ వెబ్సైట్లో కూడా లేవని జార్ఖండ్ రాష్ట్రంలోని సింఫ్ు భూమ్ జిల్లాకు చెందిన కార్మికులు చెప్పారు. కార్మికులు రుజువుగా ఉపయోగించే భౌతిక రికార్డులు అందుబాటులో లేకుంటే వారు పనికి హాజరైనట్టు రుజువు చేసే మార్గాలేవీ వారికి లేకపోవడంతో పని చేసిన దానికి వారు వేతనాలు కోల్పోతారు. ఇది ఎన్ఎంఎంఎస్ ఆప్ మెరుగుపరిచే పేరుతో పారదర్శకతను, పౌరుల బాధ్యతను హరిస్తున్న తీరు.
ఎన్ఆర్ఈజీఏలో అవినీతి పెరిగిపోతున్న ఒక సమస్యగా మారుతున్నది. నకిలీ హాజరు రికార్డుల ద్వారా నిధులు కైంకర్యం అవుతున్నాయి. వాస్తవ సమయం, హాజరుపై ఎన్ఎంఎంఎస్ దృష్టి పెట్టడం అవినీతిని పరిష్కారించే మార్గం, అయితే ఈ అవినీతి పైన, దాన్ని పరిష్కారించే ఎన్ఎంఎంఎస్ విధానం పైన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ స్పష్టత ఇవ్వలేదు. పారదర్శకత లేదా వేగవంతమైన చెల్లింపుల ప్రక్రియల విషయంలో ఎన్ఎంఎంఎస్ ఆప్ పనితీరును అంచనా వేయడానికి ఎలాంటి కొలమానాలు లేవు.
సామాజిక తనిఖీలు బలోపేతం చేయాలి
ఈ ఆప్పై కేంద్రీకరించడానికి లేదా ఇతర సంక్లిష్టమైన సాంకేతిక సంస్కరణలను ప్రవేశపెట్టడానికి బదులుగా సామాజిక తనిఖీలు బలోపేతం చేయాలని మేం బలంగా నమ్ముతున్నాం. ఎన్ఆర్ఈజీఏ వారి పంచాయతీ పరిధిలో ఎలా పనిచేస్తుందో వారే చెబుతారు. గతంలో తనిఖీలు బాగా జరిగేవి. కానీ సామాజిక తనిఖీ యూనిట్లు, గ్రామసభలు లాంటి పౌర కేంద్రీకృత సంస్థలను బలోపేతం చేయడానికి బదులు కార్మికులకు అందుబాటులో లేని, వారికి అర్థంకాని సాంకేతిక సంస్కరణలను ప్రవేశపెట్టడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ దృష్టి పెడుతున్నట్టు కనపడుతున్నది.
పౌరుల బాధ్యత, పారదర్శకతలను మెరుగు పరిచేందుకు ఉద్దేశించబడిన ఆప్, ఎన్ఆర్ఈజీఏ కార్మికులు, కార్యకర్తలు, ప్రభుత్వ ఫీల్డ్ అధికారులతో చర్చించకుండానే అమలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఎన్ఆర్ఈజీఏ క్షేత్రస్థాయిలో వాస్తవ పనితీరు పట్ల ఎన్ఎంఎంఎస్ చాలా గుడ్డిగా వ్యవహరిస్తుంది. భాగస్వాములతో ఎలాంటి చర్చలు చేయకుండా సంస్కరణలను ప్రవేశపెట్టే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అలవాటు ఎన్ఆర్ఈజీఏలో పొందుపరిచిన పారదర్శకత, పౌర భాగస్వామ్య సూత్రాలకు అనుగుణంగా లేదు. ఎన్ఎంఎంఎస్ అమలులోని అనేక సమస్యల వల్ల ఎన్ఆర్ఈజీఏ కింద పని చేయడం కార్మికులకు కష్టంగా ఉంది. ఫలితంగా కార్మికులు పని చేసే హక్కును కోల్పోతున్నారు.
''ద హిందూ'' సౌజన్యంతో
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451