Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2014 మే 25న అధికారానికి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నికల మ్యానిఫెస్టోలో 30 సంక్షేమ పథకాలను ప్రకటించింది. దేశంలో 2025 నాటికి జాతీయ స్థూల ఉత్పత్తి ఐదు ట్రిలియన్ డాలర్లకు పెంచుతానని ప్రకటించింది. ప్రస్తుత స్థూల ఉత్పత్తి 2.66 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రకటించింది. ప్రతి వ్యక్తికి ఏదో ఒక బీమా పథకాన్ని అమలు చేసి రక్షణ కల్పిస్తానని జీవన్ సురక్ష, జీవన్ జ్యోతి, అటల్ పెన్షన్ యోజన లాంటి పథకాలను ప్రవేశపెట్టింది. అందరికీ ఆహారం, ఉపాధి, ఆవాసం ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడానికి 2వ హరిత విప్లవం ప్రారంభించింది. ఇందుకు గానూ రూ.33,270 కోట్లు 11శాఖలకు కేటాయించింది. కానీ ఇంత వరకు హరిత విప్లవానికి సంబంధించి ఉత్పాదకత, పెరుగుదలకు గాని, అందుకవసరమైన పరిశోధనలకు గాని, తగు ఏర్పాట్లేమీ చేయలేదు. 2020 మే 14న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించి, పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలను అభివృద్ధిలోకి తెస్తామని చెప్పింది. నేటికీ ప్రకటించిన రూ.20లక్షల కోట్లల్లో 20శాతం కూడా వ్యయం చేయలేదు. దేశంలో ఆకలి, ఉపాధి కొరత తీర్చడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదు. ఈ ప్యాకేజీలో కాంట్రాక్టర్లకు మాత్రం ఊరట కలిగించారు. రూ.95వేల కోట్ల బాకీలో ఉన్న విద్యుత్ డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు రూ.90వేల కోట్లు ఇవ్వడంతో పాటు, విద్యుత్ రంగాన్ని కేంద్ర జాబితాలోకి తీసుకుంటామని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో సబ్సిడీలు ఇవ్వకూడదని, క్రాస్ సబ్సిడీ ఉండకూడదని, విద్యుత్ ఉత్పత్తికి జరిగిన మొత్తం ఖర్చును వినియోగదారుల నుండి వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్రంలోని 1.65 కోట్ల విద్యుత్ కనెక్షన్లల్లో కోటి కనెక్షన్లు టారీఫ్ భారాలు భరించలేక కనెక్షన్లు వదులుకోవాల్సి వస్తుంది.
స్వచ్ఛ భారత్, కాలుష్య నివారణ (గంగానది ప్రక్షాళన) తదితర ప్రణాళికలు ప్రకటించడమే తప్ప, అందుకు కేటాయించే నిధులన్నీ కాంట్రాక్టర్ల జేబుల్లోకే వెళ్ళాయి. నేడు దేశంలోకి నూనెలు, పప్పులు, ఆయుధాలు పెద్ద ఎత్తున దిగుమతులవుతున్నాయి. వీటిని తగ్గించడానికి మేక్ ఇన్ ఇండియా పేరుతో, సెల్ఫ్ రిలయన్స్ పేరుతో ఉత్పత్తిని పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపున ఉత్పత్తి రంగాలను పూర్తిగా ముఖేష్ అంబానికి, గౌతం ఆదానికి ధారాదత్తం చేస్తున్నది. రక్షణశాఖలో ప్రస్తుతం ఉన్న 49శాతం నుండి 74శాతానికి పెంచుతూ ఎఫ్డీఐ (విదేశీ ప్రత్యక్ష నిధులు)కు అనుమతిచ్చింది. విమానయాన సంస్థకు ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించి 6 విమానాశ్రయాల ప్రయివేటీకరణకు తెరతీసింది. కార్పొరేట్లకు ఆదాయం వనగూర్చే ప్రభుత్వ సంస్థలన్నింటినీ బుక్ వ్యాల్యూకు అమ్మడానికి పూనుకున్నది. ఇప్పటికే రూ.10లక్షల కోట్ల విలువ గల ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటం జరిగింది. అలాగే 27 బ్యాంకులను 12బ్యాంకులుగా కుదించి పోగైన నిధులను ఇప్పటికే బ్యాంకులకు రూ.10లక్షల కోట్లు ఎగవేసిన పెట్టుబడిదారులకు తిరిగి అప్పులివ్వడానికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నది. రిజర్వు బ్యాంకును కార్పొరేట్లకు కోరిన విధానాలను రూపొందించే సంస్థగా మార్చారు. ఆ విధంగా దేశంలోని అన్ని రంగాలను ప్రయివేటీకరణ పేరుతో కార్పొరేట్లకు అప్పజెపుతున్నారు.
ప్రజల పరిస్థితి ఏమిటి?
2022 డిసెంబర్ 31 నాటికి ప్రపంచ జనాభాలో భారతదేశం మొదటిదిగా నమోదైంది. 141.7కోట్ల ప్రజలతో భారతదేశం మొదటి స్థానం పొందగా, 141.2 కోట్లతో చైనా రెండవ స్థానంలోకి చేరింది. భారత జనాభాలో అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం 34శాతం అత్యంత దారిద్య్రరేఖకు దిగవనున్నారు. వాస్తవానికి ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్నవారు 80కోట్ల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉపాధి కోసం 25 కోట్ల మంది అనునిత్యం కార్యాలయాల వెంట, కంపెనీల వెంట, భవన నిర్మాణాల వెంట తిరుగుతున్నారు. కరోనా సందర్భంగా ఉపాధి కోల్పోయి 19 కోట్ల మంది వలస కార్మికులు తిరిగి గ్రామీణ ప్రాంతాలకు చేరారు. వీరితో కలిసి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంపై 90కోట్ల మంది ఆధారపడి బతుకులీడుస్తున్నారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 6వ స్థానంలో ఉన్నది. మొదటి వరుసలో అమెరికా 20.89, చైనా 14.72, జపాన్ 5.06, జర్మనీ 3.85, ఇంగ్లాండ్ 2.67 ట్రిలియన్ డాలర్లతో ఉ ండగా, భారతదేశం 2.66 ట్రిలియన్ డాలర్లతో 6వ స్థానంలో ఉన్నది. ఇప్పటికే బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం, చైనాను అధిగమించే దిశగా భారత ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తున్నదని ప్రకటించింది. 2.66 ట్రిలియన్ డాలర్ల ఆదాయం ఉన్న భారతదేశం 14.72ట్రిలియర్ డాలర్ల చైనాతో పోటీకి వెళ్ళగలదా?
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి బదులు కేంద్రం ఉన్న ఫ్యాక్టరీలను మూసివేసి నిరుద్యోగుల సమస్యను పెంచుతున్నది. కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టేందుకు పేరుతో లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నది. మానవాభివృద్ధి సూచికలో భారతదేశం గతంలో 104వ స్థానంలో ఉండగా, నేడు 132వ స్థానానికి పడిపోయినట్లు 2021-22 రిపోర్టు గత సెప్టెంబర్ 8న ప్రకటించింది. 191 దేశాల్లో భారతదేశం 132వ స్థానంలో ఉన్నది. ఆకలి సూచికలో 121 దేశాల్లో భారతదేశం 107వ స్థానంలో ఉన్నది. ఆరోగ్య సూచికలో 195 దేశాల్లో భారతదేశం 66వ స్థానంలో ఉన్నది. ఆరోగ్య సూచికలో కూడా చిన్న దేశాల కన్నా వెనుకబడే ఉన్నాము. అప్పుల విషయం పరిశీలిస్తే, స్వదేశీ, విదేశీ అప్పులు కలిసి దేశం 135 లక్షల కోట్ల బాకీలో ఉన్నది. విదేశీ రుణం వరకే పరిశీలిస్తే 620.7 బిలియన్ డాలర్ల రుణంలో దిగబడి ఉన్నది. యేటా రూ.12 లక్షల కోట్లు ఈ రుణాలకు వడ్డీల క్రింద చెల్లిస్తున్నాం. రుణాలు తేవడమే తప్ప, ఇంత వరకు చెల్లింపులు ప్రారంభించలేదు. చెల్లింపులు ప్రారంభించబడితే భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకోలేదు. 1947 ఆగస్టున డాలర్కు రూపాయి సమానం కాగా, నేడు డాలర్కు రూ.83కు విలువ పడిపోవడం ఇందుకు ప్రత్యక్ష్య నిదర్శనంగా ఉన్నది. సహజంగా అప్పులు తెస్తే, ఆస్తుల సంపాదనకు వ్యయం చేస్తారు. కానీ భారతదేశంలో ఉత్పాదకరంగానికి కాకుండా, అనుత్పాదక రంగానికి ఆ నిధులు వ్యయం చేయడం వల్ల తిరిగి చెల్లించే ఆర్థిక స్తోమత దేశానికి లేకుండా పోతున్నది. ఏ రంగంలో చూసినా భారతదేశం 2014 నుండి 2023 జనవరి వరకు అన్ని రంగాల్లో వెనుకబాటుతనాన్నే ప్రదర్శిస్తున్నది. ఇప్పటికే ఎగుమతి, దిగుమతుల్లో రూ.10లక్షల కోట్ల లోటు ఉన్నది. రూ.35లక్షల కోట్ల దిగుమతులు కాగా, రూ.25లక్షల కోట్ల ఎగుమతులు చేస్తున్నాము. ఇందులో ఆహార ధాన్యాలు రూ.5లక్షల కోట్ల వరకు దిగుమతి అవుతున్నాయి. సాగుభూమి 43కోట్ల ఎకరాలు ఉండగా, 9కోట్ల ఎకరాలు బీడ్లుగా మారాయి. ఉన్నత విద్య అభ్యసించినవారు ఇక్కడ ఉపాధి లేదని విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే దాదాపు వివిధ దేశాలకు ఐదుకోట్ల మంది వెళ్లినట్లు వలస గణాంకాలు చెబుతున్నాయి. మేధావులంతా విదేశాలకు వెళ్ళిపోవడంతో దేశాభివృద్ధికి తోడ్పడే మేదస్సు కొరత ఏర్పడింది. అందుకే వ్యవసాయ రంగంతో పాటు, అన్ని రంగాల్లో పరిశోధనలు మూసివేసారు. టెక్నాలజీతో సహా. ఆహారధాన్యాలను కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఇలాంటి దుస్థితి మరో ఐదు సంవత్సరాలు కొనసాగితే మనదేశం అగ్రదేశాలకు దిగుమతుల ''డంపింగ్ కేంద్రం''గా మారుతుంది. అందువల్ల ఇప్పటికైనా ప్రణాళికా బద్ధమైన ఉత్పత్తిని, దేశంలోని మౌలిక వసతులను సద్వినియోగం చేసుకునే విధానాలను రూపొందించితే తప్ప ముందుకెళ్ళలేం. ప్రణాళికా విభాగాన్ని రద్దుపరచి నిటి అయోగ్ తేవడం దుష్పరిణామమే తప్ప మరొకటికాదు. తప్పుడు విధానాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాలు మరింత దెబ్బతింటాయి.
-సారంపల్లి మల్లారెడ్డి
సెల్:9490098666