Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత సైన్యాలు ప్రవేశించిన క్షణం నుండి కామ్రేడ్ ఠాను కోసం అతన్ని సజీవంగా పట్టుకునేందుకు సైన్యం చేయని ప్రయత్నం చేయలేదు. వెతకని చోటులేదు. అయితే ఏడాది వరకు అతడు శత్రువులకు చిక్కలేదు. కానీ చివరకు ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం వల్ల 1950 మార్చి 20న ముండ్రాయి గ్రామంలో పట్టుకున్నారు. పార్టీ రహస్యాల కోసం ఆయన్ను అనేక రకాల చిత్రహింసలు పెట్టినా ఆయన నోరు విప్పలేదు. అతని మొండితనం, ధైర్యం సైన్యాధికారులకు కూడా అద్భుతం అనిపించింది వారతన్ని చంపేందుకు నిరాకరించారు. చివరకు రామవరం దేశ్ముఖ్ కటారు నరసింగరావు అతన్ని బండికి కట్టించి చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు.
ఆ పోరాటం దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఘట్టం. ఆనాటి భూస్వాముల వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ప్రజా విముక్తి కోసం, దున్నే వాడికి భూమి కావాలనే నినాదంతో జరిగిన మహాత్తరమైన పోరు. అదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా భూస్వాములు, రజకార్ల ఆగడాలను ఎండకట్టడమే ఏకైక లక్ష్యంగా సాగిన ఉద్యమం. ఆ పోరులో నాలుగు వేల ప్రాణాల బలిదానం, మూడు వేల గ్రామాల స్వరాజ్యం, పన్నెండు లక్షల ఎకరాల భూ పంపిణీ. ఇది ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర. ఈ విప్లవ కార్యచరణలో భాగ స్వాములైన వారు, ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసినవారు అనేకం.ఆ ఎర్ర సంద్రం నుంచి పుట్టిందే కామ్రేడ్ ఠానునాయక్ కుటుంబం. నమ్ముకున్న పార్టీ కోసం, ఎర్రజెండా చైతన్యాన్ని ఇంటింటికీ, వాడ వాడకూ రెపరెపలాడించడంలో ఆ కుటుంబ సభ్యులంతా శత్రుమూకలకు బలయ్యారు.
అప్పటి నల్లగొండ జిల్లా జనగామ తాలూకా ధర్మపురం తండాలోని లంబాడీలకు ఉన్న 80 ఎకరాల మెట్ట 25 ఎకరాల మాగాని భూమిపై పుసుకూరు రాఘవరావు అనే జమీందారు కన్ను పడి స్వాధీనం చేసుకోచూశాడు. సంఘం నాయకత్వాన లంబాడీలు ఏకమై ప్రతిఘటించారు. పంటలను కాపాడుకోవడం వడిసెలను చేతబట్టి గుండాలను ఎదుర్కొన్నారు. తమ పొలాల్లో ఎర్రజెండాలను నాటారు. పొలం చుట్టూ కాపలా కాశారు. ఈ పోరాటానికి నాయకత్వం వహించింది ఎర్రజెండా అయితే సంఘానికి అండగా నిలిచింది కామ్రేడ్ ఠానునాయక్ కుటుంబం. ఆంధ్ర మహాసభ జనగాం తాలూకాలో పార్టీని విస్తరింపచేయాలని నిర్ణయిస్తే తోడ్పాటునందించి, దేశ్ముఖ్ ఆగడాలకు వ్యతిరేకంగా నిలిచింది ఠానునాయక్ కుటుంబం. అందుకే ఆ కుటుంబాన్ని తలుచుకుంటే చాలు శత్రువుకు గంగ వెర్రులెత్తేది. లంబాడీలను సర్వనాశనం చేయాలని శత్రువు ఎన్నోసార్లు ప్రయత్నిరచి విఫలయ్యాడు. స్థానిక నాయ కుడు మోహన్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచినప్పుడు ఎక్కు పెట్టబడి ఉన్న పోలీస్ తుపాకులను కూడా లెక్క చేయకుండా పోలీసులను నిలదీసింది ఈ కుటుంబమే. 300మంది మిలిటరీ వీరి గ్రామంపై దాడి చేయ వచ్చినప్పుడు గ్రామ ప్రజలందరినీ కదిలించి వడిశాలతో మూడు గంటల పాటు సైన్యాన్ని అడుగు ముందు వేయకుండా చేసింది ఈ కుటుంబమే. కమ్యూనిస్టు పార్టీ కోసం పనిచేస్తున్న కుటుంబంలోని యువకులను వెంటాడి అంతం చేయాలని పోలీసులు, గుండాలు ఎన్నో ప్రయత్నాలు చేయగా చివరకు ఠాను నాయక్ మూడో అన్న కామ్రేడ్ శంకర్ దొరికాడు. అతన్ని చిత్రహింసలకు గురిచేసి జైల్లోపెట్టారు. 1947 భువనగిరిలో పల్లేరుల గ్రామంలో పెద్దవాడైన కామ్రేడ్ జోద్యనాయక్ను పట్టుకుని అతన్ని కూడా జైలుకు పంపారు. రజాకార్లు వారి ఇంటిని రెండుసార్లు తగలబెట్టారు. ఠాను నాయక్ రెండో అన్న కామ్రేడ్ సోమ్లను పట్టుకుని ఆయన చేతనే కట్టెలు పేర్పించి చితిమంటలో సజీవ దహనం చేశారు. కమ్యూనిస్టు ఆశయానికి బద్ధుడైన ఆయన చివరి క్షణాల్లో కూడా ఎర్రజెండాకు జై అంటూ అమరుడయ్యాడు. ఈ చితిలో రెడ్యా, బలరాం, చంద్రు, రాము కూడా ఉన్నారు. ఆయన ఆ కుటుంబం వెనకితగ్గకపోవడంతో మళ్ళీ వారి ఇంటిపై దాడి చేసి ఇద్దరు పసి పిల్లలను చంపేశారు. అయినప్పటికీ ఈ కుటుంబం ఎర్రజెండాను వదల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్యూనిస్టు ఆధ్వర్యాన ఏర్పాటైన దళాలకు రక్షణ ఇవ్వడం, వారికి తోడ్పాటునందించడంలో ముందునే నిలిచాడు ఠానునాయక్. శత్రువులు ఆయన తండ్రి హము, తల్లి 80ఏండ్ల వృద్ధుల చేతులు విరగ్గొట్టినా బెదరలేదు. వారికి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఠాను నాయక్ తమ్ముడు దర్గ్య నాయక్ దళా కమాండర్గా ప్రజలకు సేవలందించాడు. 1949 ఫిబ్రవరి 26న దర్గ్యను కూడా తీవ్రంగా చిత్ర హింసలు పెట్టి అరెస్టు చేసి మరణదండన విధించారు. పెద్దన్న జోద్య కుమారుడు పద్దెని మిది సంవత్సరాల కిషన్ను కూడా జైల్లో పెట్టారు. భారత సైన్యాలు ప్రవేశించిన క్షణం నుండి కామ్రేడ్ ఠాను కోసం అతన్ని సజీవంగా పట్టుకునేందుకు సైన్యం చేయని ప్రయత్నం లేదు. వెతకని చోటులేదు. అయితే ఏడాది వరకు అతడు శత్రువులకు చిక్కలేదు. కానీ చివరకు ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం వల్ల 1950 మార్చి 20న ముండ్రాయి గ్రామంలో పట్టుకున్నారు. పార్టీ రహస్యాల కోసం ఆయన్ను అనేక రకాల చిత్రహింసలు పెట్టినా ఆయన నోరు విప్పలేదు. అతని మొండితనం, ధైర్యం సైన్యాధికారులకు కూడా అద్భుతం అనిపించింది వారతన్ని చంపేందుకు నిరాకరించారు. చివరకు రామవరం దేశ్ముఖ్ కటారు నరసింగరావు అతన్ని బండికి కట్టించి చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. ఠాను నాయక్ వీరమరణం పొందుతూ కూడా కమ్యూనిస్టు పార్టీ వర్థిల్లాలి, ఎర్రజెండా జిందాబాద్, పేదల రాజ్యం వర్ధిల్లాలి అంటూ చేసినా నినాదాలు శత్రువుల్ని కూడా భయపెట్టాయి. లంబాడీ కుటుంబంలో పుట్టి భూస్వాములను ఎదిరించి భూమి, భుక్తి, విముక్తి కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఠానునాయక్ కుటుంబం పేద ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయమే.
(మార్చి 20న కామ్రేడ్ ఠానునాయక్ 73వ వర్థంతి)
- ఎం. ధర్మానాయక్
సెల్:9490098685