Authorization
Tue April 08, 2025 06:57:34 pm
ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశంగా మన భారత్ విరాజిల్లుతోంది. వివిధ రంగాల్లో అభివృద్ధి మన యువత మీదనే ఆధారపడి ఉంటుంది అనేది వాస్తవం. నూతన పరిశోధనలకు, ఆవిష్కరణలకు నేటి యువత కృషి చేయవలసి ఉంటుంది. ఆ విధంగా యువత పురోగతి సాధించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ విద్య వైద్యం అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతీ ఒక్కరూ సమాన అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగాలి. ఇటువంటి మహా సంకల్పం సాధించడానికి ప్రభుత్వాలు తమ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాడంతో పాటు, కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లిదండ్రులు పాత్ర కీలకం అని గ్రహించాలి. ''మొక్కై వంగనది, మ్రానై ఒంగునా....'' అని పెద్దలు చెబుతారు. అనగా చిన్ననాటి నుంచి పిల్లలకు చదువు, సంస్కారం, మంచి అలవాట్లు, ప్రవర్తన నేర్పాలి. అప్పుడు మాత్రమే కుటుంబాలకు, దేశానికి మంచి తరాలను అందించగలం. అయితే, ఇటీవల కాలంలో దేశంలో యువతలో చాలా మంది అనేక చెడు వ్యసనాలకు బానిలుగా మారుతూ అటు కుటుంబానికి, ఇటు దేశానికి అభివృద్ధి నిరోధకులుగా, సమాజానికి చీడ పురుగులుగా పరిణిమిస్తూ వివిధ సమస్యలకు కేరాఫ్ అడ్రస్గా మారుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హత్యలు, మానభంగాలు, ప్రేమ వేధింపులు కాదంటే యాసిడ్ దాడులు, మత్తులకు బానిసలు, సామాజిక మాధ్యమాల్లో విహరించడం, వివాహేతర సంబంధాలు, సైబర్ నేరాలు ఇలా అనేక విధాలుగా మునిగి తేలుతూ ఉంటున్నారు.
ముఖ్యంగా యువత మద్యం, డ్రగ్స్ మత్తులో మునిగిపోతున్నారు. మన దేశంలోకి డ్రగ్స్ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు నుంచి ఎక్కువ మోతాదులో చేరుతున్నాయి. పాక్, మయన్మార్ సరిహద్దు ప్రాంతాలు నుంచి ఈ డ్రగ్స్ కుప్పలు తెప్పలుగా దేశం నలుమూలల వచ్చి చేరుతూ యువతను అన్ని విధాలా నాశనం చేస్తున్నాయి. మయన్మార్లోని పర్వత ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయి ముఖ్యంగా నల్లమందు (ఓపియం) అసోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం మీదుగా దేశంలో ప్రవేసిస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. 2018లో జరిపిన ఒక సర్వేలో దేశంలో 23.2కోట్ల మంది డ్రగ్స్కు బానిస అయ్యారని, వీరిలో 10-17 సంవత్సరం వయస్సు గలవారు సుమారు 1.5 కోట్ల మంది ఉన్నారు అని తెలిపింది. ఐక్యరాజ్యసమితి యు.ఎన్.ఓ.డి.సి. కూడా భారత్ యువతలోని మత్తులకు బానిసలు అవటం పట్ల తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. 2022 ఫిబ్రవరిలో నాటికి ఒక్క అసోం రాష్ట్రంలోనే 2,878 కేసులు నమోదు చేసి, 4,691 మందిని అరెస్టు చేశారంటే ఎంత దారుణంగా ఈ దందా కొనసాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక 2023, ఫిబ్రవరి 20వ తేదీ నాటికి 1273.65 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా మత్తు దందాలకు ''గోల్డెన్ ట్రయాంగల్''గా పేరు పొందిన ఈ సరిహద్దు ప్రాంతాలు దేశ యువతకు ''డెత్ ట్రయాంగల్''గా మారుతోంది.
ఇక మనదేశంలో హైస్కూల్ స్థాయి నుంచి కళాశాల విద్యార్థులు వరకూ, పల్లెటూరు నుంచి పట్టణం వరకు ఈ డ్రగ్స్ మహమ్మారి కరోనా వైరస్ కంటే వేగంగా, విస్తృతంగా వ్యాప్తి చెందుతూ దేశ యువతను కబళిస్తున్న వేళ.... అందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి. డ్రగ్ పెడ్లర్స్పై ఉక్కుపాదం మోపాలి. సరిహద్దుల్లో నిఘా పెంచాలి. అనుమానిత విదేశీయులుపై డేగకన్నుతో పరిశీలించాలి. పబ్స్, బార్, వివిధ పార్టీల ప్రదేశాలపై నిఘా పెంచాలి. ఇటీవల కాలంలో సెల్, రకరకాల వెబ్ సైట్లు యాప్లు అందుబాటులోకి రావడంతో అన్ని ప్రదేశాలకు, అందరికీ ఈ డ్రగ్స్ రక రకాల మార్గాల ద్వారా సులభంగా చేరిపోతున్నాయి. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి. పారదర్శకంగా పని చేయాలి. అప్పుడు మాత్రమే ఈ మత్తు పీడను నివారించగలం.
- రావుశ్రీ