Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజిబివి) పథకాన్ని భారత ప్రభుత్వం 2004 ఆగస్టులో ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని విద్యాపరంగా వెనుకబడిన బ్లాకులు, పట్టణాలు, మైనారిటీ కేంద్రీకృత ప్రాంతాలలో ఉన్నత ప్రాథమిక స్థాయిలో బాలికల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. దాదాపు మండలానికి ఒక కేజీబివి ఏర్పాటు చేయబడింది. ఈ పథకం షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, ఇతర వెనుకబడిన తరగతుల, మైనారిటీ వర్గాల, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఆడపిల్లలకు ఆరవ తరగతి నుండి ఇంటర్ మీడియట్ వరకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసారు.
గొప్ప లక్ష్యంతో ఏర్పడ్డ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో బోధనేతర సిబ్బంది తీవ్రమైన శ్రమదోపిడీకి గురైతున్నారు. అతి తక్కువ వేతనాలకు అత్యధిక గంటలు పని చేస్తున్నారు. బోధనేతర సిబ్బంది ఏఎన్ఎం, అకౌంటెంట్, అటెండెంట్, స్వీపర్, డే/నైట్ వాచ్ ఉమన్, కుక్స్, కంప్యూటర్ ఆపరేటర్లుగా ఏడు రకాల పనులు చేస్తున్నారు. వీరంతా దళిత, గిరిజన, బాగా వెనుకబడిన కులాలకు చెందిన పేద మహిళలే. బాలికలకు నాణ్యమైన విద్యను అందించడంలో వీరి తోడ్పాటు కీలకమైనది. వీరు మాత్రం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగక, కనీస వేతనాలు పొందక పేదరికంలో మగ్గుతూ మరొకవైపు రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు గంటల అధికపని భారం మోస్తూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. విద్యార్థినులకు తగినట్లుగా సిబ్బందిని నియమించకపోవడం, తక్కువ సిబ్బందితో ఎక్కువ పనులు చేయించడం, 10+2గా అప్గ్రేడ్ అయిన పాఠశాలలో అదనపు సిబ్బందిని నియమించకపోవడం, పండుగలు, ఆదివారాలలో సెలవులు లేకపోవడం వలన అదనపు పని భారం పెరిగి ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కుక్స్ అధిక గంటలు పనిచేయడం వలన వంట చేస్తున్న క్రమంలో కండ్ల నుండి నీరుకారడం, లంగ్స్ ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు. పెద్ద పెద్ద గిన్నెలలో వండిన వంటను కిచెన్ నుండి డైనింగ్ హాల్కు మోస్తున్న క్రమంలో కడుపు నొప్పి, డిస్క్ సమస్యలు, బహిష్టు సమయంలో అధిక రక్తస్రావానికి గురవుతున్నారు. పని ఒత్తిడి, మనసిక ఆందోళన వలన అనారోగ్యం పాలవుతూ త్వరగా వృద్ధాప్యంలోకి నెట్టబడుతున్నారు.
దేశంలో ప్రజలకు విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. విద్య, వైద్యం, ఉపాధి పొందడం ప్రజల హక్కు. కాని మన దేశంలో ప్రభుత్వం హక్కుగా ప్రజలకు కల్పించాల్సిన సేవలను తాత్కాలిక చర్యలుగా ఆలోచిస్తూ, ఎప్పుడైనా మూసివేయగల అవకాశం ఉన్న పథకాలను ప్రారంభిస్తున్నది. మరోవైపు ఆ పథకాలకు కూడా తగిన బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదు. విద్యకు దూరంగా ఉన్న బాలికల సమగ్ర అభివృద్ధికి పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, విద్య మొదలైనవి కేజీబివి ద్వారా అందవలసి ఉంది. ఇది దేశంలో ఆడపిల్లలు, పేదరికం, వెనుకబాటుతనం ఉన్నంతకాలం కొనసాగవలసిన చర్య. ఇది శాశ్వతమైన పథకంగా ఉండాలి. ఇందులో పని చేస్తున్న వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలి. కాని ప్రభుత్వం తాత్కాలికమైన పథకంగా కొనసాగిస్తూ, ఇందులో కాంట్రాక్టు కార్మికులను నియమిస్తూ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నది. ఉదాహరణకు 2004లో కేజీబివి ప్రారంభించగా గత పందొమ్మిది సంవత్సరాలుగా పథకం కొనసాగుతుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా వేలాది మంది కార్మికులు జీవితకాలం పని చేస్తున్నారు. వీరికి ఎలాంటి రక్షణ, సౌకర్యాలు ఉండవు. క్యాజువల్ లీవులు, మెడికల్ లీవులు ఉండవు. గుర్తింపు కార్డులు, బస్ పాసులు ఉండవు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఉండదు. పని ప్రదేశంలో ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ ఉండదు. వెట్టి చాకిరీ చేయించుకుంటూ కనీస వేతనం ఇవ్వకుండా, కార్మికులుగా గుర్తించకుండా ఫ్యాన్సీ పేర్లతో పిలుస్తూ ఒక రకంగా ప్రభుత్వం వీరిని మోసం చేస్తున్నది.
దేశంలో సంపద సృష్టిస్తున్నది శ్రమజీవులే. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చట్టం చెబుతున్నది. శాశ్వత ప్రాతిపదికన, కీలక(కోర్) పనులలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతి పెట్టొద్దని కోర్టులు అనేక తీర్పులిచ్చి ప్రభుత్వాలకు చీవాట్లు పెట్టినా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధిరావడం లేదు. పైగా కార్మికులు పోరాడి సాధించుకున్న కొద్ది పాటి హక్కులను కూడా కార్మిక హక్కుల సంస్కరణల పేరిట ఉన్న హక్కులను తొలగించే ప్రయత్నం చేస్తున్నది. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వర్కర్ల ఓట్లతో చట్టసభలకు ఎన్నికైనవారు చట్టసభల్లో వీరి గురించి చర్చించరు. మోడీ బేటీ బచావో బేటీ పఢావో అని ఒకవైపు చెప్తూ మరోవైపు పథకాలకు నిధులలో కోత పెడతున్నారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అంటున్నారు. మరి సబ్ కా వికాస్ లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు లేరా. మన్ కీ బాత్లో కుక్కల గురించి మాట్లాడే ఔదార్యం ఉన్న ప్రధానికి అర్ధాకలితో అలమటిస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కనిపించడం లేదా?
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల రాజకీయంగా విమర్శ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్... తాను కార్మిక సంక్షేమం పట్ల శ్రద్ధ వహిస్తేనే తన ప్రత్యామ్నాయ మార్గంపై కార్మికులకు విశ్వాసం ఏర్పడుతుంది. అంగన్ వాడీ, ఆశావర్కర్లకు ఇస్తున్న గౌరవ వేతనం పెంచినట్లుగానే కేజీబివి బోధనేతర సిబ్బంది వేతనాలు కూడా పెంచాలి. 2018లో తెలంగాణ రాష్ట్రంలో బాల కార్మికుల, డ్రాపౌట్ల, వీధి బాలుర కోసం అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 29ఉన్నాయి. బోధనేతర సిబ్బందిగా సుమారు 200మంది పని చేస్తున్నారు. కేజీబివి బోధనేతర సిబ్బందికి వర్తించే విధి విధానాలు, పని పద్ధతులు వీరికీ వర్తిస్తాయి. వీరు కూడా కేజీబివి బోధనేతర సిబ్బందితో పాటుగా కనీస వేతనాలు, పని భద్రత, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి.
సెల్:9492585106
కాసు మాధవి