Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరస్పరం భిన్నమైన వర్గాలు ఒక సమాజంలో ఉన్నప్పుడు అక్కడ పాలకవర్గానికి తాను సాగించే వర్గ అణచివేతను సమర్థించుకోవడం అవసరం. అందుకు వీలుగా ఉండే చర్చను అది ప్రచారంలో పెడుతుంది. అటువంటి చర్చకు కొన్ని పదాలను ప్రత్యేకంగా అది ముందుకు తెస్తుంది. నయా ఉదారవాదం కూడా తనకు అనుకూలంగా ఉండే విధంగా ఒక చర్చను ముందుకు తెచ్చింది. ఆ చర్చలో తరచూ ఉపయోగిస్తున్న ఒక పదం ''పాపులిజం'' (ఓట్లకోసం చేపట్టే ప్రజాకర్షక విధానాలు అంటూ కొందరు ఈసడించుకునేది). ఈ పదానికి మీడియాలో అధిక ప్రాచుర్యం లభిస్తోంది. నయా ఉదారవాద విధానాల వలన ఎక్కువగా లబ్ధి పొందిన ఉన్నత మధ్యతరగతివర్గాల ప్రజలు ఈ విధానాలే కొనసాగాలని బలంగా కోరుకుంటున్నారు కనుక వారిద్వారా ఈ పదాన్ని ఎక్కువగా ప్రచారంలో పెడుతున్నారు. ఈ పదానికి వాస్తవంలో మంచి అర్థమే ఉంది. కాని దానిని ఎంతగా వక్రీకరిస్తున్నారంటే అభ్యుదయ భావాలు ఉండి సవ్యంగా ఆలోచించగల వ్యక్తులు సైతం దాని వక్రభాష్యాల ప్రభావానికి లోనవుతున్నారు. కార్పొరేట్ మీడియా ఆ పదానికి చెప్తున్న నికృష్టమైన అర్థంలోనే వాళ్ళు కూడా దానిని ఉపయోగిస్తున్నారు.
ఇంతకూ ఈ ''పాపులిజం'' అన్న పదం నయా ఉదారవాద మేధావులు కనిపెట్టినది కాదు. చాలా కాలం ముందునుంచే దీనిని వాడడం జరుగుతోంది. రష్యన్ మార్క్సిస్టులు, లెనిన్ కూడా, నరోద్నిక్కులను ఉద్దేశించి ''పాపులిస్టులు'' అన్న పదాన్ని ఉపయోగించేవారు. ప్రజలలో వివిధ వర్గాలు ఉన్నప్పటికీ, ఆ తేడాలు ఏవీ పరిగణనలోకి తీసుకోకుండా అందరినీ ఒకే గాటన కడుతూ నరోద్నిక్కులు ''ప్రజలు'' అన్న పదాన్ని ఉపయోగించేవారు. ఆ విధంగా ప్రజల నడుమ ఉండే వర్గ విభేదాలపట్ల విచక్షణ పాటించని ధోరణిని ఎత్తిచూపడానికి నరోద్నిక్కులను పాపులిస్టులు అని అన్నారు. దానర్థం ''ప్రజలు'' అనేవారిని కించపరచడం ఎంతమాత్రమూ కాదు. కార్మికులను, రైతాంగాన్ని కలిపి చెప్పడానికి లెనిన్ ''శ్రామిక ప్రజలు'' అన్న పదాన్ని తానే ఉపయోగించాడు. తక్కిన ప్రజలకు, వీరికి నడుమ ఉన్న తేడా చెరిగిపోకుండా ఉండాలనే ఆ విధంగా ఉపయోగిం చాడు. అయితే నయా ఉదారవాదం ఇప్పుడు ఈ పాపులిజం అన్న పదాన్ని వేరే అర్ధాలతో వాడుతోంది. మత దురహంకారాన్ని రెచ్చగొట్టి శ్రామిక ప్రజల్లోని ఏ తరగతినైనా సమీకరించడానికి పూనుకుంటే దానినీ పాపులిజం అనే అంటోంది. మరోపక్క వారిని ఆర్థికంగా ఆదుకునే చర్యలు ఏవి చేపట్టినా వాటినీ పాపులిజం అనే అంటోంది.
ఫాసిస్టులు, అర్థ ఫాసిస్టులు తాము ప్రజలపై సాగిస్తున్న అణచివేతను కప్పిపుచ్చుకోడానికి ఇచ్చే పిలుపులనూ పాపులిజం అని అంటున్నారు. మరోవైపు ఆ ప్రజలు తమపై సాగుతున్న అణచివేత నుండి కొంత ఊరట పొందడం కోసం చేసే ప్రయత్నాలనూ పాపులిజం అనే అంటున్నారు. మొదటితరహాను మితవాద పాపులిజం అని, రెండో తరహాను వామపక్ష పాపులిజం అని అంటున్నారు. ఈ విధంగా చేయడం సైద్ధాంతికంగా బుద్ధిమాంద్యాన్ని కలిగించడమే కాదు, ''మితవాద'' పాపులిజం తోబాటు, ''వామపక్ష'' పాపులిజాన్ని కూడా అపవిత్రమైనదిగా చిత్రీకరించడానికి దారి తీస్తోంది. రెండింటినీ ఒకే గాటన కడుతోంది. ఈ రెండు ధోరణులూ తప్పు అని, ఈ రెండింటికీ నడుమ ఒక మధ్యేవాద (ఉదారవాద బూర్జువా ధోరణి) ధోరణి ఉందని, అదే సరైన ధోరణి అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రష్యన్ మార్క్సిస్టులు ఒకానొక సైద్ధాంతిక చర్చలో ''ప్రజలు'' అనే పదాన్ని అవగాహన చేసుకోవడం ఎలా అన్న సందర్భంలో ఉపయోగించిన ''పాపులిజం'' అనే పదం ఇప్పుడు తప్పుడు అర్థంలో వాడుతున్నారు. ఉదారవాద బూర్జువా సిద్ధాంతమే చాలా విశిష్టమైనది అన్న అభిప్రాయాన్ని కలిగించడానికి ఈ విధంగా చేస్తున్నారు.
ఇదేదో గందరగోళం మాత్రమే అని అనుకోవద్దు. చాలా స్పష్టంగా వాళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారు. ''మితవాద'' పాపులిజం పేర చెలామణి అవుతున్న ఫాసిస్టు, నయా ఫాసిస్టు లేదా అర్థ ఫాసిస్టు ధోరణులన్నిటికీ ఉన్న ప్రధాన లక్షణం ప్రజానీకానికి ఏవిధమైన ఆర్థిక ప్రయోజనా లనూ కల్పించకపోవడమే. దానికి భిన్నంగా ''వామపక్ష'' పాపులిజం సంక్షేమ చర్యలను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. కనీసం ప్రజలకు ఆర్థిక సహాయాన్నైనా అందించమని కోరుతుంది. ఈ రెండు రకాలనూ ఒకే గాటన కట్టడం, పైగా పాపులిజం అనేదే తప్పు అని చిత్రీకరించడం ద్వారా నయా ఉదారవాదం ప్రజలకు ఏవిధంగానైనా ఆర్థిక సదుపాయాలనూ కలుగజేయడమే తప్పు అన్నవైఖరిని అనుసరిస్తోంది. ఆ విధంగా ప్రజలకు రాయితీలను కల్పించే విధానాలను విడనాడాలని, దానికి బదులుగా ప్రభుత్వాలు జీడీపీ వృద్ధి సాధించడంమీదనే దృష్టి సారించాలని ప్రబోధిస్తుంది. ప్రజా సంక్షేమ చర్యలను చేపడట్టడం వలన వృద్ధికి కావలసిన ఆర్థిక వనరులు లేకుండా పోతాయని, అటువంటి సంక్షేమచర్యలను అమలు చేయడం వృధా ఖర్చు మాత్రమే అని, కేవలం ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం మాత్రమే అటువంటి సంక్షేమ చర్యలను కొన్ని రాజకీయ పార్టీలు చేపడతాయని ప్రచారం చేస్తుంది. సమాజంలోని ఆర్థిక అసమానతలను తగ్గించేదిశగా ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టినా, అవన్నీ తెలివితక్కువ చర్యలేనన్న నిర్ధారణకు ఈ నయా ఉదారవాదతర్కం దారి తీస్తుంది.
నయా ఉదారవాద వ్యవస్థను ఈ విధమైన చర్చ పూర్తిగా సమర్థిస్తుంది. ఈ నయా ఉదారవాద విధానాలు అమలు కాకమునుపు సమాజంలోని ఆర్థిక అసమానతలను తగ్గించాలన్న అంశాన్ని ఎవరైనా చర్చనీయాంశం చేస్తే దానిని ఎవరూ విమర్శించేవారు కాదు. వాస్తవానికి ఇందిరాగాంధీ ఒక ఎన్నికలలో గరీబీ హటావో నినాదాన్ని ఇచ్చి విజయం సాధించారు. ఆ పేదరికాన్ని ఆమె తగ్గించలేదన్నది వేరే విషయం. కానీ ఆ నినాదాన్ని ఆమె అమలు చేయనందుకు విమర్శించారే తప్ప ఆ నినాదమే తప్పు అని ఎవరూ అనలేదు. దేశ జీడీపీలో కేవలం 5శాతాన్ని పూర్తిగా పేదరిక నిర్మూలనకు కేటాయించగలిగితే పేదరికమే లేకుండా పోతుందని అమర్త్యసేన్ ఎప్పుడూ చెప్తూండేవారు. ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ నియంత్రణలో నడిచిన కాలంలో పేదరిక నిర్మూలన ప్రభుత్వ ప్రధాన కర్తవ్యాలలో ఒకటిగా ప్రాధాన్యత కలిగివుండేది. నయా ఉదారవాద వ్యవస్థ వచ్చాక ఆదాయాల్లో, సంపదలో అసమానతలు తగ్గేమాట అటుంచితే విపరీతంగా పెరిగిపోయాయి. ఆ అసమానతలను తగ్గించడం ఎలా అన్నది వాస్తవానికి ప్రధాన ఎజండాగా ఉండాలి. కాని ఆ విధంగా లేదు. ఆ కర్తవ్యానికి ''పాపులిజం'' అన్న పేరు తగిలించి అదేదో పనికిమాలిన కర్తవ్యం అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. సమానత్వం సాధించడం అనే ఆదర్శాన్ని కార్పొరేట్ పెట్టుబడి చీదరించుకుంటోంది. ఆ కార్పొరేట్లకి తోడుగా ఈ మధ్య లాభపడుతున్న ఉన్నత మధ్యతరగతివర్గం కూడా పేదలకు అందించే ఆర్థిక సహాయాలను పనికిమాలిన చర్యలుగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తోంది.
బూర్జువా ఆర్థిక విధానంలో ఎప్పుడూ ఆర్థికవృద్ధికే అధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోవడం వలన ఆర్థికవృద్థికి అది ఆటంకంగా ఉంటుంది అని ఆడం స్మిత్ ఎప్పుడూ వాదించేవాడు. ఆర్థికవృద్థి ఫలితాలు శ్రామికవర్గానికి చేరవు అని అతనికి బాగాతెలుసు. దేశ సంపదను నిరంతరం పెంపొందించడమే ఒక లక్ష్యంగా ఉండాలన్నది అతని దృక్పథం. అతనికన్నా ముందరి ఆర్థికవేత్తల మాదిరిగా అతను సంపద అంటే బంగారమూ వెండీ అని భావించలేదు. సరుకులను ఉత్పత్తి చేసే సాధనాలను (యంత్రాలు, ముడిసరుకు వగైరా) కలిగివుండడమే సంపద అని ఆడం స్మిత్ భావించాడు. డేవిడ్ రికార్డో కూడా ఉత్పత్తి సాధనాలను పెంచుకోవడమే ప్రధానం అని భావించాడు. కాని రికార్డోకూ ఆ విధంగా సంపదను పెంచినందువలన కార్మికులకు ఎటువంటి ప్రయోజనమూ చేకూరదు అన్న సంగతి తెలుసు.
ఒకవేళ కార్మికవర్గం సంపద వృద్ధి ఫలితంగా ప్రయెజనం పొందితే అది ఆ కార్మికవర్గ జనాభా పెరుగుదలకు దారి తీస్తుందని, అందుచేత కార్మివర్గానికి ప్రయోజనం కలగాలంటే వారి జనాభా పెరగకుండా నియంత్రించాలని వారు తలచారు. అయితే ఆ జనాభా నియంత్రణ అన్నది ఆ కార్మికుల చేతుల్లో మాత్రమే ఉన్న విషయం. సాంప్రదాయ ఆర్థికవేత్తలు మాత్రం కార్మికుల స్థితిగతులు మెరుగుపడాలని, అందుకోసం వారు జనాభాను నియంత్రించాలని కోరుకున్నారు. మొత్తం మీద పెట్టుబడిదారీ వృద్ధి అనేది కార్మికులకు దానివలన ప్రయోజనం కలుగుతుందా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా నిరాటంకంగా సాగిపోవాలనే పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు విశ్వసించారు.
అయితే ప్రస్తుతం నయా ఉదారవాద ఆర్థికవేత్తలు చెపుతున్నది వేరు. కార్మికుల పరిస్థితులు ఇప్పుడు దిగజారిపోవడానికి కారణం వారి జనాభా పెరిగిపోవడమే అని ఎవరూ విశ్వసించడంలేదు. ప్రభుత్వం శ్రామికుల ఆదాయాలను పెంచడానికి వారికి అనుకూలంగా చర్యలు చేపడితే వారి స్థితిగతులు మెరుగుపడతాయన్న విషయం అందరికీ తెలిసినదే. కాని ఆ విధంగా చేయడం వలన ఆర్థిక వృద్ధి దెబ్బ తింటుందన్న కొత్త వాదనను నయా ఉదారవాద ఆర్థికవేత్తలు ముందుకు తెస్తున్నారు. గతకాలపు సాంప్రదాయ ఆర్థికవేత్తలకు శ్రామికవర్గ పరిస్థితుల పట్ల సానుభూతి అయినా ఉండేది. కాని నయా ఉదారవాద ఆర్థికవేత్తలకు మాత్రం ఆ సానుభూతి కూడా లేదు. పెట్టుబడిదారీ వర్గం మాదిరిగానే వారు కూడా శ్రామికవర్గం పట్ల శతృపూరిత వైఖరినే అనుసరిస్తున్నారు.
''పాపులిస్టు చర్యలు'' అంటూ(పత్రికల్లో ప్రజాకర్షక విధానాలు అంటారు) ఈ నయా ఉదారవాదులు సంక్షేమ చర్యలను చీదరించుకోవడం, ఆ విధమైన చర్యలను విడనాడి కేవలం వృద్ధి పైనే దృష్టి పెట్టాలని చెప్పడం పేదలమీద దాడిని అంతకంతా తీవ్రతరం చేస్తుంది. ఒకపక్క ఆ పేదలకు అందవలసిన ప్రభుత్వ సహాయం అందకుండా నిరోధించి వారి జీవన ప్రమాణాలను దెబ్బ తీస్తుంది. మరోవైపు ఆర్థికవృద్ధి పేరుతో చేపట్టే కొత్త ప్రాజెక్టులు రైతులను నిర్వాసితులుగా మారుస్తాయి, ప్రజలను వారి ఊళ్ళకు దూరం చేస్తాయి. కొత్త ప్రాజెక్టులవలన కొన్ని కొత్త రకాల ఉద్యోగాలు రావచ్చు. కాని వాటిలో ఈ నిర్వాసితులకు దక్కేవి మాత్రం చాలా తక్కువ. పైగా, కొత్తగా ఏర్పడే ఉపాధి అవకాశాలు ప్రాజెక్టుల కారణంగా దెబ్బ తిన్న ఉపాధి అవకాశాలకన్నా తక్కువగా ఉంటాయి. ఇక నిర్వాసితులకు కల్పిస్తామని చెప్పిన పునరావాసపు హామీలలో వాస్తవరూపం ధరించేవి చాలా స్వల్పం. రైతులే సమిష్టిగా ముందుకొచ్చి వాళ్ళే గనుక పారిశ్రామిక ప్రాజెక్టులు చేపడితే అప్పుడు జరిగేది వేరుగా ఉంటుంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆ విధంగా జరగదుకదా.
''పాపులిజం'' అని ''ప్రజాకర్షక పథకాలు'' అని చీదరించు కుంటూ ఆర్థిక వృద్ధే సర్వస్వం అని చేసే ప్రచారం పూర్తిగా ప్రజావ్యతిరేక ప్రచారమే. ఇదే అచ్చమైన నయా ఉదారవాద ప్రచారం.
- ప్రభాత్ పట్నాయక్
(స్వేచ్ఛానువాదం)